యువకుడి హత్య
చిట్టమూరు : మండలంలోని కోగిలి పంచాయతీ వడ్డికండ్రిగకు చెందిన ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన శుక్రవారం వెలుగుచూసింది. స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన మల్లి పాపయ్య (23) నాయుడుపేటలోని ఓ పెట్రోలు బంకులో పనిచేస్తున్నాడు. రెండేళ్ల క్రితం వేముగుంటపాళెంకు చెందిన తన మేనమామ కుమార్తె కవితతో వివాహమైంది. గురువారం తన తాత సంవత్సరీకానికి పక్కనే ఉన్న వేముగుంటపాళెంకు కుటుంబ సమేతంగా వెళ్లాడు. భార్య, పిల్లలను అక్కడే ఉంచి వదలి పాపయ్య ఒక్కడే స్వగ్రామం వడ్డికండ్రిగకు చేరుకున్నాడు. రాత్రి ఇంటి వద్ద ఒంటరిగా పడుకున్నాడు. శుక్రవారం చుట్టు పక్కల వాళ్లు ఇంట్లోకి వెళ్లి చూడగా పాపయ్య మెడకు తాడుతో ఉరేసుకుని చనిపోయినట్లు ఉన్నాడు. అయితే కాళ్లు మంచాన్ని తగులుతూ అనుమానాస్పదంగా ఉండటంతో మృతదేహాన్ని కిందకు దింపి చూశారు. ఒంటిపై రక్తపు గాయాలు ఉండటం, ఇంటి పక్కనే ఇనుప కమ్మీకి రక్తపు మరకలు అయి ఉండటంతో గుర్తుతెలియని వ్యక్తులు హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సీఐ రత్తయ్య, ఎస్ఐ గోపాల్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఒంటిపై రక్త గాయాలు ఉండటంతో హత్యగా కేసు నమోదు చేశారు. యువకుడు హత్యకు గురికావడంతో అలజడి వాతావరణం నెలకొంది. గతంలో గ్రామంలో క్రికెట్ బెట్టింగ్ విషయమై గొడవలు జరిగి ఇరువర్గాలు కేసులు పెట్టుకుని ఉన్నారు. ఈ క్రమంలో పాపయ్య హత్య జరగడం సంచలనం కలిగిస్తోంది.