దేశ రాజధానిలో కీచక పర్వం
ఏడాదిలో ‘40 శాతం’ మహిళలపై లైంగిక వేధింపులు
‘ఇంటర్నేషనల్ క్రిమినల్ జస్టిస్’ అధ్యయనంలో వెల్లడి
బహిరంగ ప్రదేశాల్లోనే అధిక వేధింపులు
ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలకు కరువైన భద్రత
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్ని చట్టాలు వచ్చినా, మహిళల రక్షణ కోసం ఎన్ని చర్యలు చేపట్టినా దేశ రాజధాని ఢిల్లీలో స్త్రీలపై లైంగిక వేధింపులు మాత్రం తగ్గడంలేదు. నగరంలోని బస్సులు, పార్కుల వంటి బహిరంగ ప్రదేశాల్లోనే గత సంవత్సర కాలంలో ‘40 శాతం మంది’ మహిళలు లైంగిక వేధింపులకు గురయ్యారని ఓ అధ్యయనం ప్రకటించింది. ఈ వేధింపులు పట్టపగలే ఎక్కువ చోటుచేసుకుంటున్నాయని వెల్లడించింది. ‘ఇంటర్నేషనల్ క్రిమినల్ జస్టిస్ రివ్యూ’ అనే ఆన్లైన్ పోర్టల్లో ఈ అధ్యయనం నివేదికను పొందుపరిచింది.
మూడేళ్ల కిందట దేశ రాజధాని నగరంలో జరిగిన నిర్భయ ఉదంతం అనంతరం మహిళా భద్రత కోసం కఠిన చట్టాలను రూపొందించినప్పటికీ పరిస్థితుల్లో మాత్రం మార్పు రాలేదని అధ్యయనం స్పష్టం చేసింది. రాజధాని నగరంలోని మహిళల్లో అభద్రతా భావం ఇంకా తగ్గలేదని వెల్లడించింది. అధ్యయనంలో పాల్గొన్న మహిళల్లో 40 శాతం మంది గత ఏడాది కాలంలో లైంగిక వేధింపులకు గురైనట్లు తెలిపారు. బస్సులు, పార్కుల వంటి బహిరంగ ప్రదేశాల్లోనే తాము ఈ వేధింపులకు గురయ్యామని, పట్టపగలే వేధింపులు ఎక్కువగా ఉన్నాయని వారు స్పష్టం చేశారు.
బయటకు వెళ్లడం మానేసిన 33 శాతం మంది
‘అధ్యయనంలో 1,400 మంది మహిళలు పాల్గొన్నారు. వారిలో 33 శాతం మంది అత్యాచారం, వేధింపుల భయంతో నలుగురిలోకి వెళ్లడమే మానేశారు. 17 శాతం మంది తమ ఉద్యోగాలు వదిలేశారు.’ అని నివేదిక పేర్కొంది. ఢిల్లీలో నిర్భయకాండ తర్వాత కూడా మహిళల్లో సురక్షిత భావన కలగలేదని అధ్యయన పరిశోధకుల్లో ఒకరు, అమెరికాలోని మిషిగన్స్టేట్ యూనివర్సిటీలో క్రిమినల్ ప్రొఫెసర్ మహేష్ నల్ల వెల్లడించారు.
ప్రపంచమంతటా మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతున్నప్పటికీ భారత్తో పాటు ఇతర దక్షిణాసియా దేశాల్లో ఈ సమస్య అధికంగా ఉందని పరిశోధకులు వెల్లడించారు. ఆయా ప్రజాస్వామ్య దేశాల్లో ఇళ్ల నుంచి బయటకు వచ్చి పనిచేసే మహిళల సంఖ్య పెరుగుతుండటంతో లైంగిక వేధింపులకు గురయ్యే వారి సంఖ్య పెరుగుతోందని వారు అభిప్రాయపడ్డారు. రవాణా వ్యవస్థ సరిగా లేకపోవడం, రవాణా సాధనాలు రద్దీతో కిటకిటలాడుతుండటం, పట్టణ ప్రాంతాలకు భారీగా వలసలు పెరుగుతుండటం వంటి కారణాల వల్ల భారత్ వంటి పురుషాధిక్య సమాజాల్లో మహిళలకు భద్రత కరువౌతోందని పరిశోధకులు స్పష్టం చేశారు.