breaking news
manjula devak
-
‘నా కూతుర్ని ఐఐటీకి పంపి తప్పు చేశా’
న్యూఢిల్లీ: తన కూతుర్ని ఢిల్లీ ఐఐటీకి పంపించి తప్పు చేశానని పీహెచ్డీ విద్యార్థిని మంజులా దేవక్ తండ్రి వాపోయారు. జల వనరులపై పీహెచ్డీ చేస్తోన్న మంజుల అనుమానాస్పద పరిస్థితుల్లో మంగళవారం రాత్రి ఢిల్లీ ఐఐటీ క్యాంపస్లో మృతి చెందింది. తన కుమార్తెను ఉన్నత చదువులకు పంపించకుండా ఉండాల్సిందని మంజుల తండ్రి అన్నారు. చిన్న వయసులో తన కూతురుకు పెళ్లి చేయడం పొరపాటైందన్నారు. ‘నా కూతుర్ని ఐఐటీకి పంపించి తప్పు చేశాను. కట్నం ఇచ్చేందుకు డబ్బు కూడబెట్టాల్సింది. జాతకాలు బాగా కలిశాయని చిన్న వయసులొనే పెళ్లి చేశామ’ని వెల్లడించారు. తన కూతుర్ని చదివించడం అల్లుడు రితేశ్ విర్హాకు ఇష్టం లేదని, చదువు మాన్పించేసి తనతో పాటు వ్యాపారం చేయాలని ఒత్తిడి చేసేవాడని తెలిపారు. వ్యాపారం ప్రారంభించడానికి రూ. 25 లక్షలు తీసుకురావాలని తన కుమార్తెను వేధించాడని ఆరోపించారు. కుటుంబ గౌరవం పోతుందన్న భయంతో తన కూతురు విడాకులు ఇచ్చేందుకు నిరాకరించిందని చెప్పారు. గతంలో అమెరికాలో సివిల్ ఇంజినీర్గా పనిచేసిన మంజుల 2011లో ఢిల్లీ ఐఐటీలో చేరింది. కాగా, మంజుల అనుమానాస్పద మృతి కేసులో ఆమె తల్లిదండ్రులు, స్నేహితులు సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. మంజుల ల్యాప్టాప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమె మొబైల్ ఫోన్ కాల్స్ వివరాలు సేకరిస్తున్నారు. -
మంజుల ఎలా చనిపోయింది?
న్యూఢిల్లీ: పీహెచ్డీ ఫైనల్ ఇయర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి ఢిల్లీ ఐఐటీ క్యాంపస్లో కలకలం రేపింది. జల వనరులపై పీహెచ్డీ చేస్తోన్న మంజులా దేవక్(27) అనే విద్యార్థిని తన గదిలో మంగళవారం రాత్రి కన్నుమూసింది. మంజులా.. క్యాంపస్లోని నలంద అపార్ట్మెంట్లోని గదిలో ఫ్యాన్కు ఉరి వేసుకున్నట్లు పోలీసు అధికారులు చెప్పారు. అయితే ఇది ఆత్మహత్యా, హత్యా అన్న విషయం ఇప్పుడే చెప్పలేమన్నారు. మధ్యప్రదేశ్లోని భోపాల్కు చెందిన మంజులకు కొన్నేళ్లకిందటే రితేశ్ విర్హా అనే వ్యక్తితో వివాహం అయింది. గదిలో సూసైడ్నోట్ లాంటివేవీ లభించకపోవడంతో దీనిని అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదుచేశారు. విద్యార్థిని మరణవార్తను ఆమె భర్త, తల్లిదండ్రులకు చేరవేశామని పోలీసులు చెప్పారు. ఈ వార్తకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.