మాటకు కళ్లెం మంచిది కాదు
సమకాలీనం
ఉద్యమరోజుల్లో, సీమకు చెందిన ఓ నాయకుడి విమర్శను తిప్పికొడుతూ... ‘కోదండరామ్ అంటే, నాలుగుకోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షకు ప్రతీక’ అని కేసీఆర్ అన్న మాటల వీడియో క్లిప్పింగ్ సామాజిక మాధ్యమాల్లో తాజాగా చక్కర్లు కొట్టింది. అంతలోనే ఆయన ద్రోహి, కుట్రదారుడయ్యాడా? అన్న ప్రశ్న రేకెత్తుతోంది ‘ఏ జాక్కు ఛైర్మన్? ఇంకా జాక్ ఉందా? ముందు ఆయన్ను ఏదైనా పార్టీలో చేరి మాట్లాడమను!’ వంటి చౌకబారు విమర్శలు పాలకపక్షం వారి భయాన్ని, ఆందోళనని, డొల్లతనాన్నే వెల్లడించాయి.
కాలుష్యం వల్ల చోటు చేసుకునే ‘వాతావరణ మార్పులు’ ఒకోసారి విపత్తు సృష్టించడం లాంటిది రాజకీయాల్లో కూడా జరుగుతుందా? అతివృష్టి, అనా వృష్టి, క్యుములోనింబస్ మేఘావర్తన, క్లౌడ్ బర్ట్స్.... వంటివి రాజకీ యాల్లోనూ చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్/సర్కారు దండు స్పందించిన తీరు రాజకీయ క్లౌడ్బర్ట్స్ లాగే అనిపించింది. విమర్శ–ప్రతివిమర్శ–ఆపై స్పంద నల జడివాన ముగిశాక, ఆయన ఆస్ట్రేలియా విమానమెక్కడంతో అంతా సద్దుమనిగినట్టున్న ప్రస్తుత పరిస్థితి తుపాను ముందరి ప్రశాంతత లాగుంది. తుపాను ఉంటుందో! ఉండదో! ఇంకా తెలియదు. అయితే, ఏ కాలుష్యం వల్ల ఈ రాజకీయ ‘వాతావరణ మార్పు’ చోటు చేసుకుంది? అన్నది పరిశీలించాలి. బహుశా.. రాజకీయ భావకాలుష్యం వల్లో, విలువలు నశించిన కాలుష్యం వల్లో, అదుపు తప్పుతున్న భాషా కాలుష్యం వల్లో జరిగి ఉంటుంది. పార్టీలు, సిద్ధాంతాల సరిహద్దులు చెరిగి, అంతా కలగా పులగంగా... ‘అధికారమే’ కేంద్రంగా బలపడ్డ ఉపరితల ద్రోణి వల్ల ప్రస్తుత వాతావరణం కూడా అలాగే ఉంది. ఎందుకంటే, కోదండరామ్ మాటల్ని భూతద్దంలోంచి చూసి, సర్కారు పెద్దలు కట్టకట్టుకొని అవసరానికి మించి స్పందించారేమోనన్న భావన సగటు తెలంగాణ పౌరులకు కలిగింది.
ఆయన విమర్శను అంతే మోతాదులో స్వీకరించి తగు విధంగా స్పందిస్తే ‘టీ’కప్పులో తుపానులా పోయేదాన్ని, సముద్రంలో సునామీ చేశారనే అభిప్రాయమూ ఉంది. తేలికపాటి విమర్శల్ని కూడా సహించలేని తనం, మొరటు స్పందన చూశాక ‘ఇంకా రెండేళ్లే కదా అయింది’ అని ఇప్పటి దాకా సానుకూల దృక్పథంతో, ఆశావహంగా వేచి చూస్తున్న వారు కూడా తమ నిరీక్షణ ఫలవంతమౌతుందా? లేదా? అన్న సందేహాల్లోకి జారిపోతున్నారు. తమ ‘క్రియాశీలత’ వల్ల ఇతర పార్టీలన్నీ బలహీనపడుతూ ఇప్పుడు నెలకొన్న వాతావరణానికి ‘రాజకీయ పునరే కీకరణ’అని పాలకపక్షం ముద్దుపేరు పెట్టుకుంది. అదేం కాదు, వారు సృష్టిస్తున్న ‘రాజకీయ శూన్యత’ నుంచి బలమైన ప్రత్యామ్నాయ శక్తుల పుట్టుకకివి పురిటినొప్పులని కొందరు రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. కోదండరామ్ ఉదంతాన్ని ఇదే దృష్టికోణంలో చూస్తున్నవారూ ఉన్నారు.
మరో కేజ్రీవాల్ అవుతాడనా?
కోదండరామ్పై టీఆర్ఎస్ నాయకత్వానికి ఇంత కోపం, ద్వేషం ఉన్నట్టు పార్టీ శ్రేణులు కూడా ఊహించలేదు. అందుకే, ఈ ఉరుముల్ని పార్టీ శ్రేయోభిలాషులు, తెలంగాణ హితైషులు కొందరు నమ్మలేకపోతున్నారు. మరికొందరు తప్పుపడుతున్నారు కూడా. కానీ ఉపేక్షిస్తే ఏకు మేకైందన్నట్టు కొరుకుడుపడని పరిస్థితి వస్తుందేమోనన్నది నాయకత్వం సందేహం కావచ్చు. క్రమక్రమంగా రాష్ట్రంలో విపక్షమే లేని వాతావరణం ఏర్పరచు కుంటున్న పరిస్థితుల్లో కొదండరామ్ ప్రత్యా మ్నాయ శక్తిగానో, సదరు శక్తులకు కేంద్రకంగానో ఎదగడం సుతరామూ ఇష్టముండదు. ఈ దృష్టితోనే ఇటీవలి కాలంలో తెలంగాణ జేఏసీని వీలయినంత బలహీనపరిచారు. నెమ్మదిగా అందులోని వ్యక్తుల్ని, కొన్ని సంస్థల్ని బయటకు లాగడం ఈ వ్యూహంలో భాగమే! అయినా, కీలకమైన ప్రజా సమస్యలపై కోదండరామ్ నేతృత్వంలో టి–జాక్ క్రియాశీలకంగా వ్యవహరించడం పాలకపక్షానికి మింగుడు పడలేదు. ముఖ్యంగా 1) కరువు నేపథ్యంలో కోదండరామ్ చేసిన జిల్లాల పర్యటనలు, 2) రైతు ఆత్మహత్యలపై జేఏసీ హైకోర్టుకు వెళ్లడం, వారి సూచనల్ని పాటించాలని కోర్టు ప్రభుత్వాన్ని పురమాయించడం, 3) సింగరేణి ఓపెన్కాస్ట్ మైనింగ్కు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టడం.... వంటివి పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు సహితం కొంత ఆగ్రహం తెప్పించి ఉంటాయని పార్టీ నాయకులే పరోక్షంగా అంగీకరిస్తారు. ఆయన కూడా తగిన సమయం కోసం నిరీక్షించి ఉంటారు. ఆశించిన మేర, ఆకాంక్షించిన దిశలో రెండేళ్లలో సాధించింది శూన్యం అని, మీ వల్ల కాకపోతే చెప్పండి, ఎలా చేసుకోవాలో మాకు తెలుసు అని కోదండరామ్ విమర్శించే సరికి కోపమొచ్చినట్టుంది. పార్టీ అధినాయకత్వం పనుపున ఘాటుగా విమర్శిస్తున్న క్రమంలో, కొందరు నాయకులు ‘కోదండరామ్రెడ్డి’ అని ఆయన ఏ సామాజికవర్గానికి చెందిన వారో తెలిసేలా నొక్కిచెప్పిన తీరు పలువురిని ఆశ్చర్యపరిచింది.
అది పరిశోధన జరిపి కొత్తగా కనుగొన్న విషయమేం కాదని, పార్టీలోని అత్యధికులకు ఎప్పట్నుంచో తెలుసనేది జనాభిప్రాయం. కొత్తగా ఇప్పుడే ఎందుకు నొక్కి చెప్పాల్సి వచ్చింది అన్నది ప్రశ్న! కులం వంకతోనో, స్వార్థం వంకతోనో, ఇతర పార్టీల తొత్తనో, కుట్ర ముద్రవేసో కోదండరామ్ని చిన్నబుచ్చడం ద్వారా ఆయన విమర్శల్ని పలచన చేయాలనే యోచన కావచ్చు. కులం ఆధారంగా రాజకీయాలు నడువవు, ప్రజల ఆకాంక్షల్ని నెర వేర్చడంలో ప్రభుత్వాలు విఫలమైనపుడు కేవలం ప్రత్యామ్నాయ రాజకీయాలనే ప్రజలు విశ్వసిస్తారు అనే మాట లోగడెప్పుడో కోదండరామ్ స్వయంగా పేర్కొన్నట్టు ఆయన సన్నిహితులు చెబుతారు. అవకాశముండి ఆయన అంగీకరిస్తే... ఆయన నేతృత్వంలో ఒక కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు చెందిన యువ నాయకులు కొందరు ఒక ప్రయత్నం కూడా చేసి విఫలమయ్యారు. అమెరికా సహా ఈమధ్య ఆయన ఎక్కడికి వెళ్లినా ‘మీరు ఇంకొంచెం స్వరం పెంచాలి, విమర్శకు వాడి–వేడి అద్దాలి’ అనే సూచనలు, ఒత్తిళ్లు వస్తున్న మాట నిజం. ‘ప్రెషర్గ్రూప్గా ఎన్నాళ్లుంటారు, ఓ రాజకీయ పార్టీని ప్రారంభించే అవకాశ ముందా?’ అని ఇష్టాగోష్ఠిలో ఓ జర్నలిస్టు అడిగినపుడు, కోదండరామ్ తన సహజదోరణిలో... ‘ప్రజా సమస్యలపైన వివిధ స్థాయిల్లో వేర్వేరు పోరాటాలు సాగుతున్నాయి. ఏ పోరాటం ఏ మలుపు తీసుకుంటుందో! ఆ గర్భం నుంచి ఏం ఉద్భవిస్తుందో!’అని స్పందించినట్టు సమాచారం. ఇవన్నీ తెలిసి, కోదండరామ్ను ఆయన విమర్శల్ని తేలిగ్గా తీసుకొని ఉపేక్షిస్తే, ప్రత్యామ్నాయ శిబిరానికి కేంద్ర బిందువు కాగల ప్రమాదకారి అని పాలకపక్షం భావించడానికి అన్ని విధాలా ఆస్కారం ఉంది.
రెండేళ్ల సమయం ఎక్కువా? తక్కువా?
కోదండరామ్ ఏమవుతాడన్న సంగతలా ఉంచినా, ప్రధాన ప్రత్యర్థి పార్టీలు పలచనవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆయనో, ఆయన్ని çస్ఫూర్తిగా తీసుకొని మరికొందరో ప్రభుత్వాన్ని అదే పనిగా విమర్శిస్తుంటే... తటస్థులు, ఊగి సలాటలో ఉన్నవారు తమ శిబిరంలోకి రాకుండా జారిపోతారేమోనన్న భయం టీఆర్ఎస్ నాయకత్వానికుండటం సహజం! అయితే, ‘ధిక్కారమును సైతునా...’ అన్న ధోరణి అభ్యంతరకరం. సుదీర్ఘ పోరాటం తర్వాత సాధించుకున్న రాష్ట్రంలో ప్రజలకు ఎన్నో ఆశలు, ఆకాంక్షలు ఉండటం సహజం. అవన్నీ రెండేళ్లలోనే సాధించేస్తారని ఎవరూ భావించరు. సాధించాలని మొండిగా పట్టుబట్టరు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడానికి రెండేళ్లు సరిపోయేంత కాలం కాదు. కల్పించిన ఆశల్ని, పుట్టుకొచ్చిన ఆకాంక్షల్ని, ఇచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చే బాటలోనే నడుస్తున్నామా? దారి తప్పుతున్నామా? అని ఆత్మపరిశీలన చేసుకోవడానికి రెండేళ్లు సరిపోయే కాలమే! మధ్యంతరంగా తప్పు సరిదిద్దుకోవడానికి అవకాశముండే సంధి కాలం. ‘అయిదేళ్లయినా సమయమిచ్చి అప్పుడు గొంతెత్తండి’ అంటారు కొందరు ఆశ్రితులు. అయిదేళ్లయ్యాక మాట్లాడటానికి ఏముంటుంది? అప్పటికి అంతా అయిపోతుందనేది విమర్శకుల మాట. ఇంతటి వివాదానికి కారణమైన కోదండరామ్ విమర్శ వచ్చింది తెలంగాణ విద్యావంతుల వేదిక నుంచి. అక్కడారోజు 28 పేజీల ఒక బుక్లెట్ను విడుదల చేశారు. ‘రెండేండ్ల టిఆర్ఎస్ పాలన–ఒక పరిశీలన’ అన్న ఈ పుస్తకం, కోదండరామ్ ముందు మాటతో మొదలై, వేదిక కార్యదర్శి ధర్మార్జున్ నివేదిక ‘పోరాట విజయం లోంచి... అధికార గందరగోళంలోకి’తో ముగుస్తుంది. ఇందులో, వేదిక అధ్యక్షుడు రవీందర్తో పాటు ప్రొ.హరగోపాల్, జీవన్కుమార్, కె.రఘు తదితరులు 8 మంది ప్రత్యేకంగా రాసిన వ్యాసాలు, అందులో సుని«శిత విమర్శలున్నాయి. రచయితలంతా కూడా తెలంగాణ సాధన పోరులో క్రియాశీలకంగా ఉన్నవారే! విమర్శలే తప్ప బాగు చేసిన చోట ప్రశంసలు లేవని, ఇది ఏకపక్షంగా సాగిందనేది పాలకపక్షం అభియోగం.
ఎదురుదాడికి బదులు చర్చకు తావిచ్చి ఉండాల్సింది
సర్కారు తరపున మంత్రులైనా, పాలకపక్షం నుంచి మరొకరైనా చర్చను ఆహ్వానించి ఉండాల్సిందనే అభిప్రాయం వ్యక్తమైంది. కోదండరామ్ విమర్శ చేసిన తర్వాతి రోజు పాలకపక్షం ముప్పేట దాడులకు దిగింది. ఈ ప్రతి విమర్శలు మధ్యాహ్నం తర్వాత మొదలై స్వల్ప వ్యవధిలోనే తారస్థాయికి చేరిన తీరును బట్టి అవి పథకం ప్రకారమే జరిగాయని స్పష్టమైంది. వరం గల్–కరీంనగర్–హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు, చోటామోటా నాయకుల నుంచి దాదాపు మొత్తం మంత్రివర్గం వరకు స్థాయీ భేదాలు లేకుండా విమర్శలు గుప్పిస్తూ కోదండరామ్ను తూలనాడిన తీరు పలువురికి నచ్చ లేదు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లవుతున్నా ప్రతిదానికీ ఉద్యమ నేపథ్యాన్ని వాడుకునే వారు, ఉద్యమ సమయంలో కోదండరామ్ పోషించిన పాత్రను దృష్టిలో ఉంచుకొనైనా సంయమనం పాటించి ఉండాల్సిందనేది సగటు పౌరుల అభిప్రాయం. సూచనల అమలు సాధ్యాసాధ్యాల సంగతెలా ఉన్నా, కనీసం పిలిచి చర్చించి ఉండాల్సింది. ప్రభుత్వం ఏం చేస్తోంది, ఏం చేయాల నుకుంటోంది చెప్పి మెప్పించి ఉండాల్సింది. అలా కాకుండా బట్టకాల్చి ముఖాన వేయడం, కాంగ్రెస్కు మౌత్పీస్–ఊతకర్ర అనడం, ఆయనపై వ్యాఖ్య చేయగల స్థాయి లేనివారు కూడా ఘాటుగా నిందిస్తూ దురుద్దేశాల్ని ఆపాదించడం అత్యధికులకు మింగుడుపడలేదు. ఉద్యమ కాలంలో వైరి శిబిరం నుంచి సమైక్య రాగం వినిపించి అధికారం వచ్చాక ఈ పంచన చేరినవారు కూడా కోదండరామ్ది కుట్ర, కుతంత్రం అని చేసిన వ్యాఖ్యలు విమర్శలకు తావిచ్చాయి. ఉద్యమ రోజుల్లో, సీమకు చెందిన ఓ నాయకుడి విమర్శను తిప్పికొడుతూ... ‘కోదండరామ్ అంటే, నాలుగుకోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షకు ప్రతీక’ అని కేసీఆర్ అన్న మాటల వీడియో క్లిప్పింగ్ సామాజిక మాధ్యమాల్లో పలుమార్లు తాజాగా చక్కర్లు కొట్టింది. అంతలోనే ఆయన ద్రోహి, కుట్రదారుడయ్యాడా? అన్న ప్రశ్న రేకెత్తుతోంది ‘ఏ జాక్కు ఛైర్మన్? ఇంకా జాక్ ఉందా? ముందు ఆయన్ను ఏదైనా పార్టీలో చేరి మాట్లాడమను!’ వంటి చౌకబారు విమర్శలు పాలకపక్షం వారి భయాన్ని, ఆందోళనని, అంతకుమించిన డొల్లతనాన్నే వెల్లడించాయన్న అభిప్రాయం కలిగింది. ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తన విధానాల మీద తానే విమర్శనాత్మకంగా ‘జాస్మిన్’ కలం పేరుతో ఇలస్ట్రేటెడ్ వీక్లీలో వ్యాసాలు రాసేవారు. ప్రజాస్వామ్యంలో ఆరోగ్యవంతమైన ఓ చర్చను ఆహ్వానించే ఉదాత్త స్థితి నుంచి రాజకీయాలు, కనీసం విమర్శను, అభిప్రాయాన్ని సహిం చలేని దుస్థితికి దిగజారడానికి రాజకీయ ‘క్లైమేట్ చేంజ్’ కారణం. కానీ, భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడం ప్రజాస్వామ్యంలో అంత తేలిక కాదు. తెలం గాణ వైతాళికుడు, మహారథి దాశరథి అన్నట్టు,
‘‘.... తమ మంత్రం పారదింక – ఉచ్చు త్రెంచుకొనెను జింక
ఇక స్వేచ్ఛా ప్రయాణము – ఇదే తెలంగాణము’’
- దిలీప్ రెడ్డి
ఈమెయిల్: dileepreddy@sakshi.com