ముగ్గురు మావోల సానుభూతిపరులు పరారీ!
ఖమ్మం (దుమ్ముగూడెం): మావోయిస్టు సానుభూతిపరులు పోలీసుల అదుపు నుంచి చాకచక్యంగా తప్పించుకున్నారు. కంగుతిన్న పోలీసులు ముమ్మరంగా వెతుకులాట ప్రారంభించారు. బుధవారం రాత్రి ముగ్గురు మావోల సానుభూతిపరులు చర్ల పోలీస్స్టేషన్ నుంచి తప్పించుకున్నారు. పోలీసులువారిని పట్టుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఖమ్మం జిల్లా సరిహద్దు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దండకారణ్యానికి చెందిన ముగ్గురు మావోల సానుభూతిపరులను చర్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
వారిని బుధవారం దుమ్ముగూడెం పోలీస్స్టేషన్కు విచారణ నిమిత్తం తరలించారు. పోలీసుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపంతో వారు ముగ్గురు పరారైనట్లు సమాచారం. స్థానిక ఎసై్స కడారి ప్రసాద్ ఆధ్వర్యంలో వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ములకపాడు, కాటాయిగూడెం,లక్ష్మీనగరం, గంగోలు, అంజిపాక తదితర ప్రాంతాలలో ముమ్మరంగా వెతుకుతున్నారు. బుధవారం రాత్రి 10 గంటల వరకు వారి ఆచూకీ పోలీసులకు లభ్యం కాలేదని సమాచారం. ఈ విషయమై ఎసై్స కడారి ప్రసాద్ను ‘సాక్షి’ వివరణ కోరగా తనకు ఏమీ తెలియదని సమాధానం ఇచ్చారు.