బట్టీల్లో బాల్యం!
కుల్కచర్ల, న్యూస్లైన్: ఎన్నో ఏళ్లుగా బాలకార్మిక వ్యవస్థపై పోరాటం సాగుతూనే ఉంది. కానీ మార్పు కన్పించడం లేదు. వలస వెళ్తున్న వారి పిల్లలు బడికి దూరంగా ఉంటున్నారు. విద్యాహక్కు చట్టం తీసుకొచ్చి హడావుడి చేసినా ఫలితం మాత్రం ఆశించినంత కన్పించడం లేదు. బడీడు పిల్లలు బడిలోనే ఉండాలని, పనికీ పెట్టుకుంటే శిక్షలు తప్పవని చేస్తున్న ప్రచారం కొద్దిమేర ఫలిస్తున్నా.. ఆ పిల్లలు బడిమెట్లు ఎక్కేంతగా ప్రభావం చూపడం లేదు. ముఖ్యంగా ఊరికి దూరంగా ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న కార్మికుల పిల్లలు పూర్తిగా చదువుకు దూరంగా ఉంటున్నారు. కుల్కచర్ల మండలంలో సుమారు 80కి పైగా ఇటుక బట్టీలున్నాయి.
కామునిపల్లి, గంగాపూర్, అంతారం, ఇప్పాయిపల్లి, మక్తవెంకటాపూర్, ముజాయిద్పూర్, మరికల్, కొత్తపల్లి తదితర గ్రామాల పరిధిలో బట్టీలు అధికంగా ఉన్నాయి. ఇక్కడికి మహబూబ్నగర్, గద్వాల్, వనపర్తి, నాగర్కర్నూల్ తదితర ప్రాంతాల నుంచి వలస కూలీలు వస్తారు. వీరే కాకుండా ఒడిశా నుంచి కూడా అనేక కుటుంబాలు పిల్లలతో వస్తాయి. ఇక్కడ సుమారు 500 పైబడి కుటుంబా లు ఇటుక బట్టీల్లో పనిచేస్తాయి. ఈ పేదల పిల్లలు సుమారు 300 మంది వరకు బట్టీల వద్దే ఉంటున్నారు. కాస్తా ఎదిగిన వారు తల్లిదండ్రులతోనే పనిచేస్తుంటే.. చిన్నపిల్లలు గుడిసెల వద్ద గడిపేస్తారు. నిబంధనల ప్రకారం ఎక్కువ మంది వలస కూలీలు పనిచేస్తున్న ప్రదేశంలోనే వలంటీర్ను ఏర్పాటు చేసి చదువు చెప్పించాల్సి ఉంటుం ది. కానీ ఇది ఎక్కడా అమలు కావడం లేదు. ముఖ్యంగా ఒడిశా నుంచి వస్తున్న వారు ఇక్కడ దుర్బర జీవితాలను అనుభవిస్తున్నారు. అటవీ ప్రాంతంలో ఉం టూ సరైన రక్షణ లేకుండా.. చాలీ చాలని వేతనాలతో పిల్లలకు సరైన ఆహారం కూడా అందించలేకపోతున్నారు. భార్యాభర్తలు రోజంతా కష్టపడితే రూ.300 వరకు వస్తా యి. ఇవి పూట గడిచేందుకు సరి పోతాయి కానీ పిల్లల సంరక్షణకు ఏమాత్రం సరిపోవు. వారంతా సుమారు ఆరు నెలల పాటు ఇక్కడే ఉంటారు. దీంతో పిల్లలను చదివించే పరిస్థితి ఉండదు.
బట్టీల యజమానులపై చర్యలేవీ?
స్థానిక ఇటుక బట్టీల్లో చాలా మంది పిల్లలు పనిచేస్తున్నారు. పనిలో పెట్టుకుంటే శిక్ష లు ఉన్నా.. ఏ అధికారీ ఇటువైపు చూడడం లేదు. ఇక కాంట్రాక్టర్లు సైతం కార్మికుల శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారు. కార్మికులకు చాలా తక్కువ మొత్తంలో చెల్లిస్తున్న వాళ్లు.. బయట మాత్రం వెయ్యి ఇటుకలను రూ.3,500 వరకు అమ్ముకుంటున్నారు. నిజానికి ఇటుక బట్టీల నిర్వహణకు అనుమతి తీసుకోవాలి. కానీ ఇక్క డ నిర్వహిస్తున్న ఏ బట్టీకి అనుమతి లేదు. ఇక బట్టీలన్నీ ప్రభుత్వ భూముల్లో, అసైన్డ్ భూముల్లో కొనసాగుతున్నాయి. సాగుకు మాత్రమే ఇస్తున్న ఉచిత విద్యుత్ను కూడా వీరు వాడేస్తున్నారు.
ఆరు నెలలపాటు ఇక్కడే ఉంటాం
ఇక్కడికి వచ్చి నెల రోజులు అవుతోంది. మరో ఐదు నెలలు ఉంటాం. ఇక్కడ ఇచ్చే డబ్బులు మేం ఉంటానికే సరిపోవు. ఇక పిల్లలను ఏం చదివిస్తాం. మేం ఇక్కడికి వచ్చి పిల్లలను అక్కడ ఎవరి దగ్గర ఉంచాలి.
- రాజు, ఒడిశా కూలీ
పిల్లలను చదివించాలని ఉంది
మాకూ పిల్లలను చదివించాలనే ఉంది. కానీ ఎలా? ఇక్కడ సౌకర్యాలు ఏమీ లేవు. ఆరు నెలలు ఊళ్లో ఉంటాం. మరో ఆరు నెలల ఇక్కడుంటాం. అందుకే చదువు మాన్పించినం. కొంచెం ఎదిగిన తర్వాత మాతోపాటు పనికి వస్తరు.
- రాకేష్, కూలీ
అప్పట్లో మా నాన్న.. ఇప్పుడు మేం వచ్చాం
మా నాన్న పదేళ్ల క్రితం వరకూ ఏటా ఇక్కడికి వచ్చి పనిచేసేవారు. ఇప్పుడు మేం వస్తున్నాం. ఏం చదువుకోలేదు. అక్కడ బతుకుదెరువు లేదు. అందుకే కుటుంబాలతో ఇక్కడికి వచ్చి ఉంటున్నాం. చదువుకోవాలంటే పైసలు కావాలే. తినడానికే లేవు.. చదువుకు ఎక్కడ్నుంచి వస్తయి.
- మనప్ప, మహారాష్ట్ర
మా పిల్లలూ పనిచేస్తరు..
ఇటుక బట్టిలలో నాతో పాటు నా ఇద్దరు పిల్లలు ఇక్కడే పనిచేస్తున్నాం గతంలో నేను, నా భార్య పనిచేసేవాళ్లం. అనారోగ్యం కారణంగా నా భార్య పనిచేయడం లేదు. మా పిల్లలు పనిచేస్తున్నారు. మాకు పట్టిన గతే మా పిల్లలకు పట్టేలా ఉంది.
- తిమప్ప, గద్వాల్
చదివిస్తే బానే ఉంటది.. కానీ
మా పిల్లలను చదివిస్తే బానే ఉంటది.. కానీ ఎలా చదివించాలి. మేం ఉన్న ఊళ్లో ఉంటే పూట గడవదు. వస్తే పిల్లల చదువులు పోతయి. అందుకే బడికి తోలట్లే. మాకు దగ్గర్లో ఎవరితోనైనా చదువు చెప్పిస్తే పిల్లలను పంపుతం.
- రోహిత్, ఒడిశా కూలీ
చదువు చెప్పిస్తాం..
పనిచేసే దగ్గర పాఠశాల ఏర్పాటు చేయాలని జీఓ ఉంది. కుల్కచర్ల మండలంలో ఇటుక బట్టీల దగ్గర పిల్లలు ఉంటే సర్వే చేయాలని ఎంఆర్సీలకు చెప్పాం. సర్వే చేస్తున్నారు. పిల్లలు ఉంటే అక్కడే పాఠశాల ఏర్పాటు చేసి వలంటీర్ను నియమిస్తాం. మధ్యాహ్న భోజనం కూడా ఏర్పాటు చేస్తాం.
- నర్సింహులుగౌడ్, మండల విద్యాధికారి, కుల్కచర్ల