బొగ్గుమన్న మార్కెట్లు..!
బొగ్గు మంట స్టాక్ మార్కెట్లకు అంటడంతో వరుసగా మూడో రోజు పతనమయ్యాయి. గత రెండు రోజుల్లో 462 పాయింట్లు దిగజారిన సెన్సెక్స్ తాజాగా మరో 271 పాయింట్లు పడింది. వెరసి 26,468 వద్ద ముగిసింది. ఇది నెల రోజుల కనిష్టంకాగా, నిఫ్టీ సైతం 91 పాయింట్లు జారి 7,912 వద్ద ముగిసింది. తద్వారా 8,000 పాయింట్ల కీలకస్థాయిని కోల్పోయింది.
సుప్రీం కోర్టు 1993 నుంచీ వివిధ ప్రభుత్వాలు చేపట్టిన బొగ్గు క్షేత్రాలను మూకుమ్మడిగా రద్దు చేయడంతో దెబ్బతిన్న సెంటిమెంట్ గురువారం మరింత బలహీనపడింది. మెటల్, బ్యాంకింగ్, పవర్, ఆయిల్, రియల్టీ రంగాలు 3% స్థాయిలో క్షీణించాయంటే అమ్మకాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. హెల్త్కేర్ నష్టపోకుండా నిలదొక్కుకోగా, ఐటీ ఇండె క్స్ 1% లాభపడింది. బొగ్గు క్షేత్రాల రద్దు కారణంగా మెటల్, బ్యాంకింగ్ దెబ్బతినగా, గ్యాస్ ధర వాయిదాతో ఆయిల్ ఇండెక్స్ సైతం నీరసించిందని విశ్లేషకులు పేర్కొన్నారు.