breaking news
GOSF
-
గూగుల్ షాపింగ్ సందర్శకులు 20 లక్షలు
న్యూఢిల్లీ: గూగుల్ ఆన్లైన్ షాఫింగ్ ఫెస్టివల్(జీఓఎస్ఎఫ్) 20 లక్షల మంది విజిటర్స్ను ఆకర్షించింది. గతేడాదే ప్రారంభమైన ఈ జీఓఎస్ఎఫ్కు ఈ ఏడాది రెట్టింపు సంఖ్యలో విజిటర్స్ సందర్శించారని గూగుల్ ఇండియా డెరైక్టర్ (ఈ కామర్స్-లోకల్ అండ్ మీడియా) నితిన్ బవన్కులే తెలిపారు. 20 లక్షల మంది విజిటర్స్ల్లో సగం మంది మహిళలేనని పేర్కొన్నారు. మొత్తం విజిటర్స్ల్లో 62 శాతం మంది 18-34 ఏళ్ల వయస్కులేనని తెలిపారు. ఈ ఆన్లైన్ షాపింగ్ ఫెస్టివల్ జరిగినన్ని రోజులు ఈ ఫెస్టివల్లో పాల్గొన్న 200కు పైగా ఈ కామర్స్ వెబ్సైట్ల (స్నాప్డీల్, ఈబే) రోజువారీ అమ్మకాలు 3 నుంచి 4 రెట్లు పెరిగాయని పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ వస్తువులే కాకుండా ఫ్లాట్లు, కార్లు కూడా ఈ ఫెస్టివల్లో అమ్ముడయ్యాయని వివరించారు. టాటా హౌసింగ్ సంస్థ రూ.25 కోట్ల విలువైన 55 ఫ్లాట్లను విక్రయించిందని పేర్కొన్నారు. మొత్తం మీద ఈ ఆన్లైన్ షాపింగ్ ఫెస్టివల్ పెద్ద హిట్ అని, భారత్లో ఆన్లైన్ షాపింగ్కు జోరునిచ్చిందని వివరించారు. -
మళ్లీ గూగుల్ ఆన్లైన్ షాపింగ్ ధమాకా
హైదరాబాద్: ఇంటర్నెట్ సెర్చి దిగ్గజం గూగుల్ తాజాగా మరోసారి భారీ ఆన్లైన్ షాపింగ్ వేడుకలకు తెర తీస్తోంది. ఈ నెల 11 నుంచి 13 దాకా మూడు రోజుల(72 గంటలు) పాటు గ్రేట్ ఆన్లైన్ షాపింగ్ ఫెస్టివల్(జీఎస్వోఎఫ్) నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. దీనిలో భాగంగా వివిధ ఉత్పత్తులపై 20-80 శాతం దాకా డిస్కౌంట్లు అందించనుంది. ఈసారి జీఎస్వోఎఫ్లో 200 పైగా ఈ-కామర్స్ కంపెనీలు పాల్గొంటున్నాయని, భారీ ఆఫర్లు అందించనున్నాయని గూగుల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ రాజన్ ఆనందన్ తెలిపారు. ఆటోమొబైల్ సంస్థలు, ఆన్లైన్ ట్రావెల్ సైట్లు, టెలికం తదితర రంగాల కంపెనీలు ఇందులో ఉంటాయన్నారు. గతేడాది జీఎస్వోఎఫ్కి మంచి స్పందన లభించడంతో ఈ ఏడాది కూడా నిర్వహిస్తున్నట్లు ఆనందన్ వివరించారు. టీవీలపై 50 శాతం దాకా, మొబైల్ ఫోన్లపై 40 శాతం మేర, కంప్యూటర్లు..ట్యాబ్లెట్లపై 45 శాతం దాకా, లగ్జరీ వాచీలపై 60 శాతం దాకా, దేశీ రూట్లలో విమాన టికెట్లపై 20 శాతం దాకా, స్పీకర్లు..హెడ్ఫోన్లు వంటి ఉత్పత్తులపై 50 శాతం దాకా డిస్కౌంట్లు లభించగలవని ఆనందన్ పేర్కొన్నారు. ప్రస్తుతం దేశీయంగా 2 కోట్ల మంది ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారని, వచ్చే కొన్నేళ్లలో ఇది 5 కోట్లకు చేరగలదని పరిశ్రమ వర్గాల అంచనా. ఆన్లైన్ షాపింగ్ లావాదేవీలు 2017 నాటికి 16 బిలియన్ డాలర్లకు చేరగలవని అంచనా వేస్తున్నట్లు ఆనందన్ వివరించారు.