కారు ఢీకొట్టిన వ్యక్తి మృతి
తణుకు అర్బన్ : అదుపుతప్పిన కారు ఢీకొట్టిన ఘటనలో తీవ్రగాయాలపాలైన ఆచంటకు చెందిన నెక్కంటి నగేష్ (42) ఆదివారం ఉదయం మృతిచెందారు. శనివారం సాయంత్రం తణుకు ఎన్టీఆర్ పార్కు వద్ద అదుపుతప్పిన కారు ఐదుగురిని ఢీకొట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన నగేష్ స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. రెండుచోట్ల కాలు ఎముకలు విరగడంతో పాటు అతని కడుపుపై నుంచి కారు వెళ్లడంతో పక్కటెముకలు కూడా విరిగిపోయాయి. దీంతో ఊపిరితిత్తుల్లో ఇబ్బందులు తలెత్తి క్షతగాత్రుడు మృతిచెందినట్టు వైద్యులు చెబుతున్నారు. మృతుడి భార్య రమణి సిద్దాంతంలో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. వీరికి పిల్లలు లేరు. ఆదివారం మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు.