breaking news
Constitutional unitary parliamentary republic
-
హంగేరీ
ప్రపంచ వీక్షణం నైసర్గిక స్వరూపం ఖండం: యూరప్ వైశాల్యం: 93,030 చదరపు కిలోమీటర్లు జనాభా: 98,77,365 (తాజా అంచనాల ప్రకారం) రాజధాని: బుడాపెస్ట్ ప్రభుత్వం: యూనిటరీ పార్లమెంటరీ కాన్స్టిట్యూషనల్ రిపబ్లిక్ కరెన్సీ: ఫోరింట్ భాష: మాగ్యార్ (హంగేరియన్) మతం: క్రైస్తవులు వాతావరణం: జనవరిలో-4 నుండి 1 డి గ్రీ వరకు, జులైలో 16 నుండి 28 డిగ్రీల వరకు. పంటలు: తృణధాన్యాలు, బంగాళదుంపలు, చెరుకు, కూరగాయలు, పళ్లు, ద్రాక్ష. పరిశ్రమలు: ఇనుము, ఉక్కు పరిశ్రమలు, దుస్తులు, రసాయనాలు, యంత్ర పరికరాలు, రవాణా పరికరాలు, కలప ఉత్పత్తులు, గనులు. ఎగుమతులు: ఆహార ఉత్పత్తులు, యంత్ర పరికరాలు, రసాయనాలు, మోటారు వాహనాలు, దుస్తులు, ఇనుము, ఉక్కు. స్వాతంత్య్రం: అక్టోబర్ 23, 1989. సరిహద్దులు: చెకొస్లోవేకియా, రష్యా, రొమేనియా, యుగొస్లావియా, ఆస్ట్రియా. చరిత్ర వెయ్యి సంవత్సరాల కిందటే ఈ దేశపు పునాదులు ఏర్పడ్డాయని చర్రిత చె బుతోంది. క్రీస్తుశకం 896 లో మాగ్యార్లు అనే రష్యా దేశపు స్టెప్పీలు డాన్యూబ్ నది తీరం గుండా వచ్చి ఈ ప్రాంతంలో స్థిరపడ్డారు. వీరు నిజానికి దేశ దిమ్మరులు. గుర్రాలను పెంచుకోవడం వీరికి వృత్తి. వీళ్లకు నాయకుడు అర్పాడ్, ఇతను ప్రస్తుత హంగేరీ దేశపు పశ్చిమ భాగాన్ని ఆక్రమించి పరిపాలించాడు. మొట్టమొదటి హంగేరియన్ సామ్రాజ్యం మాగ్వార్ రాజు స్టీఫెన్ నాయకత్వంలో క్రీస్తుశకం 1000 శతాబ్దంలో ఏర్పడింది. ఈ సామ్రాజ్యం క్రమంగా విస్తరించింది. అయితే మధ్య మధ్యన తుర్కులు దాడులు చేస్తూ ఉండేవారు. చివరికి వీరు హంగేరీ మధ్య భూభాగాన్ని ఆక్రమించుకొని 150 సంవత్సరాలు పరిపాలన చేశారు. వీరు 16, 17 శతాబ్దాలలో తమ సామ్రాజ్యాన్ని విస్తరించారు. ఆస్ట్రియాను పరిపాలిస్తున్న హప్స్బర్గ్ పాలకులు ఈ తుర్కుల మీద క్రమంగా దాడులు చేసి క్రీస్తు శకం 1699లో హంగేరీ దేశాన్ని పూర్తిగా ఆక్రమించారు. 1848 లో ఆస్ట్రియా స్వాతంత్య్ర పోరాటాన్ని వీరు రష్యా సహకారంతో అణచి వేశారు. అయితే మాగ్యార్లు తను అస్తిత్వాన్ని చాటుకోవడానికి హప్స్బర్గ్ పాలకుల మీద తిరుగుబాటు ఫలితంగా 1867లో ద్వంద్వ పాలన చేయాలని నిర్ణయం జరిగింది. దాని ఫలితంగా ఆస్ట్రో హంగేరీ రాజ్యపాలనలో మాగ్యార్లతో పాటు చెకొస్లోవేకియన్లు, స్లోవేనియన్లు, సెర్బ్లు కూడా భాగస్వాములు అయ్యారు. మొదటి ప్రపంచయుద్ధం తరువాత హాప్స్బర్స్ రాజ్యం కూలిపోయింది. ఫలితంగా హంగే రీ తన భూభాగాన్ని ఒక వంతు చెకోస్లోవేకియాకు, రుమేనియాకు, యుగొస్లోవియాకు కోల్పోయింది. 1930 దశకంలో హంగేరీ, జర్మన్ ఆధిపత్యంలో పని చేసింది. రెండో ప్రపంచ యుద్ధంలో హంగేరీ జర్మనీతో కలిసి రష్యాపై యుద్ధం చేసింది. అయితే రెండో ప్రపంచయుద్ధం పూర్తయ్యాక చిత్రంగా హంగేరీ రష్యాకు అనుకూలంగా మారిపోయింది. ప్రజలు - సంస్క ృతి హంగేరీ ప్రజలు తమ పూర్వపు మాగ్యావర్ సంస్కృతిని, ఆ భాషను, అప్పటి ఆహార రీతులను, పురాతన జాపపద సంగీతాన్ని ఎంతో ఇష్టపడతారు. హంగేరియన్లు భోజనాన్ని చాలా సుష్టుగా తింటారు. బాగా తాగుతారు కూడా! పాప్రికా అనే ఆహారాన్ని బాగా తింటారు. టోకాజ్, బుల్స్బ్లడ్ అనే పేరు గల వైన్ ఇక్కడ ఉత్పత్తి అవుతుంది. ప్రజలు కూడా వీటికి అధికంగా ఉపయోగిస్తారు. భార్యాభర్తలిద్దరూ పనికి వెళ్లడం ఇక్కడ రివాజు. జాతీయ, ప్రాంతీయ ఉత్సవాలలో జానపద గీతాలు, నృత్యాలు ఇక్కడ సర్వసాధారణం. నగరాలలో మహిళలు జీన్స్, సూట్స్ ధరిస్తారు. ఎంబ్రాయిడరీ చేసిన, లేసులతో అల్లిన టోపీ మహిళలు సాధారణంగా ధరిస్తారు. ఉర్గోస్, కరికాజో, సర్దాస్ అనే పేర్లు గల నృత్యాలు బాగా ప్రాచూర్యంలో ఉన్నాయి.ఇక హంగేరీయన్లు తమ శరీరాలను మర్దన చేసుకోవడానికి ఎక్కువ ఇష్టపడతారు. మర్దన కోసం ‘స్పా’లు ప్రతిచోటా అందుబాటులో ఉంటాయి. దేశ పరిపాలనా రీతులు - ప్రత్యేకతలు హంగేరీ దేశం పరిపాలనా సౌలభ్యం కోసం 19 కౌంటీలుగా విభజింపబడింది. ఈ 19 కౌంటీలు తిరిగి 198 రైడింగ్లుగా విభజింపబడ్డాయి. దేశం మొత్తంలో 20 నగరాలు అతి పెద్దవిగా చలామణి అవుతున్నాయి. వీటిలో బుడాపెస్ట్, డెబ్రెసెన్, మిస్కోల్క్, జెగెడ్, పెక్స్, గ్యోర్, నిరె గీజా, మొదలైనవి పెద్ద జనాభాలో ఉన్నాయి. దేశంలో రొమేనియన్లు, జర్మన్లు, స్లోవాక్లు, రొమేనియన్ల జనాభా కూడా బాగా ఉంది. 1. {పపంచం మొత్తంలో కుర్రకారుకు ఇష్టమైన రూబిక్ క్యూబ్ను కనిపెట్టిన వ్యక్తి ఈ దేశానికి చెందినవాడే. అతడి పేరు ఎర్నో రూబిక్, 1974లో అతడు క్యూబ్ను కనిపెట్టాడు. అదే రూబిక్ క్యూబ్. 2. ‘విటమిన్ సి’ ని కనిపెట్టిన అల్బర్ జెంట్ ఈ దేశానికి చెందిన వాడు. అతడి కి 1937లో నోబెల్ బహుమతి లభించింది. 3. ప్లాస్మో టీవిని 1936లో ఈ దేశానికి చెందిన శాస్త్రవేత్త కల్మన్ తిహాన్యీ దానిని కనిపెట్టాడు. 4. మనం విరివిగా ఉపయోగిస్తున్న బాల్ పాయింట్ పెన్నును లాస్జ్లో బైరో అనే శాస్త్రవేత్త కనిపెట్టాడు. అతడు ఈ దేశస్థుడే. 5. ప్రపంచ ప్రసిద్ధి చెందిన హ్రైడోజన్ బాంబును ఈ దేశస్థుడైన ఎడ్వర్డ్ టెల్లర్ కనిపెట్టాడు. చూడదగిన ప్రదేశాలు బాలాటన్ సరస్సు బాలాటన్ సరస్సు - ఆ సరస్సులో ఉన్న ద్వీపగ్రామం. గ్రామంలో ఉన్న 17వ శతాబ్దపు బెనెడిక్ట్ ఆబే చూడద గ్గవి. దాదాపు 598 చదరపు కిలోమీటర్లు వెడల్పు ఉన్న సరస్సు నీలి ఆకాశపు రంగును కలిగి ఉండి సందర్శకులను మంత్రముగ్థులను చేస్తుంది. దేశం మొత్తంలో ఒక అద్భుతమైన టూరిస్టు ప్రదేశం ఇది. ఇక్కడ ఒక ఓడరేవు కూడా ఉండడం ఒక విశేషం. ఈ సరస్సునే హంగేరీయన్ సముద్రం అని ముద్దుగా పిలుస్తుంటారు. ఈ సరస్సు చుట్టూ 130 బీచ్లు ఉన్నాయి. సరస్సు రెండువైపులా అనేక చిన్న చిన్న గ్రామాలు, రిసార్టులు నిండి ఉన్నాయి. ఇక్కడ సంవత్సరం పొడవునా యాత్రికులు సందడి చేస్తుంటారు. చిన్న చిన్న గుహలు, ఎకో హిల్, సక్స్ హిల్, అబే, ఇంకా సరస్సు చుట్టూ దాదాపు 30 చిన్న గ్రామాలు నెలకొని ఉన్నాయి. బుడాపెస్ట్ హంగేరీ దేశాన్ని దర్శించడానికి ప్రపంచ వ్యాప్తంగా సందర్శకులు వస్తూ ఉంటారు. సందర్శకుల రాకడలో ఈ దేశం ప్రపంచంలో పదమూడవ స్థానంలో ఉంది. దేశ రాజధాని బుడాపెస్ట్ సంవత్సరం పొడవునా సందర్శకులతో కళకళలాడుతూ ఉంటుంది. ఇక్కడ చారిత్రక ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. వియన్నా గేట్ స్క్వేర్లు ఉన్న వరుస గృహాలు, సండోర్ రాజభవనం ఇప్పుడిది అధ్యక్ష భవనంగా మారింది. వర్కర్ట్ కాసినో, 17వ శతాబ్దంలో నిర్మించిన పెటెర్ఫీ ప్యాలెస్, గ్రేషుమ్ ప్యాలెస్, హంగేరియన్ అకాడమీ ఆఫ్ సెన్సైస్, బుడా క్యాజిల్, స్టేట్ ఓపెరా హవుస్ గోల్డ్ మ్యూజియం, బాహవుస్ విల్లాలు, సిటీ పార్క్, ఇన్నర్ సిటి పరిశ్ చర్చి, కేవ్ చర్చి, లిబర్టీ విగ్రహం, లిబర్టీ బ్రిడ్జి, హీరోస్ స్క్వేర్, గ్రేట్ మార్కెట్ హాల్, మిల్లేనియం పార్లమెంట్ బిల్డింగ్ సెయింట్ స్టీఫెన్ బాసిలికా, గుల్ బాబా టోంబ్, సెయింట్ ఇస్త్వాన్ బాసిలికా, డాన్యూబ్ నది మీద నిర్మించిన వివిధ వంతెనలను తప్పక చూడాల్సిందే. మొత్తం ఏడు బ్రిడ్జిలు, ఏడు విధాలుగా ఉంటాయి. ఎగెర్ ఈ చారిత్రాత్మక నగరం దేశ ఉత్తర ప్రాంతంలో ఉంది. ఈ నగరం మాట్రాబక్ అనే రెండు పర్వతాల మధ్య ఉంది. ఈ నగర ప్రత్యేకతలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా అద్భుత శైలిలో శతాబ్దాల క్రితం నిర్మించిన క్యాజిల్లు, ధర్మల్ బాత్ ప్రదేశాలు, చారిత్రక కట్టడాలు ఉన్నాయి. ముఖ్యంగా టర్కిష్ ప్రజలు తమ ఉనికి తెలుపుకోవడానికి దశాబ్దాల క్రితం నిర్మించిన ఒంటి స్తంభ మినరెట్ నగరానికి ఒక ప్రత్యేక ఆకర్షణ. ఈ స్తంభం 42 మీటర్ల ఎత్తు ఉంటుంది. లోపలి నుండి పైవరకు ఎక్కడానికి 97 మెట్లు ఉంటాయి. నగరంలో సెర్బియన్ల చర్చి రెక్టెంప్లమ్ మరో ప్రత్యేక ఆకర్షణ. ఇక వైన్ మ్యూజియం మద్యం ప్రియులను ఎంతగానో ఆకర్షిస్తుంది. పిర్కర్ ప్రాంతంలో నిర్మించిన బాసిలికా ఒక గొప్ప కట్టడం. నగరంలో ఇళ్లు సాధారణంగా రెండు లేదా మూడు అంతస్తుల్లో ఉంటాయి. ఇంటి పైకప్పులన్నీ దాదాపు ఎరుపు రంగుతో ఉంటాయి. దూరం నుండి చూస్తే ఎరుపుదనం పరుచుకున్నట్లు కనబడుతుంది. మొహాక్స్ ఈ నగరం డాన్యూబ్ నది ఒడ్డున ఉంది. ఈ నగరంలో పదిహేను, పదహారు శతాబ్దాలలో రెండు యుద్ధాలు జరిగాయి. మొదటిది క్రీ.శ.1526లో జరిగింది. ఈ యుద్ధంలో ఒట్టోమాన్ రాజులు గెలిచి ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. రెండవది క్రీ.వ. 1687 లో జరిగింది. ఈ యుద్ధంలో ఒట్టోమాన్ రాజులు ఓడిపోయి కనుమరుగైపోయారు. ఓట్టోమాన్ రాజులు ఈ ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేశారు. ఆనాటి ఆనవాళ్లు నేటికీ మనకు కనిపిస్తాయి. ఈ నగరంలో ఆనాడు యుద్ధాలలో మరణించిన 1700 మంది సైనికులకు గుర్తుగా మొహాక్స్ టార్టెనెల్మి ఎమ్లెంఖేమి అనే నిర్మాణం నేటికి నిలిచి ఉంది. ఈ నగరం ప్రతి వసంత మాసంలో బుసోజరాస్ కార్నివాల్ పండగ జరుగుతుంది. నగరం మధ్యలో టౌన్హాల్ భవనం, దాని నిర్మాణం ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తాయి. మెమోరియల్ పార్క్, డాన్యూబ్ నది పరవ ళ్లు అందరినీ ఆకట్టుకుంటాయి. ఈ నగరం నుండి ముగ్గురు వ్యక్తులు ప్రపంచానికి చాటి చెప్పారు. వారితో ఫెరెంక్ ఫాఫ్ గొప్ప ఆర్కిటెక్ట్, ఎండ్రేరోజ్దా ప్రపంచ ప్రసిద్ధ పెయింటర్, నోర్బర్ట్ మిచెలిస్ ఒక గొప్ప రేసింగ్ డ్రైవర్. -
జోర్డాన్
నైసర్గిక స్వరూపం ఖండం: ఆసియా, వైశాల్యం: 89,342 చదరపు కిలోమీటర్లు, జనాభా: 66,55,000 (తాజా అంచనాల ప్రకారం), రాజధాని: అమ్మాన్, ప్రభుత్వం: యూనిటరీ పార్లమెంటరీ కాన్స్టిట్యూషనల్ రిపబ్లిక్, కరెన్సీ: దీనార్, భాషలు: అరబ్బీ, ఇంగ్లిష్, మతం: 98 శాతం ముస్లిములు, ఒక శాతం క్రైస్తవులు, ఒక శాతం అమెరికన్స్, వాతావరణం: జనవరి ప్రాంతంలో 4 నుండి 12 డిగ్రీలు, ఆగస్ట్ ప్రాంతంలో 18 నుండి 32 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది, సరిహద్దులు: సిరియా, లెబనాన్, ఇజ్రాయెల్, ఈజిప్టు, సౌదీ అరేబియా, ఇరాక్, స్వాతంత్య్ర దినోత్సవం: 1946, మే 25. పరిపాలనా పద్ధతి- ప్రజలు జోర్డాన్ దేశాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం 12 భాగాలుగా విభజించారు. ఈ భాగాలను గవర్నరేట్లు అని అంటారు. అవి ఇర్బిడ్,అజ్లేన్, జెరాంశ్, మఫ్రాక్, బల్కా, అమ్మాన్, జర్కా, మడాబా, కరక్, తఫిలా, మాన్, అఖాబా, స్థానిక జోర్డానియన్లు గ్రామాల్లో ఉంటారు. వారిని బెడోయిన్లు అంటారు. వీళ్లు దేశ తూర్పు భాగంలో అధికంగా ఉంటారు. వీరు దేశమంతటా తిరుగుతూ ఉంటారు. మగవాళ్లు నాలుగు పెళ్లిళ్లు చేసుకోవచ్చు. సాధారణంగా మగవాళ్లే పనిచేస్తారు. ఆడవాళ్ళు ఎక్కువగా ఇంటికే పరిమితమై ఉంటారు. ఇప్పుడు యువతులు కాలేజీ చదువులకు వెళ్లడాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. దేశంలో మత దూషణలు ఉండవు. అన్ని మతాలూ కలసికట్టుగా ఉంటాయి. ముస్లిములు విధిగా రోజుకు అయిదుసార్లు మసీదుల్లో ప్రార్థన చేస్తారు. రంజాన్ మాసంలో పగలు అసలు హోటళ్లే తెరిచి ఉంచరు. చరిత్ర ఈ ప్రాంతాన్ని క్రీస్తుపూర్వం 1300 నుండి టర్కీ దేశపు ఓట్టోమాన్ రాజవంశం పరిపాలిస్తూ వచ్చింది. దేశంలో ఎక్కువ భాగం ఎడారి ప్రాంతం కావడం వల్ల అప్పటి రాజులు ఆ ఎడారిలోని రాతి గుట్టలు, పర్వతాలను చెక్కి భవనాలను నిర్మించారు. ప్రస్తుత పెట్రా ప్రాంతంలో రాతిని తొలచి భవంతులు కట్టిన అప్పటి శిథిలాలు నేటికీ చెక్కుచెదరని రీతిలో కనిపిస్తాయి. భూగర్భంలో విశాలమైన భవన సముదాయాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రదేశాలు విదేశీ పర్యాటకులకు, గత చరిత్ర ఆధారంగా తీసే అంతర్జాతీయ సినిమా షూటింగ్లకు చక్కని ప్రదేశంగా మారిపోయింది. 1923లో జోర్డాన్ దేశం ఏర్పడి, 1946 దాకా ఆంగ్లేయుల సంరక్షణలో ఉండింది. 1946లో పూర్తి స్వాతంత్య్రం పొంది జోర్డాన్ రాజ్యంగా ఆవిర్భవించింది. దాదాపు 30 సంవత్సరాలు దేశాన్ని పరిపాలించిన ‘కింగ్ హుస్సేన్’ ఆధ్వర్యంలో ఈ దేశం ఆధునిక జోర్డాన్గా రూపొందింది. పంటలు- పరిశ్రమలు: జోర్డాన్లో ఎక్కువగా కూరగాయలు పండిస్తారు. ముఖ్యంగా టమోటా, గుమ్మడి, నిమ్మ, అరటిపళ్లు అధికంగా పండిస్తారు. దేశంలో పొటాష్, ఫాస్పేట్ గనులు ప్రముఖమైనవి. వీటిని తవ్వి విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. దేశ ఆదాయంలో 26 శాతం ఆదాయం ఈ ఎగుమతుల ద్వారా లభిస్తుంది. మందుల తయారీ, సిమెంటు, వస్త్రపరిశ్రమ, ఎరువుల తయారీ పరిశ్రమలు ఉన్నాయి. మఫ్రాక్ ప్రాంతంలో ప్రత్యేక పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేశారు. అయితే నీరు, విద్యుచ్ఛక్తి కొరత తీవ్రంగా ఉండడం వల్ల సంపూర్ణ అభివృద్ధి సాధ్యం కావడం లేదు. సంస్కృతి-వస్త్రధారణ: జోర్డాన్ ముస్లిం దేశం. ముఖ్యంగా మహిళల వస్త్రధారణ మిగతా దేశాల్లో ఉన్న ముస్లిముల మాదిరిగానే ఉంటుంది. బిగుతుగా ఉండే దుస్తులు, స్లీవ్లెస్, కురచ దుస్తులు ధరించడం నిషేధం. మహిళలు చీరలు, పంజాబీ డ్రస్సులు తొడిగినా పై నుండి కింది వరకు లిబిస్ లేదా జిల్బాబ్ అనే పేరున్న పొడవాటి పై తొడుగు వేసుకుంటారు. వెంట్రుకలు, తల కనబడకుండా స్కార్ఫ్ ధరిస్తారు. మగవాళ్ళు షర్టు, ప్యాంటు ధరిస్తారు. నమాజు వేళల్లో తలకు టోపీ ధరించడం తప్పనిసరి. తలపాగా చుట్టుకోవడం సాధారణంగా కనిపిస్తుంది. మగవాళ్ళు తలకు ధరించే వస్త్రాన్ని కఫియ్యే అంటారు. ఆహారం: జోర్డానియన్లు తినే భోజనాన్ని మెజ్జె అంటారు. ఆహారంలో బ్రెడ్డు, సలాడ్ తప్పనిసరిగా తీసుకుంటారు. అలాగే పేస్ట్రీలు ఎక్కువగా తింటారు. దేశీయ భోజనాన్ని మస్సాఫ్ అంటారు. ఇది గొర్రెమాంసం, యోగర్ట్తో కూడి ఉంటుంది. కోడిమాంసం బంగాళదుంపలు, టమోటాలు, ఉల్లిపాయలు కలిపి తయారుచేసే పదార్థాన్ని సనియత్ దజాజ్ అంటారు. బియ్యం, కూరగాయలు, మాంసంతో కాసరోత్ తయారు చేస్తారు. దీనిని మక్లుబా అంటారు. మొక్కజొన్న పిండితో కరదీశ్ అనే బ్రెడ్ తయారుచేస్తారు. దేశంలో మద్యపానం నిషేధం కాబట్టి ఇక్కడి ప్రజలు సాధారణంగా పాలు, కాఫీ, నిమ్మరసం, ఆప్రికాట్ రసం వంటి పానీయాలు తీసుకుంటారు. చూడాల్సిన ప్రదేశాలు 1. అమ్మాన్: ఏడు వేల సంవత్సరాల చరిత్ర గల ఈ నగరం ఏడుకొండల మీద నిర్మితమైంది. ఇక్కడ పూర్వం రాజభవనాలు ఉండేవని చరిత్రకారులు చెబుతున్నారు. దీనికి సమీపంలోనే బైజాంటియన్బ్రాసిలికా అనే నిర్మాణం ఉంది. దీనిని 6వ శతాబ్దంలో నిర్మించారని అంచనా. ఆ కాలంలో ప్రజలకు ఇది హెర్క్యులస్ దేవుని మందిరం. ఇప్పుడు దీనిని గ్రేట్ టెంపుల్ ఆఫ్ అమ్మాన్ అంటున్నారు. ఇక్కడికి దగ్గరలోనే జోర్డాన్ పురాతన మ్యూజియం ఉంది. ఇక్కడికి కొద్దిదూరంలో రోమన్ ఆంఫిథియేటర్ (ఆరుబయలు రంగస్థలం) ఉంది. దీనిని ఒకటవ శతాబ్దంలో నిర్మించారు. ఈ నగరంలోనే 1924లో నిర్మించినకింగ్హుస్సేన్ మసీదు ఉంది. అమ్మాన్ నగరానికి సమీపంలో సాల్ట్ అనే పురాతన నగరం ఉంది. ఇక్కడికి సమీపంలో బానిసల భవనాలు, శిథిలమైన రాజ గృహాలు ఉన్నాయి. 2. జోర్డాన్ వ్యాలీ: జోర్డాన్లోయ దేశంలోనే ఎంతో ప్రముఖమైంది. ఇది దేశానికి పశ్చిమభాగంలో ఉంది. గ్రేట్ రిఫ్ట్వ్యాలీలో ఇదొక భాగం. ఈ ప్రదేశంలో ఒక భాగాన్ని ఘోర్ అని అంటారు. ఇక్కడే జోర్డాన్ నది ప్రవహిస్తోంది. ఈ నది సిచేరియస్ సరస్సులో కలుస్తుంది. సముద్ర మట్టానికి 212 మీటర్ల దిగువన ఉండే ఈ సరస్సు మృతసముద్రం (ఈ్ఛ్చఛీ ్ఛ్చ)లో కలుస్తుంది. పదివేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ప్రాంతాన్ని 1967 తర్వాత ఇజ్రాయెల్ ఆక్రమించుకుంది. ఇదే వెస్ట్బ్యాంక్గా రూపాంతరం చెందింది. జీసస్ క్రీస్తు ఈ జోర్డాన్ నదీతీరంలో బెతాని అనే ప్రాంతంలోనే బాప్టిజమ్ తీసుకున్నాడని బైబిల్ చెబుతోంది. ప్రత్యేక సంరక్షణలో ఉన్న ఈ ప్రదేశాన్ని పర్యాటకులు చూడవచ్చు. ఇక్కడ ఉన్న మృతసముద్రం 75 కిలోమీటర్ల పొడవు, 6 నుండి 16 కిలోమీటర్లు వెడల్పు ఉంది. ఇందులో ఉప్పు శాతం అధికంగా ఉండడం వల్ల వస్తువులు మునగవు, మనుషులు మునిగిపోరు. 3. మడాబా: మడాబా ఒక పురాతన నగరం. ఇది రాజధాని అమ్మాన్కు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ నగరం గురించి బైబిల్లో వర్ణన ఉంది. ఆ కాలంలో దీనిని మెడాబా అనేవారు. బైజాంటియన్ రాజుల కాలంలో గొప్ప నిర్మాణాలు చేశారు. ముస్లిం, క్రైస్తవ మత సంబంధమైన నిర్మాణాలు ఎన్నో ఉన్నాయి. పాలరాతి పలకలు ఇప్పటికీ నగరంలో అక్కడక్కడా దర్శనమిస్తాయి. క్రీస్తుశకం 747లో వచ్చిన భూకంపం కారణంగా ప్రజలంతా ఇతర ప్రదేశాలకు వలస పోయారు. ఇక్కడి సెయింట్ జార్జ్ చర్చి నగరం మధ్యలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మడాబా మ్యూజియం ఈ చర్చ్ సమీపంలో ఉంది. చర్చ్ ఆఫ్ అపోసిల్స్ నగరానికి 10 కిలోమీటర్ల దూరంలో మౌంట్నెబో ఉంది. బైబిల్ గ్రంథంలో దీనిపేరు పిస్గాత. ఈ పర్వతానికి రెండు శిఖరాలు ఉన్నాయి. ఒకదానిని సియాగా అని, రెండోదానిని ముఖాయట్ అంటారు. ఇక్కడి భవనాల ముందుభాగంలో ఉన్న సర్పిలాకార శిలువ ప్రత్యేక అకర్షణగా నిలుస్తుంది. 4. పెట్రా: మొత్తం దేశంలో అత్యంత ఆకర్షణీయమైన ప్రదేశం పెట్రా. మృత సముద్రానికి దక్షిణ ప్రాంతంలో నిర్మితమైన ఈ రాతినగరం ఇప్పటికీ నిర్మాణపరంగా ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఒకప్పుడు నెబాటియన్లకు-అరబ్బులకు ఇది రాజధాని నగరం. ఎన్నో శతాబ్దాల క్రితం నిర్మించిన ఈ రాతినగరం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉండడం ఒక గొప్ప విషయం. రాతి కొండలను తొలిచి భవనాలుగా మలిచిన తీరు ప్రశంసనీయం. ఈ భవనాలు దాదాపు 200 మీటర్ల వెడల్పుతో ఉంటాయి. ఇటీవలి కాలం వరకూ ఈ రాతి భవనాలను బెడోయిన్లు నివాస భవనాలుగా ఉపయోగించుకున్నారు. ఇవి రాజధానికి 260 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. పెట్రా చుట్టుపక్కల ఓ బలిస్క్ టోంచ్, అల్ఖజ్నే, రోమన్ల ఆంఫిథియేటర్, రాయల్ టోంచ్లు, టెమెనస్ గేట్ వే పెట్రాచర్చ్, అల్ దీర్, సిక్ అల్ బారెద్ ఇలా ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి. 1812లో ఈ ప్రాంతాన్ని జోహన్ లుడ్విగ్ అనే చరిత్రకారుడు నవీన ప్రపంచానికి పరిచయం చేశాడు.