breaking news
grandmothers
-
ఒంటరితనానికి విరుగుడు అమ్మమ్మ... నానమ్మల బడి
అమ్మమ్మ... నానమ్మ... ఇప్పుడు అంతగా పట్టని మనుషులు. వాళ్ల చేతికో ఫోన్ ఇచ్చేసి, గది ఇచ్చేస్తే ఎవరూ మాట్లాడాల్సిన పని లేదని అనుకునే కుటుంబాలు ఉన్నాయి. పెద్దవయసులో ఒంటరితనం ఫీలవుతున్న స్త్రీలు ఎందరో ఉన్నారు. అలాంటి వారిని తిరిగి స్కూలుకు పంపితే చదువుకు చదువు, స్నేహానికి స్నేహం దక్కుతాయి. మహారాష్ట్రలో పదేళ్ల క్రితం మొదలైన ఇలాంటి బడి నేటికీ కొనసాగుతూ ప్రతి ఊరికి ఇలాంటిది అవసరమని చాటుతోంది. ‘ఆజిబైచి శాల’ అంటే ‘అమ్మమ్మల బడి’ గురించి...ఇది అద్భుతం. మొన్నటి మార్చి 8న మహారాష్ట్రలోని ఆ చిన్న పల్లెలో, ముంబైకి 120 కిలోమీటర్ల దూరాన ఉన్న ఆ గ్రామంలో పెద్ద ఉత్సవం జరిగింది. అదేమిటో తెలుసా? ‘ఆజిబైచి శాల’ దశాబ్ది ఉత్సవం. అంటే ఆ స్కూల్ పెట్టి సరిగ్గా పదేళ్లయిన సందర్భంగా ఆ స్కూలు స్టూడెంట్లు, పెద్దమనుషులు, గ్రామస్తులు... ఆ స్కూల్ని స్థాపించిన యోగేంద్ర బంగార్ అనే ఉపాధ్యాయుడు ... అందరూ వేడుక చేసుకున్నారు. బహుశా ప్రపంచంలో ఇలాంటి స్కూల్ ఏర్పాటయ్యి ఇలా పదేళ్లపాటు కొనసాగి, ఇంకా కొనసాగుతూ ఉండటం ఎంత గొప్ప. ‘ఆజిబైచి శాల’ అంటే ‘అవ్వల బడి’. అందులో స్టూడెంట్స్ అందరూ అవ్వలే.మలుపు తిప్పిన ఆలోచనఒక ఆలోచన వెలిగితే అది చరిత్ర సృష్టిస్తుంది. పదేళ్ల క్రితం ఫంగణె అనే ఆ పల్లెలో ఛత్రపతి శివాజీ గాథను ఊరి వారికి ఏర్పాటు చేశారు. వచ్చిన గాయకులు శివాజీ గాథను పాడుతూ ఉంటే ఊళ్లోని వారందరూ ఒకవైపు; ఊళ్లోని అవ్వలందరూ ఒకవైపూ కూచున్నారు. వారి సంఖ్య 36. శివాజీ గాథను ఊరి వారందరూ ఉత్సాహంగా వింటుంటే అవ్వలకు ఆ కథ సరిగ్గా అర్థమయ్యీ అర్థం కాక ఇబ్బందిగా అనిపించింది. కథ ముగిశాక ఆ ఊరి ఉపాధ్యాయుడైన యోగేంద్ర బంగార్ దగ్గరకు వెళ్లిన వారందరూ ‘సారూ... మీరంతా కథ మస్తు ఎంజాయ్ చేశారు. మేం కూడా చదువుకుని ఉంటే మీలాగే ఎంజాయ్ చేద్దుము’ అన్నారు. యోగేంద్ర బంగార్కు మనసు కలుక్కుమంది. ఇంట్లో ఉండే అవ్వలు చదువు లేక పోవడం వల్ల, వయసు రీత్యా, మారిన కాలం వల్ల ఒంటరితనం అనుభవిస్తున్నారని, వీరికి ఒక ఉపయోగపడే కాలక్షేపం కల్పిస్తే మేలవుతుందని ఆయన అనుకున్నాడు. అదే సంవత్సరం అంటే 2016 మార్చి 8 మహిళా దినోత్సవం రోజున ఊళ్లోని చిన్న స్థలంలో షెడ్డు వేసి ‘అవ్వల బడి’ని ప్రారంభించాడు. అవ్వలు ముందు కంగారు పడ్డా ఆ నిర్ణయాన్ని స్వాగతించారు. ఊరి వాళ్లు మెచ్చుకుని మద్దతు ఇచ్చారు. అలా మొదలైన ఆ స్కూలు ఆ నాటి నుంచి అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది.పెద్ద సమూహం, ఎంతో మేలుగ్రామంలో అంతవరకూ ఎవరికీ పట్టని ఈ అవ్వలు ఇప్పుడు కొత్త ఉనికిలోకి వచ్చారు. గౌరవం పొందారు. అంతేకాదు ఇంట్లో వీరు తమ మనవలతో, మనవరాళ్లతో పాటుగా చదవడం మొదలుపెట్టారు. అవ్వల హోమ్వర్కులో మనవలు సాయం పట్టారు. దాంతో వాతావరణమే మారి పోయింది. ఈ అవ్వలందరూ కలిసి యాత్రలకు వెళుతున్నారు. అలాగే వీరికోసం హెల్త్ క్యాంపులు ఏర్పాటు అవుతున్నాయి. వృద్ధాప్యంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ ఎప్పటికప్పుడు తెలియచేస్తుంటారు. ఇవన్నీ వారికి ఆత్మవిశ్వాసం కలిగిస్తున్నాయి.‘ఈ బంధుగణం కావాలి’‘మన దేశంలో చిన్న వయసులో పెళ్లిళ్ల వల్ల అరవై ఏళ్లు వచ్చేసరికి స్త్రీలు ఒంటరితనాన్ని, నిరాసక్తతను అనుభవిస్తున్నారు. వీరికి చదువు లేక పోతే చాలా విషయాలకు మరింత దూరమవుతున్నారు. కనీసం ఫోను వాడకం కూడా రావడం లేదు. వీరి కోసం వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేయడం కంటే ఇలాంటి బడులు ప్రతి ఊళ్లో ప్రతి ఏరియాలో ఏర్పాటు చేయాలి. దీనివల్ల వీరికి మనం కూడా ఎంచదగ్గ మనుషులమే అనే భావన కలుగుతుంది. అవ్వల అనుభవం, వారి చిరునవ్వు ప్రతి ఇంటా ఉండాలంటే వారిని గౌరవించి పట్టించుకోవడం అవసరం‘ అంటాడు ఈ స్కూలు స్థాపకుడు యోగేంద్ర బంగార్.నిజమే... ప్రతి ఊరూ పూనుకుని ఇలాంటి స్కూలు ఏర్పాటు చేస్తే నిరక్షరాస్యత పోవడం మాత్రమే కాదు వృద్ధుల మనోవికాసం వారికి కొత్త జవసత్వాలను ఇస్తుంది. వారి ఉదాసీనత పోగొడుతుంది. పింక్ రంగు చీరల్లో ‘స్టూడెంట్స్’ఊరిలోని వాళ్ల ఫండ్స్తో మొదలైన ఈ స్కూలుకు అవ్వలందరికీ పింక్ రంగు చీరలు యూనిఫామ్గా ఇచ్చారు. స్కూల్ బ్యాగులు, పలకలు, బలపాలు అన్నీ ఇచ్చారు. స్కూలు మొదలైన రోజున ‘చేతికర్రతో తిరిగే ఆ స్త్రీలు బలపం పట్టుకోవడానికి విద్యార్థుల్లా’ బడికి వచ్చారు. ఆ దృశ్యం అందరినీ కదిలించింది. స్కూలు గంటలు వారికి సౌకర్యంగా ఏర్పాటు చేశారు. రోజువారీ పనులన్నీ అయ్యి, గొడ్లకు మేత వేసి, మధ్యాహ్నం భోజనం చేసి అప్పుడు బడికి రావాలి. రోజూ బడి మధ్యాహ్నం 2 నుంచి 4 వరకు రెండు గంటలు మాత్రమే జరుగుతుంది. మరాఠీ లిపి, కొద్దిపాటి లెక్కలు, ఆర్ట్స్, క్రాఫ్ట్స్... అన్నీ నేర్పిస్తారు. సిలబస్ ఉంటుంది. అన్నింటికీ మించి తమదంటూ ఒక చోటు.. తమకంటూ కొందరు మనుషులు వారికి దొరుకుతారు. -
ఏమ్మా ఎలా ఉన్నావు?
‘ఏమ్మా...ఇంతకీ నువ్వు ఎక్కడుంటావు?ఎంత మంది పిల్లలు, చిన్నవాళ్లేనా?నాకు ఒక మంచి ఫోన్ కొనిపెట్టవచ్చు కదా!... ఈ మాటలు విని పెద్దగా నవ్వుకోవడానికి ఏముంది!అయితే ఇంటర్నెట్వాసులు మాత్రం తెగ నవ్వుతున్నారు. అసలు విషయంలోకి వద్దాం... ఒక బామ్మ చాట్జీపీటీతో ముచ్చటించడం మొదలుపెట్టింది. అందులో భాగంగానే ‘ఎక్కడుంటావు? ఎంత మంది పిల్లలు?’ అని అడిగింది.బామ్మ అమాయకత్వానికి నవ్వులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఈ వీడియో 2 మిలియన్ల వ్యూస్ను సొంతం చేసుకుంది. కామెంట్ సెక్షన్ ఫన్నీ రియాక్షన్స్తో నిండిపోయింది. బామ్మలు ఏఐ చాట్బాట్స్తో సరదాగా సంభాషించడం అనేది సోషల్ మీడియాలో ట్రెండ్గా మారింది. -
మనవడా... నువ్వు మారుతావు
సిటీ నుంచి ఇంటికొచ్చిన మనవడు నానమ్మ గొలుసు కాజేశాడు. ఆ సంగతి నానమ్మ కనిపెట్టింది. మనవడంటే ఎంత ప్రేమో ఆమెకు. ఇంట్లో ఉండగా బాగా చదువుకుని టాపర్గా ఉన్న మనవడు సిటీకి వెళ్లి ఇలా అయ్యాడా అని బాధ పడింది. తర్వాత ఆమె చేసిన పని మనవడిలో మార్పు తెస్తుందో లేదో గాని టీనేజ్లో ఉన్న పిల్లల గురించి పెద్దలందరినీ ఆలోచనల్లో పడేసింది. కేరళలో జరిగిన ఈ తాజా ఘటన వివరాలు....కేరళలోని అలెప్పి.ఆ నానమ్మ రోజూ నిద్రపోయే ముందు తన ఒకటిన్నర సవర్ల గొలుసు దిండుకింద పెట్టుకుంటుంది. తెల్లవారి లేచిన తర్వాత మళ్లీ ధరిస్తుంది. కాని ఆ రోజు లేచి దిండు కింద చూస్తే గొలుసు లేదు. రెండు రోజుల క్రితం మనవడు వచ్చాడు. ఈ మధ్య వచ్చినప్పుడల్లా డబ్బు అడుగుతున్నాడు. ఈసారి గొలుసు తీసేశాడన్న మాట. ఆమెకు ఏం చేయాలో పాలుపోలేదు. మనవడిని ఈ చేతులతో పెంచింది. వాడు ఇంటర్ వరకూ నిన్న మొన్న ఇక్కడే చదివాడు. టాపర్. ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తానని బెంగళూరు వెళ్లినప్పటి నుంచి ఏమైందో ఏమిటో ఇలా తయారయ్యాడు. నగరం వాడిని మార్చేసిందా... లేదంటే తల్లిదండ్రులకు దూరంగా ఉండటం... అజమాయిషీ లేకపోవడం... తల్లిదండ్రులు సరిగ్గా పట్టించుకోకపోవడం... ఇవి వాణ్ణి ఇలా తయారు చేశాయా అని మధన పడింది.పోలీస్ రిపోర్టు ఇస్తే కేసవడం, అరెస్టు చేయడం తాను భరించలేదు. అలాగే తనకున్న ఒక్కగానొక్క గొలుసును పోగొట్టుకోవాలని లేదు. అందుకే పోలీసులకు చాటుగా ఫోన్ చేసింది. ‘అయ్యా... నా మనవడు ఇంత పని చేశాడు. కేసు గీసు ఏం వద్దు. వాడి దగ్గరి నుంచి ఆ గొలుసు సంపాదించి ఇవ్వండి చాలు.... వాడిని తీసుకెళ్లి లోపల వేసి కొట్టడం, హింసించడం చేయవద్దు’ అని బతిమిలాడింది.అలెప్పి పోలీసులు నానమ్మ హృదయాన్ని అర్థం చేసుకున్నారు. వెంటనే మనవడి ఫొటోను వాట్సప్ చేయమన్నారు. ఆమె చేసింది. పోలీసులు ఆ ఫోటోను ‘ఆల్ కేరళ గోల్డ్ మర్చంట్ అసోసియేషన్’ అలెప్పీ సెక్రటరీ అబి థామస్కు పంపారు. అబి థామస్ దానిని తమ వర్తకుల వాట్సప్ గ్రూప్లో పెట్టి ‘ఈ కుర్రాడు గొలుసు తీసుకొని వస్తే ఎవరూ కొనవద్దు’ అని మెసేజ్ చేశాడు. అప్పటికే గొలుసుతో బయలుదేరిన మనవడు అలెప్పిలోని ఏ దుకాణానికి వెళ్లినా వర్తకులు ‘నువ్వు దొంగవి’ అనకుండా ‘మేం కొనం’ అని వెనక్కు పంపేయసాగారు.మనవడు మొత్తం 25 షాపులు తిరిగాడు. ఎవరూ కొనలేదు. దాంతో మూడు రోజుల తర్వాత ఆ గొలుసును తిరిగి నానమ్మకు ఇచ్చేశాడు. ఆమె కోప్పడలేదు. కన్నీరు కార్చింది. మనవడికి బహుమతిగా 1000 రూపాయలు ఇచ్చింది. నువ్వు మారతావని ఆశిస్తున్నా... అంది. మనవడు మారతాడో లేదో కానీ ఇదో ఆలోచించాల్సిన విషయం. చదువు కోసం, కోర్సుల కోసం నగరాలకు పిల్లల్ని పంపాక వారితో నిత్యం కమ్యూనికేషన్లో తల్లిదండ్రులు ఉండాలి, ప్రేమను చూపాలి, సాధక బాధకాలు వినాలి... లేకుంటే వారు పెడత్రోవ తొక్కవచ్చు. -
ఇట్లుంటరన్నమాట!
మనం చిన్నప్పుడు ఎలా ఉన్నామో చూడడానికి ఫొటో ఆల్బమ్లు ఉన్నాయి. మరి వయసు పైబడిన తరువాత ఎలా ఉంటామో చూడడానికి ఏమీలేవు. ‘ఎందుకు లేవు’ అంటూ రంగంలోకి దిగాడు ఏఐ ఆర్టిస్ట్ షాహిద్. ‘మిడ్జర్నీ’ సాఫ్ట్వేర్ను ఉపయోగించి బాలీవుడ్ అందాల కథానాయికలు దీపిక పదుకోణ్, కత్రినా కైఫ్, ఐశ్వర్యరాయ్, అనుష్క శర్మ.. .మొదలైన వారిని బామ్మలుగా మార్చేశాడు. ‘వావ్ రే వావ్’ అంటూ ఈ ఫొటోలు నెట్లో బాగా వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలను చూసి కొందరు తత్వంలోకి దిగి ఇలా అన్నారు... ‘భౌతిక అందం అశాశ్వతం. అంతఃసౌందర్యమే శాశ్వతం’ -
మనోబలం: బామ్మలందరూ కలిసి బాల్యంలోకి వెళ్లొచ్చారు!
‘అదిగదిగో విమానం’ అంటూ ఆకాశాన్ని చూస్తూ పరుగులు తీశారు చిన్నప్పుడు. వృద్ధాప్యంలోకి వచ్చాక పరుగులు తీసే శక్తి లేదు. అయినా ఆ ఉత్సాహం ఎక్కడికీ పోలేదు. ‘ఒక్కసారైనా విమానం ఎక్కలేకపోయామే’ అని నిట్టూర్చేవారు. అయితే అల్లావుద్దీన్ అద్భుత దీపం దొరకకుండానే వారి చిరకాల కల నెరవేరింది... చిన్నప్పుడు ఆకాశంలో వినిపించీ, వినిపించని శబ్దం చేస్తూ కనిపించే చిట్టి విమానాన్ని చూసి మౌనిక ఎంత ముచ్చటపడేదో! పెద్దయ్యాక ఎలాగైనా విమానం ఎక్కాలని చిన్నారి మౌనిక ఎంతో బలంగా అనుకుంది. అయితే వృద్ధాప్యంలోకి వచ్చినప్పటికీ ఆమె కోరిక నెరవేరలేదు. ఆరుబయటకు వచ్చినప్పుడు ఆకాశంలో కనిపించే విమానాన్ని చూస్తూ ‘చిన్నప్పుడు ఎన్నో అనుకుంటాం’ అని తనలో తాను నవ్వుకునేది మౌనిక. నిజానికి మౌనికలాంటి ‘విమాన కల’ బామ్మలు ఎందరో ఉన్నారు. కోచి(కేరళ)లోని ‘హెల్ప్ఏజ్ ఇండియా’ అనే స్వచ్ఛందసంస్థ, కోచి మున్సిపల్ కార్పోరేషన్తో కలిసి 27 మంది బామ్మల సుదీర్ఘకాల విమానప్రయాణ కలను నెరవేర్చింది. ఎంతసేపు ప్రయాణించాం, ఎంత దూరం వెళ్లాం అనేది ముఖ్యం కాదు... ఆ అనుభూతి ముఖ్యం! బామ్మలు కోచి నుంచి కన్నూర్కు విమానంలో ప్రయాణించి కొత్త ఉత్సాహాన్ని తెచ్చుకున్నారు. ‘ఇంకో వారంలో రోజుల్లో విమానం ఎక్కబోతున్నాం’ అనే ఆనందం రోజీమేరీ, మారియాలను ఒక దగ్గర ఉండనివ్వలేదు. ఎందరికో ఎన్నోసార్లు చెప్పుకొని మురిసిపోయారు. ‘విమానం ఎక్కడం కాదు... అసలు నేను విమానాశ్రయం అనేది చూడడం ఇదే మొదటిసారి’ నవ్వుతూ అంటుంది 67 సంవత్సరాల రోజీమేరి. ‘చిన్నప్పటి కోరిక నెరవేరిందనే సంతోషంతో నా మనోబలం రెట్టింపు అయింది’ అంటుంది 61 సంవత్సరాల మారియా. ఇక విమానంలో బామ్మల సందడి చూస్తే... వారు విమానం ఎక్కినట్లుగా లేదు. టైమ్మిషన్లో బాల్యంలోకి వెళ్లినట్లుగా ఉంది. ఏ బామ్మను కదిలించినా.... వారి కళ్లలో... మాటల్లో సంతోషమే సంతోషం! వీరి విషయంలో మాత్రం ‘సంతోషం సగం బలం’ కానే కాదు. సంపూర్ణబలం! కోరిక గట్టిదైతే, ఎప్పుడో ఒకప్పుడు అది తప్పకుండా నెరవేరుతుంది... అనే మాటను విన్నాను. అది నా విషయంలో నిజమైంది. వినేవాళ్లు ఉండాలేగానీ నా విమానప్రయాణం గురించి కొన్ని రోజుల వరకు చెప్పగలను. – మౌనిక (88) -
వేకువ పువ్వు
అది డిసెంబర్లో ఒక సాయంత్రం. ఒక చెట్టు కింద చినిగిన దుస్తులు కట్టుకుని ఉన్న ఒక అవ్వ చేతిలో సత్తుగిన్నెతో నిలుచుని ఉంది. ఎన్ని అనుభవాలో.. ఆ అవ్వ ముఖం మీద ముడతలై పరుచుకుని ఉన్నాయి. చలికాలం కావటం వల్ల అందరూ ఒంటినిండా వెచ్చటి చలికోట్లు. చేతుల్లో పెద్ద పెద్ద సంచుల్లో ప్లాస్టిక్ నక్షత్రాలు, చెట్లు, అలంకరణ సామగ్రితో నవ్వుతూ తుళ్ళుతూ తిరుగుతున్నారు. తన ముందు నుంచి వెళ్తున్న అందరి వంక ఆ అవ్వ తన సత్తుగిన్నెను చాపి ఆశగా చూస్తోంది. కొందరు ఆ చెట్టు కిందే ఆగి తాము చేసిన క్రిస్మస్ షాపింగ్ గురించి, క్రీస్తు పుట్టుక గురించి మాట్లాడుకుంటున్నారు తప్ప ఆమె వంక కూడా చూడటం లేదు. అయితే అవ్వ మాత్రం వారి మాటలు ఆసక్తిగా వింటున్నట్టుగా చెవులు రిక్కిస్తోంది. ఇంతలో ఒక పెద్ద కారు అవ్వ ముందు ఆగింది. ఆమె కళ్ళలో ఆనందం! ఇక ఆ అవ్వ గిన్నెధనంతో నిండి పోతుంది అని.. చిన్న సంతోషం. కారు వెళ్లిపోయింది. ఆ అవ్వ గిన్నెలో ఒక్క పది రూపాయల నోటు కనిపించింది.. కారు పెద్దదే కానీ అందులో ఉన్నవారి హృదయాలు చిన్నవే అనుకుంటా! ఆ అవ్వ ఆ గిన్నెలో ఉన్న డబ్బులు లెక్క పెట్టుకుంటుంటే అవ్వకి సాయం చేయాలని నేను అటువైపు కదిలాను. ఇంతలో ఎక్కడ నుండి వచ్చిందో నక్షత్రం తెగిపడినట్టు ఉన్నపాటుగా వేకువపువ్వు పరిమళించినట్టుగా ఒక చిన్న పాప ఆ అవ్వ సత్తు గిన్నెలో వందరూపాయల కాగితం వేసి తన వంటిమీద ఉన్న శాలువాను అవ్వ మీద కప్పి అవ్వని ముద్దు పెట్టుకొని వెళ్లిపోయింది. అదంతా చూస్తున్న నాకు క్రీస్తు పుట్టింది ఆ పాప హృదయంలోనేనేమో అనిపించింది. కాసేపయ్యాక ఆ అవ్వ తన సత్తుగిన్నెలో ఉన్న పైసలు లెక్కపెట్టుకొని ఎదురుగా అడుక్కుంటున్న ఒక అంధుడి గిన్నెలో కొంత వేసింది. మెల్లిగా వెళ్లి ఆ అవ్వని అడిగాను – అవ్వా! నీకు వచ్చిందే తక్కువ కదా, మళ్ళీ అందులోనే అతనికి దానం చేసావేంటి అని. అప్పుడు ఆ అవ్వ నావైపు చూసి – అయ్యా! నేను మొత్తం ఇవ్వలేదు. నాకు కలిగిన దానిలో కొంత ఇచ్చాను. ఇవ్వమని నా ప్రభువు చెప్పాడు! అని అంది. అప్పుడు అర్థమైంది నాకు ఆ అవ్వ ఎంత ధనవంతురాలో..! – బెల్లంకొండ రవికాంత్ -
నానమ్మల ఓనమాలు!
ఆ ఊరి పేరు ఫాంగనే. మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఓ కుగ్రామం. ఆ విద్యార్థులు ప్రతి రోజూ మధ్యాహ్నం యూనిఫాం ధరిస్తారు. పలకా బలపం, అబాకస్ను స్కూల్ సంచిలో పెట్టుకుంటారు. అడుగులో అడుగుగా నడుస్తూ స్కూల్కు వెళతారు. అక్కడ అ ఆ దిద్దుతారు. గుణింతాలు వల్లెవేస్తారు. ఆ విద్యార్థుల్లో కొందరికి కళ్లు సరిగా కనపడవు. కొందరికి కాళ్లు సరిగా నిలబడవు. ఇంకొందరికి మాటలు సరిగా వినబడవు. మరికొందరికి గట్టిగా మాట్లాడితే ఛాతీలో నొప్పి వస్తుంది. కానీ.. ప్రతి రోజూ వారు ఠంచనుగా బడికి వెళతారు. సహ విద్యార్థులతో కలిసి ఆటపాటలతో చదువుకుంటుంటారు. స్కూలు ఆవరణలో వారే స్వయంగా నాటిన మొక్కలకు రోజూ నీళ్లు పోస్తారు. వారంతా కొడుకులు, కూతుళ్లు, మనవలు, మనవరాళ్లు, మునిమనుమలు కూడా ఉన్న.. అమ్మమ్మలు. నానమ్మలు! వారి వయసు 60 ఏళ్ల నుంచి 90 ఏళ్ల వరకూ ఉంటుంది. ఊర్లో మహిళలు చదువుకోలేకపోవడం పెద్ద లోటుగా గుర్తించిన యోగేంద్ర బంగర్ అనే 41 సంవత్సరాల ఆదర్శనీయుడు.. 2016 మహిళా దినోత్సవం రోజును ఈ పాఠశాలను ప్రారంభించారు. ఒక తరగతిని ఏర్పాటు చేసుకుని, విరాళాలు సేకరించి ఆ విద్యార్థుల కోసం గులాబీ రంగు చీరలు, పలకలు, పుస్తకాలు సమకూర్చారు. శీతల్ మోరె (30) అనే ఉపాధ్యాయురాలు ఉచితంగా విద్యాబోధన చేస్తున్నారు. ఆమె అత్తగారు కూడా ఆమె వద్ద చదువు నేర్చుకుంటున్నారు. ఏడాది కాలంలో ఈ విద్యార్థుల బృందంలో ఒకరు కన్నుమూశారు. ముగ్గురు కొత్త విద్యార్థులు చేరారు. ప్రస్తుతం 30 మంది విద్యార్థినులు ఆ పాఠశాలలో చదువుకుంటున్నారు. ‘‘దేశంలో చదువుకోని వారందరూ చదువుకోవాలి. ప్రతి గ్రామంలో మహిళలందరి కోసం పాఠశాలలు ఉండాలి’’ అని ఆ ఉపాధ్యాయులు అభిలషిస్తున్నారు. విద్యాభ్యాసానికి వయసుతో నిమిత్తం లేదని నిరూపిస్తున్న ఈ అమ్మమ్మలు, నానమ్మలు అక్షరమాల నేర్చుకున్నారు. 1 నుండి 21 వరకూ చదవడం రాయడం చేయగలుగుతున్నారు. అందరూ వేలిముద్రలకు బదులుగా సంతకం చేయగలుగుతున్నారు. అయితే.. తాము చదివింది, స్కూల్లో బోధించింది గుర్తు పెట్టుకోవడం కష్టంగా ఉందని కొందరు చెప్తున్నారు. ఫొటోగ్రాఫర్ సాత్యకి ఘోష్ ఈ మహిళల అక్షరాస్యతా ప్రయాణాన్ని అద్భుతమైన ఫొటో దృశ్యాలతో నమోదు చేస్తున్నారు. అనసూయ దేశ్ముఖ్ వయసు 90 సంవత్సరాలు. చిన్నప్పుడు చదువుకోవాలంటే పలక, పుస్తకాలు కొనడానికి డబ్బులు లేవు. పదేళ్ల వయసులోనే ఆమెకు పెళ్లిచేశారు. కానీ.. ఇప్పుడామె ఏడాది కాలంగా చదువుకుంటున్నారు. సంతకం పెట్టగలుగుతున్నారు. రాంభాయ్ గాన్పాత్ను ఆమె మనుమలు చేయిపట్టుకుని నడిపిస్తూ స్కూల్కు తీసుకెళతారు. ‘‘చాలా ఆనందంగా ఉంది. ఈ బడంటే మాకు చాలా ఇష్టం. అమ్మమ్మలమంతా కలిసి స్కూలుకు వెళతాం. మేం బాగా చదువు నేర్చుకోగలుగుతున్నాం. అది గర్వంగా కూడా ఉంది’’ అని ఆమె చెప్తున్నారు. ‘‘కానీ.. మా కళ్లు సరిగా కనపడవు. కాబట్టి ఎక్కువగా బాగా చదవలేకపోతున్నాం’’ అంటూ నవ్వేస్తున్నారు. - సాక్షి నాలెడ్జ్ సెంటర్


