ప్రతి ఫొటో వెనకా ఒక్కో కథ!
అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు గడించిన ఫొటోగ్రాఫర్లలో గావిన్ ఎవాన్స్ ఒకరు. ఈయన చిత్రాలన్నీ విభిన్నంగా ఉంటాయి. వైవిధ్యాన్ని ప్రదర్శిస్తాయి. దేశ విదేశాల్లో చేపట్టిన ఫొటోగ్రఫీ ప్రాజెక్టులు ఆయన తెగువని తెలియజేస్తాయి. కాలం చెల్లిన ఆచారాలు, సంప్రదాయాలను ఆయన సవాల్ చేస్తారు. అలా గడచిన కొన్నేళ్లుగా ఎన్నో విశేషమైన ప్రాజెక్టులను ఆయన ఎంచుకున్నారు. వాటిలో ముఖ్యమైనది ‘ప్రాజెక్ట్ టచ్’.
ప్రపంచంలోని మానవులందరూ ఆ భగవంతుడి సృష్టేనన్న నమ్మకాలు మనలో చాలామందికి ఉంటాయి. అయినప్పటికీ సమానత్వం, సౌభ్రాతృత్వం లాంటి మాటలు ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మేలు! ఇలాంటి అంశాలను మనలో చాలామంది సమర్థించరు. అగ్రకులాలు, నిమ్నకులాలు పేరిట మనుషులను విభజించి, గుర్తిస్తారు. ఈ ప్రక్రియ ఎంతటి చేటు తెస్తుందంటే.. మన దేశంలో కొందరు నేటికీ ఓ వర్గాన్ని అంటరానివాళ్లుగానే పరిగణిస్తున్నారు. వారిని ముట్టుకోవడం, గృహాల్లోకి, ఆఫీసుల్లోకి, ఆలయాల్లోకి ప్రవేశాలు కల్పించడం దాదాపు నిషేధం.
‘ప్రాజెక్ట్ టచ్’కు రూపకల్పన చేస్తున్న సమయంలోనే గావిన్కు మనదేశంలోని ఈ విపరీత పోకడ గురించి తెలిసింది. అంతే.. 2005లో రెక్కలు కట్టుకుని భారత్లో వాలిపోయాడు. ఇక్కడ అంటరాని వారెవరో, అంటదగిన వారెవరో తెలుసుకున్నాడు. ఢిల్లీ, రాజస్థాన్లలో పర్యటించి అంటరాని వారందరినీ కలుసుకున్నాడు. అంటరానివారిని తాకితే ఏం జరుగుతుందో చూద్దామనుకున్నాడు. తాకి చూశాడు కూడా. విచిత్రం! అతనికేమీ కాలేదు. సంపూర్ణ ఆరోగ్యవంతుడిగానే ఉన్నాడు!! మరి, ఈ అంటరానితనం ఎక్కడి నుంచి, ఎందుకు వచ్చినట్టు..?
ఇలాంటి ప్రశ్నలతోనే దాదాపు 700 మంది స్త్రీ, పురుషులను, వృద్ధులను, చిన్నారులను కలిశాడు. వారందరికీ తన చేతిని అందించాడు. భయపడినవారిని ఫర్వాలేదు తాకండంటూ ధైర్యం చెప్పాడు. అంతే.. అందరూ గావిన్తో చేతులు కలిపారు. తోటి భారతీయులే తాకనీయని తమను, తెల్లజాతి వ్యక్తి ముట్టుకోవడమా అంటూ ఆశ్చర్యపోయారు. ఆనందపడ్డారు.
తాను తీసిన ప్రతి ఫొటో వెనకా ఒక్కో కథ ఉందని చెబుతాడు గావిన్. తన చేయి మాత్రమే చిత్రంలో కనిపించేలా, మరోచేతితో కెమెరాను క్లిక్మనిపిస్తున్న సమయంలో వారు చెప్పే ‘అంటరాని’ సమస్యలు తనను ఎంతగానో ప్రభావితం చేశాయని చెప్పాడు. ఇకపై వారెవరూ అంటరాని వారు కాదనే సందేశాన్నివ్వడమే తన ప్రాజెక్ట్ లక్ష్యమని చెబుతున్నాడు. గావిన్ ‘టచ్’ అయినా మన దేశ భవిష్యత్తును మార్చుతుందేమో చూద్దాం..!