IDPL
-
891.38 ఎకరాల భూమి సర్కార్కే..
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ (ఐడీపీఎల్)కు బాలానగర్లో అప్పగించిన 891.38 ఎకరాల భూమికి సంబంధించి హైకోర్టు కీలక ఉత్తర్వులిచ్చింది. ఆ భూమిని రాష్ట్ర ప్రభుత్వం తిరిగి స్వాదీనం చేసుకోకుండా 2008 నాటి పారిశ్రామిక, ఆర్థిక పునర్విర్మాణ మండలి (బీఐఎఫ్ఆర్) ఇచ్చిన ఉత్తర్వును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 2008లోనే ప్రభుత్వం భూమిని అధికారికంగా స్వాధీనం చేసుకున్నందున, బీఐఎఫ్ఆర్ ఉత్తర్వులో హేతుబద్ధత లోపించిందని చెప్పింది. నాటి ఉత్తర్వు అమలులో ఉంటే రాష్ట్ర ప్రభుత్వం పూడ్చలేని నష్టాన్ని చవిచూస్తుందని అభిప్రాయపడింది. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయకుండా, వాదనలు వినకుండా ఉత్తర్వులు ఇవ్వడాన్ని తప్పుబట్టింది. ఇప్పటికే ఈ భూమిని టీజీఐఐసీకి అప్పగించడం కూడా జరిగిందని గుర్తు చేసింది. తదుపరి విచారణ జూన్ 22కు వాయిదా వేసింది. ఈ వివాదం 90వ దశకంలో మొదలైంది. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వినియోగం కోసం ఆ భూమిని సేకరించి, ఒక ఫార్మాస్యూటికల్ ప్లాంట్ను స్థాపించడానికి ఐడీపీఎల్కు బదిలీ చేసింది. ఆ భూమిని కేవలం పారిశ్రామిక ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించాలనే నిర్దిష్ట ఒప్పందం కింద అప్పగించారు. అయితే, ఐడీపీఎల్ ఫార్మాస్యూటికల్ ఉత్పత్తిపై దృష్టి పెట్టకుండా, తన పరిపాలనా భవనాలను ప్రైవేట్ కంపెనీలకు లీజుకు ఇవ్వడానికి ప్రయత్నిస్తోందని తెలుసుకున్న ప్రభుత్వం ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి చర్యలు ప్రారంభించింది. వివాదం బీఐఎఫ్ఆర్కు చేరడంతో.. భూ స్వాధీన ప్రక్రియను ఉపసంహరించుకోవాలని, కంపెనీపై బలవంతపు చర్యలను నిలిపివేయాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించింది. దీన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్పై జస్టిస్ నగేశ్ భీమపాక ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. మూడో పక్షానికి లీజుకివ్వడం కుదరదు.. ప్రభుత్వం తరఫున ఏజీ ఏ.సుదర్శన్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వం నిర్దిష్ట ప్రజాప్రయోజనం కోసం బదిలీ చేసిన భూమిని ఒక సాధారణ ప్రైవేట్ అమ్మకంలా పరిగణించకూడదన్నారు. ఒప్పందం ప్రకారం పరిశ్రమల స్థాపన కోసమే ఈ భూమిని వినియోగించుకోవాలి తప్ప.. మూడో పక్షానికి లీజుకు, సబ్ లీజుకు ఇచ్చి తద్వారా ఆదాయ వనరుగా మార్చుకోకూడదన్నారు. ఐడీపీఎల్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. 2008లో ఇచ్చిన ఉత్తర్వులపై అప్పీల్లో తీవ్ర జాప్యం జరిగిందని, పిటిషన్ను కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. 2008 నుంచి చట్టపరమైన పరిస్థితులు గణనీయంగా మారాయన్నారు. బీఐఎఫ్ఆర్ను రద్దు చేశారని, కేసును నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్కు సక్రమంగా బదిలీ చేశారనడానికి ఎటువంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు. రోజువారీ ఖర్చుల కోసం లీజుకు ఇవ్వడాన్ని కూడా సమర్థించలేమన్నారు. నాటి ఆదేశాలపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. -
HYD: యాచకురాలికి పురుడు పోసిన 108 సిబ్బంది, కానిస్టేబుల్
సాక్షి, జీడిమెట్ల: పురిటి నొప్పులు భరించలేక రోడ్డుపై పడిపోయిన ఓ యాచకురాలికి 108 సిబ్బంది ఓ మహిళా కానిస్టేబుల్ సహాయంతో పురుడు పోశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి 11.30గంటల ప్రాంతంలో ఐడీపీఎల్లోని డొమినోస్ సందులో ఓ గర్బిని పురిటి నొప్పులతో అవస్థ పడుతున్నట్లు జీడిమెట్ల పోలీసులకు సమాచారం అందింది. వెంటనే వారు 108 సిబ్బంది రాజు, శ్రీనివాస్లకు విషయం తెలిపి ఐడీపీఎల్ వద్దకు వాహనం పంపించారు. అప్పటికే ప్రసవ వేదనతో తల్లడిల్లుతున్న మహిళకు 108 సిబ్బంది ఓ లేడీ కానిస్టేబుల్ పురుడు పోయగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. జీడిమెట్ల సీఐ వపన్ సూచన మేరకు సదరు మహిళను 108 సిబ్బంది గాంధీ ఆస్పత్రికి తరలించారు. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఎవరు ఆమె! సదరు మహిళను పోలీసులు, 108 సిబ్బంది వివరాలు అడగగా తన పేరు కృష్ణవేణి అని తాను యాచకురాలిని అని తెలిపింది. దీంతో పాటు తనకు ఎవరూ లేరంటూ ఒంటిరిగా ఉంటూ భిక్షాటన చేస్తున్నట్లు మాత్రమే తెలిపిందని పోలీసులు అంటున్నారు. -
నేడు చంద్రన్న సంస్మరణ
తెలుగునేల మీద అలలు, అలలుగా ఎదిగిన అనేక ప్రజా ఉద్యమాలతో అర్ధ శతాబ్దం పైబడి నడిచిన దళిత సామాజిక ఉద్యమకారులు, నాటి ఇఫ్టూ కార్మిక నాయకులు, 2004లో నాటి ప్రభుత్వంతో విప్లవ పార్టీ తరఫున శాంతి చర్చల ప్రతినిధి, కల్లెపు చంద్రన్న అలియాస్ చర్చల చంద్రన్న అలియాస్ ఐడీపీఎల్ చంద్రన్న ఈ నెల 12న అమరులైనారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆలేరు దగ్గర టంగుటూరులో 1945 మే, 15న నిరుపేద దళిత కుటుంబంలో ముత్తమ్మ, ఎల్లయ్యలకు జన్మించిన పెద్దకొడుకు చంద్రన్న. చదువుల కోసం అష్టకష్టాలు పడి జనగామలో పదో తరగతి ముగించుకొని పొట్ట చేతపట్టు కుని సికింద్రాబాద్ చిలకలగూడలోని చింతబాయి బస్తీ చేరిండు. తెలంగాణ ఉద్యమం జోరుగా సాగుతున్న కాలంలో ఈశ్వరీ బాయిగారి వెంట ఉండి ఆందోళనలో పొల్గొంటూ ఐడీపీఎల్ ఉద్యోగిగా, ప్రాగాటూల్స్, ఆల్విన్, తుంగభద్ర ఇండస్ట్రీస్, బిర్లాప్లాంట్ సహా అనేక ఫ్యాక్టరీలలో విప్లవకార్మిక నాయకుడిగా ఎదిగాడు. దేశం నలు మూలల జాతీయ కార్మిక సంఘాల సభల్లో పాల్గొని, విప్లవ పార్టీ నిర్మాణంలోకి వెళ్ళి అడ్డగుట్ట, పార్సీగుట్ట, జగద్గిర్గుట్ట బతుకమ్మకుంట, భగత్సింగ్ నగర్ ఒకటేమిటి మురికివాడల పేదలకోసం, అసంఘటిత కార్మికుల కోసం అనేక పోరాటాలకు ఆయన నాయకత్వం వహించి జనశక్తి పార్టీ తరఫున 2004లో శాంతి చర్చలో పాల్గొన్న చర్చల చంద్రన్నగా మనకు తెలుసు. ఎన్నికల్లో పోటీ చేసి తెలంగాణలో బహుజన నాయకత్వం ఎదగాలని రాజకీయ ఆచరణకు శ్రీకారం చుట్టి మాదిగ ఉప కులాల ఫ్రంట్ ఏర్పాటుచేశారు చంద్రన్న. తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం ఏర్పాటు చేసి, అసంఘటిత కార్మిక సంఘాల ఫ్రంట్ నడిపి, తెలంగాణ కోసం పోరా డిన యోధులకు ఒక సంఘం ఉండా లని ‘తెలంగాణ స్వాతంత్య్ర సమరయోధుల సంఘం’ నడిపిన చంద్రన్నను స్మరించుకోవడం మన బాధ్యత. సంస్మరణ సభకు జెండా మనమే, ఎజెండా మనమే. నిన్న అంతిమ యాత్రలో కదిలింది మనమే, సంస్మరణ సభలో కదం తొక్కాల్సింది మనమే. జనం కొరకు నిలబడ్డ యోధుడు ‘అన్సంగ్ హీరో’గా కాల గర్భంలో కలిసిపోవద్దు. మన యోధుల చరిత్ర మనమే ఎత్తి పట్టాలి. ఈ సంస్మరణ సభను ఇంటి పార్టీ సమన్వయం చేస్తున్నది. చంద్రన్న అందరివాడు... సభను జయప్రధం చేద్దాం. (నేటి సాయంత్రం 6 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కల్లెపు చంద్రన్న సంస్మరణ సభ) -పోతిరెడ్డిపల్లి రామన్న మాదిగ, తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర సెక్రటరీ మొబైల్ : 90006 00744 -
గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
జగద్గిరిగుట్ట: రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం తెల్లవారుజామున నగరంలోని ఐడీపీఎల్ చౌరస్తా వద్ద జరిగింది. వివరాలు.. జగద్గిరిగుట్ట పాపిరెడ్డినగర్కు చెందిన సాంబశివరావు (50) బాలానగర్లోని ఉషా ఫ్యాన్ల కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే శనివారం ఉదయం విధులకు నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీ కొనడంతో మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి వాహనం వివరాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.


