బ్యాంక్ ఖాతా ప్రారంభం ఇక మరింత సులువు
చిరునామా నిబంధనలు సరళతరం చేసిన ఆర్బీఐ
ముంబై: ‘మీ కస్టమర్ల గురించి తెలుసుకోండి’ (కేవైసీ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సరళతరం చేసింది. దీనితో బ్యాంక్ అకౌంట్ల ప్రారంభం మరింత సులభతరం కానుంది. కేవలం ఒక శాశ్వత లేదా స్థానిక చిరునామా ధ్రువీకరణ ఉంటే చాలు బ్యాంక్ అకౌంట్ తెరిచేలా వెసులుబాటునిస్తూ నిబంధనలను సడలించినట్లు ఆర్బీఐ సోమవారం విడుదల చేసిన ఒక నోటిఫికేషన్లో తెలిపింది.
ప్రస్తుతం వలస కార్మికులు, ఉద్యోగులకు బ్యాంకింగ్ సేవలు పొందడం క్లిష్టంగా మారింది. ఈ సమస్య పరిష్కారానికి ఆర్బీఐ తాజా నిర్ణయం దోహదపడుతుంది. ఒకవేళ చిరునామా ధ్రువీకరణను సమర్పించలేకపోతే ఖాతాదారు నుంచి స్థానిక చిరునామాకు సంబంధించిన డిక్లరేషన్ ఒకదానిని తీసుకుని ఖాతా తెరవాలని ఆర్బీఐ సూచింది. ఆ డిక్లరేషన్లో తెలియపర్చిన చిరునామాకు లేఖ, చెక్బుక్స్, ఏటీఎం కార్డ్స్ వంటివి ‘ఎకనాలెడ్జ్మెంట్’ ద్వారా పంపి, తిరిగి వచ్చిన రిిసీట్ ద్వారా చిరునామాను బ్యాంక్ బ్రాంచ్ ధ్రువీకరించుకోవచ్చని సైతం ఆర్బీఐ నోటిఫికేషన్ సూచించింది.
ఒక బ్యాంక్ బ్రాంచ్లో అకౌంట్ తెరచిన తరువాత మళ్లీ ఒకవేళ అడ్రస్ మారితే ఆ వివరాలను ఆరునెలల్లో సంబంధిత బ్యాంక్ బ్రాంచ్కి తెలియజేస్తే సరిపోతుంది. ఈ విధంగా కేవైసీ నిబంధనలను సడలించుకుంటూనే... సంబంధిత నిబంధనలను కఠినంగా అమలుచేయడంపై దృష్టిపెట్టాలని నోటిఫికేషన్ స్పష్టం చేసింది.