హైకోర్టు చీఫ్ జస్టిస్ను కలిసిన అనురాగ్ శర్మ
తెలంగాణ-సీమాంధ్ర ప్రాంత న్యాయవాదుల పరస్పర ఘర్షణ నేపథ్యంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కళ్యాణ్ జ్యోతిసేన్ గుప్తాను హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ కలిశారు. లాయర్ల గొడవకు దారితీసిన పరిణామాలపై వీరు చర్చించినట్టు తెలిసింది. ఘర్షణపై ఇరు ప్రాంతాల న్యాయవాదులు కూడా ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు.
సీమాంధ్ర న్యాయవాదులను హైకోర్టులో తెలంగాణ లాయర్లు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ రాజమండ్రిలో న్యాయవాదులు విధులు బహిష్కరించి, ర్యాలీ నిర్వహించారు. పోలీసులు అరెస్ట్ చేసిన సీమాంధ్ర న్యాయవాదులను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.
తెలంగాణ-సీమాంధ్ర లాయర్ల మధ్య చోటుచేసుకున్న ఘర్షణతో హైకోర్టు ప్రాంగణం దద్దరిల్లింది. సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్ర ప్రాంతానికి చెందిన లాయర్లు హైకోర్టు ప్రాంగణంలో నిర్మిస్తున్న మానవహారాన్ని తెలంగాణ ప్రాంత న్యాయవాదులు అడ్డుకోవడంతో ఘర్షణ ప్రారంభమయింది. ఇరు ప్రాంతాల న్యాయవాదులు తోపులాటకు దిగడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. మాజీ అడ్వకేట్ జనరల్ సి.వి.మోహన్ రెడ్డి సహా అనేక మంది న్యాయవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.