breaking news
former chief justice
-
వెరవని వ్యక్తిత్వం
సంక్షుభిత సమయంలో ఒక జాతి తమను నడిపే నేతగా ఒక స్త్రీ వైపు చూడటం అరుదు. నేపాల్లో ఇప్పుడు అక్కడి యువత అలాంటి ఒక స్త్రీ వైపు చూస్తోంది. అక్కడ ఏర్పడబోతున్న ఆపద్ధర్మ ప్రభుత్వానికి అధినేతగా మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కి ఉంటే బాగుంటుందని ఆశిస్తోంది. ఆమె ఆర్మీ చీఫ్ను కలిశారు కూడా! భారతదేశంలో చదువుకుని, టీచర్ స్థాయి నుంచి సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి వరకూ ఎదిగిన సుశీలా కర్కీది వెరవని వ్యక్తిత్వం. ఆమె రచయిత కూడా. వివరాలు...‘ఇండియా– నేపాల్ దేశాల మధ్య అనుబంధం ఈనాటిది కాదు. దశాబ్దాలది. ప్రభుత్వాలు వాటి వాటి విధానాల వల్ల పని చేస్తుండొచ్చు. కాని ఇరుదేశాల ప్రజలు ఏనాటి నుంచో స్నేహంగా ఉన్నారు. ప్రధాని మోదీపై నాకు మంచి అభి్రపాయం ఉంది. మా స్నేహితులు, బంధువులు ఎందరో ఇండియాలో ఉన్నారు. మావారు ఎక్కువ కాలం ఇండియాలోనే గడిపారు. భారతీయులు నేపాలీలను ఆదరిస్తూనే ఉన్నారు’ అన్నారు సుశీలా కర్కి.73 ఏళ్ల ఈ మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేపాల్లో ఏర్పడనున్న ఆపద్ధర్మ ప్రభుత్వానికి ప్రధాని అయ్యే అవకాశాలు ఖరారయ్యాయి. నేపాల్లో ఉద్యమం కొనసాగిస్తున్న జెన్ జి విద్యార్థుల బృందం తాజా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి సుశీలా కర్కి మా ఎంపిక అని తేల్చి చెప్పింది. సుశీలా కర్కి తన సోషల్ మీడియా అకౌంట్లో ‘దేశ పరిస్థితుల రీత్యా నాకు అప్పజెప్పే బాధ్యతను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను’ అని తెలియచేశారు.‘నేను బెనారస్ హిందూ యూనివర్సిటీలో చదువుకున్నాను. మా హాస్టల్ నుంచి నిత్యం పారే గంగను చూసే దాన్ని. ఎండాకాలం హాస్టల్ టెర్రస్ మీద పడుకునేవారం. ఉదయాన్నే గంగను చూసేవారం. అక్కడ నాతో పాటు చదువుకున్న విద్యార్థులు, పాఠాలు చెప్పిన గురువులు ఇంకా స్పష్టంగా గుర్తున్నారు’ అన్నారామె. ‘మా ఊరు విరాట్నగర్ నుంచి భారత్ సరిహద్దు 25 మైళ్లు ఉంటుంది. మేము తరచూ బోర్డర్ మార్కెట్కు వెళ్లేవాళ్లం. నాకు హిందీ వచ్చు’ అని తెలిపారామె.ప్రభుత్వంలో అవినీతి, మంత్రుల పట్ల వ్యతిరేకత, నయా సంపన్నుల వైఖరి, సోషల్ మీడియాపై నిర్బంధం... వీటన్నింటి దరిమిలా నేపాల్లో యువతరం తెచ్చిన తిరుగుబాటు వల్ల నాయకత్వ మార్పు స్పష్టమైంది. సుశీలా కర్కి ఆపద్ధర్మ ప్రధాని అయితే త్వరలో ఎన్నికలు నిర్వహించి ప్రభుత్వ ఏర్పాటు చేయించి తప్పుకోవడమే ఆమె ప్రధాన బాధ్యత. ఆ బాధ్యతకు ఆమె సమర్థురాలని యువత భావిస్తోంది.టీచర్గా మొదలైసుశీలా కర్కి నేపాల్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవిని నిర్వహించిన ఏకైక మహిళగా ఆ దేశవాసుల్లో గుర్తింపు, గౌరవం పొందారు. జూన్ 7, 1952న నేపాల్లోని శంకర్పూర్కు చెందిన ఓ కుటుంబంలో పుట్టిన కర్కి ఏడుగురు పిల్లలలో మొదటి సంతానం. 1972లో బిరాట్నగర్లోని మహేంద్ర మొరాంగ్ క్యాంపస్ నుండి బీఏ డిగ్రీ చేసి మన బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి రాజకీయ శాస్త్రం చదివారు. అక్కడ చదువుతున్న సమయంలోనే నేపాలీ కాంగ్రెస్ సభ్యుడు, యువజన విభాగ నాయకుడు దుర్గా ప్రసాద్ సుబేదిని కలుసుకున్నారు. అనంతరం వారిద్దరూ వివాహం చేసుకున్నారు. 1979లో కార్కి బిరాట్నగర్లో లాయర్గా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. 1985లో ధరణ్లోని మహేంద్ర మల్టిపుల్ క్యాంపస్లో అసిస్టెంట్ టీచర్గా పనిచేశారు. 2007లో సీనియర్ అడ్వకేట్గా 2009లో ఆ దేశ సుప్రీంకోర్టులో అడ్–హాక్ జస్టిస్గా నియమితులయ్యారు. నవంబర్ 18, 2010న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2016 ఏప్రిల్ నుండి 2016 జూలై వరకు నేపాల్ సుప్రీంకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా, 2017 జూన్ వరకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు.రచయితగా...కర్కి 2018లో ‘న్యాయ’ పేరుతో తన ఆత్మకథ రాశారు. 2019 డిసెంబర్లో ‘కారా’ అనే నవల ప్రచురించారు. నేపాల్లో 1960 నుంచి 90ల మధ్యకాలంలో రాజు కనుసన్నల్లో సాగిన ‘పంచాయత్’ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ప్రజల అనుభవాలను ఆమె తన రచనల్లో ఉటంకించారు. ఆపద్ధర్మ అధినేతగా తన ఎంపిక జరిగితే శాంతి నెలకొల్పడం, చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు భరోసా ఇవ్వడం తన తొలి ప్రాధాన్యం అని ఆమె అన్నారు.సుశీలా కర్కిది వెరవని వ్యక్తిత్వం అని అందరూ అంటారు. ఆమె న్యాయనిపుణత, అవినీతి రహిత నేపథ్యం చాలా కేసుల్లో కీలకమైన తీర్పులు ఇచ్చేలా చేసింది. ఒక అవినీతి కేసులో మంత్రిని జైలుకు పంపించడానికి సైతం ఆమె వెనుకాడలేదు. ఇవన్నీ ఆమెకు సానుకూలంగా మారాయని చర్చ సాగుతోంది. ఆ పేరు బయటకు వచ్చాక నేపాల్లో ముఖ్యంగా ఖాట్మండులో శాంతి నెలకొనడం ఆమె మాటకు విలువ ఉంటుందనడానికి ఉదాహరణ.గమనిక: ఈ కథనం రాసే సమయానికి సుశీలా కర్కితోపాటు మరికొన్ని పేర్లు కూడా ఆపద్ధర్మ ప్రధాని పదవికి పరిశీలనలోకి వచ్చాయి. -
రాజ్యసభలో గొగోయ్ ప్రమాణం
న్యూఢిల్లీ/చండీగఢ్: అయోధ్య వివాదం వంటి కీలక కేసుల్లో చారిత్రక తీర్పులు వెలువరించిన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఇందిరా రంజన్ గొగోయ్(65) కొత్త అధ్యాయం ప్రారంభించారు. గురువారం ఆయన రాజ్యసభ సభ్యునిగా ప్రమాణం చేశారు. ఆయన ప్రమాణ స్వీకారం చేస్తుండగా ప్రతిపక్ష సభ్యులు నిరసన తెలిపారు. ‘షేమ్, షేమ్’అని నినాదాలు చేసుకుంటూ వాకౌట్ చేశారు. ఒక సభ్యుని ప్రమాణ స్వీకారం చేస్తుండగా సభ్యులు ఇలా వాకౌట్ చేయడం రాజ్యసభ చరిత్రలో ఇదే మొదటిసారి. అంతకుముందు, ప్రమాణ స్వీకారానికి ఆయన పేరును పిలవగానే ప్రతిపక్ష సభ్యులు ‘షేమ్, డీల్’అంటూ నినాదాలు ప్రారంభించారు. -
సీఎం జగన్ నిర్ణయం అభినందనీయం
సాక్షి, గుంటూరు: ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ అధ్యక్షుడిగా లక్ష్మణ్రెడ్డిని నియమించడం మంచి నిర్ణయం అని అలహాబాద్ మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణరావు అన్నారు. ఆయనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంచి బాధ్యతను అప్పగించారన్నారు. ఆదివారం గుంటూరులో మాట్లాడుతూ.. మద్యాన్ని ఆదాయ వనరుగా చూడకూడదన్న సీఎం నిర్ణయం అభినందనీయం అని ప్రస్తుతించారు. మద్యం వల్ల పేద కుటుంబాలు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నాయన్నారు. కుటుంబాల హింసకు గురైన పిల్లలు రోడ్డున పడుతున్నారని తెలిపారు. అనేక నేరాలు, అరాచకాలు, రోడ్డు ప్రమాదాలకు కారణం మద్యమేనన్నారు. -
మాజీ సీజేఐ ఆనంద్ కన్నుమూత
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆదర్శ్ సేన్ ఆనంద్(81) కన్నుమూశారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. తీవ్ర గుండె పోటు రావటంతో శుక్రవారం ఉదయం ఆనంద్ కన్నుమూశారని కుటుంబసభ్యులు తెలిపారు. సుప్రీంకోర్టుకు 29వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఆనంద్ 1998– 2001 కాలంలో పనిచేశారు. 2003–06 కాలంలో జాతీయ మానవహక్కుల కమిషన్ చైర్మన్గా పనిచేశారు. డీకే బసు కేసులో ఖైదీల హక్కులపై ఆయన ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైనదిగా పరిగణిస్తారు. 1936లో కశ్మీర్లో జన్మించిన జస్టిస్ ఆనంద్.. లక్నో వర్సిటీ నుంచి లా పట్టా అందుకున్నారు. పంజాబ్, హరియాణా హైకోర్టుల్లో లా ప్రాక్టీస్ చేశారు. 1975లో కశ్మీర్ హైకోర్టు అదనపు జడ్జీగా నియమితులయ్యారు. -
ఇంటి దేవుడి సేవలో జస్టిస్ వెంకటాచలయ్య
లేపాక్షి : సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి మానేంపల్లి వెంకటాచలయ్య వారి ఇంటి దైవమైన కోడి రంగనాథస్వామికి విశేష పూజలు నిర్వహించారు. ఆదివారం ఉదయం ఆయన మండలంలోని శిరివరం గ్రామంలో వెలసిన కోడిరంగనాథస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆయన స్వగ్రామమైన మానేంపల్లికి వచ్చినపుడల్లా స్వామిని దర్శించుకునే వెళ్తారు. ఆలయం వద్దకు వచ్చిన ఆయనకు మానేంపల్లి, శిరివరం గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన కోడి రంగనాథ స్వామి సేవా ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమాలను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట రూరల్ సీఐ రాజగోపాల్నాయుడు, డిప్యూటీ తహశీల్దార్ సైఫుల్లాహక్, మానేంపల్లికి చెందిన వెంకటాచలపతి (చెలిస్వామి), శంకరప్ప, సంజీవప్ప, రఘునాథరెడ్డి, శిరివరం గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ వెంకటేష్, మంజునాథ్, డీలరు దత్తాత్రేయ తదితరులు ఉన్నారు. -
ఎన్హెచ్చార్సీ చైర్మన్ హెచ్ ఎల్ దత్తూ బాధ్యతల స్వీకరణ
న్యూఢిల్లీ: జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్చార్సీ) చైర్మన్ గా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి హెచ్ ఎల్ దత్తు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గత ఏడాది మేలో జస్టిస్ కేజీ బాలకృష్ణన్ పదవీకాలం ముగియడంతో ఎన్ హెచ్చార్సీ చైర్మన్ పదవికి ఖాళీ ఏర్పడింది. అప్పటినుంచి జస్టిస్ సిరియాక్ జోసెఫ్ ఇన్ చార్జి చైర్ పర్సన్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. దత్తూ నియామకంతో ఎన్ హెచ్చార్సీ పదవికి పూర్తికాల చైర్మన్ ను నియమించినట్లైంది. ఆ పదవి చేపట్టినవారిలో దత్తూ ఏడోవారు. న్యాయమూర్తిగా సుదీర్ఘ అనుభవం ఉన్న హెచ్ ఎల్ దత్తూ అనేక కేసుల్లో చట్టాల్ని అనుసరించి విభిన్న తీర్పులు చెప్పారు. 1950, డిసెంబర్ 3న కర్ణాటకలోని చిక్ మంగళూరు జిల్లా కాదూర్ లో జన్మించిన దత్తూ.. కాదూర్, తరికేరి, బిరూరుల్లో ప్రాధమికవిద్యను పూర్తిచేశారు. ఉన్నత చదువుల కోసం బెంగళూరు వచ్చిన ఆయన అక్కడే ఎల్ఎల్ బీ పూర్తిచేశారు. 1975లో కర్ణాటక బార్ అసోసియేషన్ లో పేరు నమోదుచేయించుకున్న ఆయన పలు సివిల్, క్రిమినల్ కేసులను సమర్థవంతంగా వాదించి పేరుతెచ్చుకున్నారు. 1995లో కర్ణాటక హౌకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన హెచ్ఎల్ దత్తూ.. 2008లో సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు. 2014లో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా(సీఐజే)గా ఎంపికై 2015, డిసెంబర్ 2 వరకు కొనసాగారు. అపార అనుభవం ఉన్న హెచ్ ఎల్ దత్తు సేవలను వినియోగించుకోవాలనుకున్న కేంద్రం ఆయనను ఎన్ హెచ్ ఆర్సీ చైర్మన్ గా నియమించింది. -
మాజీ సీజే జస్టిస్ కపాడియా కన్నుమూత
సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్హెచ్ కపాడియా మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. సరోష్ హోమీ కపాడియా భారత ప్రధాన న్యాయమూర్తిగా మంచి సిద్ధాంతాలకు కట్టుబడి, క్రమశిక్షణతో ఉండేవారు. జస్టిస్ కేజీ బాలకృష్ణన్ పదవీ విరమణ చేసిన తర్వాత జస్టిస్ కపాడియా చీఫ్ జస్టిస్ అయ్యారు. వోడాఫోన్ కేసు తీర్పు, మీడియా విచారణ విషయంలో ఐదుగురు జడ్జీలతో కూడిన ధర్మాసనం తీర్పు లాంటివి జస్టిస్ కపాడియా హయాంలోనే వెలువడ్డాయి. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఒక నిరుపేద పార్సీ కుటుంబంలో పుట్టిన కపాడియా.. స్వయంకృషితోనే ప్రధాన న్యాయమూర్తి స్థాయి వరకు ఎదిగారు. 2012 సెప్టెంబర్ నెలలో పదవీ విరమణ చేసిన తర్వాత ఆయన ఎలాంటి కమిటీలలో లేరు, ఇతర పదవులు చేపట్టలేదు. -
బీసీసీఐకి లోధా కమిటీ ప్రశ్నావళి
న్యూఢిల్లీ: బీసీసీఐలో పరిపాలనా సంస్కరణల కోసం సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన లోధా కమిటీ కార్యరంగంలోకి దిగింది. దీంట్లో భాగంగా మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆర్ఎం లోధా ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ కమిటీ 80కి పైగా ప్రశ్నలను బోర్డుకు పంపింది. సుప్రీం కోర్టు మాజీ జడ్జీలు అశోక్ భాన్, ఆర్వీ రవీంద్రన్ సభ్యులుగా ఉన్న ఈ కమిటీ... బోర్డుకు సంబంధించి పరస్పర విరుద్ధ ప్రయోజనాలు, ఆడిట్స్, ఖాతాల నిర్వహణ, కమిటీలు.. ఎన్నికలు, ఆటగాళ్ల సంక్షేమం, పారదర్శకత, ఆర్థికపరమైన అంశాలకు సంబంధించి ఏడు ఉప శీర్షికలతో ఈ ప్రశ్నావళిని రూపొందించింది. వీటికి బీసీసీఐ ఉన్నతాధికారులు సమాధానమివ్వాల్సి ఉంటుంది. -
లైంగిక వేధింపుల కేసులో మాజీ జడ్జి పేరు వెలుగులోకి
న్యూఢిల్లీ: న్యాయవిద్యార్థినిపై లైంగిక వేధింపుల కేసులో గోప్యంగా ఉన్న సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి పేరు శుక్రవారం వెలుగులోకి వచ్చింది. సుప్రీం కోర్టులో ఎన్నో కీలక కేసులు పరిష్కరించి, ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా పనిచేస్తున్న జస్టిస్ ఏకే గంగూలీ అని వెల్లడైంది. బాధితురాలితో పాటు జస్టిస్ గంగూలీ వాంగ్మూలాన్ని రికార్డు చేయడం పూర్తవడంతో సుప్రీం కోర్టు అధికారి ఒకరు ఆయన పేరు బయటపెట్టారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను జస్టిస్ గంగూలీ ఖండించారు. ఆ ఆరోపణలు తనను షాక్నకు గురిచేశాయని చెప్పారు. విచారణకు ఏర్పాటు చేసిన కమిటీకి ఆ ఆరోపణలు అసత్యమని తేల్చిచెప్పానని, అసలు తనపై అలాంటి నిందలను ఆమె ఎందుకు వేసిందో అర్థం కావడం లేదని తెలిపారు. అంతకుముందు ఆయన ఒక టీవీ చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘తెహెల్కా’ తరుణ్ తేజ్పాల్ కేసుతో తన కేసును పోల్చవద్దని చెప్పారు. ఆ న్యాయ విద్యార్థిని తన కుమార్తె లాంటిదని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తానే బాధితుడిగా మిగిలానన్నారు. అయితే పేరు బయటపడిన విషయంపైతానేమీ సిగ్గుపడడంలేదని ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఆమెను శారీరకంగా హింసించలేదని స్పష్టంచేశారు. ఆమె తన దగ్గర ఇంటర్న్షిప్ చేయడానికి అధికారికంగా అనుమతి తీసుకురాలేదని చెప్పారు. వేరే విద్యార్థిని స్థానంలో ఆరోపణలు చేసిన విద్యార్థిని స్వతంత్రంగా వచ్చిందని తెలిపారు. అంతేగాక పనుల నిమిత్తం తన ఇంటికి చాలా సార్లు వచ్చిందని వెల్లడించారు.