-
ఆహార దిగుమతి.. చైనా గుణపాఠాలు
దేశంలోని 95 శాతం ప్రజల ఆహార అవసరాన్ని దేశీయ ఉత్పత్తిద్వారానే నెరవేర్చాలని చైనా 1996లో లక్ష్యంగా పెట్టుకుంది. కానీ 2011 నాటికి చైనా ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార ధాన్యాల దిగుమతిదారుగా మారిపోయింది. మన దేశంలోనూ ప్రధాన స్రవంతి ఆర్థిక వేత్తలు వ్యవసాయ సంస్కరణల పేరిట ఉన్న సౌకర్యాలను కూడా తొలగించే పద్ధతులను ప్రోత్సహిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ నియంత్రణ నుంచి మార్కెట్ ఆధారిత వ్యవసాయం వైపు పరివర్తన అనేది.. చైనాను నిర్వహించలేని ఆహార సంక్షోభంలోకి ఎలా నెట్టివేసిందనే అంశంపై చైనా మనకు పెద్ద గుణపాఠం నేర్పుతోంది. అదే బాటలో మనమూ నడిస్తే భారత్కు ఎవరు తిండి పెడతారు అనే ప్రశ్న మన భవిష్యత్ తరాలను కూడా వెంటాడుతుంది. సరిగ్గా 150 ఏళ్ల క్రితం గ్రేట్ ఐరిష్ కరువు బారిన పడి 10 లక్షలమంది చనిపోయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఐర్లండ్లోని యూనివర్సిటీ కాలేజి కోర్క్లో 1998లో నిర్వహించిన ఒక అంతర్జాతీయ సదస్సులో మాట్లాడుతూ సభికులు నన్ను ప్రశ్నించారు. భారత్కు తిండి పెట్టేది ఎవరు? ప్రపంచ ప్రఖ్యాత పర్యావరణ పరిశోధకుడు, చింతనాపరుడు లెస్టర్ బ్రౌన్ ప్రతిపాదించిన ఒక పరికల్పనను ప్రపంచం చర్చిస్తున్న సందర్భంగా ఆ ప్రశ్న వెలువడింది. అమెరికా కేంద్రంగా పనిచేసే పర్యావరణ మేధోమధన సంస్థ వరల్డ్ వాచ్ ఇనిస్టిట్యూట్ సంస్థాపకుడు, తర్వాత ఎర్త్ పాలసీ ఇనిస్టిట్యూట్ అధ్యక్షుడు లెస్టర్ బ్రౌన్ చైనాకు ఎవరు తిండి పెడతారు (హూ విల్ ఫీడ్ చైనా) అనే పుస్తకంలో తన విశ్లేషణను తీసుకొచ్చారు. ఇది ప్రపంచవ్యాప్తంగా అసంఖ్యాక సెమినార్లు, సదస్సులలో తీవ్ర వాదోపవాదాలకు తావిచ్చింది. అగణిత మేధోపండితులు కూడా లెస్టర్ బ్రౌన్ పరికల్పనను బలపర్చారు. కాగా కొంతమంది నిపుణులు ఆయన వాదనను బహిరంగంగానే సవాలు చేశారు. కానైతే.. సరిగ్గా 25 సంవత్సరాల తర్వాత చైనా ప్రపంచంలోనే అతి పెద్ద ఆహార ధాన్యాల దిగుమతిదారుగా ఆవిర్భవించింది. ఆహార సంక్షోభ తీవ్రతను పైకి తోసిపుచ్చుతున్నప్పటికీ, గత ఏడాది ఆగస్టులో ఒక్క మెతుకు ఆహారాన్ని కూడా వృథా చేయవద్దని చైనా ప్రజలను కోరుతూ సాక్షాత్తూ చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ ఆపరేషన్ క్లీన్ ప్లేట్ (ఆహార వృధాను అరికట్టే చర్య) పథకాన్ని ప్రారంభించడంతో చైనా పరిస్థితిపై ప్రశ్నలు కొనసాగుతూనే ఉన్నాయి. చైనాలో ఒక సంవత్సరంలో 6 శాతం ఆహారం మాత్రమే వృథా అవుతుందని అంచనా వేసినా, అది 20 కోట్లమంది ప్రజలకు సరిపోయే ఆహారాన్ని అందిస్తుంది. చివరకు కస్టమర్లు కోరినంత తిండి పెట్టవద్దని చైనాలో రెస్టారెంట్లపై ఆంక్షలు విధించారు. ఉదాహరణకు విని యోగదారులు అయిదు మీల్స్ ఆర్డర్ చేస్తే నలుగురికి సరిపోయే తిండి మాత్రమే పెట్టాలని రెస్టారెంట్లను ప్రభుత్వం ఆదేశించింది. ఆహార వృథాపై చైనా ప్రభుత్వ ఆంక్షలు.. ప్రతి సోమవారం నిరాహార దీక్ష పూనాలంటూ నాటి ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి 1965లో భారతీయులను కోరిన విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. నిజానికి 1965లో అంటే దేశంలో హరిత విప్లవం ప్రారంభానికి సంవత్సరం ముందు ఏర్పడిన తీవ్రమైన ఆహార కొరతను అధిగమించడానికి భారతదేశం కోటి టన్నుల ఆహారధాన్యాలను దిగుమతి చేసుకుంది. హరిత విప్లవం మొదలైన తర్వాత భారత్ ఆహార పదార్థాల విషయంలో స్వావలంబనను సాధించింది కానీ ఆహారం సులభంగా అందుబాటులోకి వస్తుండటంతో నిర్లక్ష్యం దేశాన్ని అలుముకుంది. చైనా కూడా ఆహార ధాన్యాల ఉత్పత్తిలో చాలా పెద్ద ముందంజ వేసింది. 1996లో చైనా ఒక విధానంపై దృష్టి పెడుతూ దేశంలోని 95 శాతం ప్రజల ఆహార అవసరాన్ని దేశీయ ఉత్పత్తిద్వారానే నెరవేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ 2011 నాటికి ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రకటన మేరకు, చైనా ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార ధాన్యాల దిగుమతిదారుగా మారిపోయింది. ఆదాయాలు పెరగడంతో మధ్యతరగతి ప్రజల ఆహార ప్రాధాన్యతల్లో తీవ్ర మార్పులు చోటు చేసుకున్నాయి. చైనా వాడుకగా పండించే ఆహార ఉత్పత్తులనుంచి చైనా మధ్యతరగతి మాంసం, పాలతో సహా ఇతర పోషకాహార ఉత్పత్తులను డిమాండ్ చేయడం మొదలెట్టింది. ప్రజల ఆహార అలవాట్లలో మార్పులు చోటుచేసుకోవడంతో ఆహార స్వావలంబన విధానం నుంచి చైనా ప్రభుత్వం గమనం మార్చుకుని తగుమాత్రం ఆహార దిగుమతులను అనుమతించింది. అదేసమయంలో భారీ ఎత్తున ప్రజలు నగరాల బాట పట్టడం, వ్యవసాయరంగం నుంచి రైతాంగం భారీ స్థాయిలో పారిశ్రామిక కార్మికవర్గంలోకి పరివర్తన చెందడం అనేది ఆహార ఉత్పత్తిలో అంతరాన్ని సృష్టించింది. పైగా, రసాయన ఎరువులు అధికంగా వాడే సాంద్ర వ్యవసాయ పద్ధతులతో సాగుభూములు కలుషితమయ్యాయి. భూగర్భ జలాలు క్షీణించి పోవడంతో కాలుష్యం కూడా పెరిగిపోయింది. ఈ పర్యావరణపరమైన క్షీణత సాగు భూముల విస్తీర్ణాన్ని తగ్గించివేసింది. దీంతో తన ఆహార భద్రత కోసం 12 కోట్ల హెక్టార్ల సాగు భూమిని కాపాడుకోక తప్పదంటూ చైనా ప్రకటించింది. చైనాలో సగటు వ్యవసాయ భూమి విస్తీర్ణం ఇప్పుడు 1.6 ఎకరాలకు పడిపోయింది. నైట్రోజన్తోపాటు రసాయనిక ఎరువుల వాడకం తీవ్రమవడం, రైతులకు ప్రత్యక్ష నగదు మద్దతును అందించడం కారణంగా 2017లో 60 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు అదనంగా ఉత్పత్తయ్యాయి. కానీ, బీఫ్తో సహా ఇతర పోషకాహార పదార్థాల కోసం చైనాలో డిమాండ్ పెరిగిపోయింది. ఉదాహరణకు చైనాలో బీఫ్ ఉత్పత్తులకు డిమాండ్ 19,000 శాతానికి అమాంతంగా పెరిగిపోయింది. దీంతో భారత్, పాక్తో సహా ప్రపంచమంతటినుంచి చైనా ఆహార పదార్థాల కోసం అర్రులు చాచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫిచ్ రేటింగుల ప్రకారం 2020 సంవత్సరంలో మొక్కజొన్న, గోధుమ, జొన్న, బార్లీ పంటల దిగుమతులు చైనాలో వరుసగా 136, 140, 437, 36.3 శాతం వరకు పెరిగాయి. ప్రపంచంలోనే అత్యధికంగా సోయాబీన్స్ను ఉత్పత్తి చేస్తున్న బ్రెజిల్నుంచి ఇప్పటికే గరి ష్టంగా సోయాబీన్ దిగుమతులు మొదలెట్టిన చైనా, ఇప్పుడు వాటికోసం అమెరికావైపు చూపు సారిస్తోంది. ప్రపంచంలోనే గోధుమలను అత్యధికంగా పండిస్తున్న రెండో దేశంగా గుర్తింపు పొందిన చైనా ప్రపంచవ్యాప్తంగా పండే మొత్తం గోధుమ నిల్వల్లో సగం మేరకు సొంతం చేసుకుంది. ప్రపంచంలోని మొక్కజొన్న నిల్వల్లో 65 శాతాన్ని చైనా ఇప్పటికే సొంతం చేసుకుంది. దేశీయంగా ఆహార అవసరాలను తీర్చలేకపోతున్న చైనా, ఇప్పుడు ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లోని వ్యవసాయ క్షేత్రాలను కొనివేయడంలో దూకుడు ప్రదర్శిస్తోంది. అమెరికా, యూరోపియన్ యూనియన్, ఆస్ట్రేలియా దేశాల్లోని వ్యవసాయ క్షేత్రాల కొనుగోలుపైనా చైనా చూపు సారిస్తోంది. 2010 నుంచి చైనా విదేశాల్లో 94 బిలియన్ డాలర్లు పెట్టి 32 లక్షల హెక్టార్ల భూమిని కొనుగోలు చేసిందని జ్చటఝl్చnఛీజట్చb.ఛిౌఝ వెబ్సైట్ అంచనా వేసింది. చైనా అనుభవాల నుంచి భారత్ ముఖ్యమైన గుణపాఠాలు తీసుకోవాల్సి ఉంది. ప్రభుత్వ నియంత్రణ నుంచి మార్కెట్ ఆధారిత వ్యవసాయం వైపు చైనా పరివర్తన అనేది ఆ దేశాన్ని ఇక నిర్వహించలేని ఆహార సంక్షోభంలోకి ఎలా పడవేసిందనే అంశంపై చైనా మనకు పెద్ద గుణపాఠం నేర్పుతోంది. ప్రపంచ వస్తూత్పత్తి కేంద్రంగా చైనాను మార్చివేసిన ప్రయోగం ఇప్పుడు అవసవ్య దిశలో పయనించబోతోంది. ఎందుకంటే కారుచౌకతో దొరికే శ్రామికలను అందించడంలో ఆఫ్రికా చైనాతో పోటీపడుతోంది. దీంతో చైనాలో మళ్లీ వ్యవసాయ క్షేత్రాలను పునరుద్ధరించడం అనేది అతి పెద్ద సవాలు కానుంది. చైనా ప్రతి ఏడాది 206 బిలియన్ డాలర్ల మేరకు వ్యవసాయ సబ్సిడీలను అందిస్తోంది. దీనికి ప్రతి ఏటా ఆహార ధాన్యాల దిగుమతిపై ఖర్చుపెడుతున్న వందల కోట్ల డాలర్లను కూడా కలుపుకోవాలి. చైనాలోని చిన్న కమతాల వ్యవసాయ క్షేత్రాలను ఆర్థిక శక్తి కేంద్రాలుగా మార్చడానికి ఇంతే మొత్తం ఖర్చు పెట్టినట్లయితే, అతిపెద్ద ఆహార ధాన్యాల ఉత్పత్తిదారు అయిన చైనా ప్రపంచ అతిపెద్ద ఆహార ధాన్యాల దిగుమతిదారుగా మారే ప్రమాదాన్ని అరికట్టవచ్చు. ఇది ఒకరకంగా ప్రత్యామ్నాయ ఆర్థిక మార్గం. సాగుభూములపై అధికంగా వ్యయం చేయడం వల్ల దీర్ఘకాలంలో స్వావలంబన సాధ్యపడుతుంది. కానీ చైనా ఇక్కడే విఫలమైంది. భారత్ కూడా ఆ దారిలో పయనిస్తే తట్టుకోలేదు. మరోమాటలో చెప్పాలంటే భారత్కు ఎవరు తిండి పెడతారు అనే ప్రశ్న మన భవిష్యత్ తరాలను కూడా వెంటాడుతుంది. దేవీందర్ శర్మ వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు ఈ-మెయిల్ : : hunger55@gmail.com -
‘మందుల’ వాడకంలో మనమే టాప్
క్రిమిసంహారక మందుల తయారీ సంస్థల ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా రైతుల ప్రాణాలను బలిగొంటున్నాయని, ఆ మందులను పంటపొలాల్లో వాడుతున్న రైతులు కేన్సర్ వ్యాధికి గురవుతున్నారని అంతర్జాతీయ అధ్యయనాలు భయంగొలిపే నివేదికలను వెలువరిస్తున్నాయి. ప్రపంచ పురుగుమందుల్లో 59 శాతంవరకు వినియోగిస్తున్న భారతదేశం అంతర్జాతీయంగా పురుగుమందుల వినియోగంలో అగ్రస్థానం పొందినట్లు తెలిసింది. పురుగుమందుల కంపెనీలు తయారు చేస్తున్న మందుల్లో 99.9 శాతం మందులు పర్యావరణంలో కలిసిపోతుండగా 0.1 శాతం మందులు మాత్రమే క్రిములను ప్రభావితం చేస్తున్నాయని ప్రొ. డేవిడ్ పిమెంటర్ యాభయ్యేళ్ల క్రితమే తన శాస్త్ర పరిశోధనా పత్రంలో సమర్పించారు. దీన్ని ముందుగానే గ్రహించి ఉంటే ప్రపంచం పురుగుమందులకు వ్యతిరేకంగా మరింత సురక్షితమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకుని ఉండేది. అంతర్జాతీయ వ్యవసాయ రసాయనిక ఉత్పత్తుల బహుళజాతి సంస్థ బేయర్–మోన్శాంటో తయారు చేసిన రౌండప్, డికాంబా అనే క్రిమిసంహాకర మందులు కేన్సర్ వ్యాధికారకాలను కలిగి ఉన్నట్లు వచ్చిన ఆరోపణలపై అమెరికాలోనూ, ఇతర దేశాల్లోనూ ఆ సంస్థ కేసులు ఎదుర్కొం టోంది. ఈ నేపథ్యంలో స్విట్జర్లాండ్ ఎన్జీఓ పబ్లిక్ ఐ, యూకేకు చెందిన గ్రీన్ పీస్ సంస్థలకు చెందిన జర్నలిస్టు పరిశోధనా బృందం ‘అన్ఎర్త్డ్’ చేసిన పరిశోధనలో.. అత్యంత ప్రమాదకరమైన పురుగుమందుల్లో 59 శాతంవరకు వినియోగిస్తున్న భారతదేశం అంతర్జాతీయంగా పురుగుమందుల వినియోగంలో అగ్రస్థానం పొందినట్లు తెలిసింది. అయితే ది గార్డియన్ పత్రిక నివేదిక ప్రకారం, వ్యవసాయ రసాయన ఉత్పత్తుల కంపెనీలు ఈ డేటాతో విభేదిస్తున్నాయి. పరిశోధనా బృందం ప్రకటించిన సమాచారం తప్పుదోవ పట్టిస్తోందని బేయర్ కంపెనీ చెబుతోంది కానీ దాన్ని తన సొంత డేటాతో ఎదుర్కోలేకపోయింది. మరోవైపున ఆగ్రో–కెమికల్ పరిశ్రమకు చెందిన బలమైన లాబీ గ్రూప్ అయిన క్రాప్ లైఫ్ ఇంటర్నేషనల్ ఒక ప్రకటన చేస్తూ, తన ఉత్పత్తులలో 15 శాతం మాత్రమే అత్యంత ప్రమాదకరమైనవిగా ఉంటున్నాయని, వీటిలో కూడా 10 శాతం మందులను రైతులు సురక్షితంగా వాడుతున్నారని తెలిపింది. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ, అమెరికా ఆహార, వ్యవసాయ సంస్థ అభిప్రాయం ప్రకారం అత్యంత ప్రమాదకరమైన పురుగుమందులు అంటే.. ‘అంతర్జాతీయంగా ఆమోదించిన వర్గీకరణ వ్యవస్థల ప్రకారం మానవ ఆరోగ్యానికి లేదా పర్యావరణానికి తీవ్రమైన, దీర్ఘకాలిక హాని కలిగించేవి’ అని అర్థం. ఇది 1980లలో నోబెల్ గ్రహీత నార్మన్ బొర్లాగ్తో నేను జరిపిన చర్చను గుర్తుకు తెచ్చింది. పర్యావరణ ఉద్యమానికి దారిచూపుతున్నట్లుగా అప్పట్లో ప్రచారమైన రేచల్ కార్ల్సన్ రాసిన ‘సైలెంట్ స్ప్రింగ్’ పుస్తకంపై నేను సంధించిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ ఆమె ఒక దుష్టశక్తి అని అభివర్ణించారు. ఆమెలాంటి వ్యక్తులు ప్రపంచంలోనుంచి ఆకలిని తరిమివేయాలని అసలు కోరుకోరని ఆయన విమర్శించారు. పైగా పురుగుమందులు అనేవి ఔషధాల వంటివి అనేశారు. అన్ని జాగ్రత్తలూ తీసుకుని రైతులు వాటిని ఉపయోగించాలన్నారు. ఆరోజు బొర్లాగ్ చెప్పిన మాటలు చర్చనీయాంశమే. కానీ ఆయన అభిప్రాయాలు క్రిములు కలిగించే నష్టాన్నుంచి పంటలను కాపాడేందుకు పురుగుమందులను ఉపయోగించే హరిత విప్లవానికి కీలక వ్యూహాన్ని ఏర్పర్చాయి. కానీ ఏళ్లు గడిచేకొద్దీ, పురుగుమందులు పర్యావరణానికి మరిం తగా హాని కలిగించాయి. రసాయనమందుల వినియోగం, దుర్వినియోగం అనేవి ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ నష్టాలకు, పర్యావరణ అసమతుల్యతకు, పురుగుమందుల ప్రభావం నిరోధకతకు, మొత్తం ఆహార సరఫరా వ్యవస్థనే కలుషితం చేసిందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. ఎంత అధికంగా పురుగుమందులు వాడితే అంత అధికంగా ఆకలిని తొలగించవచ్చనే అభిప్రాయం భ్రాంతి మాత్రమే అని ఐక్యరాజ్య సమితి ప్రత్యేక ప్రతినిధి హిలాల్ ఎల్వర్ పేర్కొన్నారు. మరింతగా పురుగుమందులు వాడితే ఆకలి సమస్యపై అంత ఎక్కువగా స్వారీ చేయవచ్చనడంలో నిజం లేదు. ఎప్ఏఓ ప్రకారం, ఈరోజు మనం 700 కోట్లమందికి ప్రపంచంలో తిండిపెడుతున్నాం. ఉత్పత్తి కచ్చితంగా పెరిగింది. కానీ దారిద్య్రం, అసమానత్వం, పంపిణీయే అసలు సమస్య. పురుగుమందులను దీర్ఘకాలంగా వాడటం అనేది కేన్సర్, అల్జీమర్స్, పార్కిన్సన్ వంటి వ్యాధులకు దారితీస్తోందని, హార్మోన్ల విచ్ఛిన్నత, మానవ శరీర అభివృద్ధి క్రమరాహిత్యం, సంతాన విహీనత వంటివి కూడా తలెత్తుతున్నాయని పై నివేదిక వివరించింది. రౌండప్ పురుగుమందులో వాడుతున్న గ్లైపోసేట్ మనుషుల్లో కేన్సర్కు కారణమవుతోందన్న అంశాన్ని జతచేస్తూ ఇంటర్నేషనల్ ఏజెన్సీ రీసెర్చ్ ఆన్ కేన్సర్ నివేదికను ప్రచురించిన తర్వాత, విషపూరితమైన పురుగుమందుల వాడకానికి వ్యతిరేకంగా అమెరికాలో అనేక వ్యాజ్యాలు ప్రారంభమయ్యాయి. గ్లిపోసేట్కు, కేన్సర్ వ్యాధికి మధ్య లింకు ఉన్నట్లు యూరోపియన్ కమిషన్, అమెరికా పర్యావరణ రక్షణ ఏజెన్సీ వంటి రెగ్యులేటరీ సంస్థలు చెప్పడం లేదని మోన్శాంటో చెప్పింది కానీ పలువురు కేన్సర్ రోగులు పురుగుమందుల కంపెనీలపై లీగల్ కేసులు పెట్టడం ప్రారంభించారు. తాజా గణాంకాలను చూస్తే ఇంతవరకు పురుగుమందుల కంపెనీలపై 42,000 కేసులు పెట్టారు. కాగా ఫిర్యాదుదారుల సంఖ్య ఇప్పటికే లక్షకు పైగా దాటినట్లు న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఒక్క గ్లైపోసేట్కు వ్యతిరేకంగానే కాకుండా, మరొక క్రిమిసంహారక మందు అయిన డికాంబాపై కూడా న్యాయవివాదాలు కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 15న మిస్సోరి రైతుకు తన పీచ్ ఆర్చర్డ్ తోటను పురుగుమందులు ధ్వంసం చేసిపడేశాయన్న ఆరోపణతో ఏకీభవిం చిన అమెరికా ఫెడరల్ కోర్టు 265 మిలియన్ డాలర్ల పరిహారాన్ని చెల్లించాలని పురుగుమందుల కంపెనీలను ఆదేశించింది. తన పొరుగున ఉన్న పొలం యజమాని చల్లిన డికాంబా క్రిమిసంహాకర మందు పక్కనే ఉన్న తన పూలతోటకు వ్యాపించి తోట మొత్తాన్ని పాడు చేసిందంటూ ఆ రైతు బేయర్, బీఎఎస్ఎఫ్ అనే బడా ఆగ్రో–కెమికల్ కంపెనీలపై ఫిర్యాదు చేశారు. డికాంబా పురుగుమందు ప్రభావాన్ని తట్టుకునే పత్తిపంట కోసం పొరుగు రైతు ఈ కంపెనీల మందును చల్లగా అది పక్కనున్న తన పొలంలోని పీచ్ అర్చర్డ్ తోటలోని ఆకులను, చెట్లను చంపేసిందని ఆ రైతు వాదించి మరీ గెలిచారు. అయితే గ్లైపోసేట్ పురుగుమందుకు వ్యతిరేకంగా నడుస్తున్న న్యాయపరమైన లావాదేవీని మనం నిశితంగా పరిశీలించాలి. ఇంతవరకు గ్లైపోసేట్కు వ్యతిరేకంగా మూడు వ్యాజ్యాలలో నలుగురు ఫిర్యాదీదారులకు న్యాయస్థానం 2.3 బిలియన్ డాలర్ల పరిహారాన్ని చెల్లించాలని తీర్పు ఇచ్చింది. తన పురుగుమందులు వాడేటప్పుడు కేన్సర్ ప్రమాదం పొంచి ఉంటుందని వినియోగదారులను నిర్దిష్టంగా హెచ్చరించడంలో పురుగుమందుల కంపెనీ విఫలమైందని తీర్పులు స్పష్టం చేశాయి. మొట్టమొదటగా 2018 ఆగస్టు నెలలో డెవైన్ జాన్సన్ అనే తోటల పెంపకందారుకు శాన్ప్రాన్సిస్కో న్యాయస్థానం 289 మిలి యన్ డాలర్ల నష్టపరిహారాన్ని చెల్లించాలని పురుగుమందుల కంపెనీలను ఆదేశించింది. తన పొలంలో గ్లైపోసేట్కు చెందిన వివిధ రకాల కాంబినేషన్లను స్ప్రే చేశానని, దీంతో తాను లింపోమా వ్యాధికి గురయ్యానని ఆ రైతు చెప్పారు. ఇక భారతదేశం విషయానికి వస్తే ప్రతి సంవత్సరం 10 వేల పురుగుమందుల విషప్రభావానికి సంబంధించిన కేసులు సగటున నమోదవుతున్నాయని డౌన్ టు ఎర్త్ పత్రిక పేర్కొంది. 2015లో ప్రమాదవశాత్తూ పురుగుమందులతో విషప్రభావానికి గురై 7,060 మంది చనిపోయారని జాతీయ నేర నమోదు బ్యూరో పేర్కొంది. వాస్తవానికి దేశంలో రూ. 20,000 కోట్ల విలువైన క్రిమిసంహారక పరిశ్రమలు 2024 వరకు ప్రతి ఏటా 8.1 శాతంతో వృద్ధి సాధించనున్నాయని అంచనా. అంటే పురుగుమందుల కంపెనీల క్రమబద్ధీకరణ విషయంలో లొసుగులను పరిష్కరించడం ఎంత అవసరమో దీన్ని బట్టి తెలుస్తోంది. కేంద్రం తీసుకురానుందని చెబుతున్న పెస్టిసైడ్స్ మేనేజ్మెంట్ బిల్ 2020ను త్వరలో పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఈ చట్టం క్రిమిసంహారక మందుల కంపెనీలను క్రమబద్ధీకరించడమే కాకుండా తమ మందుల వాడకం ద్వారా రైతులకు కలుగుతున్న ఆరోగ్యపరమైన నష్టాలకు కూడా పరిహారం అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. పైగా వేలాది మంది రైతులు వేయబోయే కేసులను కూడా మననంలో ఉంచుకోవలసిన అవసరం ఉంది అయితే దాదాపు అయిదు దశాబ్దాల క్రితం 1970లలో కార్నెల్ యూనివర్సిటీకి చెందిన సుప్రసిద్ధ ప్రొఫెసర్ డేవిడ్ పిమెంటర్ చెప్పిన మాటలను ప్రపంచం పట్టించుకుని ఉంటే ఈ 50 ఏళ్లలో జరుగుతూ వచ్చిన నష్టాన్ని నివారించి ఉండేది. పురుగుమందుల కంపెనీలు తయారు చేస్తున్న మందుల్లో 99.9 శాతం మందులు పర్యావరణంలో కలిసిపోతుండగా 0.1 శాతం మందులు మాత్రమే క్రిములను ప్రభావితం చేస్తున్నాయని ఆయన ఆనాడే తన శాస్త్ర పరిశోధనా పత్రంలో సమర్పించారు. అంటే పురుగుమందుల్లోని రసాయనాలు ఒక శాతం మాత్రమే తమ లక్ష్యాన్ని తాకుతున్నాయని అర్థం. దీన్ని ముందుగానే గ్రహించి ఉంటే ప్రపంచం పురుగుమందులకు వ్యతిరేకంగా మరింత సురక్షితమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకుని ఉండేది. కానీ ఇంతవరకు జరిగిన నష్టానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? వ్యాసకర్త: దేవీందర్ శర్మ, వ్యవసాయ నిపుణులు, ఈ–మెయిల్ : hunger55@gmail.com -
సమృద్ధి వెలుగులో ఆకలి నీడలు
దేశంలోని అదనపు ఆహార నిల్వల సంచులను ఒకదానిపై ఒకటిగా పేర్చుకుంటూ పోతే వాటిపై నడుచుకుంటూ చంద్రుడి వద్దకు వెళ్లి మళ్లీ తిరిగిరావచ్చు. పైగా మన ఆహార నిల్వలు రానురాను పెరుగుతూనే ఉన్నాయి. ఇంత సమృద్ధిగా ఆహార నిల్వలు ఉన్నప్పటికీ పొరుగు దేశాల్లోకంటే ఆకలి బాధా సూచికలో భారత ర్యాంకు ఘోరంగా పడిపోవడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఆహారోత్పత్తిలో, అదనపు మిగులులో రికార్డులన్నింటినీ బద్దలు చేస్తున్న భారత్లో ప్రతిరోజూ 2,400 మంది చిన్నారులు రకరకాల పోషకాహార లేమితో అల్లాడుతూ మృత్యువాత పడుతుండటం సమృద్ధి వెనుక దాగిన చీకట్లను స్పష్టంగా చూపుతోంది. ప్రతి ఏటా 8 లక్షల మంది పిల్లలు ఆకలిదప్పులతో కన్నుమూస్తున్న స్థితిలో, జనాభాలో అధిక శాతానికి తగిన పోషకాహారం లేని నేపథ్యంలో భారత్ ఆర్థిక అగ్రరాజ్యంగా మారాలనే కలను ఎన్నటికీ సాకారం చేసుకోలేదు. సమృద్ధికి సంబంధించిన ఈ వింత పరామితి ఇప్పటికీ ఊహకు అందనివిధంగానే ఉంటోంది. ఒకవైపున దేశంలో గోధుమ నేలలు విస్తారమైన పంట లతో కళకళలాడుతుండగా మరోవైపున ప్రపంచ క్షుద్బాధా సూచి (జీహెచ్ఐ) భారత్కు అకలితో అలమటించిపోతున్న 117 దేశాల్లో 102వ స్థానమిచ్చింది. ఇది చాలదన్నట్లుగా, తాజా యూనిసెఫ్ నివేదిక అయిదేళ్లలోపు పిల్లలు అధిక మరణాల పాలవుతున్న దేశాల జాబితాలో భారత్ను చేర్చింది. గత ఏడాది భారత్లో 8.82 లక్షలమంది చిన్నపిల్లలు మరణించారని యూనిసెఫ్ నివేదించింది. ఒకవైపున వినియోగదారీ వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తనకు తలకు మించిన భారంగా తయారవుతున్న ఆహారధాన్యాల నిల్వలను కాస్త తగ్గించి పుణ్యం కట్టుకోవలసిందిగా భారత విదేశాంగ శాఖను వేడుకుంటోంది. భారత ఆహార సంస్థ వద్ద పేరుకుపోతున్న ఆహార ధాన్యాలలో అదనపు నిల్వలను ప్రపంచంలో అవసరమైన దేశాలకు అందించే అవకాశాలను పరిశీలించాల్సిందిగా ఈ మంత్రిత్వ శాఖ భారత విదేశాంగ శాఖను కోరింది. విచిత్రం ఏమిటంటే దేశంలో 6 నుంచి 23 ఏళ్ల వయసులో ఉన్న పిల్లల్లో 90 శాతం మందికి తినడానికి తగినంత ఆహారం లేక అల్లాడిపోతున్న పరిస్థితుల్లో మన ఆహార ధాన్యాల నిల్వలను బయటిదేశాలకు పంపవలసిందిగా వేడుకోవడమే. ఆకలి, పోషకాహార సమస్యను తీవ్రతరం చేస్తూ మన అమూల్య వనరులైన పిల్లల జీవితాల్లో నిశ్శబ్ద విషాదాన్ని సృష్టిస్తుండగా, బయటిదేశాలకు మానవీయప్రాతిపదికన ఆహార నిల్వలను అందించాలన్న ప్రతిపాదన కంటే మించిన అభాస మరొకటి ఉండదు. దేశంలో ప్రతి ఇద్దరు పిల్లల్లో ఒకరు తగిన తిండి లేకుండా బక్కచిక్కిపోతున్న వాస్తవం తెలిసిన విషయమే. అక్టోబర్ 1 నాటికి 307.70 లక్షల టన్నుల ఆహార ధాన్యాల సేకరణ లక్ష్యంగా పెట్టుకోగా భారత ఆహార సంస్థ ఇప్పటికే రెట్టింపు స్థాయిలో 669.15 లక్షల టన్నుల వరి, గోధుమ పంటను సెప్టెంబర్ 1 నాటికే సేకరించింది. వరి పంట ఇప్పుడు తారస్థాయిలో పోగవుతున్న స్థితిలో రాబోయే కొద్ది వారాల్లో కేంద్ర ఆహార నిల్వల గిడ్డం గులు ధాన్య సమృద్ధితో పొంగిపొరలనున్నాయి. దీనికితోడుగా దేశంలో 2018–19 సంవత్సరంలో పళ్లు, కూరగాయలు 314.5 మిలి యన్ టన్నులకు పోగుపడ్డాయి. ఇక పాల ఉత్పత్తి 176 మిలియన్ టన్నులతో రికార్డు సృష్టించింది. అంటే దేశంలో పోషకాహారానికి కొరతే లేదని ఈ గణాంకాలను బట్టి తెలుస్తోంది. ఆహార ధాన్యాలను ఇంత సమృద్ధిగా నిల్వ ఉంచుకున్న దేశంలో అత్యధిక జనాభా ఆకలితో అలమటిస్తుండటం కంటే మించిన అసందర్భం ఉండదు. దీన్ని మరింత సులువుగా చెప్పుకుందాం. దేశంలోని అదనపు ఆహార నిల్వల సంచులను ఒకదానిపై ఒకటిగా పేర్చుకుంటూ పోతే వాటిపై నడుచుకుంటూ చంద్రుడి వద్దకు వెళ్లి మళ్లీ తిరిగిరావచ్చు. ఇంత సమృద్ధికరంగా ఆహార నిల్వలు ఉన్నప్పటికీ పొరుగు దేశాల్లోకంటే ఆకలి బాధా సూచికలో భారత ర్యాంకు ఘోరంగా పడిపోవడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. కెనడా తన రికార్డును మెరుగుపర్చుకుని అంతర్జాతీయంగా 25వ ర్యాంకులో నిలబడగా, బ్రిక్స్ దేశాలన్నిటికంటే భారత్ వెనుకబడిపోయింది. శ్రీలంక (66), నేపాల్ (73), బంగ్లాదేశ్ (88), పాకిస్తాన్ (94) ర్యాంకులతో మనకంటే ఎంతో మెరుగ్గా ఉండగా, చివరకు వెనిజులా (65), ఉత్తర కొరియా (92), ఇథియోపియా (93) ర్యాంకులతో మనల్ని అధిగమించటం బాధాకరం. నిజానికి, 2006 నుంచి ప్రపంచ క్షుద్బాధా సూచిని ప్రకటిస్తుండగా, 14 రిపోర్టుల తర్వాత కూడా భారత్ ఆకలి, పోషకాహార లేమి సంబంధించి ఏమాత్రం మెరుగుపడలేదు. ఇది మన ప్రాధాన్యతల ఎంపికకు సంబంధించిన సమస్య. కొన్నేళ్లుగా అత్యధిక ఉత్పాదకతను సాధించడంపైనే మన విధాన నిర్ణేతల దృష్టి ఉంటూ, దేశంలో ప్రబలుతున్న ఆకలిని, పోషకాహార లేమిని తేలికగా పక్కనపెడుతూ వస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ అధికంగా అభివృద్ధి చెందితే ఆకలిదప్పులతో జీవిస్తున్న వారి జనాభా దానికదే తగ్గిపోతుందనే ఆర్థిక వ్యవస్థ ప్రాధాన్యతా దృక్పథాన్ని దేశంలో కంటికి కనబడే ఆకలి, కనిపించకుండా మరుగున ఉండే ఆకలి రెండూ వెక్కిరిస్తూ వస్తున్నాయి. పైగా, ఆర్థిక వ్యవస్థ పెరుగుదలతోపాటే ఆకలి, పోషకాహార లేమి కూడా అదే స్థాయిలో పెరుగుతూ వస్తోంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పోషకాహార లేమిని ‘జాతీయ అవమానం’గా భావించాలని ప్రకటించినా పరిస్థితిలో మార్పు లేదు. ఆకలిని తొలగించడం సంక్లిష్టమైన, సవాలుతో కూడిన కర్తవ్యమని అర్థం చేసుకుంటాను కానీ గత కొన్నేళ్లుగా పిల్లల పోషకాహార లేమి, ఆహార దుబారా వంటి అంశాల్లో దేశం ప్రగతి సాధించి ఉంటే ఆకలి చరిత్రను నివారించడం అనే భారీ లక్ష్యం అసాధ్యమై ఉండేది కాదు. జనాభాలోని మూడింట రెండొంతుల మందికి సబ్సిడీ కింద ఆహార ధాన్యాలను అందించే లక్ష్యంతో 2013 జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని తీసుకురావడమే కాకుండా, పిల్లల్లో పోషకాహార లేమితో తలపడేందుకు, ఆకలిని నిర్మూలించేందుకు అనేక పథకాలను కేంద్ర స్థాయిలో ప్రవేశపెట్టినప్పటికీ సూక్ష్మ ఆర్థిక విధానాలలో.. వీటిని సాధించాల్సిన లక్ష్యాల్లో ఒకటిగా పెట్టుకోలేదు. పైగా జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని తీసుకువచ్చినప్పుడు కూడా అలా ఆహార సబ్సిడీలను పెంచడం వల్ల ద్రవ్యలోటు పెరిగిపోతుందని మన జాతీయ స్రవంతి ఆర్థికవేత్తలు నిరసన గళం వినిపించారు. తీవ్రమైన దారిద్య్రాన్ని, ఆకలిని నిర్మూలించేందుకు నాటి బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డా సిల్వా 2003లో ప్రారంభించిన ‘జీరో హంగర్’ (సంపూర్ణంగా ఆకలిని నిర్మూలించడం) కార్యక్రమంతో భారత్ విధానాలను పోల్చి చూద్దాం. జీరో హంగర్ కార్యక్రమం కింద వ్యవసాయంలో వ్యవస్ధాగతమైన మార్పులను నాటి బ్రెజిల్ అధ్యక్షుడు లూలా ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమం కింద 2011 నాటికే బ్రెజిల్లో దాదాపు మూడు కోట్ల 20 లక్షలమంది ప్రజలు (జనాభాలో 16 శాతం) దారిద్య్రం కోరల నుంచి బయటపడ్డారని ప్రముఖ పత్రిక ‘ది గార్డియన్’ పేర్కొంది. దీనికి ‘బోల్సా ఫ్యామిలియా’ వంటి నగదు బదిలీ పథకాలు తోడై జనాభాలో పావు శాతం పైగా ప్రజలకు నిజంగా ఊతమిచ్చాయి. ఆహార భద్రత, విద్య, వైద్యాలను అందుబాటులో ఉంచడం, ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక అభివృద్ధిని ప్రోత్సహించడం వంటి వాటి కలయికే బోల్సా ఫ్యామిలియా. పర్యవసానంగా కేవలం 15 ఏళ్ల వ్యవధిలోనే బ్రెజిల్ ప్రపంచ క్షుద్బాధా సూచి కలో 18వ ర్యాంకులో నిలిచింది. అంటే ఆకలి నివారణలో చైనాకంటే అగ్ర స్థాయిని బ్రెజిల్ సాధించింది. సారాంశంలో బ్రెజిల్ అమలు పర్చిన జీరో హంగర్ విధానాలు ఆహారోత్పత్తిని ఆకలి నిర్మూలనతో ముడిపెట్టడంలో విజయవంతమయ్యాయి. ఈ పథకంలోనూ కొన్ని తేడాలు ఉండవచ్చు కానీ, ఆకలిని పూర్తిగా నిరోధించడానికి బ్రెజిల్ ఇప్పటికీ నిర్ణీత గడువుతో కూడిన పథకాలను అమలు చేస్తోంది. భారత్లో ఆహార ఉత్పత్తిని పెంచడంపైనే పాలకుల విధానాలు దృష్టి పెడుతూ ఆహారధాన్యాలు తక్కువగా ఉంటున్న ప్రాంతాలకు అదనపు ఆహార నిల్వలను తరలించే పద్ధతిని అమలుచేస్తూ ఉన్నప్పటికీ, రైతుల సంక్షేమానికి మాత్రం ఏ ప్రభుత్వమూ ప్రాధాన్యత ఇచ్చిన చరిత్ర లేదు. వ్యవసాయంలో 60 కోట్లమంది ప్రజలు ప్రత్యక్షంగా లేక పరోక్షంగా పాల్గొంటున్న దేశంలో జీరో హంగర్ని సాధించడానికి చేసే ఏ పథకమైనా వ్యవసాయాన్ని మౌలికంగా పునరుద్ధరించాల్సి ఉంటుంది. వ్యవసాయరంగంలో ప్రభుత్వ రంగ పెట్టుబడులను పెంచవలసి ఉంది. అయితే ఆర్బీఐ ప్రకారం 2011–12 నుంచి 2016–17 మధ్య ప్రభుత్వరంగ సంస్థలు వ్యవసాయంలో పెట్టిన పెట్టుబడులు మన స్థూల దేశీయోత్పత్తిలో 0.4 శాతం మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. గత కొన్ని దశాబ్దాలుగా ఆకలితో, పోషకాహార లేమితో పోరాడ్డానికి సంబంధించి లెక్కలేనన్ని వాగ్దానాలు చేశారు. హామీలు గుప్పిం చారు. కానీ దురదృష్టకరమైన విషయం ఏమిటంటే, భారత్లో ప్రతి రోజూ 2,400 మంది చిన్నారులు రకరకాల పోషకాహార లేమితో అల్లాడుతూ మృత్యువాత పడుతుండటమే. దేశంలో జరుగుతున్న ఈ భారీ మానవ విషాదానికి.. పిల్లల నోటికి సరైన మోతాదులో మనం ఆహారాన్ని అందించకపోవడమే కారణం. ఆహార ఉత్పత్తిలో కొరత లేదు. ఆర్థిక విధానాలను ప్రకటించి అమలుచేసే సామర్థ్యంలో కొరత లేదు. కానీ, ఆకలిని తొలగించడానికి బలమైన రాజకీయ సంకల్పం నిజంగా కరువైపోయింది. ప్రతి ఏటా కొన్ని లక్షల మంది పిల్లలు ఆకలిదప్పులకు తాళలేక కన్నుమూస్తున్న స్థితిలో, జనాభాలో అధిక శాతానికి తగిన పోషకాహారం లేని నేపథ్యంలో భారత్ ఆర్థిక అగ్రరాజ్యంగా మారాలనే కలను ఎన్నటికీ సాకారం చేసుకోలేదు. దేవీందర్ శర్మ వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్ :hunger55@gmail.com -
పంటల సమృద్ధికి దుబారా పోటు
ఉత్తర భారత ధాన్యాగారమైన పంజాబ్, హరియాణా రాష్ట్రాలు గోధుమ, వరి పంటల దిగుబడిలో ప్రతి ఏటా రికార్డులను చెదరగొడుతూ ఉన్నాయి. కానీ పంటల సమృద్ధిని మించి పోటీపడుతున్న ఆహార ధాన్యాల దుబారా మన ధాన్య సేకరణ, నిల్వల విధానాన్నే పరిహసిస్తోంది. గోధుమ పంట సీజన్ ముగుస్తున్నప్పటికీ కొత్త పంటను నిల్వచేయడానికి పంజాబ్లో ఎలాంటి నిల్వ సౌకర్యాలు లేకపోవడం విచారకరం. ఆహారధాన్యాల ఉత్పత్తి విషయంలో ప్రతి సంవత్సరం సంబంధిత అధికారులు లక్ష్యాలు విధిస్తూ పోవడం పాలసీ ఎజండాగా ఉంటూవస్తోంది తప్పితే.. పండించిన, సేకరించిన ప్రతి వరి, గోధుమ గింజను నిల్వచేయడాన్ని నిర్వహించడం ఎలా అనేది మన రాజకీయ ప్రాధాన్యతలలో అట్టడుగున ఉండటమే విచారకరం. ఆహార ధాన్యాలు మానవ వినియోగానికి పనికిరాకుండా పోవడం జాతి మొత్తం సిగ్గుపడాల్సిన విషయం. ప్రజాస్వామ్యానికి చెందిన అతి పెద్ద పండుగ అయిన సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ సీజన్లో గోధుమ పంట విరగపండిందని వార్తలొస్తున్నాయి. భారతదేశ గోధుమ ధాన్యాగారమైన పంజాబ్, హరి యాణా రాష్ట్రాల్లో ఎంత పంట పండిందనే విషయంలో అధికారిక లెక్కలను ఖరారు చేయడానికి కాస్త సమయం పడుతుంది కానీ, ఈసారి గోధుమ పంట 310 లక్షల టన్నులతో రికార్డు సృష్టించనుందని ప్రారంభ అంచనా. పంజాబ్లో ఈ దఫా 180 లక్షల టన్నుల ఉత్పత్తి జరుగుతుందని భావిస్తుండగా పొరుగున ఉన్న హరియాణాలో 130 లక్షల టన్నుల గోధుమ పంట పండుతుందని అంచనా వేస్తున్నారు. శీతాకాలం విస్తరించిన కారణంగా గోధుమ పంట కాస్త ఆలస్యమయింది కానీ అదే సమయంలో పంట దిగుబడి పెరగడానికి ఈ పరిస్థితి దోహదపడింది. ఇక పంజాబ్లో ఈ సంవత్సరం హెక్టారుకు 52 క్వింటాళ్ల మేరకు గోధుమ దిగుబడి రావచ్చని భావిస్తున్నారు. ఇది జాతీయ సగటు అయిన 32 క్వింటాళ్ల కన్నా చాలా ఎక్కువ. కానీ గోధుమ భారీ దిగుబడి వార్తలు సంతోషం కలిగిస్తున్నప్పటికీ పంట నిల్వ సౌకర్యాల్లో తీవ్రమైన కొరత నిరాశ కలిగిస్తోంది. మండీ అంచులను దాటి జాతీయ రహదారుల పక్కనే గోధుమ పంటను నిల్వ చేస్తుండటాన్ని పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో అడుగడుగునా కనబడుతుంది. ధాన్య సేకరణ కార్యక్రమాలు ప్రారంభం కాకముందే వందలాది, వేలాది గోధుమ బస్తాలు మండీలకు పోటెత్తుతుండటం శుభవార్తే. పంటల నిల్వ సౌకర్యాల లేమి గోధుమ పంట సీజన్ ముగుస్తున్న తరుణంలో, కొత్త పంటను నిల్వ చేయడానికి ఆ రాష్ట్రంలో ఎలాంటి నిల్వ సౌకర్యాలు లేకపోవడం విచారకరం. ఇప్పటికే గత ఏడాది సేకరించిన 12 లక్షల టన్నుల గోధుమ పంట అలాగే నిల్వ ఉండిపోయింది. క్యాప్ స్టోరేజ్ అని దీన్ని పిలుస్తున్నారు. అంటే బహిరంగ స్థలాల్లో గోధుమ పంటను ఉంచి నల్ల టార్పాలిన్ కప్పి ఉంచుతున్నారు. పంజాబ్లో మొత్తం గోధుమ నిల్వ సామర్థ్యం 158.5 లక్షల టన్నులు కాగా గత సీజన్లో ఇప్పటికే 143 లక్షల టన్నుల వరకు వరి, గోధుమ పంటను నిల్వ చేసి ఉంచారు. అదనంగా 75 లక్షల టన్నుల క్యాప్ స్టోరేజి కూడా అందుబాటులో ఉంది కానీ గత సీజన్ పంటకు సంబంధించి 12 లక్షల టన్నుల దిగుబడి నిల్వ రూపంలో ఉంది. అదనంగా వరి మిల్లర్లు 20 నుంచి 22 వ్యాగన్ల మేరకు ఆడించిన వరిధాన్యాన్ని త్వరలో ధాన్య సేకరణ కేంద్రాలకు పంపనున్నారు. గోధుమతో పోలిస్తే వరికి నిల్వ నష్టాలు ఎక్కువ కాబట్టి ఈ పంటను ఇండోర్ కేంద్రాల్లో అంటే గోడౌన్లలో నిల్వ చేయడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. సంవత్సరం తర్వాత సంవత్సరం మనదేశంలో నడుస్తున్న కథ ఇదే మరి. 132 లక్షల టన్నుల గోధుమ దిగుబడి వస్తుందన్న అంచనా నేపథ్యంలో కొనుగోలు చేసే ఈ పంటలో చాలా భాగం బహిరంగ స్థలాల్లోనే నిల్వ చేయాల్సి ఉంటుంది. గత సంవత్సరం కూడా మండీలకు కొత్త పంట రావడం మొదలయ్యేటప్పటికి 20 లక్షల టన్నుల గోధుమ బస్తాలను బహిరంగ స్థలాల్లోనే నిల్వ చేశారు. ధాన్య సేకరణ ముమ్మరంగా జరిగే నాటికి 70 లక్షల టన్నుల తాజా పంటను క్యాప్ స్టోరేజీ కింది బహిరంగ స్థలాల్లోనే టార్పాలిన్ల కింద నిల్వ చేసి ఉంచారు. దీనికి ప్రధాన కారణం గత సంవత్సరం కొనుగోలు చేసిన వరి, గోధుమ పంటను నిల్వ కేంద్రాలనుంచి తరలించడంలో అసమర్థతే అని చెప్పాలి. మరో మాటలో చెప్పాలంటే గత సంవత్సరం మొత్తం 90 లక్షల టన్నుల గోధు మలను సేకరించి బహిరంగ స్థలాల్లో నిల్వ ఉంచగా దానిలో 12 లక్షల టన్నుల గోధుమ ఇంకా అక్కడే మగ్గుతోంది. పంజాబ్లో గోడౌన్లలోనూ, బహిరంగ ప్రదేశాల్లోనూ పేరుకుపోయిన గోధుమల మేటలను వీలైనంత త్వరగా రాష్ట్రం దాటించే ప్రయత్నం చేస్తే పరిస్థితి కాస్త మెరుగుపడటానికి అవకాశం ఉంటుంది. ధాన్యసేకరణ సీజన్ ముగిసిపోయే నాటికి రాష్ట్రంలో ధాన్యాల నిల్వకు తగిన చోటు ఖాళీ అవుతుందని భావిస్తున్నట్లు పంజాబ్ ఆహార, పౌర సరఫరాల మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యదర్శి కేఏపీ సిన్హా పేర్కొన్నట్లు పత్రికల్లో వార్తలు. రాష్ట్ర పాలనాయంత్రాంగం ప్రతి సంవత్సరం ఒకటికి రెండుసార్లు తప్పనిసరిగా ఎదుర్కొంటున్న ఈ పాలనాపరమైన అడ్డం కులను ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. గోధుమ పంట చేతికి వచ్చే సీజ న్లో, వరి పంట చేతికొచ్చే సమయంలో ఏటా రెండుసార్లు నిల్వకు సంబంధించిన సంక్షోభం ఎదురవుతూనే ఉంటుంది. ధాన్య నిల్వలకు రాజకీయ ప్రాధాన్యత లేదా? ప్రతి సంవత్సరం గడిచేకొద్దీ ధాన్యాల నిల్వ ప్రక్రియ, దానిలోని అడ్డం కులు, అవాంతరాలకు చెందిన వాస్తవ పరిస్థితి మరింత దిగజారిపోతోందే తప్ప సమస్యకు పరిష్కారం లభిస్తుందనే ఆశ లేశమాత్రం కని పించడం లేదు. గత ముప్పై ఏళ్లుగా ఉత్తర భారత ధాన్యాగారంలో ఆహారధాన్యాల నిల్వ కార్యక్రమాల్లో ఎంత తీవ్రమైన అవకతవకలు జరుగుతున్నాయో నేను నిత్యం పరిశీలిస్తూ వచ్చాను. ఆహారధాన్యాల ఉత్పత్తి విషయంలో ప్రతి సంవత్సరం సంబంధిత అధికారులు లక్ష్యాలు విధిస్తూ పోవడం పాలసీ ఎజెండాగా ఉంటూవస్తోంది తప్పితే పండించిన, సేకరించిన ప్రతి వరి, గోధుమ గింజను నిల్వచేయడాన్ని నిర్వహించడం ఎలా అనేది మన రాజకీయ ప్రాధాన్యతలలో అట్టడుగున ఉండటమే విచారకరం. సమృద్ధికి సంబంధించిన ఈ సరికొత్త విరోధాభాస – అత్యధిక పంటలు, విపరీతమైన ఆహార దుబారా– అనేది ఆహార నిర్వహణతో ముడిపడి ఉన్న అన్ని సూత్రాలను తోసిపుచ్చుతూండటం గమనార్హం. పండిన పంటలను సరైన రీతిలో నిల్వ చేసుకోలేని ఈ అసమర్థత పట్ల మన విధాన నిర్ణేతలు ఎందుకు దృష్టి సారించరో, అలాంటి ప్రయత్నానికి కూడా వారెందుకు పూనుకోరో నాకు అర్థం కానే కాదు. చాలా సార్లు నాకు అనిపిస్తుంటుంది.. ఆహార ధాన్యాల దుబారాని తగ్గించడం అనేది రైతు చేపట్టాల్సిన లక్ష్యమనీ, అదే సమయంలో విలువైన ఆహార ధాన్యాల సేకరణను పూర్తిగా దుబారా చేయడం అనేది ప్రభుత్వానికి చెందిన చెక్కుచెదరని హక్కు అనీ నాకు చాలాసార్లు అనిపించేది. నిల్వచేసిన ఆహార ధాన్యాల నాణ్యత విషయంలో ప్రభుత్వం చూపుతున్న నిర్దయ కానీ, కఠిన వైఖరి కానీ ఏ స్థాయికి దిగజారిపోయాయంటే నాణ్యత లేని నిల్వ కారణంగా ఆహారధాన్యాలు మానవ వినియోగానికి ఏమాత్రం పనికిరాకుండా పోతుంటాయి. ఇది జాతి మొత్తం సిగ్గుపడాల్సిన విషయం. ఏది ఏమైనా.. ఆహార ధాన్యాల నిల్వను, ధాన్య భాండాగారాలను నిర్మించడానికి మనకు రాకెట్ సైన్స్ ఏదీ అవసరం లేదు. ప్రతి సందర్భంలోనూ ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు డబ్బు మదుపు చేస్తోందని నేను వింటూంటాను. కానీ వాస్తవాచరణలో ప్రభుత్వం తన వద్ద ఉన్న డబ్బు మొత్తాన్ని సూపర్ హైవేలను నిర్మించే పనిలోనే గుమ్మరిస్తూ ఉండటం చాలా పరిపాటిగా జరుగుతోంది. జాతీయ రహదారుల యంత్రాంగాన్ని విస్తరించడానికి నేను ఏమాత్రం వ్యతిరేకిని కాదు. కానీ ప్రభుత్వ రంగ మదుపులకోసం ఆరాటపడుతున్న అనేక ఇతర రంగాలు ఉన్నాయి. 2017లో మన ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఒక ప్రకటన చేస్తూ 2022 సంవత్సరం నాటికి దేశంలో 83,677 కిలోమీటర్ల మేరకు రహదారులను నిర్మించడానికి రూ. 6.92 లక్షల కోట్ల ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ అందించనున్నట్లు తెలిపారు. యుద్ధప్రాతిపదికన ధాన్య నిల్వ కేంద్రాల నిర్మాణం అయితే కేంద్ర ఆర్థిక మంత్రి జాతీయ రహదారుల విస్తరణకోసం కేటాయించిన ఈ రూ. 6.92 లక్షల కోట్ల మదుపులో కేవలం లక్ష కోట్ల రూపాయలను ఆహార ధాన్యాల నిల్వ కేంద్రాలను నిర్మించడంలో ఉపయోగించినట్లయితే, సరైన ధాన్య నిల్వల సౌకర్యాల లేమి కారణంగా సంభవిస్తున్న తీవ్రాతితీవ్రమైన ఆహార ధాన్యాల దుబారాకు సంబంధించి దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న సమస్యకు సులభ పరిష్కారం లభిస్తుంది. గతంలో మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 2.5 లక్షల పంచాయితీలో పంచాయితీ గృహాలను నిర్మించింది. ఆ సమయంలో కూడా దేశవ్యాప్తంగా ఆహార ధాన్యాల నిల్వ కేంద్రాలను నిర్మించడానికి తగిన మదుపును కేటాయించాలని నేను చెబుతూ వచ్చాను. అంతకు మించి, గోడవున్లలో ముగ్గిపోతున్న ఆహార ధాన్యాలు, మండీల్లో నీటీ మడుగుల్లో పడి ఉంటున్న ఆహార ధాన్య బస్తాలుకు సంబంధించి టీవీలలో కనిపించే చిత్రాలు మన అసమర్థతకు గానూ క్షమించలేని దృశ్యాలుగా ఉంటాయి. పైగా, ప్రపంచ క్షుద్బాధా సూచికను పరిశీలిస్తే మొత్తం 119 దేశాల్లో భారతదేశం 103వ స్థానంలో నిలబడి అధోగతిలో ఉంటోంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ప్రపంచంలో ఆకలిగొన్న జనాభాలో పాతిక వంతు భారతదేశంలోనే జీవిస్తున్నారు. సమృద్ధిగా ఆహార పంటల దిగుబడి జరుగుతున్నప్పటికీ వాటిని నిల్వ చేసి ఉంచే సరైన వసతులు లేని దేశంలో పరిస్థితిని ఇంతకుమంచి ఉన్నతంగా ఎలా ఆలోచించగలం? ఆహార ధాన్యాల దుబారాకు సంబంధించిన ఈ భారీ సమస్య ఎందుకు మన దేశంలో రాజకీయ ప్రాధాన్యతల్లో ఒకటిగా కాకుండా పోయిందనే విషయం నాకు ఇప్పటికీ అర్ధం కాదు. మనం వెతికి చూడాల్సిన శాశ్వత పరిష్కారం ఇది మాత్రమే. దేవిందర్ శర్మ వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు -
వారి కళ్లకు కరువు కనిపించదు
విశ్లేషణ తరచుగా నేను బెంగళూరు వెళుతూ ఉంటాను. సంవత్సరానికి కనీసం నాలుగు సార్లయినా వెళతాను. ఇన్ని పర్యాయాలు ఆ నగరానికి వెళ్లినా, కర్ణాటక తీవ్ర దుర్భిక్షంతో నకనకలాడుతున్న సంగతి ఏనాడూ నా అనుభవానికి రాలేదు. మహా నగర జీవితమంటేనే అంత కాబోలు. అక్కడికి ముప్పయ్ కిలోమీటర్ల దూరంలోనే కరువు తాండవిస్తున్న సంగతి సంకేతప్రాయంగా కూడా అవగతం కాదు. 176 తాలూకాలలో 139 కంటే ఎక్కువ తాలూకాలను కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటించారని నాకు చెప్పారు. ఇంకా విషాదం ఏమిటంటే, గడచిన పదహారు సంవత్సరాలలో పదకొండేళ్లుగా కర్ణాటక రాష్ట్రం కరువుతో అలమటిస్తున్నది. ‘అనంత’ కరువు ఆంధ్రప్రదేశ్లోనిదే అయినా బెంగళూరుకు కూతవేటు అవతలే ఉంది అనంతపురం జిల్లా. ‘న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్’(ఏప్రిల్ 28)లో వెలువడిన ఒక వార్తా కథనం నా కళ్లల్లో నీళ్లు రప్పించింది. ‘మా నాన్న వచ్చాడా?’– ఇది అప్పుడే స్కూలు నుంచి వచ్చిన 12 సంవత్సరాల దివాకర్ వేసిన ప్రశ్న. ఇందుకు పినతండ్రి ఈశ్వరయ్య, ‘రాలేదు, వచ్చే నెలలో వస్తాడు. వచ్చేటప్పుడు నీకు బెంగళూరు నుంచి బోలెడు బొమ్మలు తెస్తాడు’ అని జవాబిచ్చాడు. అంతే, చేతిలోని పుస్తకాల సంచీ చిరాకుగా విసిరేసి, యూనిఫారమ్ మార్చుకుని, తన సైకిల్ వేసుకుని తాళాలు బిగించి ఉన్న ఇళ్ల మధ్య నుంచి సాగుతున్న వీధిలోకి వెళ్లిపోయాడు. జిల్లా కేంద్రం అనంతపురం గురించీ, ఆ జిల్లాలోని పల్లెలు ఎలా వెలవెలపోతున్న తీరు గురించి వివరిస్తూ జర్నలిస్ట్ హరీశ్ గిలాయ్ రాసిన కథనం మరొకటి. అది గ్రామీణ భారతపు విషాదాన్ని వెల్లడించే కథనం. అయితే దీనిని ఎవరూ చదవరు. ఆ జిల్లాలోని నల్లమాడ మండలం, కూటపల్లి గ్రామం స్మశానాన్ని మరపిస్తున్నదని ఆయన పేర్కొన్నారు. సగానికి పైగా ఇళ్లకు తాళాలు కనిపిస్తాయి. అక్కడ అటూ ఇటూ తిరుగుతున్న పెద్దలు కనిపిస్తారు. లేదంటే వీధుల్లో ఆడుకుంటున్న పిల్లలు కనిపిస్తారు. నిజనిర్ధారణ సంఘం తరఫున వెళ్లిన అదితి మాలిక్, గీతికా మంత్రిల నివేదిక (ది న్యూస్ మినిట్, మే 9) మన గుండెలను కదిపి కుదిపే వాస్తవాలను వెల్లడిస్తుంది. కొంతమంది తమ పిల్లలను కూడా అక్కడే వదిలిపెట్టి, కూలీనాలీ వెతుక్కుంటూ ఎలా వలసపోయారో ఆ నివేదిక చెప్పింది. భూక్యా శ్యాములమ్మ వయసు పన్నెండేళ్లు. అనంతపురం జిల్లా కరెడ్డిపల్లి గ్రామంలోనే ఉండి తన తమ్ముడినీ, చెల్లెలినీ పోషిస్తోంది. బక్కపలచగా ఉండే శ్యాములమ్మ పక్క ఊళ్లో ఉన్న చౌకధరల దుకాణం నుంచి పాతిక కిలోల బియ్యం మోసుకువస్తుంది. ఆమె తండ్రి తాగుడుకు బానిసై గత ఏడాదే చనిపోయాడు. అందుకే ఆ కుటుంబానికి ఆమే దిక్కయింది. ఇది బాలీవుడ్ సినిమాలో దృశ్యంలా కనిపించవచ్చు. కానీ అదొక వాస్తవిక చిత్రమన్న సంగతిని మనం మరిచిపోరాదు. ఆ గ్రామానికే చెందిన రమాదేవి కథ కూడా అంతే. తల్లిదండ్రులు ఇద్దరూ పని వెతుక్కుంటూ కేరళ వెళ్లారు. ‘కొన్నిసార్లు నా రక్షణ గురించి నాకు భయమేస్తూ ఉంటుంది’అని చెప్పింది రమాదేవి. ఇంట్లో ఆడపిల్ల ఒక్కర్తిని విడిచిపెట్టి తల్లిదండ్రులు పనుల కోసం వెళ్లిపోయారంటే ఆ కరువు ఎంత భయంకరమైన స్థాయిలో ఉంటుంది? అన్న ప్రశ్న నన్ను వెంటాడుతూనే ఉంటుంది. కానీ వాళ్లకు మరో మార్గం లేదు. తల్లిదండ్రులు ఎవరైనా కూడా తమ బిడ్డలను వదిలిపెట్టి దూరంగా ఉండాలని అనుకోరు. ఇదికూడా హాలీ వుడ్ సినిమా హోమ్ ఎలోన్లోని దృశ్యం కాదు. ఇలా వందలమంది చిన్నారులను వదిలిపెట్టి ఎందరో పనులు వెతుక్కుంటూ వలస వెళ్లారు. వరసగా ఆరో సంవత్సరం కూడా అనంతపురం జిల్లా కరువు బారిన పడింది. దైవభూమి దృశ్యం దైవభూమిగా ఇంకెంత మాత్రం చెప్పడానికి వీలుకాని కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో నివశించే కుటుంబాలు వారానికి 10 నుంచి 15 బకెట్ల నీటితో జీవనం సాగిస్తున్నాయి. ఇండియన్ ఎక్స్ప్రెస్ (మే 8)లో వార్తా కథనం రాసిన షుజా ఫిలిప్ అట్టప్పాడి గురించి కళ్లకు కట్టారు. అక్కడ నిరుడే కాదు, ఈ సంవత్సరం కూడా కరువు తాండవిస్తోంది. నిజానికి కేరళ గడచిన 115 సంవత్సరాలలో ఏనాడూ చూడనంత కరువును ఇప్పుడు చూస్తోంది. 2016 అక్టోబర్లోనే ఆ రాష్ట్రంలోని మొత్తం 14 జిల్లాలను కరువు జిల్లాలుగా ప్రకటించారు. కానీ, ఆ రాష్ట్రంలోని నగరాలు తిరువనంతపురం గానీ, కోచి గానీ, లేదంటే కోజికోడ్ వెళితే ఇంత దారుణమైన కరువు కాటకాలు తాండవిస్తున్నాయన్న సంగతి మచ్చుకైనా తెలియదు. ఇక తమిళనాడులోని కరువు ప్రాంతాలలో ఐదురోజులు పర్యటించిన తరువాత స్వరాజ్ అభియాన్ ప్రముఖుడు యోగేంద్ర యాదవ్ తీవ్ర స్థాయిలో క్షోభను వ్యక్తం చేశారు. ‘‘కేంద్ర ప్రభుత్వం చూపుతున్న దారుణమైన నిర్లక్ష్యం అక్కడి యంత్రాంగాన్ని పూర్తిగా స్తంభించిపోయేటట్టు చేసింది. దీనితో రాష్ట్రంలో బలవన్మరణాలు పెరి గాయి’’ అని ఆయన రాశారు. అలాగే, ‘‘పశువుల మరణాలు రాష్ట్రంలో కరువు పరిస్థితికి సూచనలు’’అని కూడా యాదవ్ రాశారు. న్యూఢిల్లీలోని జంతర్మంతర్ దగ్గర కొద్ది రోజుల క్రితం వరకు కొందరు తమిళనాడు రైతులు చేసిన దీక్షకు మీడియాలో పెద్ద చోటే దక్కింది. రూ. 40,000 కోట్ల మేరకు ఉన్న రుణాలను మాఫీ చేయాలన్న డిమాండ్తో వారు నిరసన కార్యక్రమం చేపట్టారు. కానీ ఇది జాతిని కదిలించలేకపోయింది. ‘‘ఇది మునుపెన్నడూ లేని పరిస్థితి’’అని వ్యవసాయ వాతావరణ పరిశోధన విశ్వవిద్యాలయం ఆచార్యుడు ఎస్. పన్నీర్సెల్వం ‘ఇండియా స్పెండ్’తో చెప్పారు. తమిళనాడులోని 32 జిల్లాలకు గాను 21 జిల్లాలు కరువు కోరలలో చిక్కుకున్నాయని ఆయన వెల్లడించారు. గడచిన 140 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ చూడనంత కరువును ప్రస్తుతం ఆ రాష్ట్రం అనుభవిస్తోంది. కానీ ఈ రాష్ట్రంలో కూడా అంతే. చెన్నై లేదా కోయంబత్తూరు, మరేదైనా ఇతర నగరానికి వెళ్లండి! అసలు ఆ నగరాలకి కొద్దిదూరంలోనే కరువు కరాళ నృత్యం చేస్తున్న ప్రాంతాలు ఉన్న సంగతి కాస్త కూడా తెలియదు. నగరాలకు సమస్యలెందుకు రావు? మరొక అంశం కూడా నాకు వింతగా అనిపిస్తుంది. ఈ కరువుకాటకాలెప్పుడూ పల్లెప్రజలనే ఎందుకు ప్రధానంగా పట్టి పీడిస్తాయి? ఎంతో అరుదుగా తప్ప నగరాల జోలికీ, పట్టణాల జోలికీ ఆ దుర్భిక్షం ఎందుకు తాకదు? ఇందుకు నేను దేవుణ్ణి నిందించను. ఆయన అంత పక్షపాతంగా అయితే ఉండడు. ఎలాంటి తప్పు లేకున్నా పల్లెల్లో నివశిస్తున్న ప్రజలను దేవుడు శిక్షించడని నేను చెబుతాను. కానీ గ్రామీణ ప్రాంత ప్రజలే కరువు కాటకాలకు ఎందుకు లక్ష్యంగా మారుతున్నారు? గుజరాత్లోని కచ్ ప్రాంతంలోని లాతూర్ ఇందుకు మినహాయింపు అనుకోవచ్చు. కానీ చెన్నై సంగతి అలా కాదు. అక్కడ ఏర్పడిన నీటి కరువును తట్టుకోవడానికి ఆ నగరం నీళ్లను మోసుకొచ్చే రైళ్ల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అయితే కరువు నీటి సమస్యను మాత్రమే తీసుకుని రాదు. దానితో ఇంకా అనేక సమస్యలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. అయితే అవేవీ నగరాల అనుభవంలోకి రావు కూడా. ఇదంతా ఏమిటంటే, అభివృద్ధి క్రమం చోటు చేసుకున్న అసమతౌల్యత ఫలితమే. అసలు అభివృద్ధి విధానమే నగరాలు, పట్టణాలు కరువు పరిణామాల బారిన పడని రీతిలో జరుగుతుందని నాకు అనిపిస్తుంది. గ్రామాలు, పట్టణాల మధ్య విభజన సుస్పష్టం. దుర్భిక్షం ద్వారా తలెత్తే పరిణామాల బారిన పడకుండానే నగరవాసులకు పూచీ పడినట్టు ఉంటుంది. గ్రామాల గుండా ప్రవహించే కాలవలు, నదులు ఎండిపోతుంటాయి. కానీ నగరాలలో కుళాయి నీరు మాత్రం ఎలాంటి దుర్భర పరిస్థితులలో కూడా రోజులో ఉదయం కొన్ని గంటలు, సాయంత్రం కొన్ని గంటల పాటైనా ధారగా ప్రవహిస్తూనే ఉంటుంది. న్యూఢిల్లీ తనకు అవసరమైన నీటిని హిమాచల్ ప్రదేశ్లోని రేణుకా డ్యాం నుంచి తెచ్చుకుంటుంది. అలాగే ముంబై నగరం సమీపంలోని పశ్చిమ కనుమల నుంచి తెచ్చుకుంటుంది. కానీ గ్రామీణ ప్రాంతాలు సమస్యలతో ఎంత సతమతమవుతున్నా ఈ నగరాలు ఏమీ పట్టనట్టే ఉండిపోతున్నాయి. పట్టణవాసులు, నగరవాసులు తమదైన ప్రపంచంలో తేలియాడుతూ ఉంటారు. తాము నివశిస్తున్న పట్టణానికీ లేదా నగరానికీ S కొద్దిదూరంలోనే ఉన్న కష్టాలను వారు గమనించరు. మన నాగరిక ప్రపంచం మనలని అలాంటి ధోరణికి తీసుకువెళ్లింది. సెల్ఫీల ప్రపంచంలో స్వార్థం తారస్థాయికి చేరుకుంది. వ్యాసకర్త: దేవిందర్శర్మ వ్యవసాయ నిపుణులు ఈ మెయిల్ : hunger55@gmail.com
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు ఎస్వీ డిగ్రీ కళాశాలకు ముగ్గురు కమిటీ సభ్యులరాక
No Headline
ఎన్నికల భారతం పుస్తకావిష్కరణ
వృత్తిదారుల మోములో ఆనందం...
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
హైదరాబాద్లో ఈదురుగాలులతో కూడిన భారీవర్షం (ఫొటోలు)
"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి
‘మోసం చేసిన వారిపై చర్య తీసుకోవాలి’
తప్పక చదవండి
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓటేస్తే ఎవరు ప్రధాని అవుతారో తెలియదు
- ప్రమాదంలో ముస్లిం సమాజం
- నేడు వేములవాడకు మోదీ!
- Telangana: మరో రెండు రోజులు వానలు
Advertisement