breaking news
malladhi suribabu
-
రేడియో హోదా పెరిగింది!
మల్లాది సూరిబాబు, కర్ణాటక సంగీత విద్వాంసులు - ‘ఆకాశవాణి’ నిలయ కళాకారులు అనుభూతి శబ్దాన్ని ఆశ్రయిస్తే మంచి పాట పుడుతుంది. సుస్వరంతో నిండిన ఆ శ్రావ్యమైన పాట సంస్కారవంతమైన హృదయాన్ని తట్టి లేపుతుంది. అప్పటికప్పుడు పాటను వ్రాయడం, అలా వచ్చిన పాటకు స్వరం కూడా తనే సమకూర్చుకుని పాడడం - ఈ మూడూ ఒకే వ్యక్తి వల్ల అయ్యే పనులు కాదు. రచన, సంగీతం, గానం - ఒకరే అయితే? మధురానుభూతుల్ని మాటలుగా మార్చి, వాటిని అందంగా పేర్చగల ప్రతిభామూర్తి మా రజనీ బాబాయ్. ‘‘హాయిలో నేల యెదకింత హింస... తీయ పాటలో బాధేల వంశీ...’’ అనే రజని పాటను నాలుగు దశాబ్దాల క్రితం ‘గజల్’గా ‘జనసమ్మోదిని’ రాగంలో ట్యూన్ చేసి, రజని గారికే వినిపించాను. గజల్ శైలిలో తన పాట విని ఆయన ఎంత పరవశించారో. ఈ పాటతో మా ఇద్దరి స్నేహం ఎంతో పెరిగింది. ఇవాళ్టికీ ఆయనకు ఈ పాట ఇంకా గుర్తే! రజనీ గారిది అదో సహజమైన, స్వతంత్రమైన సంగీతధార. ఆయన సంగీత విహంగం రెక్కలు చాపుకొని నాదప్రపంచంలో అందచందాలను వెతుక్కుంటూ, అటు మధ్య ప్రాచ్యం దాకా ఎగిరి రాగలదు. ఇటు హిందు స్థానీ, బెంగాలీ, జానపద రీతులతోనూ జత కట్టగలదు. జాతీయతకు (నేటివిటీ) దూరం కాకుండా నాద ప్రపంచంలో తనకో శైలిని ఏర్పరచుకున్నాడాయన. శాస్త్రీయ రాగాలు, వాటి స్వరూప స్వభావాలు, కోమలంగా ఉండే స్వరాలు, తీవ్రమైన స్వరాలు, పాటలోని మాటలకు ఏయే స్వరాన్ని ఎలా పాడితే భావాన్ని చెప్పగలమో అన్నీ తెలిసిన ‘సంగీతవేత్త’. ‘మనసౌనే ఓ రాధా...’, ‘మరు నిముసమే మనదో కాదో...’, ‘ఆశా నా ప్రాణసఖీ...’ లాంటి పాటలు ఓలేటి వెంకటేశ్వర్లు గారి కంఠంలో ఎన్ని హొయలు పోయాయో వింటే... రజని గారి ఊహాలోకాన్ని దర్శించవచ్చునని నాకనిపిస్తుంది. నూతన రీతుల క్రియాశీలతకు సంప్రదాయ పరిధులు అడ్డు రాకూడదనే విధానాన్ని వెనుకటి తరంలోని రేడియో స్టేషన్ డెరైక్టర్లు పాటించారు కాబట్టే, ఈవేళ ‘ఆలిండియా రేడియో’ గౌరవం తరిగిపోకుండా అలా నిలబడింది. అటువంటి సంగీత, సాహిత్య మర్యాదలను నిలబెట్టినవారిలో శ్రీరజనీకాంతరావు ముందు వరుసలో ఉంటారు. గమ్మత్తేమిటంటే, రచన, సంగీతం - రెండూ రజని గారి మనసులో నుంచి ఏకకాలంలో వచ్చేస్తాయి. రజని గారి వరసలు ఎవరూ, ఏమీ మార్చలేరు. వాటిని అవగాహన చేసుకుని పాడడం సామాన్య గాయకుడికి కష్టం. ‘రజని గారి గేయా లను స్వర సహితంగా అచ్చువేస్తే, భావితరాలకు ఆయన సంగీతజ్ఞత బోధపడుతుంద’ని బాల మురళీకృష్ణ గారోసారి నాతో అన్నారు. అంటే, రజని పాటల్లోని మజా ఏమిటో మనకర్థవుతుంది. పాటల్ని కంపోజ్ చేయడంలో రజనీది ఒక ప్రత్యేకమైన శైలి. ఎవరూ అనుకరించ లేని శైలి. ఎవరూ ఎదురుచూడని దారులు తొక్కుతూ, ఏదో కొత్తదనం కనిపిస్తూనే ఉంటుంది. విజయవాడలో 1970ల మొదట్లో ‘జై ఆంధ్రా’ ఉద్యమం ముమ్మరంగా జరుగుతున్న రోజులవి. ‘ఆకాశవాణి’లో ఏ కార్యకలాపాలూ జరగరాదని నిర్ణయించిన ఉద్యమకారులు స్టూడియో చుట్టూ మోహరించినప్పుడు, ఆ సమస్యను గ్రహస్థితికి ముడిపెట్టి, రజని గారు తయారు చేసిన ‘నవగ్రహ స్తుతి’ ఒక వినూత్న అనుభవం. ఈ కీర్తన ప్రసారమైన కొన్నాళ్ళకి ఉద్యమం కాస్త తగ్గింది. అలాగే, 1977లో దివిసీమ తుపానప్పుడు రజని ఒక పాట రాశారు. ‘నివాత శూన్య స్తంభం, నిష్పీడన మంథానం, జంఝా వాత సంరంభం, హంసవిధి విధానం...’ అనే పల్లవితో తుపాను బీభత్స సమయాన్ని ప్రతిబిం బిస్తూ సాగే ఆ పాటను ‘ఆకాశవాణి’లో ‘ఈ మాసపు పాట’గా పాడాను. నిజానికి, ఆ పాటలోని మాటలన్నీ చక్రవాక తుపానుకు సంబంధించిన సాంకేతిక పదాలకు చక్కటి తెలుగు మాటలు. ‘సైక్లోనిక్ సిలిండర్’కి అనువాదం ‘నివాత శూన్య స్తంభం’. సంక్లిష్టమైన మాటలు, తుపానుకు సంబంధించిన విషాదం అయినప్పటికీ... పాడడానికి అనువుగా ఉండే అద్భుతమైన గీతం అది. రేడియోకు ఒక ప్రత్యేకతను తెచ్చిన ఘనత - రజనీదే! ‘సంస్కృత పరిచయం’, ‘భక్తిరంజని’, ఓలేటి చేత ‘సంగీత శిక్షణ’, ‘ఈ మాసపు పాట’ వంటి కార్యక్రమాల రూపకల్పనకు ఆద్యుడు రజనీయే. రజని తన దగ్గర పనిచేసేవారిలోని ప్రతిభను గుర్తించి, కార్యక్రమాలను చేయించేవారు. అది చిన్న విషయం కాదు. ఆయనకున్న హోదా వల్లనే పేరు ప్రఖ్యా తులు వచ్చాయనుకుంటే పొరపాటు. ఆయన వల్ల రేడియో హోదా పెరిగిందనడం నిజం. -
ఆయన జీవితమే ‘గానకళా’ యజ్ఞం
సంగీత సభను నడపడం, సంగీతం కోసం ఒక మాసప త్రికను నడపడం - రెండూ కష్టసాధ్యమైన విషయాలే..! ఆర్థికబలం, అంగబలం- ఈ రెండూ చెప్పుకోతగినంతగా లేకపోయినా, కొన్ని దశాబ్దా లుగా కాకినాడలో ‘శ్రీరామ సమాజం’ ఆధ్వర్యంలో సంగీత కచ్చేరీలు నిర్వహిస్తూ, ఆంధ్రదేశంలో ఒక మంచి సం గీత వాతావరణాన్ని నెలకొల్పే ప్రయత్నంలో నూటికి నూరుపాళ్ళూ కృతకృత్యుడైన వ్యక్తి- మునుగంటి శ్రీరామమూర్తి. తూర్పుగోదావరి జిల్లా, కాకినాడలో 1962 జూన్ లో ప్రారంభించిన ‘గానకళ’ సంగీత మాసపత్రిక సం గీత విద్వాంసులకూ, రసికులకూ, ఔత్సాహిక గాయనీ గాయకులకూ కొంగుబంగారంగా విలసిల్లుతున్నది. సంగీతజ్ఞులకు ఒక నిఘంటువులా ‘గానకళ’ను రూపొం దించిన మహనీయుడు - శ్రీరామమూర్తి. తొమ్మిది పదు ల వయస్సులో కూడా సంప్రదాయ సంగీతానికి గౌర వాన్ని ఇనుమడింపజేసే ప్రయత్నంలో ‘గానకళ’ పాఠ కుల సంఖ్యను పెంచేందుకు ఎంతో కృషి చేశారాయన. సుభద్రమ్మ, వెంకటరావు పంతులు దంపతులకు 1925 మార్చి 25లో కాకినాడలో ఆయన జన్మించారు. తండ్రి ‘గాయక సమ్రాట్’ వెంకటరావు పంతులు. సంప్రదాయ సంగీతం, సంగీత విద్వాంసుల చరిత్రలను విస్తృతమైన పరిశో ధనావ్యాసాలతో అలరిస్తూ 53 ఏళ్ళుగా సాగుతున్న ఏకైక తెలుగు మాసపత్రిక ‘గాన కళ’. ‘పద్మవిభూషణ్’ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ దీనికి గౌరవ సలహాదారు. సంగీత మూర్తిత్రయంతో పాటు, అనేక మంది వాగ్గేయకారుల రచనలను ప్రాచీన విద్వాంసులు తాము పాడి, తమ శిష్య ప్రశి ష్యుల చేత పాడించి, మహారాజ పోషణ తోడై రాగా, ఈ కళకు ఎంతో ప్రచారం తెచ్చారు. ఈ ప్రచారమంతా ఎప్పుడూ తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లోనే ఎక్కు వగా జరుగుతోంది. అయితే, గత రెండు, మూడు తరా లలో తాడిగడప శేషయ్య, పిరాట్ల శంకరశాస్త్రి, రామసు బ్బయ్య (చీరాల), సుసర్ల దక్షిణామూర్తిశాస్త్రి, పారుపల్లి రామకృష్ణయ్య పంతులు, బలిజేపల్లి సీతారామయ్య వంటి ప్రసిద్ధ ఆంధ్ర సంగీత విద్వాంసులు దక్షిణాది బాణీని తెలుగుదేశంలో ప్రచారం చేసే ప్రయత్నం చేయ లేకపోలేదు. తెలుగు ప్రాంతంలో కూడా పదిమంది విద్వాంసులు తయారవ్వాలన్నది శ్రీరామమూర్తిగారి ఆకాంక్ష. ఈ సంకల్పంతోనే ‘గానకళ’ను నిరాటంకంగా ప్రచురించారు. తండ్రికి తగ్గ తనయుడిగా చిరంజీవి వెం కటరావు ఇప్పటి దాకా తండ్రితో పాటు పత్రిక కోసం పాటుపడుతున్నారు. సంగీత వ్యాప్తి కోసం శ్రీరామమూర్తిగారు చేసిన కృషి సామాన్యమైనది కాదు. దాదాపు 115 ఏళ్ళుగా ఉచిత సంగీత కళాశాలను నడుపుతున్న ‘శ్రీరామ సమాజం’కి ఆయనే కార్యదర్శి. త్యాగరాజస్వామికి సాక్షాత్తూ 5వ తరం ప్రశిష్యులైన తమ తాతగారు మునుగంటి వెంకట శ్రీరాములు పంతులుగారి బాటలో ఏటా పది రోజులు గణపతి నవరాత్రులకు సంగీతోత్సవం నడుపుతూ వచ్చారు. అం దులో ఐదు రోజులు హరికథలకే కేటాయిం చేవారు. ‘త్యాగరాజ సేవాసమితి’ని మిత్రు లతో కలసి స్థాపించి, ప్రతినెలా సంగీత సభా నిర్వహణ ద్వారా ఇంటింటికీ సంగీతాన్ని చేర్చేం దుకు శ్రమించారు. ‘సంగీత విద్వత్ సభ’ను స్థాపించి, గత 64 ఏళ్ళుగా ప్రతియేటా క్రమం తప్పకుండా సంక్రాంతికి కాకినాడలో సంగీతోత్సవం నిర్వహించారు. కానీ, మునుగంటి శ్రీరామమూర్తిగారు ఈసారి సంక్రాంతి సంగీత సభల్లో లేరు. 12వ తేదీ సాయంత్రం అకస్మాత్తుగా కన్నుమూశారు. ప్రచారార్భాటం లేకుండా సంప్రదాయ సంగీత వ్యాప్తి కోసం కృషి చేసిన శ్రీరామ మూర్తి భౌతికంగా దూరమవడం సంగీతానికీ తీరనిలో టే! ఆయన స్ఫూర్తిని అందుకొని, ‘గానకళ’ను చిరకాలం నిలబెట్టుకొని, సంగీత యజ్ఞంలో పాలుపంచుకోవడమే ఆ సంగీతయాజికి మనమివ్వగలిగిన నివాళి! మల్లాది సూరిబాబు - ఆకాశవాణి, విజయవాడ (9052765490) - మల్లాది సూరిబాబు