breaking news
individual
-
ఎఫ్ అండ్ ఓ... ముంచేస్తోంది!
స్మోకింగ్ కిల్స్... అని హెచ్చరించినా సిగరెట్లు తాగుతూనే ఉంటారు. మద్యపానం హానికరం అన్నా... తాగేవారు మానరు. స్టాక్ మార్కెట్ డే ట్రేడింగ్ కూడా అలాంటిదే. ప్రతి 10 మందిలో 9 మంది నష్టపోతున్నారనే సెబీ వార్నింగ్ డే ట్రేడర్లకు పట్టదు. ఎందుకంటే ఇదో వ్యసనం. గతేడాది ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో జనం పోగొట్టుకున్నది ఏకంగా 91,685 కోట్లు. దీన్లో రూ.20వేల కోట్లు పన్నులు, ఎక్సే్ఛంజీల చార్జీలు, బ్రోకరేజీ సంస్థల ఫీజలుకు పోతే... మరో 72 వేల కోట్లు నికరంగా పోగొట్టుకున్నవి. విచిత్రమేంటంటే చరిత్రలో తొలిసారిగా మన మార్కెట్లలో డే–ట్రేడర్ల సంఖ్య గతేడాది తగ్గిపోయింది. అంతక్రితం ఏడాదితో పోలిస్తే 20 లక్షల మంది తగ్గిపోయారు. అంటే.. పోగొట్టుకున్నవారంతా మౌనంగా మార్కెట్ల నుంచి నిష్క్రమిస్తున్నారన్న మాట. మార్కెట్లలో ఎందరు నష్టపోతున్నారు? ఎందరు లాభపడుతున్నారు? అసలు ట్రేడింగ్ ధోరణి ఎలా ఉంది? ఏ వయసు వారు ట్రేడింగ్లోకి వస్తున్నారు? మూలధనం ఎంత పెడుతున్నారు? అసలు షేర్లు కొంటున్నారా? ట్రేడింగ్ మాత్రమే చేస్తున్నారా? అనే అంశాలపై ‘సెబీ’ రెండు అధ్యయనాల్ని విడుదల చేసింది. డే–ట్రేడర్లకు కనువిప్పు కలిగించే ఈ అధ్యయనాల సమాహారమే ఈ ‘సాక్షి వెల్త్’ స్టోరీ..నెలకోసారి ఎక్స్పైరీ ఉండే ఆప్షన్లు వారానికోసారి ఎక్స్పైరీతో ఫ్రెష్గా ముస్తాబవుతున్నాయి. నిఫ్టీ, సెన్సెక్స్లే కాకుండా క్రూడ్ ఆయిల్, గోల్డ్, సిల్వర్లో సైతం ఆప్షన్లు జోరందుకున్నాయి. ఖాతాలో పదివేలున్నా సరే ట్రేడింగ్ చేయొచ్చునంటూ కొన్ని బ్రోకరేజీ సంస్థలు యువతను ఆకర్షిస్తున్నాయి. డీమ్యాట్ ఖాతాల్లో గనక షేర్లుంటే... డబ్బులు లేకపోయినా మార్జిన్తో ట్రేడింగ్ చేసుకోవచ్చని ఊరిస్తున్నాయి. దీంతో స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ వాల్యూమ్ విపరీతంగా పెరిగింది. కానీ ఫలితమైతే మారలేదు. నష్టాలు తప్పటంలేదు. డే ట్రేడింగ్ చేసిన ప్రతి 10 మందిలో 9 మంది నష్టపోతున్నారనే సత్యాన్ని సెబీ తాజా అధ్యయనం ద్వారా మరోసారి చెప్పింది. కాకపోతే కొన్నేళ్లుగా ప్రతి ఏటా విపరీతంగా పెరుగుతూ వచ్చిన ట్రేడర్ల సంఖ్య... గతేడాది మాత్రం తొలిసారిగా తగ్గింది. అదికూడా మామూలు తగ్గుదల కాదు. ఏకంగా 20 శాతం. ఈ అధ్యయనం ప్రకారం... → 2026 ఆర్థిక సంవత్సరంలో 87.7% మంది ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్లో ఏకంగా రూ.72,000 కోట్లు పోగొట్టుకున్నారు. అదికూడా ఎక్సే్ఛంజీలకు, బ్రోకరేజీలకు చెల్లించిన ఛార్జీలు కాకుండా. ఈ ఛార్జీలు రూ.20వేల కోట్లు కలిపితే మొత్తంగా వీరు నష్టపోయింది రూ.92 వేల కోట్లు పైనే. → ఎక్సే్ఛంజీ చార్జీలు, బ్రోకరేజీలు కాకుండానే 2025లో పోగొట్టుకున్న రూ.1.11 లక్షల కోట్లతో పోలిస్తే ఇది తక్కువే. కాకపోతే ట్రేడర్ల సంఖ్య కూడా 98 లక్షల నుంచి 78 లక్షలకు పడిపోయింది. → సగటు ట్రేడరు పోగొట్టుకున్న మొత్తం మాత్రం రూ.1.13 లక్షల నుంచి రూ.1.16 లక్షలకు పెరిగింది. → గడిచిన ఐదేళ్లతో పోలిస్తే ట్రేడర్ల సంఖ్య తగ్గిపోవడమన్నది ఇదే తొలిసారి.మార్కెట్లకు దూరమవుతున్నదెవరు? తొలిసారి 20% మంది మార్కెట్లను వదిలేశాక.. మనం సమాధానం వెతకాల్సిన ప్రశ్న ఎందరు నష్టపోతున్నారన్నది కాదు. ఇంకా ఎవరు ట్రేడింగ్ చేస్తున్నారన్నది. సెబీ అధ్యయనంలో దీనిక్కొంత సమాధానం దొరికింది. అదేంటంటే ఇపుడు రిటైల్ ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్లో యువత సంఖ్యే ఎక్కువని. చిన్న ఇన్వెస్టర్లు, ఆర్థిక సంస్థలతో సంబంధంలేని మామూలు ట్రేడర్లు వీరికి తోడవుతున్నారు. ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్ చేసే రిటైలర్లలో 43% మంది 30 ఏళ్ల లోపు వారే. వీరిలో 90% మంది గతేడాది నష్టపోయిన వారే. ఈ యువ ట్రేడర్లు వారి ఖాతాల్లోని షేర్లకన్నా 93 రెట్లు ఎక్కువ మొత్తాన్ని ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్లో పెడుతున్నారు. అంటే... రూ. 1,000 షేర్లలో ఉంటే 93 వేలు ఎఫ్ అండ్ ఓలో ట్రేడింగ్కు వాడుతున్నారన్న మాట. అంటే వీళ్లెవరూ తమ షేర్లలో రిస్క్ తగ్గించుకోవటానికి ఎఫ్ అండ్ ఓను ఉపయోగించుకోవట్లేదు. జస్ట్ దాన్నో బెట్టింగ్ సాధనంగా చూస్తున్నారు. అంతే! వాస్తవమేంటంటే ఓ ఇన్వెస్టరుకు తన ఖాతాలో రూ.లక్ష విలువైన షేర్లున్నాయనుకోండి. వాటిపై వచ్చే మార్జిన్తో కోట్ల రూపాయల ఎఫ్ అండ్ఓ ట్రేడింగ్ చేయగలడు. అది చాలా ఎక్కువ మొత్తం కనక నష్టం వస్తే ఈ లక్షలో రూపాయి కూడా మిగలకపోవచ్చు. తక్కువ ట్రేడింగ్... ఎక్కువ లాభం లాభాలు ఆర్జించిన వారి విషయంలోనూ అదే సూత్రం వర్తిస్తోంది. ఏడాదికి రూ.5 లక్షల లోపు ఆదాయాన్ని సంపాదిస్తున్న ట్రేడర్లు వారి ఖాతాల్లోని షేర్ల విలువకన్నా ఏకంగా 73 రెట్లు ఎక్కువ ఎఫ్ అండ్ ఓ టర్నోవర్ చేస్తున్నారన్నది సెబీ తేలి్చన వాస్తవం. కానీ ఏడాదికి రూ.కోటికన్నా ఎక్కువ సంపాదించేవారు మాత్రం తమ పోర్టుఫోలియోకన్నా 14 రెట్లు మాత్రమే అధికంగా ఎఫ్ అండ్ ఓ టర్నోవర్ చేస్తున్నారు. అంటే ఎక్కువ సంపాదించేవారు తక్కువ ట్రేడింగ్ చేస్తున్నారు. తక్కువ సంపాదించేవారు, నష్టపోతున్న వారు మాత్రమే అత్యధికంగా ట్రేడింగ్ చేస్తున్నారు. ముగ్గురిలో ఒకరు.. అలాంటివారే! కొంతమంది ట్రేడర్లకు ఇన్వెస్ట్మెంట్లతో ఏమాత్రం సంబంధం ఉండటం లేదు. వారి ఖాతాల్లో జీరో షేర్లున్నా సరే... ఎఫ్ అండ్ ఓ మాత్రం జోరుగా చేస్తున్నారు. ప్రతి ముగ్గురిలో ఒకరు ఇలా పూర్తి స్పెక్యులేషన్ ట్రేడింగ్నే చేస్తున్నారట. వాస్తవానికి ఎఫ్ అండ్ ఓ ట్రేడర్లలో 78 శాతం మంది తమ ఖాతాల్లో రూ.లక్ష కన్నా తక్కువ షేర్లున్నవారే. కానీ ట్రేడర్లు పోగొట్టుకుంటున్న మొత్తంలో 70 శాతం వీళ్లదే. అంటే.. వీళ్లు తమ షేర్లతో సంబంధం లేకుండా ఎఫ్ అండ్ ఓ చేస్తున్నారు. భారీగా పోగొట్టుకుంటున్నారు. ఆప్షన్స్... అదే ఆకర్షణ ఎఫ్ అండ్ ఓ అంటే... ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. కానీ ఫ్యూచర్స్లో ట్రేడ్ చెయ్యాలంటే భారీగా డబ్బులుండాలి. నష్టమైనా, లాభమైనా సమ పాళ్లలోనే ఉంటుంది. కానీ ఆప్షన్స్లో అలాకాదు. రూ.100, వెయ్యితో కూడా ఆప్షన్స్ చేయొచ్చు. అప్పటికప్పుడే వెయ్యి డబుల్ అయిపోవచ్చు. సున్నా కూడా అయిపోవచ్చు. ఇదే అసలైన ఆకర్షణ. ఈ ఆకర్షణ ఎంతలా పెరిగిందంటే... 2020లో ఎఫ్ అండ్ ఓలో రూ.100 టర్నోవర్ జరిగితే అందులో రూ.5 మాత్రమే ఆప్షన్స్ది. మిగతా మొత్తం ఫ్యూచర్స్దే. కానీ 2025 వచ్చేసరికి ఈ 5 ఏకంగా రూ.41కి చేరింది. నిజానికి ఆప్షన్ కొనటమంటే షేరు కొన్నట్లు కాదు. ఎందుకంటే షేర్లకు ఎక్స్పైరీ ఉండ దు. పడినా మళ్లీ కోలుకుంటాయి. కానీ ఆప్షన్లకు ఎక్స్పైరీ ఉంటుంది. ఎక్స్పైరీ గడు వు దగ్గరకొస్తున్నకొద్దీ ఆప్షన్ ప్రీమియం కరిగిపోతుంది. చివరికి సున్నా అయిపోతుంది. అలాగని ఆప్షన్లు కొనటం మాత్రమే రిస్కనుకుంటే అదీ పొరపాటే. ఆప్షన్లు కొనేవారి కన్నా అమ్మే వారిలో నష్టపోయేవారు తక్కువే. కానీ వారి నష్టాలు మాత్రం బీభత్సం. అప్షన్లు కొనేవారి సగటు నష్టాలు రూ.4.6 లక్షలు ఉంటే... అమ్మేవారి సగటు నష్టాలు రూ.51.7 లక్షలు. దీన్నిబట్టే రిస్క్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.సెబీ ప్రయోగం ఫలించిందా? నిజానికి ఎఫ్ అండ్ ఓ నిబంధనల్ని కఠినం చేయటాన్ని సెబీ 2024లోనే మొదలుపెట్టింది. → వీక్లీ ఆప్షన్ల సంఖ్యను తగ్గించింది. కొన్ని మాత్రమే అందుబాటులో ఉంటే ట్రేడింగ్ను నియంత్రించవచ్చనేది సెబీ వ్యూహం. → కాంట్రాక్టు సైజుల్ని పెంచింది. అంటే కొనటానికి అవసరమయ్యే మొత్తాన్ని బాగా పెంచింది. ఇలా చేయటం వల్ల లాభమైనా, నష్టమైనా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి చాలామంది దూరంగా ఉంటారన్నది సెబీ ఆలోచన. → ఆప్షన్ ప్రీమియంలను కొనటానికైనా, అమ్మటానికైనా కావలసిన మొత్తాన్ని పూర్తిగా ముందే చెల్లించటమనే నిబంధన తెచ్చింది. → పొజిషన్ల పరిమితుల్ని ఇంట్రాడేలో పర్యవేక్షించటం... ఎక్సే్ఛంజీలన్నింటినీ ఒక తాటిమీదికి తెస్తూ ఎక్స్పైరీ తేదీల్ని హేతుబద్ధం చేయటం వంటివి చేసింది. కాకపోతే తాజా అధ్యయనాన్ని పరిశీలిస్తే కొన్ని కోణాల్లో సెబీ చర్యలు ఫలితాలనిచ్చాయి. రిటైలర్ల టర్నోవర్ తగ్గింది. వాళ్ల సంఖ్య తగ్గింది. నష్టాలు తగ్గాయి. కానీ దీనివల్ల.. నష్టపోయే ట్రేడర్లేమైనా తగ్గారా అంటే అలాంటిదేమీ జరగలేదు. నష్టపోయేవారి సంఖ్య అసాధారణంగానే ఉంది. పైపెచ్చు వారి నష్టాలు పెరిగాయి. కాబట్టి నాణ్యమైన ట్రేడర్లు పెరగటమన్నదే ఇపుడు సెబీ ముందున్న అతిపెద్ద సవాలు.ఆ 23 శాతం మందే...సెబీ వివరాల ప్రకారం... ట్రేడింగ్లో నష్టాల్లో 90 శాతం వరకూ కేవలం 23 శాతం మంది నుంచే వస్తున్నాయి. అంటే... మొత్తంగా 78 లక్షల మంది రూ.91వేల కోట్లు పోగొట్టుకుంటే... అందులో రూ.82 వేల కోట్లు పోగొట్టుకున్నది 18 లక్షల మందే. దీన్నిబట్టి కొందరు ఈ ట్రాప్లో ఇరుక్కుని అత్యధికంగా పోగొట్టుకుంటున్నారని అర్థమవుతుంది. వీళ్ల ధోరణిని విశ్లేషిస్తే బయటపడ్డ అంశాలు నివ్వెరపరిచేలా ఉన్నాయి. అవి... → వీళ్లు తమ ఆదాయానికి మించి అత్యధికంగా టర్నోవర్ నమోదు చేస్తున్నారు. → పదేపదే నష్టాలొచ్చినా డబ్బులు తెచ్చి పెడుతున్నారు. → ఎక్స్పైరీ డేనాడు అత్యధికంగా ట్రేడ్ చేస్తున్నారు. → వీరి టర్నోవర్కు–పోర్టుఫోలియోకు పొంతన లేదు. → పదేపదే ఆప్షన్లు కొనటం... లాట్ సైజు పెంచుకుంటూ పోయి పోగొట్టుకోవటం.మెట్రోలకే పరిమితం కాదిప్పుడు... మొబైల్ యాప్లు, టెక్నాలజీ షేర్ల ట్రేడింగ్ను సమూలంగా మార్చేశాయి. పలితం... ఈ ఎఫ్ అండ్ ఓ ఆకర్షణ ఇప్పుడు మెట్రో నగరాలకే పరిమితం కావటం లేదు. దేశంలో ప్రధానంగా గుర్తించిన 30 మెట్రో నగరాలను మినహాయిస్తే... వాటి వెలుపలున్న ప్రాంతంలోనే ట్రేడింగ్ ఎక్కువగా జరుగుతోంది. 2024 ఆర్థిక సంవత్సరంలోనే ఏకంగా 72 శాతం ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్ మెట్రోలకు వెలుపల జరుగుతున్నట్లు వెల్లడయింది. అంటే నష్టపోతున్నవారిలో ఎక్కువ మంది టైర్–2, టైర్–3 పట్టణాలు, గ్రామాలకు చెందినవారన్న మాట. అది ఆందోళనకరమన్నది నిపుణుల మాట. అసలు లాభపడ్డది ఎవరు? సెబీ అధ్యయనం ప్రకారం చూస్తే రిటైల్ ట్రేడర్లు రూ.72వేల కోట్లు పోగొట్టుకుంటే... సంస్థాగత ఇన్వెస్టర్లు, సంస్థలు రూ.72వేల కోట్లు లాభాలను ఆర్జించాయి. ప్రొప్రయిటరీ ట్రేడర్లు అత్యధికంగా రూ.44వేల కోట్లు లాభపడగా, ఎఫ్పీఐలు రూ.14వేల కోట్లు, కార్పొరేట్లు రూ.8వేల కోట్లు, మ్యూచువల్ ఫండ్లు రూ.3వేల కోట్లు, ఎల్ఎల్పీ/పార్ట్నర్షిప్ సంస్థలు రూ.3వేల కోట్లు ఆర్జించాయి. ఇది రిటైలర్లు పోగొట్టుకున్న రూ.72వేల కోట్లకు సమానం. ఇక మిగిలిన మొత్తంలో ఎన్ఎస్ఈ రూ.11,366 కోట్లు, బీఎస్ఈ రూ.3,134 కోట్లు చార్జీల రూపంలో వసూలు చేశాయి. కొంత మొత్తం ప్రభుత్వానికి సెక్యూరిటీ లావాదేవీల పన్ను రూపంలో చేరింది. కొంత సెబీకి ఛార్జీల రూపంలో చేరగా... మిగిలింది బ్రోకరేజీ రూపంలో బ్రోకరేజీ సంస్థలకు దక్కింది. అయితే ఇదంతా ట్రేడర్లు పోగొట్టుకున్న లెక్క మాత్రమే. లాభాలను ఆర్జించినట్లు చెబుతున్న సంస్థలు కూడా బ్రోకరేజీ, కొంత ఎస్టీటీ, కొంత ఎక్సే్ఛంజీలకు చార్జీలుగా చెల్లిస్తాయి. అంటే ఈ ట్రేడింగ్ వ్యవస్థపై ఫీజులు, పన్నులు, బ్రోకరేజీల రూపంలో పోతున్నదే ఎక్కువ భాగమన్నమాట!రమణమూర్తి మంథా -
అదానీ వివాదం దేశానికి సంబంధించింది
రాయ్బరేలీ: అదానీ గ్రూప్ వివాదం వ్యక్తిగతమంటూ ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తప్పుబట్టారు. ‘అదానీ వ్యవహారం నా వ్యక్తిగతం కాదు..దేశానికి సంబంధించిన వ్యవహారం’అంటూ కుండబద్దలు కొట్టారు. ఇటీవల అమెరికా పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ..అధ్యక్షుడు ట్రంప్తో అదానీపై వన లంచాల ఆరోపణలపై చర్చించారా అని మీడియా ప్రశ్నించగా.. ‘అది ఒక వ్యక్తికి సంబంధించిన అంశం, ఇద్దరు ప్రముఖ ప్రపంచ నేతలు కలుసుకున్నప్పుడు ఇటువంటివి చర్చకు రావు’అని పేర్కొనడం తెలిసిందే. ప్రధాని మోదీతో భేటీ అనంతరం ట్రంప్ కూడా అదానీ వ్యవహారాన్ని ప్రస్తావించకపోవడం గమనార్హం. రాహుల్ శుక్రవారం సొంత నియోజకవర్గం రాయ్బరేలీలోని లాల్గంజ్లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ..‘నరేంద్ర మోదీ జీ, ఇది వ్యక్తిగత వ్యవహారం కాదు..దేశానికి సంబంధించినది. మీరు నిజంగా భారత ప్రధానే అయితే అదానీ వివాదం గురించి ఆరాతీసి ఉండేవారు. ఆరోపణలపై విచారణకు అవసరమైతే అదానీని అమెరికా పంపిస్తానని ట్రంప్కు చెప్పి ఉండేవారు. అలాంటిదేమీ లేకుండా, కేవలం వ్యక్తిగతమంటూ వదిలేశారు’అని రాహుల్ పేర్కొన్నారు. వ్యాపారవేత్త గౌతమ్ అదానీను తన మిత్రుడని పేర్కొన్న మోదీ, ఆయన గురించి ట్రంప్ను ఎలాంటి విషయాలు అడగలేదని కూడా చెప్పారని రాహుల్ అన్నారు. అమెరికాలో అదానీపై అవినీతి, దొంగతనం కేసు పెండింగ్లో ఉందని రాహుల్ తెలిపారు. సోలార్ పవర్ కాంట్రాక్టుల కోసం అమెరికా కంపెనీలు భారత్లోని అధికారులకు రూ.2,100 కోట్ల మేర లంచాలు ఇచ్చినట్లు గత బైడెన్ ప్రభుత్వంలోని న్యాయశాఖ ఆరోపించింది. ఇందులో అదానీ గ్రూప్కు కూడా సంబంధమున్నట్లు తెలిపింది. ఈ ఆరోపణలను అదానీ గ్రూపు నిరాధారాలంటూ ఖండించింది. యోగి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ కాదు..అసలు ఇంజినే లేదు యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. యూపీలో ఉన్నది డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కాదు..ఘోరంగా విఫలమైన అసలు ఇంజినే లేని ప్రభుత్వమంటూ ఎద్దేవా చేశారు. కర్నాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో మంచిగా పనిచేస్తుండగా, యూపీ ప్రభుత్వం దేశంలోనే అత్యంత విఫలమైన ప్రభుత్వమని దుయ్యబట్టారు. యూపీ ప్రభుత్వం ప్రజల సమస్యల్ని పరిష్కరించేందుకు ఎటువంటి చర్యలను తీసుకోవడం లేదన్నారు. మరో వైపు, కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణలో మునిగిపోయిందని చెప్పారు. ‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తుంది. కర్ణాటక, తెలంగాణ మాదిరిగా తయారు చేస్తుంది. నోట్ల రద్దు వల్లే అవినీతితోపాటు చదువుకున్న యువతలో నిరుద్యోగం పెరిగిపోయింది. ఉద్యోగావకాశాలను సృష్టించాలంటే మొదటగా చేయాల్సిన పని చిన్న పరిశ్రమలను బలోపేతం చేసిన రక్షణ కల్పించడమే’ అని రాహుల్ సూచించారు. వ్యక్తిగతమన్న మోదీ వ్యాఖ్యలపై -
కొత్త పన్ను విధానంలోకి ఇక భారీగా..!
న్యూఢిల్లీ: తాజా బడ్జెట్లో తెరతీసిన ఆదాయ పన్ను భారీ రిబేట్లు కారణంగా కొత్త విధానంలోకి మరింత మంది వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు చేరతారని ప్రభుత్వం భావిస్తోంది. 90 శాతానికిపైగా పన్ను చెల్లింపుదారులు కొత్త విధానాన్ని ఎంపిక చేసుకోనున్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) చైర్మన్ రవి అగర్వాల్ ఒక ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం 75 శాతంమంది కొత్త విధానంలో ఉన్నారు. ఆర్థిక మంత్రి సీతారామన్ రూ. 12 లక్షల వరకూ ఆదాయంపై పన్ను లేకుండా ప్రతిపాదించడంతో పలువురు కొత్త విధానంలోని మారనున్నట్లు తెలియజేశారు. పన్ను శ్లాబుల పునర్వ్యవస్థీకరణ సైతం ఇందుకు సహకరించనున్నట్లు పేర్కొన్నారు. ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వినియోగాన్ని మరింత పెంచడం ద్వారా మానవ జోక్యం లేని పన్నుల నిర్వహణకు ప్రభుత్వం, ఆదాయ పన్ను శాఖలు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వివరించారు. ఆదాయాన్ని ప్రకటించడంలో సాధారణ పన్ను చెల్లింపుదారులకు సులభమైన పద్ధతులను అందుబాటులోకి తీసుకువచి్చనట్లు తెలియజేశారు. ఇందుకు ప్రవేశపెట్టిన సరళతర ఐటీఆర్–1, ముందస్తుగా నమోదయ్యే ఐటీ రిటర్నులు, మూలంవద్ద పన్ను(టీడీఎస్)లో ఆటోమాటిక్ మదింపు తదితరాలను ప్రస్తావించారు. మినహాయింపులు, తగ్గింపులవంటివి లేని నూతన పన్ను విధానంలో పన్ను చెల్లింపుదారులకు మదింపు మరింత సులభమవుతుందని పేర్కొన్నారు. వెరసి ఐటీ నిపుణుల అవసరంలేకుండానే ఐటీఆర్ను దాఖలు చేయవచ్చని తెలియజేశారు. -
భారీగా పెరిగిన వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదారులు
సాక్షి, అమరావతి: గడచిన దశాబ్దకాలంలో దేశంలో వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లించే వారి సంఖ్య భారీగా పెరిగింది. 2014 నుంచి 2024 వరకు వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదారుల పెరుగుదలపై ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక విడుదల చేసింది. 2014లో వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లించిన వారి సంఖ్య కేవలం 40వేలు ఉండగా, 2024లో ఐదు రెట్లు.. అంటే 2.2 లక్షలకు పెరిగిందని నివేదిక వెల్లడించింది.అలాగే దేశంలో 2014లో మధ్యతరగతి ఆదాయం రూ.1.5 లక్షల నుంచి రూ.5.0 లక్షల వరకు ఉండగా 2024లో మధ్యతరగతి ఆదాయం రూ.2.5 లక్షల నుంచి రూ.10.0 లక్షల వరకు పెరిగిందని పేర్కొంది. దేశంలో గత పదేళ్లలో ఆదాయ పన్ను చెల్లింపుదారుల సంఖ్య 4.8 కోట్లు పెరిగిందని నివేదిక వివరించింది. 2014లో ఆదాయ పన్ను చెల్లించే వారి సంఖ్య 3.79 కోట్ల మంది ఉండగా 2014లో 8.62 కోట్ల పెరిగిందని ఎస్బీఐ వెల్లడించింది. -
ఏటా 10 శాతం చొప్పున జీవితాంతం
న్యూఢిల్లీ: జీవిత బీమా రంగ దిగ్గజం ఎల్ఐసీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూడు నుంచి నాలుగు వరకు నూతన పాలసీలను ఆవిష్కరించనుంది. నూతన వ్యాపార ప్రీమియంలో రెండంకెల వృద్ధిని సాధించాలనే లక్ష్యంతో ఉంది. ‘‘గతేడాదితో పోలిస్తే రెండంకెల వృద్ధిని సాధిస్తాం. ఎందుకంటే ఇండివిడ్యువల్ రిటైల్ వ్యాపారం పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆకర్షణీయమైన కొత్త పాలసీలను ఆవిష్కరించనున్నాం’’అని ఎల్ఐసీ చైర్మన్ సిద్ధార్థ మహంతి తెలిపారు. డిసెంబర్ మొదటి వారంలో ఎల్ఐసీ ఒక ఉత్పత్తిని తీసుకువస్తుందని వెల్లడించారు. దీనితో మార్కెట్లో మంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. డిసెంబర్లో తెచ్చే నూతన పాలసీ గురించి వివరిస్తూ.. పాలసీ మెచ్యూరిటీ తర్వాత (గడువు ముగిసిన అనంతరం) జీవితాంతం ఏటా సమ్ అష్యూర్డ్లో (బీమా కవరేజీలో) 10 శాతం చొప్పున లభిస్తుందని తెలిపారు. ఇది మార్కెట్లో సంచలనాన్ని సృష్టిస్తుందన్నారు. 20–25 ఏళ్ల తర్వాత ఎంత చొప్పున వస్తుంది, ఎంత ప్రీమియం చెల్లించాలన్నది తెలుసుకునేందుకు ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపిస్తారని పేర్కొన్నారు. ఈ ప్లాన్పై రుణ సదుపాయం, ముందస్తు ఉపసంహరణకూ అవకాశం ఉంటుందన్నారు. హామీతో కూడిన రాబడులు ఇచ్చే పాలసీలకు పాలసీదారులు, వాటాదారులు ఆసక్తి చూపిస్తున్నారని చెబుతూ.. తమ కంపెనీ వాటాదారుల్లో చాలా మంది పాలసీదారులుగా ఉన్నట్టు మహంతి తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో (ఏప్రిల్–సెపె్టంబర్) నూతన వ్యాపార ప్రీమియం (ఇండివిడ్యువల్) 2.65 శాతమే వృద్ధి చెంది రూ.25,184 కోట్లకు చేరుకోవడం గమనార్హం. -
మహీంద్రా నుంచి చిన్న ట్రాక్టర్లు: ఏఆర్ రెహమాన్ గీతం అదుర్స్
కేప్టౌన్ (దక్షిణాఫ్రికా): ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) కొత్తగా మరిన్ని వాహనాలను ఆవిష్కరించింది. చిన్న ట్రాక్టర్లు, కార్లు వీటిలో ఉన్నాయి. చిన్న కమతాల రైతులు, వ్యక్తిగత ఫామ్హౌస్లున్న వారు మొదలైన వర్గాలకు ఉపయోగపడేలా తేలికపాటి, చిన్న ట్రాక్టర్లను ఫ్యూచర్స్కేప్ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో కంపెనీ ప్రవేశపెట్టింది. మహీంద్రా ఓజా పేరిట ఆవిష్కరించిన ఈ ట్రాక్టర్ల శ్రేణిలో ఏడు మోడల్స్ ఉంటాయి. వీటి ధర రూ. 5,64,500 నుంచి రూ. 7,35,000 వరకు (పుణె– ఎక్స్ షోరూమ్) ఉంటుంది. తెలంగాణలోని జహీరాబాద్ ప్లాంటులో తయారు చేసే ఈ ట్రాక్టర్లను దేశీయంగా విక్రయించడంతో పాటు ఉత్తర అమెరికా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, యూరప్ తదితర ప్రాంతాలకు కూడా ఎగుమతి చేయనున్నట్లు సంస్థ ఈడీ (ఆటో, ఫార్మ్ విభాగాలు) రాజేశ్ జెజూరికర్ తెలిపారు. వచ్చే మూడేళ్లలో ట్రాక్టర్ల ఎగుమతులను రెట్టింపు చేసుకోవాలని నిర్దేశించుకున్నట్లు చెప్పారు. కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో 18,000 పైచిలుకు ట్రాక్టర్లను ఎగుమతి చేసింది. ఓజా ప్లాట్ఫాంపై రూ. 1,200 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు జెజూరికర్ వివరించారు. మహీంద్రా రీసెర్చ్ వ్యాలీ, మిత్సుబిషి మహీంద్రా అగ్రికల్చర్ మెషినరీ కలిసి దీన్ని తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు. (2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్) థార్.ఈ, గ్లోబల్ పికప్ ఆవిష్కరణ.. ఫ్యూచర్స్కేప్ కార్యక్రమంలో భాగంగా ఎంఅండ్ఎం ఎలక్ట్రిక్ ఎస్యూవీ ‘థార్.ఈ’ని కూడా ఆవిష్కరించింది. వినూత్నమైన డిజైన్, ఇంటీరియర్స్తో పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని దీన్ని రూపొందించినట్లు సంస్థ ఆటోమోటివ్ విభాగం ప్రెసిడెంట్ వీజే నక్రా తెలిపారు. మరోవైపు, అంతర్జాతీయ మార్కెట్ల కోసం గ్లోబల్ పికప్ వాహనాన్ని సైతం సంస్థ ఆవిష్కరించింది. రోజువారీ ప్రయాణ అవసరాలతో పాటు సాహస ట్రిప్లకు కూడా అనువుగా ఇది ఉంటుందని నక్రా వివరించారు. అటు, విద్యుత్ వాహనాల శ్రేణి కోసం నెలకొల్పిన మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటోమొబైల్స్ (ఎంఈఏఎల్)కి కొత్త లోగోను కూడా కంపెనీ ఆవిష్కరించింది. దీనికి సంబంధించిన ‘లే ఛలాంగ్’ ప్రచార గీతాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ స్వరపర్చారు. (టెకీలకు గుడ్ న్యూస్: ఇన్ఫోసిస్ మెగా డీల్) -
గూగుల్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇక ఆ బెడద ఉండదు
న్యూఢిల్లీ: సెర్చ్ ఇంజీన్ దిగ్గజం గూగుల్ యూజర్లకు భారీ ఊరట కల్పించింది. ఇప్పటివరకూ ఉన్న 15జీబీ స్టోరేజీ సామర్థ్యాన్ని ఏకంగా 1టీబీ సామర్థ్యానికి పెంచనుంది. ఈ మేరకు ప్రతి గూగుల్ వర్క్స్పేస్ వ్యక్తిగత ఖాతాలో ఆటోమేటిగ్గా 1 టీబీ నిల్వ సామర్థ్యం ఉండేలా అప్గ్రేడ్ చేయనుంది. ఈ విషయాన్ని గూగుల్ తన తాజా బ్లాగ్ పోస్టులో వెల్లడించింది. దీంతో గూగుల్ స్టోరేజ్, జీమెయిల్ లాంటి వాటిల్లో స్టోరేజ్ బాధ లేకుండా అపరిమితంగా ఫైల్స్ను దాచుకోవచ్చు. ప్రతి Google Workspace వ్యక్తిగత ఖాతా 1 టీబీ సురక్షిత క్లౌడ్ స్టోరేజ్తో వస్తుందని కంపెనీ ప్రకటించింది. వినియోగదారులు అడగాల్సిన అవసరం లేకుండానే ప్రతి ఖాతాలో 1 టీబీ స్టోరేజ్ స్వయంచాలకంగా స్టోరేజ్ అప్గ్రేడ్ చేస్తామని బ్లాగ్ పోస్ట్లో తెలిపింది. తాజా చర్య గూగుల్ డ్రైవ్ దాదాపు 100 రకాల ఫైల్స్ స్టోరేజ్కు, పీడీఎఫ్, సీఏడీ, జేపీజీ తదితర రకాల ఫైల్స్ స్టోర్ చేసుకునేందుకు అనుమతిస్తుంది. వీటిని మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఫైల్స్లా కన్వర్ట్ చేసుకోకుండానే ఎడిట్ చేసేలా ఆప్షన్స్ ఎనేబుల్ చేయనుంది. దీనికి తోడు గూగుల్ డ్రైవ్ ఇప్పుడు మాల్వేర్, స్పామ్, రాన్సమ్వేర్ నుంచి రక్షణగా బిల్ట్ ఇన్ ప్రొటెక్షన్ ఫీచర్లను అందించనుంది. -
మంచిమాట..నీ నిశ్చలమైన మనసే నీవు
అన్ని భావాలలోకి అతి ముఖ్యమైనది ‘నేను’ అనే భావం. వ్యక్తిత్వమనే భావం కూడా అన్ని భావాలకీ మూలమే. ఏ భావమైనా దేనినో ఒకదానిని ఆశ్రయించే ఉదయిస్తుంది. అహంకారమే భావాలకి నిలయం. అంటే, భావాల వ్యాపకం అహంకారానికి సంబంధించినదే. నువ్వు, అతడు, అది అంటూ మధ్యమ ప్రథమ పురుషలకి సంబంధించినవి ‘నేను’ అనే ఉత్తమ పురుషలకి తప్ప ఇంకెవరికీ గోచరించవు. అందువల్ల ఉత్తమ పురుష ఉదయించిన తరువాతనే అవీ ఉదయిస్తాయి. అంటే కలిసే వస్తాయి. కలిసే అణగిపోతాయి. .ఈ ‘నేను’ అనేది ఎక్కడినుండి ఉదయిస్తున్నది? దాని కోసం లోపల వెతకాలి. అప్పుడు అది మాయమవుతుంది. మనస్సంటే ఆలోచనల సమూహమే. అన్ని ఆలోచనలకు మూలం ‘నేను’ అనే భావం. కాబట్టి మనస్సు అంటే ‘నేను’ అనే ఆలోచనే. ‘నేను’ అనే ఆలోచన పుట్టుకే వ్యక్తి జననం కూడ. దాని మరణమంటే వ్యక్తి మరణమే. ఈ ‘నేను’ అనే భావాన్ని వదిలించుకోవాలి. అది సజీవంగా ఉన్నంతకాలమూ బాధ తప్పదు. ‘నేను’ పోతే, బాధా పోతుంది. నేను ఫలానా వ్యక్తినని, అంతటి వాడిని, ఇంతటి వాడిని, అలాంటి వాడిని, ఇలాంటి వాడిని అనే విజ్ఞానాన్ని పక్కన పెట్టి, నీవు నువ్వుగా ఉండటం ‘నీ నిజస్వరూపం’. ఆత్మయే చైతన్యంగా మారి ’నేను ఫలానా’ అని గిరిగీసుకోవటమే ’అహం’. అంతకు మించి ‘అహం’ అంటూ ప్రత్యేకంగా లేదు. విషయాలతో మమేకం చెందకుండా మనసును గమనిస్తే దైవమే మన మనసు, తనువు, ఇంద్రియాలు, ప్రపంచంగా మారిందని అర్ధం అవుతుంది. దీనికి కారణం నువ్వు కాదని తెలుసుకుంటే, కర్తృత్వంపోయి శాంతి వస్తుంది. మనకి మనసు స్వరూపమే కాదు, దాని క్రియలు కూడా పూర్తిగా తెలియవు. కేవలం ఆలోచనల ద్వారా ఈ శరీర బాహ్యక్రియలు చేయించేది మాత్రమే మనసని అనుకుంటున్నాం. మనస్సుతో కుస్తీ పడకండి. మీ మనస్సు ఎక్కడికీ వెళ్ళదు. అది ఇక్కడే ఉండి దేని గురించో ఆలోచిస్తూ ఉంటుంది. మీరు కేవలం మీ ఆలోచనల వల్ల అలా మోసగింపబడుతున్నారు. అది ఇక్కడే ఉంది. దేని గురించో ఊహించుకుంటోంది. అది ఎక్కడికీ వెళ్ళడం లేదు. మీరు దానితో ఎంతగా మమేకం అయిపోయా రంటే మీరు మీ మనస్సు మరెక్కడో ఉంది అని అనుకుంటున్నారు. మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. మీరు కాని విషయాలతో మిమ్మల్ని మీరు, గుర్తించుకుంటున్నారు. మీ మనస్సు అన్నది నిరంతరం పని చేస్తూనే ఉంటుంది. మీరు ఎన్నో విషయాలతో మిమ్మల్ని మీరు గుర్తించుకుని మీ మనస్సుని ఆపాలని చూస్తున్నారు. మీరు ఒక లక్ష సంవత్సరాలు తీసుకున్నా సరే.. ఇది జరగదు... మీ మనస్సు ఒక పెద్ద గందరగోళం. ఎందుకంటే.. మీరు ఎన్నో విషయాలతో మిమ్మల్ని మీరు గుర్తించుకున్నారు. మీరు మీ శరీరంతో.. మీరు వేసుకొన్న దుస్తులతో.. మీ జుట్టుతో.. ఎన్నో విషయాలతో.. మిమ్మల్ని మీరు గుర్తించుకున్నారు. ఇప్పుడు మీ మనస్సు అంతు లేనట్లుగా, అలా వెళ్లిపోతూనే ఉంటుంది. మీరు దానిని ఆపలేరు. మీరు ఇక్కడ కూర్చొని, ధ్యానం చెయ్యాలనుకుంటూ ఉన్నారు. మీరు ఏ బయటికి వెళ్ళడం గురించో, సినిమా గురించో, స్నేహితుడి గురించో, మరో దాని గురించో ఆలోచిస్తారు. మీకు అందరూ ఏమి చెప్పారంటే భగవంతుడి గురించి ఆలోచించండి, అన్నీ సరిగ్గానే ఉంటాయి అని. మీరు ఆ భగవంతుని గురించి ఆలోచించినప్పుడు మీమనస్సు ఎక్కడెక్కడికో వెళుతుంది. మనస్సు తత్త్వం అలాంటిది. దీనిని మీరు ఆపలేరు. ఎందుకంటే, మీరు ఏవైతే కాదో అటువంటి విషయాలతో, మిమ్మల్ని మీరు గుర్తించుకున్నారు. ఇక్కడ మనం మీ మనస్సుని నియంత్రించడం గురించి మాట్లాడడం లేదు. మీరు ఏది కాదో, అన్న దాని పట్ల అవగాహన పెంచుకోవాలి. మీ మొట్టమొదటి గుర్తింపు మీ శరీరం. మీరు మీ శరీరంతో, మీరు వేసుకొన్న దుస్తులతో, మీ జుట్టుతో, ఎన్నో విషయాలతో.. మిమ్మల్ని మీరు గుర్తించుకున్నారు. మీ భార్యా, మీ పిల్లలూ, మీ కుటుంబం, మీ విద్యా, మీ మతమూ ఇవన్నీ అంతులేనన్ని గుర్తింపులు.. ఇన్ని గుర్తింపులతో మీ మనస్సు ప్రశాంతంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు. అది అలా కుదరదు. అందుకనే, నేను శూన్యం అని ఒక చిన్న, సరళమైన సాధన చేయాలి. దీని ద్వారా మీరు మీకూ, మీ మనస్సుకీ కొంత దూరం ఏర్పరచుకోవచ్చు. ఈ దూరం ఏర్పడిన తరువాత, అది గోల చేసే మనసైనా సరే.. పర్వాలేదు. మీరు, దాని నుంచి విడవగలరు. ఒకసారి మీరు, మీ మనసు నుంచి విడిపడిపోయిన తరువాత మీరు, మీ గుర్తింపులన్నింటి నుంచీ విడవగలరు. ఎందుకంటే, ఈ మనస్సే మీలో ఈ గుర్తింపులని తయారు చేస్తూ ఉంది. అందుకని అన్ని రకాల విషయాలనూ ఆలోచించకండి. ప్రతి రోజూ రెండుసార్లు, పదిహేను నిమిషాల పాటూ, మీ గందరగోళాన్నంతా పక్కన పెట్టి కూర్చోండి. మీరు ధ్యానం కూడా చెయ్యనక్కర్లేదు. కేవలం కూర్చోండి. జరగాల్సినవి అవే జరుగుతాయి. – భువనగిరి కిషన్ యోగి ► మీ పొరపాటు ఆలోచనలన్నిటినీ విడిచి పెట్టిన క్షణాన మీ మనస్సు ఒక అద్దంలా మారిపోతుంది. అప్పుడది ఏమీ చేయదు. అన్నిటినీ ప్రతిబింబిస్తూ ఉంటుంది. ► మీ మనస్సు ఒక యంత్రాంగం. దానిలో స్పష్టత ఉన్నప్పుడే అది బాగా పని చేస్తుంది. ► నిశ్చలంగా ఉన్నప్పుడు ఉండే నీ ఉనికే ‘నీ నిజస్వరూపం’ -
కోవిడ్ ఎఫెక్ట్... ఆరోగ్య బీమా జోరు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్–19 పుణ్యమాని భారత్లో ఆరోగ్య బీమా పాలసీలు ఒక్కసారిగా పెరిగాయి. ఆసుపత్రి ఖర్చులకు భయపడ్డ ప్రజలు ప్రైవేటు బీమా కంపెనీల వద్దకు పరుగెత్తారు. అటు ఐఆర్డీఏఐ చొరవతో బీమా కంపెనీలు కరోనా కవచ్ పేరుతో ప్రత్యేక పాలసీలను సైతం ఆఫర్ చేశాయి. దీంతో 2020 ఏప్రిల్–సెప్టెంబర్లో నాన్–లైఫ్ బీమా కంపెనీలు వసూలు చేసిన మొత్తం ప్రీమియంలో హెల్త్ ఇన్సూరెన్స్ వాటా దూసుకెళ్లి 29.7 శాతం కైవసం చేసుకుంది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 15.8 శాతం అధికం. ఇక మోటార్ ఇన్సూరెన్స్ వాటా 13.8% తగ్గి 29%కి పరిమితమైంది. నాన్–లైఫ్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్లో ఆరోగ్య బీమా గత 2 దశాబ్దాల్లో తొలిసారి గా వాహన బీమా విభాగాన్ని దాటడం గమనార్హం. 2014–15లో ఆరోగ్య బీమా వాటా 23.4%, మోటార్ విభాగం వాటా 44.4% నమోదైంది. ఈ ఏడాది సెప్టెంబరుతో ముగిసిన ఆరు నెలల కాలంలో వృద్ధి పరంగా ఫైర్ విభాగం 33.5 శాతంతో తొలిస్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానంలో ఆరోగ్య బీమా వచ్చి చేరింది. ఇండివిడ్యువల్ పాలసీలే అధికం.. వాస్తవానికి ఆరోగ్య బీమా రంగంలో గ్రూప్ పాలసీలదే హవా. ఈసారి మాత్రం ఇండివిడ్యువల్స్ నుంచి దరఖాస్తులు ఎక్కువయ్యాయి. గతేడాదితో పోలిస్తే ఇండివిడ్యువల్ పాలసీల ప్రీమియం 2020 ఏప్రిల్–సెప్టెంబర్లో 34 శాతం అధికమైతే, గ్రూప్ పాలసీల వృద్ధి 16 శాతానికే పరిమితమైంది. దీంతో హెల్త్ ప్రీమియంలో ఇండివిడ్యువల్ పాలసీల శాతం 36 నుంచి 41 శాతానికి చేరింది. అయితే నాన్–లైఫ్ విభాగంలో పోటీ పడుతున్న 32 సంస్థల్లో 23 కంపెనీలు వృద్ధిని నమోదు చేశాయి. హెల్త్ విభాగంలో దిగ్గజ కంపెనీ న్యూ ఇండియా అష్యూరెన్స్ కేవలం 5 శాతం వృద్ధి సాధించింది. యునైటెడ్ ఇండియా అష్యూరెన్స్ 57.9 శాతం, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ 45.6 శాతం వృద్ధిని దక్కించుకున్నాయి. 2014–15 నుంచి 2018–19 మధ్య కంపెనీలు వసూలు చేసిన ప్రతి రూ.100 ప్రీమియంలో క్లెయిమ్స్ కింద సగటున రూ.96 చెల్లించాయి. అదే మోటార్ విభాగంలో రూ.84, ఫైర్ సెగ్మెంట్లో రూ.81 చెల్లించాయి. మహమ్మారి కారణంగా.. జూలై 2017–జూన్ 2018 మధ్య చేపట్టిన నేషనల్ శాంపిల్ సర్వే ప్రకారం దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో 85.9%, పట్టణాల్లో 80.9% మందికి బీమా పాలసీలు లేవని గణాంకాలు చెబుతున్నాయి. ఆరోగ్య బీమా ప్రయోజనాల పట్ల అవగాహన లేకపోవడమే ఇందుకు కారణమని మణిపాల్సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్ సీఈవో ప్రసూన్ సిక్దర్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘కోవిడ్–19తో ఆరోగ్య బీమా తప్పనిసరన్న భావన ప్రజల్లో వచ్చింది. ఆరోగ్య బీమా పరిశ్రమ (పర్సనల్ యాక్సిడెంట్తో కలిపి) ఈ ఏడాది ఏప్రిల్–సెప్టెంబర్లో 14% వృద్ధి చెంది రూ.31,132 కోట్ల ప్రీమియం వసూలైంది. మణిపాల్సిగ్నా 30% వృద్ధితో రూ.329 కోట్ల ప్రీమియం పొం దింది. రానున్న రోజుల్లో పరిశ్రమ సానుకూలంగా ఉంటుంది’ అని చెప్పారు. కాగా, బీమా కంపెనీలకు రూ.8,000 కోట్ల విలువైన కోవిడ్–19 క్లెయిమ్స్ వచ్చినట్టు తెలుస్తోంది. ఇందులో రూ.3,500 కోట్ల విలువైన క్లెయిమ్స్ సెటిల్ అయ్యాయని సమాచారం. -
భూ వివాదంలో వ్యక్తిపై దాడి
పరిస్థితి విషమం హత్యాయత్నం కేసు నమోదు కూసుమంచి : భూ వివాదంలో ఓ వ్యక్తిపై దాడి చేయగా.. అతడు తీవ్రంగా గాయపడిన సంఘటన ఆదివారం మండలంలోని చేగొమ్మలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఇరుకులపాటి రమేష్కు అతడి చిన్నతాత కుమారుడైన ఇరుకులపాటి వీరభద్రయ్యకు కొంతకాలంగా చేలోని దారి విషయంలో గొడవ జరుగుతోంది. పలుమార్లు ఇద్దరు ఘర్షణ కూడా పడ్డారు. ఆదివారం ఉదయం రమేష్ డ్రిప్ పైపులు వేయించేందకు కూలీలతో వెళుతుండగా వీరభద్రయ్య, అతడి కుమారుడు అడ్డుకున్నారు. ఇరువురి మధ్య వివాదం చోటుచేసుకోవటంతో వీరభద్రయ్య, అతడి కుమారుడు.. రమేష్పై గడ్డపార, పారతో దాడికి దిగారు. దీంతో అతడికి తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి వెళ్లి క్షతగాత్రుడిని ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితుడి అన్న వెంకటేశ్వర్ల ఫిర్యాదు మేరకు వీరభద్రయ్య, అతడి కుమారుడిపై హత్యాయత్నం కేసును నమోదు చేసినట్లు ఎస్సై శ్రీధర్ తెలిపారు. -
వ్యక్తిగత ప్రశంసలతో టీం వర్క్ కు ప్రోత్సాహం
మనిషికి ఇచ్చే వ్యక్తిగత గుర్తింపు.. ప్రశంసలు... వారిని టీం వర్క్ చేయడానికి ప్రోత్సహిస్తుందని, వారిలో మంచి శక్తినిస్తుందని తాజా పరిశోధనలు చెప్తున్నాయి. చైనాలోని ఓ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ లో పనిచేసేవారిపైనా, కొందరు విద్యార్థులపైనా జరిపిన అధ్యయనాల్లో ఈ కొత్త వివరాలు వెల్లడయ్యాయి. ప్రయోగశాలలు, ఫీల్డ్ ప్రయోగాల ద్వారా అధ్యయనాల్లో... వ్యక్తిగత గుర్తింపు.. టీమ్ వర్క్ కు ఎంతగానో సహకరిస్తుందని కనుగొన్నారు. వ్యక్తి పని తీరుపై అతడికి ఇచ్చే ప్రశంసల ప్రభావం ఉంటుందని చైనాలో జరిపిన కొత్త పరిశోధనల్లో తెలుసుకున్నారు. ఒక్కొక్కరి పనిని వ్యక్తిగతంగా గుర్తించడం, ప్రశంసలు తెలియజేయడం టీం వర్క్ ను ప్రోత్సహిస్తుందని అమెరికా నార్త్ కరోలినా స్టేట్ యూనివర్శిటీకి చెందిన పూలే కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్ సహ అధ్యయనకారుడు ప్రొఫెసర్ బ్రాడ్లీ కిర్క్ మాన్ తెలిపారు. అధ్యయనకారులు చైనా విశ్వవిద్యాలయానికి చెందిన 256 మంది విద్యార్థులపై జరిపిన అధ్యయనాల్లో ఒక్కొక్కరి పనులను విడివిడిగా గుర్తించడంతోపాటు, సమూహాలతో కలసికూడ గుర్తించారు. వ్యక్తిగత పనుల్లో ప్రశంసలు పొందిన వారే సమూహాల్లో శక్తివంతంగా పనిచేసినట్లు గుర్తించామని తమ అధ్యయనాల వివరాలను అప్లైడ్ సైకాలజీ జర్నల్ లో ప్రచురించారు. రెండవ రౌండ్ లోనూ వ్యక్తిగత ప్రశంసలు పొందిన వ్యక్తి... ఇటు వ్యక్తిగతంగానూ, సమూహాలతో కలసి కూడా పనిలో గణనీయమైన మెరుగును కనబరచినట్లు అధ్యయనకారులు గుర్తించారు. అంతేకాక వ్యక్తిగత గుర్తింపులేని వ్యక్తి టీమ్ మెంబర్ గా కూడ ఎటువంటి మెరుగుదలను చూపించలేకపోయినట్లు తెలుసుకున్నారు. ఉత్తర చైనాలోని ఓ ఉత్సత్తి సంస్థ కూలీలపై కూడ పరిశోధకులు ఈ కొత్త ప్రయోగాలను నిర్వహించారు. కంపెనీలోని కొన్ని విభాగాల్లో 'ఎంప్లాయీ ఆఫ్ ద మంత్' పేరుతో టీమ్ లోని అత్యధిక పనిమంతులను గుర్తించి మిగిలిన విభాగాల్లో గుర్తించకుండా వదిలేశారు. అయితే ఇక్కడకూడా ప్రత్యేక గుర్తింపునివ్వకుండా వదిలేసిన టీమ్ లలో అటు వ్యక్తిగతంగా గాని, టీమ్ వర్క్ లో గాని పనిలో ఎటువంటి ప్రత్యేక ఫలితాలూ కనిపించకపోవడాన్ని తెలుసుకున్నారు. -
రోహిత్ కోసం ప్రపంచ స్కాలర్ల లేఖ..!
ప్రపంచ పండిత సమాజం ఏకమైంది. హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో దళిత విద్యార్థి ఆత్మహత్య ఘటన ఇప్పుడు భారత్ తో పాటు, దక్షిణాసియా అంతర్జాతీయ స్కాలర్లను ఏకతాటిపైకి తెచ్చింది. భారత ఉన్నత విద్యలో కుల వివక్షపై న్యాయ పోరాటానికి నడుం బిగించింది. ఈ నేపథ్యంలో పలు దేశాల్లోని విద్యావంతులు, ప్రొఫెసర్లు సంతకాలు చేసిన ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు. ఐదుగురు దళిత పీహెచ్ డీ విద్యార్థులను వర్శిటీ నుంచి బహిష్కరించడం కుల వివక్షకు తార్కాణమని.. విద్యార్థులు కనీసం మాట్లాడేందుకు అనుమతించకుండా రాజకీయ ఒత్తిడులతో వారిని బహిష్కరించడం అన్యాయమని, ఈ విషయంలో వెంటనే న్యాయం విచారణ చేపట్టాలని వారు లేఖలో డిమాండ్ చేశారు. విద్యార్థులపై పాలకుల పక్షపాత వైఖరి, రాజకీయ నాయకుల ప్రమేయం భయంకర పరిణామాలకు దారితీస్తోందని ప్రపంచ స్కాలర్ల సమాజం ధ్వజమెత్తింది. యూనివర్శిటీ బహిష్కరించిన ఐదుగురు దళిత విద్యార్థుల్లో ఒకరైన స్కాలర్ స్టూడెంట్ వేముల రోహిత్.. వర్శిటీ బహిష్కరణ తన గుర్తింపునకు భగం కలిగించిందన్న నిరాశకు లోనయ్యాడని.. తక్షణ గుర్తింపుకోసం స్వంత జీవితాన్నేబలి చేసుకున్నాడని వారంటున్నారు. ప్రజాస్వామ్య భారతదేశంలో యువకుల మేధో, వ్యక్తిగత అభివృద్ధిని వేగవంతం చేయాల్సిన ప్రాధమిక బాధ్యతలో విద్యా సంస్థలు వైఫల్యం చెందుతున్నాయని ఆరోపించారు. సంస్థల్లో సమస్యలను చక్కగా పరిష్కరించలేని పరిస్థితుల్లో రోహిత్ వంటి దళిత విద్యార్థులెందరో వివక్ష, నిరాశలతోనే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటూ స్కాలర్ల సమాజం ఆందోళన వ్యక్తం చేసింది. వెంటనే రోహిత్ సహ విద్యార్థులు నలుగురినీ విచారించాలనీ, రోహిత్ కుటుంబానికి సహకారం అందించడంతోపాటు... అతడి ఆత్మహత్యపై ప్రత్యేకంగా పోలీస్ విచారణ జరిపించాలని దక్షిణాసియా అంతర్జాతీయ స్కాలర్స్... హైదరాబాద్ వర్శిటీ అధికారులను కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో న్యాయ విచారణ చేపడితే సరిపోదని, భవిష్యత్తులో కూడ ఇటువంటి సంఘటనలు జరగకుండా నివారించేందుకు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. రోహిత్ వంటి విద్యార్థుల పౌర జీవితంతోపాటు వారి ఆరోగ్యవంతమైన రాజకీయ చర్చకు విశ్వవిద్యాలయాలు వేదికలు కావాలన్నారు. భారత విశ్వవిద్యాలయాల్లో ముఖ్యంగా రాజకీయ నాయకుల ప్రమేయం, కుల వివక్ష ప్రపంచవ్యాప్తంగా విద్యార్థుల ప్రతికూల కీర్తికి దోహదపడుతోందన్నారు. గౌరవ ప్రదమమైన, మంచి వాతావరణంలో విద్యాబోధన సాగించడంతోపాటు వర్శిటీల్లో రాజకీయ ప్రమేయం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.


