breaking news
Belt Shop Auction
-
హోంమంత్రి అనిత ఇలాకాలో బెల్ట్ షాపులకు వేలం పాట
-
అనిత ఇలాకాలో బెల్టు షాపులకు వేలం పాట.. దండోరా వేసి మరి..
సాక్షి, అనకాపల్లి: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో బెల్టు షాపుల దందా కొనసాగుతోంది. ఏకంగా హోం మంత్రి అనిత ఇలాకాలోనే బెల్టు షాపులకు బహిరంగ వేలం పాటకు దండోరా వేయడం చర్చనీయాంశంగా మారింది. కూటమి ప్రభుత్వ అసమర్థత తీరుకు ఇది నిదర్శమని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.వివరాల ప్రకారం.. ఏపీ హోం మంత్రి అనిత ఇలాకాలో బెల్ట్ షాపులకు బహిరంగ వేలం పాట ప్రకటించారు. ఎస్ రాయవరం మండలంలోని పేట సూదిపురంలో బహిరంగ వేలం పాట నిర్వహణకు ప్లాన్ చేస్తున్నారు. బెల్టు షాపు వేలంపాట కోసం ముందు రోజు రాత్రి గ్రామంలో దండోరా వేయడం చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీ కూటమి నేతల కనుసన్నల్లో బెల్టు షాపులు వేలం పాట జరుగుతున్నట్టు తెలుస్తోంది.అయితే, రాష్ట్రంలో బెల్టు షాపులు లేవని సీఎం చంద్రబాబు, మంత్రి అనిత అడ్డగోలు వాదనలు చేస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా బెల్టు షాపులు నిర్వహిస్తే ఐదు లక్షల జరిమానా అంటూ ప్రకటన కూడా చేశారు. మరోవైపు.. తనిఖీల్లో బెల్టు షాపు నిర్వాహకులు దొరికినా ఎటువంటి జరిమానా విధించడం లేదు ఎక్సైజ్ అధికారులు. ప్రభుత్వ పెద్దలు చెప్పేది ఒకటి.. గ్రౌండ్ లెవల్ జరుగుతున్నది మరొకటి అని పలువురు గుసగుసలాడుకుంటున్నారు. -
అక్కడ వారి చూపుడువేలే చట్టం
కడలి తీరానికి ఆనుకుని ఉండే ఆ మత్స్యకార గ్రామంలో కొందరు చెప్పిందే వేదం. వారి చూపుడువేలే చట్టం. రాజ్యాంగం, శిక్షాస్మృతులు, వ్యవస్థలకు ఆ ఊళ్లో కడలి నురుగుకు ఉన్నంత బలం కూడా ఉండదు. ఆ గ్రామంలో ఏ పని జరగాలన్నా కొందరు పెద్దల కనుసన్నల్లోనే జరుగుతుంది. వారి తీర్మానమే అక్కడ అంతిమ తీర్పు. రేషన్ దుకాణం దగ్గర నుంచి మద్యం దుకాణం వరకు ఏదైనా కొందరు పెద్దల సమక్షంలో జరిగే వేలంలో పాల్గొని దక్కించుకోవాల్సిందే. పోలీసులు, రెవెన్యూ...ఇలా ఏ శాఖ ఆదేశాలూ అక్కడ చెల్లుబాటు కావు. ఆ గ్రామంతో పాటు చాలా తీరప్రాంత గ్రామాల్లో ఏళ్లతరబడి నెలకొన్న ఈ సంస్కృతి ఇటీవల కాలంలో కొన్నిచోట్ల తగ్గుముఖం పట్టింది. అయితే ఇప్పటికీ పెత్తందారీతనం నీడలోనే ఉన్న ఆ ఊరు కాట్రేనికోన మండలం బలుసుతిప్ప. ⇒ బలుసుతిప్పను వీడని పెత్తందారీ పోకడలు ⇒ నిరాఘాటంగా నడుస్తున్న సమాంతర సర్కారు ⇒ ఏ పనైనా కొందరు పెద్దల కనుసన్నల్లోనే.. ⇒ నేడు బెల్ట్షాపు తదితరాల నిర్వహణకు వేలం సాక్షి ప్రతినిధి, కాకినాడ : కాట్రేనికోన మండలం బలుసుతిప్ప గ్రామంలో ఇప్పటికీ కొందరు పెద్దల నిరంకుశ పెత్తనమే చెలామణి అవుతోంది. వారి మాటను ధిక్కరించిన వారికి ఇక్కట్లు తప్పని పరిస్థితి నెలకొంది. గ్రామంలో మద్యం దుకాణం, ఉప్పుమడులు, రేవుల వేలం తమ ఆధీనంలో కొందరు పెద్దలు నడిపిస్తుంటారు. తాజాగా వాటికి శనివారం నిర్వహించే వేలంలో పాల్గొనే వారు డిపాజిట్లు చెల్లించండంటూ గ్రామంలో శుక్రవారం చాటింపు కూడా వేయించారు. బెల్టు షాపు వేలంలో పాల్గొనాలంటే రూ.50 వేలు, రేషన్షాపు, మార్కెట్ వంటి వాటి కోసం రూ.10 వేలు వంతున డిపాజిట్ చెల్లించాలని అక్కడి పెద్దల కమిటీ నిర్ణయించిందని సమాచారం. వేలం పాటల ద్వారా బెల్టు షాపును దక్కించుకొన్న వారు లెసెన్సు షాపులో విక్రయిస్తున్న ధరలకు అదనంగా మద్యం సీసాపై రూ.10, బీరు బాటిల్పై రూ.15 వేసుకోవచ్చని నిర్ణయించారు. ఈ బెల్ట్షాపునకు పల్లంకుర్రు లెసైన్సు షాపు నుంచి మద్యం సరఫరా అవుతుంటుంది. అక్కడ ఇప్పటికే మద్యం బాటిల్ను ఎంఆర్పీ కంటే అదనంగా రూ.10 నుంచి రూ.20కు విక్రయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. బెల్ట్షాపునకు నిర్వహించే వేలం ద్వారా ధరలు పెంచి విక్రయించడంతో మరింత భారం పడుతుందని మందుబాబులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది ఈ గ్రామంలో నిర్వహించిన వేలం పాటలో బెల్టు షాపు రూ.22 లక్షలు, రేవు పాటలు రూ.2 లక్షలు, ఉప్పుమడులు రూ.8,50,000, మార్కెట్కు రూ.2,20,000గా నిర్ణయించారు. బలుసుతిప్పలోని కొత్తపేట, మధ్యపేట, పాతపేటల నుంచి పలువురు పెద్దల సమక్షంలో శనివారం వేలం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే గత వేలం సొమ్ముల లెక్కలు తేలక పోవడంతో వేలాన్ని అడ్డుకోవాలని కొందరు భావిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో శనివారం పరిస్థితి ఉద్రికంగా మారే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మరి, అధికార యంత్రాంగం ఏం చేస్తుందో చూడాలి.