breaking news
b.raja kumari
-
ముళ్లబాటలు దాటి.. పూలదారి చేరి
బతుకు పూలబాట కాదు.. అది పరవశించి పాడుకొనే పాటకాదు.. అన్నాడో సినీ కవి. నిజమే.. బంగారానికి పుటం పెడితేనే దాని నాణ్యత పెరిగేది. కష్టాల కొలిమిలో కాగిపోతూ జీవనగమ్యాన్ని చేరుకున్నప్పుడే సార్థకత. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అనుకున్న సివిల్స్ సాధించినవారు ఒకరైతే.. పెళ్లైన ఏడేళ్లకే భర్తను కోల్పోయినా ధైర్యం పోగొట్టుకోకుండా కూలిపనులు చేసి ఇద్దరు పసి బిడ్డలను ప్రయోజకులుగా తీర్చిదిద్దిన వారు ఇంకొకరు. నారీశక్తికి ప్రతీకగా నిలిచిన ఆ ఇద్దరూ మహిళలందరికీ ఆదర్శప్రాయులు. సాక్షి,రాజమహేంద్రవరం : పశ్చిమగోదావరి జిల్లాలో ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టారు బి.రాజకుమారి. తండ్రి న్యాయవాది. తల్లి గృహిణి. చిన్ననాడే సివిల్స్ సాధించడమే తన ధ్యేయం చేసుకున్నారామె. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఆమెకు సహకరించలేదు. దాంతో ఒక్కోమెట్టు ఎక్కాలని ఆమె నిర్ణయించుకున్నారు. ఆమేరకు ఆమె గ్రూప్–2 ఉద్యోగిగా ఉద్యోగ జీవనం ప్రారంభించారు. 2000లో గ్రూప్–2కు ఎంపికయ్యారు. ఈవోఆర్డీగా ఉద్యోగం సంపాదించారు. 2003లో వివాహం అయ్యింది. 2005లో మరో ప్రయత్నంలో ఏసీటీఓ (గ్రూప్–2)గా ఎంపికై ఆకివీడులో విధులు నిర్వర్తించారు. 2005లోనే గ్రూప్–1 పరీక్షలు రాశారు. ఈసారి బీసీ వెల్ఫేర్ అధికారిగా ఎంపికయ్యారు. గుంటూరు జిల్లా అధికారిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇద్దరు పిల్లలు కలిగారు. ఇద్దరు పిల్లల తల్లిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ 2006లో సివిల్స్కు ఎంపికయ్యారు. ఐపీఎస్గా ఎంపికై 2007 బ్యాచ్లో హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ శిక్షణ అకాడమీలో శిక్షణ పొందారు. ఎస్పీ(ట్రైనింగ్)గా నల్లగొండ జిల్లాలో తొలి పోస్టింగ్ పొందారు. తర్వాత నూజివీడు అసిస్టెంట్ ఎస్పీగా, నిజమాబాద్ అడిషనల్ ఎస్పీగా విధులు నిర్వహించి 2015లో మంగళగిరి ఆరో బెటాలియన్ కమాండెంట్గా వెళ్లారు. 2016 మే 16న రాజమహేంద్రవరం అర్బన్ జిల్లాకు తొలి మహిళా ఎస్పీగా వచ్చి విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం కుమారుడు తొమ్మిదో తరగతి, కుమార్తె 8వ తరగతి చదువుతున్నారు. మహిళా సమస్యల పరిష్కారానికి పటిష్ట చర్యలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, కాలేజీలు, స్కూళ్లు, గృహిణుల సమస్యల పరిష్కారానికి, వారి రక్షణకు రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ పటిష్ట రాజకుమారి పటిష్టమైన చర్యలు చేపడుతున్నారు. షీటీమ్స్, సెల్ఫ్ టీమ్స్, వుమెన్ హెల్ప్ డెస్క్, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీ, పాఠశాల పిల్లలకు సెక్సువల్ అబ్యూజ్పై అవగ్నా టీమ్లు ఏర్పాటు చేశారు. రాజమహేంద్రవరం అర్బన్ జిల్లాలో మహిళా సమస్యల పరిష్కారానికి చేపడుతున్న చర్యలు ఎస్పీ రాజకుమారి మాటల్లో.... షీ టీమ్స్ ఏర్పాటు చేశాం షీ టీమ్ 2016లో ఏర్పాటు చేశాం. తర్వాత రెండో టీమ్ను ఏర్పాటు చేశాం. ఫిర్యాదు వచ్చి నిమిషాల్లోనే షీ టీమ్ సభ్యులు ఆ ప్రాంతానికి వెళ్లి సమస్యను పరిష్కరిస్తారు. 24 గంటల పాటూ షీ టీమ్ అందుబాటులో ఉంటుంది. రాజమహేంద్రవరం నగరంలో ఆకతాయిల పని పడుతున్నాం. బాలికలకు సెక్సువల్ అబ్యూజ్పై షీ టీమ్స్ ద్వారా అవగాహన కల్పించేందుకు పాఠశాలల్లో సమావేశాలు నిర్వహిస్తున్నాం. కళాశాలల్లో ‘సెల్ఫ్ షీ టీమ్స్’ ఏర్పాటు చేశాం. ఈ టీమ్లో ఆయా కళాశాలల్లోని ఐదుగురు సీనియర్ విద్యార్థులు సభ్యులుగా ఉంటారు. ఆయా కళాశాలల్లో తలెత్తే సమస్యలను షీ టీమ్స్ సహాయంతో వారే పరిష్కరించుకునేలా దీన్ని రూపొందించాం. ఉమెన్ హెల్ప్ డెస్క్... ఎస్పీ కార్యాలయానికి వచ్చే మహిళలకు ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశాం. మహిళలు అక్కడ ఉన్న సిబ్బందిని సంప్రదిస్తే పిటిషన్లు రాసేందుకు సహకరించడం, లేదా సిబ్బందే రాసిస్తారు. సమస్యను బట్టీ పోలీస్ స్టేషన్కు, లేదా షీటీమ్స్కు వారి ఫిర్యాదును పంపిస్తాం. సమస్య పరిష్కారంపై ఉమెన్ డెస్క్లు ఫాల్అప్ చేస్తాయి. పోలీసు మహిళా సిబ్బందికి వెల్ఫేర్ కమిటీలు పోలీసు విభాగంలో మహిళా సిబ్బంది సమస్యలను పరిష్కరించేందుకు మూడు వుమెన్ వెల్ఫేర్ కమిటీలు ఏర్పాటు చేశాం. ఈ కమిటీలకు మహిళా ఎస్సై నేతృత్వం వహిస్తున్నారు. మహిళా పోలీసులు ఎదుర్కొనే సమస్యలకు ఒక కమిటీ, జిల్లా పోలీసు శిక్షణ సంస్థలోని ట్రైనీ కానిస్టేబుళ్లకు రెండో కమిటీ, ఇతర సిబ్బంది (మినిస్టీరియల్ సిబ్బంది) కోసం మూడో కమిటీని ఏర్పాటు చేశాం. బ్లూకోల్ట్.. వైట్ కోల్ట్ మహిళా కానిస్టేబుళ్లు రాష్ట్రంలోనే మొదటిసారిగా రాజమహేంద్రవరంలో బ్లూకోల్ట్, వైట్కోల్ట్గా మహిళా కానిస్టేబుళ్లను నియమించాం. గొడవలు, సమస్యాత్మక ప్రదేశాలు, ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు బ్లూకోల్ట్ సిబ్బంది వెంటనే స్పందిస్తారు. వారు ద్విచక్రవాహనంపై ఘటనా స్థలానికి చేరుకుంటారు. బ్లూకోల్ట్ కానిస్టేబుల్ ఇటీవల గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకోబోయిన ఇద్దరిని కాపాడింది. వైట్కోల్ట్ మహిళా కానిస్టేబుల్ ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించిన వారిపై చర్యలు చేపడుతుంది. అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం నగరంలో రౌడీయిజాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తున్నాం. రౌడీ షీటర్ల సమాచారాన్ని డిజిటలైజ్ చేశాం. తరచూ వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నాం. మహిళా రక్షణ కోసం ‘యూ– సేఫ్’ యాప్ ప్రమాదంలో ఉన్న మహిళల కోసం కొత్తగా ‘యూ– సేఫ్’ పేరుతో యాప్ తయారు చేయిస్తున్నాం. ఈ యాప్లో ఆటోలు, వాహనాల్లో వెళుతూ ఇబ్బందులకు గురైతే చిన్నపాటి సిగ్నల్ ఇస్తే ఆ వాహనాన్ని జీపీఎస్ ద్వారా గుర్తిస్తాం. -
కొత్త జట్టు!
యంత్రాంగం కూర్పులో కేసీఆర్ మార్కు! ఏఐఎస్ విభజనతో అధికారుల బదిలీ అనివార్యం ఎస్పీ, సబ్కలెక్టర్ ఏపీ కేడర్కు.. వారిస్థానంలో కొత్త ముఖాలు బదిలీల జాబితాలో జేసీల పేర్లు కూడా.. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : పాలనా యంత్రాంగంలో ప్రక్షాళనకు తెరలేచింది. అఖిల భారత సర్వీసు(ఏఐఎస్) అధికారుల విభజన ప్రక్రియ కొలిక్కి రావడంతో జిల్లా సారథుల మార్పు అనివార్యం కానుంది. రంగారెడ్డి గ్రామీణ ఎస్పీ బి.రాజకుమారి, వికారాబాద్ సబ్కలెక్టర్ హరినారాయణ్ లను విభజన ప్రక్రియలో ఏపీ కేడర్కు కేటాయించడంతో వీరిరువురు బదిలీ తప్పనిసరిగా మారింది. రెండు నెలల క్రితం రాజకుమారిని బదిలీ చేస్తూ ఆమె స్థానే మెదక్ ఎస్పీ సుమతిని ఇన్చార్జిగా ఎస్పీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, సుమతి బాధ్యతలు స్వీకరించకపోవడంతో రాజకుమారే ఎస్పీగా కొనసాగుతున్నారు. తాజాగా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ తదితర అధికారుల విభజనకు ప్రధాని ఆమోదముద్ర వేయడం.. నేడో, రేపో డీఓపీటీ కూడా జాబితాను రాష్ట్ర ప్రభుత్వానికి పంపనున్న తరుణంలో రాజకుమారి ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేయాల్సివుంటుంది. సబ్కలెక్టర్ హరినారాయణ్ కూడా ఆ రాష్ట్రానికి వెళ్లాల్సివుంటుంది. ఏపీకి మారుతున్న వీరి స్థానంలో కొత్త ముఖాలు కొలువు దీరనున్నాయి. జాయింట్ కలెక్టర్లకు స్థానచలనం? మరోవైపు జిల్లా జాయింట్ కలెక్టర్లుగా వ్యవహరిస్తున్న ఎం.చంపాలాల్, ఎంవీరెడ్డిల పేర్లు బదిలీల జాబితాలో ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. ఏడాదిన్నర క్రితం జేసీలుగా ఒకే రోజు విధుల్లో చేరిన ఈ ఇద్దరూ కలెక్టర్ పోస్టుపై కన్నేశారు. పని ఒత్తిడితో సతమతమవుతున్న చంపాలాల్ జిల్లా నుంచి నిష్ర్కమించడమే మంచిదనే భావనకొచ్చినట్లు తెలుస్తోంది. నగర శివార్లలో భూముల ధరలు ఆకాశన్నంటిన నేపథ్యంలో ఈ పోస్టుకు భలే డిమాండ్ ఉంది. ఈ క్రమంలోనే పలువురు అధికారులు జేసీ-1గా వచ్చేందుకు పావులు కదుపుతున్నారు. విభజన ప్రక్రియ కొలిక్కిరావడంతో జేసీ-2 ఎంవీరెడ్డికి కూడా స్థానచలనం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. పదవీ విరమణకు కొన్నేళ్లు మాత్రమే ఉన్నందున ఏదేనీ జిల్లాకు కలెక్టర్గా సేవలందించాలని ఆయన భావిస్తున్నారు. ఆప్రాధాన్య పోస్టులో ఏడాదిన్నరగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన పేరు త్వరలో వెలువడే బ దిలీల జాబితాలో ఉండవచ్చనే ప్రచారం జరుగుతోంది. కలెక్టర్ పోస్టుపై కన్ను! తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బదిలీపై కలెక్టర్గా జిల్లాకొచ్చిన ఎన్.శ్రీధర్ కు ఇప్పట్లో స్థానచలనం జరిగే అవకాశాలులేకపోవచ్చు. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ప్రభుత్వాన్ని గట్టెక్కించేందుకు కేసీఆర్ సర్కారు అప్పగించిన గురుతర బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తున్న శ్రీధర్ను మార్చడం వల్ల స్థలాల క్రమబద్ధీకరణ, భూముల అమ్మకంతో నిధులు సమకూర్చుకోవాలనే ప్రభుత్వ లక్ష్యం దెబ్బతినే ఆస్కారం ఉందనే వాదన వినిపిస్తోంది. భూముల సర్వే, పరిశ్రమల స్థాపనలోనూ ముఖ్యపాత్ర పోషిస్తున్న ఆయనను మార్చే అవకాశాలు స్వల్పంగానే ఉన్నాయి. కార్యదర్శి హోదాలో ఇప్పటికే నాలుగు జిల్లాల్లో కలెక్టర్గా సేవలందించిన శ్రీధర్ పేరు సింగరేణి కాలరీస్ సీఎండీ పోస్టుకు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇది కార్యరూపం దాల్చితే కృష్ణా జిల్లా కలెక్టర్ రఘునందన్రావు పేరును ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవచ్చనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం కృష్ణా కలెక్టర్గా పనిచేస్తున్న ఆయన తెలంగాణ కేడర్కు మారనున్నారు. ఇదిలావుండగా, తెలంగాణలోనే ముఖ్య పోస్టుగా భావిస్తున్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్గిరిపై పలువురు అధికారులు ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే ప్రభుత్వ స్థాయిలో తమదైన శైలిలో పావులు కదుపుతున్నారు. ఏదీఏమైనా వారం, పది రోజుల్లో జిల్లా పాలనాయంత్రాంగంలో సమూల మార్పులు జరుగనున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్కు పాలనకు అనుగుణంగా అధికారులు కొలువుదీరనున్నారు.