breaking news
cctv camera vigilance
-
హైవేలపై సీసీ ఫుటేజ్: రాత్రి వేళ కష్టమే.. స్పీడ్ కూడా సమస్యే!
సాక్షి, హైదరాబాద్: మహబూబ్నగర్ జిల్లా ఆమన్గల్ పోలీస్స్టేషన్ పరిధిలో ఓ రైతు శ్రీశైలం హైవే సమీపంలోని తన పొలానికి నీళ్లు పెడదామని అర్ధరాత్రి 1.30 గంటలకు ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై వెళ్లాడు. తిరిగి వస్తున్న సమయంలో హైవే మీద వెనక నుంచి 130–140 కి.మీ వేగంతో వచ్చిన ఓ గుర్తు తెలియని వాహనం అతన్ని ఢీ కొట్టింది. దూరంగా ఎగిరిపడిన రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, ఢీకొట్టిన వాహనం డ్రైవర్ హైవేలోనే ముందుకు వెళితే సీసీటీవీ కెమెరాలో రికార్డై పోలీసులకు దొరికిపోతానని ఊహించాడు. కడ్తాల్ టోల్గేట్ లైన్లో కాకుండా సర్వీస్ రోడ్డు గుండా పరారయ్యాడు. ప్రమాదం జరిగిన ప్రాంతంలోనే సీసీటీవీ కెమెరా ఉన్నా.. అది పని చేయకపోవటంతో కేసు దర్యాప్తు నత్తనడకన సాగుతోంది. సీసీటీవీ కెమెరాల పరిస్థితికి ఆమన్గల్ ఘటన అద్దం పడుతుంది. కేసు దర్యాప్తులో కీలకంగా నిలిచే కెమెరాలు పని చేయకపోవటం, పని చేసినా రాత్రి సమయాల్లో రికార్డయ్యే ఆధునిక కెమెరాలు కాకపోవటంతో హిట్ అండ్ రన్ కేసుల దర్యాప్తులో పోలీసులు సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోంది. రాత్రివేళ కష్టమే.. స్పీడ్ కూడా సమస్యే.. హైవేలలో ఉదయం పూట జరిగే రోడ్డు ప్రమాదాలు ఆయా ప్రాంతాల్లో పని చేస్తున్న సీసీటీవీ కెమెరాల్లో బాగానే రికార్డవుతున్నాయి. అయితే రాత్రి పూట జరిగే ప్రమాదాలు మాత్రం సరిగా రికార్డు కావటం లేదు. వాహనాల లైట్ల కాంతి ఎక్కువగా ఉండటం, వీధి లైట్ల వెలుతురూ కెమెరాల మీద పడుతుండటంతో రాత్రివేళ దృశ్యాలు సరిగా రికార్డు కావటం లేదని శంషాబాద్ జోన్ పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అలాగే జాతీయ రహదారులలో స్పీడ్ బ్రేకర్లు లేకపోవటంతో వాహనాలు 100–130 కి.మీ వేగంతో దూసుకెళ్తుంటాయి. అంత స్పీడ్లో వెళ్లే వాహనాల నంబర్లను ఏఎన్పీఆర్ (ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్) కెమెరాలు గుర్తించలేకపోతున్నాయని ఆయన పేర్కొన్నారు. నిధుల్లేవు.. నిర్వహణ లేదు.. సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, నిర్వ హణ కోసం ప్రభుత్వ పరంగా ఎలాంటి ప్రత్యేక వ్యవస్థా లేదు. అందువల్ల ప్రత్యేకంగా నిధుల కేటాయింపూ లేదు. హైవేలతో పాటు నగరాలు, పట్టణాల్లోని రోడ్లపై వీటిని ఏర్పాటు చేస్తున్న పోలీసు శాఖ కూడా సొంత నిధులు వినియోగించడం లేదు. సామాజిక బాధ్యతగా కార్పొరేట్ సంస్థలు, ఇతర సంఘాలు, సంస్థలు ఇచ్చే నిధులతో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇలా ఏర్పాటు చేసిన కెమెరాలు 10 లక్షలకు పైగా ఉన్నాయి. ఇందులో 40% పనిచేయడం లేదని వెల్లడైంది. కెమెరాల ఏర్పాటే కష్టసాధ్యంగా ఉన్న పరిస్థితుల్లో, ఏర్పాటైన కెమెరాల నిర్వహణ అంతంత మాత్రంగానే ఉంటోంది. సీసీటీవీ ఫుటేజీలే ప్రధాన ఆధారం.. ప్రధాన నగరాల్లో జరిగే రోడ్డు ప్రమాదాలు, చైన్ స్నాచింగ్లు, దాడులు, హత్యోదంతాలు ఇతర త్రా కేసుల్లో నేరస్తులను చాలావరకు.. ఆయా ఘటనలకు సంబంధించిన సీసీటీవీ కెమెరాల రికార్డింగుల ఆధారంగానే పోలీసులు గుర్తిస్తున్నారు. అయితే ఆయా ప్రాంతాల్లో కెమెరాలు పనిచేయనప్పుడు మాత్రం ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఆధునిక కెమెరాలైతేనే బెటర్.. రాష్ట్రంలో ప్రస్తుతం బుల్లెట్, ఏఎన్పీఆర్ కెమెరాలున్నాయి. ఆధునిక ఫీచర్లు తక్కువగా ఉండే ఏఎన్పీఆర్ కెమెరాల్లో 10– 20మీటర్లకు మించి జూమ్ చేయలేం. అదే ఫేస్ రికగ్నిషన్, పాన్ టిల్ట్ జూమ్ (పీటీజెడ్)వంటి ఆధునిక కెమెరాలు అయితే 1కి.మీ. దూరం వరకూ జూమ్ చేయవచ్చు. 360 డిగ్రీల కోణంలో తిరుగుతూ ఉంటాయి. వేగంగా వెళ్లే వాహనాలను గుర్తించి, నంబరు ప్లేట్లను రీడింగ్ చేసే సామర్థ్యం ఉన్న ఈ తరహా కెమెరాలు ఏర్పాటు చేయాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
సీసీ కెమెరాలతో కనిపెడతాం
-
కెమెరాలతో కనిపెడతాం
- సీసీ కెమెరాల నిఘా నీడన ఇక ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్స్ - ఇష్టారాజ్యం మార్కుల విధానానికి అడ్డుకట్ట వేసే చర్యలు - ఆన్లైన్లో పరీక్ష పత్రం.. అప్పటికప్పుడే మార్కుల నమోదు - పరీక్ష కేంద్రాల జంబ్లింగ్కు పట్టుదలతో ఉన్న ప్రభుత్వం - ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు ప్రాక్టికల్ పరీక్షలు సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షల్లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు ఇంటర్మీడియెట్ బోర్డు సీసీ కెమెరాల సాయం తీసుకోనుంది. ప్రాక్టికల్ పరీక్షలు జరిగే కేంద్రాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఉండేలా చర్యలు చేపడుతోంది. తద్వారా ప్రాక్టికల్స్లో ఒక్కో పాఠ్యాంశంలో 30కి 30 మార్కులు వేసే పద్ధతికి అడ్డుకట్ట వేసేందుకు పటిష్ట చర్యలు చేపడుతోంది. పారదర్శకత కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, మాస్ కాపీయింగ్ను నిరోధించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆన్లైన్ చర్యలకు శ్రీకారం చుట్టింది. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 22 వరకు జరిగే ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణను నిఘా నీడన చేపట్టడంతో పాటు నిర్ణీత సమయంలో ఆన్లైన్లోనే ప్రశ్నాపత్రం డౌన్లోడ్ చేయడం, వాల్యుయేషన్ చేసిన తరువాత నిర్ణీత సమయంలో ఆన్లైన్లోనే మార్కుల నమోదు వంటి చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. దీంతోపాటు ఈసారి ప్రయోగ పరీక్షలకు జంబ్లింగ్ పెట్టాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది. అయితే దీనిపై ఇంటర్ బోర్డు ఏ నిర్ణయం తీసుకోలేదు. ‘ప్రైవేటు’ కేంద్రాల్లోనూ కెమెరాలు ప్రస్తుతం ప్రభుత్వ కాలేజీల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ విధానం అమల్లో ఉంది. ప్రైవేటు కాలేజీల్లో కూడా మిగతా 3వ పేజీలోu వీటిని తప్పనిసరి చేయనున్నారు. ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించే ప్రతి పరీక్ష కేంద్రంలో యాజమాన్యం ఇప్పుడు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాల్సిందే. వాటికే పరీక్ష కేంద్రాలను కేటాయించేలా బోర్డు చర్యలు చేపట్టింది. వీటితోపాటు కంప్యూటర్, ఇంటర్నెట్ సదుపాయం తప్పని సరి. ఇక వారిష్టం కుదరదు... గతంలో యాజమాన్యాలు సూచించిన విద్యార్థులకు వారు కోరుకున్న పేపరు ఇవ్వడం, ముందుగానే ప్రాక్టికల్ పరీక్ష పేపరును లీక్ చేయడం, యాజమాన్యాల నుంచి ఎగ్జామినర్లు ముడుపులు పుచ్చుకొని ప్రతిభావంతులు కాకపోయినా విద్యార్థులకు 30కి 30 మార్కులు వేయడం వంటి అక్రమాలకు పాల్పడేవారు. దీనికి బోర్డు చెక్ పెట్టనుంది. పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా రికార్డు చేస్తారు. తద్వారా ఎగ్జామినర్ ఇష్టానుసారం వ్యవహరించలేరు. బయటివారు పరీక్ష కేంద్రంలోకి వచ్చే వీలు ఉండదు.గతంలో ముందుగా ఎగ్జామినర్కు వచ్చిన ప్రశ్నాపత్రాల సెట్లోని ఏ కోడ్ పేపర్లో ఏ ప్రయోగంపై ప్రశ్న ఇచ్చారన్న విషయాలను విద్యార్థులకు తెలియజేసేవారు. దాంతో విద్యార్థి కోరుకున్న కోడ్ కలిగిన ప్రశ్నాపత్రాన్ని ఆ విద్యార్థికి ఇచ్చే వారు. ఇప్పుడు అలాంటి మార్పులకు ఆస్కారం ఉండదు. ర్యాండమ్గా ఇంటర్ బోర్డే విద్యార్థి హాల్టికెట్ ఆధారంగా ప్రశ్నాపత్రాన్ని సదరు విద్యార్థికి కేటాయిస్తుంది. పైగా అది ఎగ్జామినర్కు కూడా ముందుగా తెలియదు. పరీక్ష సమయానికి అరగంట ముందుగా ఎగ్జామినర్ బోర్డు వెబ్సైట్లో పరీక్షకేంద్రం ఐడీ, పాస్వర్డ్తో లాగిన్ అయ్యాక, అతని మొబైల్కు వచ్చే ఓటీపీని ఉపయోగించిన ప్రశ్నాపత్రాలను డౌన్లోడ్ చేస్తారు. అందులో ఏ హాల్టికెట్ నెంబరు విద్యార్థికి ఏ ప్రశ్నాపత్రం అన్నది ఉంటుంది. వాటి ఆధారంగా ప్రయోగాలు చేయించాలి. ప్రతి రోజు రెండు బ్యాచ్లుగా విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రాక్టికల్స్ చేయిస్తారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటాయి. అవి పూర్తి కాగానే ఎగ్జామినర్ ఆ బ్యాచ్లోని 20 మంది విద్యార్థుల రికార్డులను దిద్ది, ప్రాక్టికల్స్ ఫలితాలను, మార్కుల వివరాలను 12 గంటల నుంచి 2 గంటలలోగా అప్లోడ్ చేయాలి. నిర్ణీత వేళలో అప్లోడ్ చేయకుంటే వెబ్సైట్ క్లోస్ అవుతుంది. ఆ విద్యార్థి మార్కులు ఆన్లైన్లో నమోదు కావు. దీంతో అక్రమాలు జరక్కుండా ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 వరకు జరిగే రెండో బ్యాచ్కీ ఇదే పద్ధతి అమలు చేస్తారు. గతంలో ఎగ్జామినర్ అదే పరీక్ష కేంద్రంలో 3 రోజులు విధులు నిర్వహించేవారు కనుక యాజమాన్యాలతో బేరం కుదుర్చుకొని ఇష్టారాజ్యంగా యాజమాన్యం సూచించిన వారికి ఎక్కువ మార్కులు వేసేవారు. చివరలో మూడో రోజు విద్యార్థులు అందరి మార్కులను వేసి వెళ్లేవారు. ఇప్పుడు అలా కుదరదు. ఎప్పటికప్పుడు మార్కులను అప్లోడ్ చేయాలి. తద్వారా బేరసారాలకు అస్కారం ఉండదని అధికారులు భావిస్తున్నారు. గతంలో ఏం జరిగేది.. యాజమాన్యాలు సూచించిన విద్యార్థులకు వారు కోరుకున్న పేపరు ఇవ్వడం, ముందుగానే ప్రాక్టికల్ పరీక్ష పేపరును లీక్ చేయడం, యాజమాన్యాల నుంచి ఎగ్జామినర్లు ముడుపులు పుచ్చుకొని ప్రతిభావంతులు కాకపోయినా విద్యార్థులకు 30కి 30 మార్కులు వేయడం వంటి అక్రమాలకు పాల్పడేవారు. ఇప్పుడు ఏం చేస్తారు.. ప్రాక్టికల్ పరీక్షలు జరిగే కేంద్రాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరి. ర్యాండమ్గా ఇంటర్ బోర్డే విద్యార్థి హాల్టికెట్ ఆధారంగా ప్రశ్నపత్రాన్ని కేటాయిస్తుంది. పరీక్ష పూర్తి కాగానే ఎగ్జామినర్ విద్యార్థుల రికార్డులను దిద్ది, ప్రాక్టికల్స్ ఫలితాలను, మార్కుల వివరాలను 12 గంటల నుంచి 2 గంటలలోగా అప్లోడ్ చేయాలి. నిర్ణీత వేళలో అప్లోడ్ చేయకుంటే వెబ్సైట్ క్లోస్ అవుతుంది. ఆ విద్యార్థి మార్కులు ఆన్లైన్లో నమోదు కావు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు జరిగే రెండో బ్యాచ్కీ ఇదే పద్ధతి అమలు చేస్తారు.