breaking news
Key rates
-
కీలక రేట్లు యథాతథం..
ముంబై : ఆర్థిక మందగమనం నేపథ్యంలో వడ్డీరేట్లలో కోత విధిస్తారనే అంచనాలకు భిన్నంగా ఆర్బీఐ కీలక రేట్లను యథాతథంగా ఉంచింది. రెపో రేటును 5.15 శాతంగానే కొనసాగించాలని నెలవారీ ద్రవ్య విధాన సమీక్ష సమావేశంలో ఆర్బీఐ నిర్ణయించింది. అక్టోబర్ మాసంలో జరిగిన పరపతి సమీక్షా సమావేశంలో ఆర్బీఐ కీలక వడ్డీరేటును 25 బేసిస్ పాయింట్లు కుదించి 5.15 శాతానికి తగ్గించింది. మరోవైపు తాజా భేటీలో 4.9 శాతంగా ఉన్న రివర్స్ రెపో రేటులోనూ ఎలాంటి మార్పులూ చేపట్టలేదు. స్వల్ప కాలానికి వేచిచూసే ధోరణిలో వ్యవహరించేందుకే ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ మొగ్గుచూపింది. మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు అంచనాను 6.1 శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది. -
ఆర్బీఐ పాలసీ: మార్కెట్లు పతనం
ముంబై : కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేకుండా ఆర్బీఐ ద్రవ్య విధాన పరపతి సమీక్ష ప్రకటించిన అనంతరం పెట్టుబడిదారులు ప్రాఫిట్స్ బుకింగ్స్పై ఎక్కువగా మొగ్గుచూపారు. దీంతో మూడు రోజుల లాభాల ర్యాలీకి బ్రేక్ పడి దేశీయ సూచీలు నష్టాల బాట పట్టాయి. సెన్సెక్స్ 150 పాయింట్లకు పైగా నష్టాల్లో 28,019.26 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 54.95 పాయింట్ల నష్టంతో 8,656గా నమోదవుతోంది. ఎక్కడ రేట్లు అక్కడే ఉంచుతున్నట్టు నేటి పాలసీ వెలువడిన అనంతరం వడ్డీరేట్ల సెన్సిటివ్ స్టాక్స్ మిక్స్డ్గా ట్రేడ్ అవుతున్నాయి. హెచ్డీఎఫ్సీ 2 శాతం మేర పడిపోయింది. యాక్సిస్ బ్యాంకు, కొటక్ మహింద్రా క్షీణించింది. ఎస్బీఐ,ఐసీఐసీ బ్యాంకులు లాభాల్లో పయనిస్తున్నాయి. ఆటో స్టాక్స్ ఐషెర్ మోటార్స్, హీరో మోటార్, మారుతీ సుజుకీ, మహింద్రా అండ్ మహింద్రా టాప్ ఇండెక్స్ లూజర్లుగా నష్టాలను గడిస్తున్నాయి. అటు రియాల్టీ స్టాక్స్ కూడా మిక్స్డ్గానే ట్రేడ్ అవుతున్నాయి. రాజన్ వెళుతూ వెళుతూ రేట్లను కోసేసి పారిశ్రామిక, బ్యాంకింగ్, మార్కెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తారా..? అని కొంతమంది విశ్లేషకులు భావించారు. కానీ ఎలాంటి సర్ ప్రైజ్లు లేకుండానే రాజన్ పాలసీ వెలువడింది. దీంతో దేశీయ సూచీలు నష్టాల్లో నమోదవుతున్నాయి. అటు డాలర్ తో పోల్చుకుంటే రూపాయం మారకం విలువలో కొంత మేర మార్పు జరిగింది. రూపాయి 0.12 పైసలు బలహీనపడి 66.96గా ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధర రూ.68 పాయింట్లు పడిపోయ 31,108 రూపాయలుగా ట్రేడ్ అవుతోంది. -
కీలక వడ్డీ రేట్లు యథాతథం: ఆర్బీఐ
న్యూఢిల్లీ : రిజర్వు బ్యాంకు గవర్నర్గా రఘురామ్ రాజన్ తన చివరి ద్రవ్యపరపతి పాలసీ సమీక్షలో ఎలాంటి సర్ప్రైజ్ లు లేకుండా కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతున్నట్టు ప్రకటించారు. మెజార్జీ నిపుణులు భావించిన మాదిరిగానే రాజన్ నిర్ణయం వెలువడింది. ఎలాంటి మార్పులు చేయని కీలక వడ్డీ రేట్లు రెపో 6.50 శాతంగా, రివర్స్ రెపో 6 శాతంగా, సీఆర్ఆర్ను 4శాతంగా ఉంచుతున్నట్టు వెల్లడించారు. సెప్టెంబర్ 4న ఆర్బీఐ గవర్నర్ బాధ్యతల నుంచి తప్పుకోనున్న రాజన్కు ఇదే చివరి పరపతి విధాన సమీక్షా సమావేశం కానున్న నేపథ్యంలో మంగళవారం నాటి విధాన సమీక్షపై మార్కెట్ వర్గాలు, విశ్లేషకులు ఎక్కువగా దృష్టిసారించారు. రాజ్యసభ, లోక్సభలు ఆమోదించిన ఏకీకృత వస్తు సేవల పన్ను(జీఎస్టీ) అమలుతో బిజినెస్ సెంటిమెంట్ పెరుగుతుందని, పెట్టుబడులు మరింతగా ఆకర్షించవచ్చని రాజన్ చెప్పారు. అధిక వడ్డీ రేట్లు కొనసాగిస్తున్నారని తనపై ఆరోపణలు చేస్తున్న విమర్శకుల గురించి తానేమీ మాట్లాడదలుచుకోలేదని... ప్రజలనుంచి తనకు పూర్తి మద్దతు ఉందని తెలిపారు. ఆర్బీఐ గవర్నర్గా తనకు ఆఖరిక్షణం వరకూ అంతా పాజిటివ్ అనుభూతే కలగాలని తాను ఆశిస్తున్నట్టు చెప్పారు. ఇదే తన చివరి పాలసీ కావడంతో తనకున్న తక్కువ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటానని ద్రవ్య పరపతి సమీక్షలో వెల్లడించారు. అధిక వడ్డీ రేట్లు కొనసాగిస్తున్నారన్న విమర్శల వల్ల చివరి పాలసీలో రేట్లకు కొంత మేర కోత పెట్టొచ్చని కొందరు ఆర్థికనిపుణులు అభిప్రాయం వ్యక్తంచేశారు. అయితే ఎవరిని ఎలాంటి ఆశ్చర్యానికి లోనుచేయకుండా ముందటి పాలసీ మాదిరిగానే కీలక రేట్లలో ఎలాంటి మార్పుల చేపట్టలేదు. మరోవైపు రాజన్కు, ఆర్బీఐకు ఇదే చివరి ద్రవ్య పరపతి సమీక్ష. వచ్చే పాలసీ నిర్ణయం ప్రభుత్వం నియమించే మానిటరీ పాలసీ కమిటీ ప్రకటించనుంది. తదుపరి సమీక్షా సమావేశం అక్టోబర్ 4న జరగనుంది. -
రేట్లలో కోత లేదు.. రెపో 6.5శాతమే
ముంబై: మెజారిటీ విశ్లేషకులు అంచనా వేసిన మాదిరిగానే ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ నిర్ణయం వెలువడింది. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను 6.5 శాతంగానే ఉంచుతున్నట్టు వెల్లడించారు. ఈ రేటుపై ఎలాంటి కోత విధించలేదని పేర్కొన్నారు. అలాగే సీఆర్ఆర్ 4 శాతంగా ఉంది. మంగళవారం జరిగిన ప్రస్తుత ఆర్థిక సంవత్సర మొట్టమొదటి ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో ఆర్బీఐ గవర్నర్ ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే రాజన్ వెలువరిచిన ఈ పాలసీని విశ్లేషకులు, మార్కెట్ వర్గాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ సెప్టెంబర్ తో రాజన్ పదవి ముగియనుండటం, మరో మారు ఆర్బీఐ గవర్నర్ గా రాజన్ నే కొనసాగించాలని చర్చనీయాంశాలు జోరు అందుకోవడంతో, ఆర్ బీఐ పాలసీ ఎలా ఉండబోతుందనే దానిపై ఎక్కువగా దృష్టిసారించారు. 2013 సెప్టెంబర్ లో ఆర్బీఐ గవర్నర్ గా రాజన్ మూడేళ్ల బాధ్యతలు చేపట్టారు. ఒకవేళ రాజన్ పదవిని కొనసాగించకపోతే నేడు వెలువరించిన పాలసీనే రాజన్ కు ఆఖరిదని విశ్లేషకులంటున్నారు. రాజన్ మూడేళ్ల బాధ్యతలు చేపట్టిన తర్వాత క్రమంగా రుణ బెంచ్మార్క్ రేటు- రెపో రేటును 7.25 శాతం నుంచి 8 శాతానికి పెంచారు. అటుతర్వాత ఆర్థికశాఖ, పరిశ్రమల నుంచి వచ్చిన ఒత్తిడులు, ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో క్రమంగా రెపో రేటును 1.50 శాతం తగ్గించారు. దీనితో ఈ రేటు ప్రస్తుతం 6.5 శాతానికి దిగివచ్చింది. ప్రస్తుతం కొనసాగుతున్న రెపో రేటును ఏ మాత్రం మార్పుల చేయలేదు. నేడు వెలువరిచిన ఆర్ బీఐ ద్రవ్యపరపతి సమీక్ష సందర్భంగా తెలుసుకోవాల్సిన అంశాలు... ఈ రేటును ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ, విశ్లేషకులు నిర్ణయించారు. తర్వాతి పాలసీ ఆగస్టులో వెలువడే వరకూ ఈ రేట్లే అమలుల్లో ఉండనున్నాయి. ఈ రేటుపై నిర్ణయం తీసుకున్న ద్రవ్యవిధాన కమిటీ ఏర్పాటు బిల్లుకు పార్లమెంటులో ఆమోదం లభించింది. ఆరుగురు సభ్యులున్న ఈ కమిటీలో ముగ్గురిని కేంద్రప్రభుత్వం నామినేట్ చేస్తోంది. మరో ముగ్గురు ఆర్ బీఐకి చెందిన వ్యక్తులుంటారు. ఆర్ బీఐ గవర్నర్ ఓటింగ్ అధికారం కలిగి ఉంటారు. నేడు వెలువరించిన ద్రవ్యవిధాన పాలసీలో ఎక్కువగా ఆర్ బీఐ గవర్నర్ గా రాజన్ నే కొనసాగిస్తారా..? అనే అంశంపైనే అందరూ దృష్టిసారించారు. ప్రతి ఆర్ బీఐ గవర్నర్ పదవి ముగుస్తుందనగా.. వారికి పదవిని రెండేళ్లు పొడిగించేవారు. మరి రాజన్ కు ఏ నిర్ణయం తీసుకోబోతుందన్నదే చర్చనీయాంశం. బీజేపీలో ఫైర్ బ్రాండ్ గా ఉన్న నేత సుబ్రహ్మణ్య స్వామి, రాజన్ పదవి కొనసాగింపును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వడ్డీరేట్లు తగ్గించకపోవడం వల్లే ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదని విమర్శల వర్షం కురిపిస్తున్నారు. మానసికంగా రాజన్ భారతీయుడు కాదని వ్యాఖ్యానిస్తున్నారు. అమెరికా జారీచేసిన గ్రీన్ కార్డ్ ను ఆయన ఇంకా రెన్యూవల్ చేప్పించుకుంటున్నారని ప్రధాని మోదీకి లేఖ కూడా రాశారు. సెప్టెంబర్ లో రాజన్ పదవి ముగుస్తుండటంతో, అప్పుడే దీనిపై నిర్ణయం తీసుకుంటామని, ప్రస్తుతం దీనిపై ఎలాంటి చర్చ వద్దని మోదీ ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు రాజన్ పదవి పొడిగింపుకు మోదీకి ఎలాంటి అభ్యతరం లేదని సంకేతాలు వెలువడుతున్నాయి. నెట్ సిటిజన్లు, మెజార్టి విశ్లేషకుల నుంచి కూడా రాజన్ కు ఆదరణ గణనీయంగా పెరుగుతోంది. బ్యాంకులకు ఆర్ బీఐ ఇచ్చే రుణాలపై రేటు.. రెపోను 6.50గానే ఉంచుతుందని మెజార్టి విశ్లేషకులు భావించారు. మార్చిలో 4.83శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్ లో 5.39శాతంగా పెరగడం దీనికి కారణంగా చూపారు. 2017 మార్చిలో రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 5శాతం కంటే తక్కువ స్థాయికి తీసుకురావడమే ఆర్ బీఐ ప్రధాన లక్ష్యం. ఇటీవల ఆయిల్ ధరలు పెరగడం వల్ల రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగిందని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. 7వ వేతన సంఘ సిఫారసులను అమలుచేయడం వల్ల, కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు వేతనాలు పెరిగాయని, దీంతో ధరలు ఎగబాకాయని చెబుతున్నారు. రేట్లలో కోత విధింపు అంశం రుతుపవనాల వల్ల కురిసే వర్షాలపై ఆధారపడి ఉంటుందని, రాజన్ కూడా రేటు కోత విధించకుండా రుతుపవనాల కోసం వేచిచూస్తున్నారని ఈ నిర్ణయంతో వెల్లడైంది.. వాతావరణ నిపుణులు ఈ ఏడాది రుతుపవనాలు బాగుంటాయని అంచనావేస్తున్నారు. రెండేళ్ల కరువు అనంతరం ఈ ఏడాది రుతుపవనాలు ఆర్థికవ్యవస్థకు మేలు చేకూర్చబోతున్నాయని ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. మంచి రుతుపవనాలు, గ్రామీణ వినియోగాన్ని పెంచుతుందంటున్నారు. అమెరికా సెంట్రల్ బ్యాంక్- ఫెడ్ ఫండ్ రేటుపై ఈ నెల 15-16 తేదీల్లో నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో ఆర్బీఐ తాజా సమీక్ష జరుగుతుండటం విశేషం.