breaking news
Bank account opening
-
బ్యాంక్ ఖాతా తెరుస్తున్నారా.. నామినేషన్ మరవొద్దు..
సేవింగ్స్ అకౌంట్.. కరెంటు అకౌంట్ కావొచ్చు లేదా డిపాజిట్ లాకర్ తీసుకునేటప్పుడు కావొచ్చు .. నామినేషన్ అంశం చాలా కీలకమైనది. ఎందుకంటే ఆయా అకౌంట్లకు సంబంధించి నామినీ వివరాలను బ్యాంకులకు అందజేయకపోతే.. ఖాతాదారుడికి ఏదైనా అనుకోనిది జరిగిన పక్షంలో కుటుంబసభ్యులు డిపాజిట్లను క్లెయిమ్ చేసుకోవడం చాలా కష్టతర మవుతుంది. ఇంతటి ముఖ్యమైన నామినేషన్ గురించి సోదాహరణంగా తెలియజేసేదే ఈ కథనం. నామినేషన్ అంటే.. తన తదనంతరం అకౌంట్లోని మొత్తం చెందాల్సిన వారి పేరు (నామినీ) తదితర వివరాలను ఖాతాదారు బ్యాంకు లేదా ఆర్థిక సంస్థకు తెలియజేయడాన్ని నామినేషన్ అంటారు. ఇది మరిస్తే సదరు ఖాతాల్లోని మొత్తాలను క్లెయిమ్ చేసుకునేందుకు కుటుంబసభ్యులు సమస్యలు ఎదుర్కొనాల్సి వస్తుంది. రాజు ఉదాహరణే తీసుకుంటే.. అతని తండ్రి ఆటో స్వీప్ సదుపాయం గల సేవింగ్స్ ఖాతా ప్రారంభించారు. దానికి రాజును నామినీగా ఉంచారు. అయితే, ఆయన మరణానంతరం ఖాతాలో డబ్బును క్లెయిమ్ చేసుకునేందుకు బ్యాంకుకు వెళ్లిన రాజుకు ఊహించని పరిస్థితి ఎదురైంది. సేవింగ్స్ ఖాతాకు మాత్రమే రాజు నామినీగా ఉన్నారని.. అందులో నుంచి ఆటో స్వీప్ పద్ధతిలో ఫిక్సిడ్ డిపాజిట్కి బదలాయించిన డబ్బుకు సంబంధించి ఆయన్ను నామినీగా పరిగణించలేమని బ్యాంకు పేర్కొంది. దీనిపై ఫిర్యాదులు గట్రా సుదీర్ఘ తతంగం జరిగి, సేవింగ్స్ ఖాతా నుంచి ఎఫ్డీకి మళ్లిన మొత్తానికి కూడా తానే హక్కుదారు అని నిరూపించుకుంటే గానీ రాజు చేతికి మిగతా మొత్తం అందలేదు. కాబట్టి ఖాతాదారులు, లాకర్ హోల్డర్లు తమ తదనంతరం హక్కుదార్లుగా నామినీల పేర్లను పేర్కొనడం ఎంత ముఖ్యం అన్నది ఈ ఉదంతం తెలియజేస్తుంది. నామినేషన్ చేయడం వల్ల.. ఖాతాదారు మరణానంతరం వారసత్వ సర్టిఫికెట్లు, కోర్టు ఆర్డర్లు మొదలైన బాదరబందీ లేకుండా ఖాతాలో సొమ్ము/లాకర్లలో ఉన్నవాటిని బ్యాంకు నుంచి నామినీ సులువుగా పొందేందుకు వీలవుతుంది. నామినేషన్ తీరుతెన్నులు.. వ్యక్తిగత ఖాతా ఉన్నవారైనా, జాయింట్ అకౌంట్ ఉన్నవారు నామినేషన్ చేయొచ్చు. సేఫ్ డిపాజిట్ లాకర్ హోల్డర్లు తమ లాకర్లకు నామినీని సూచించవచ్చు. ఒకవేళ మైనర్ను నామినేట్ చేసిన పక్షంలో వారి సంరక్షకుల వివరాలను నామినేషన్ ఫారంలో పేర్కొనాల్సి ఉంటుంది. సాధారణంగా బ్యాంక్ అకౌంట్లకు ఒకే ఒక్క నామినీని నియమించుకునే అవకాశం ఉన్నప్పటికీ.. అదే బ్యాంకులో పలు ఖాతాలు ఉన్న పక్షంలో పలువురిని నామినీలుగా పేర్కొనడానికి వీలుంది. పరిస్థితులను బట్టి ముందుగా పేర్కొన్నవారిని తప్పించి నామినీలుగా వేరేవారిని ఎంచుకునేందుకు కూడా వెసులుబాటు ఉంటుంది. ఇక బ్యాంకు తన వంతుగా ఖాతాదారు మరణానంతరం.. నామినీ పత్రాలను ధృవీకరించుకుని గరిష్టంగా 15 రోజుల్లోగా చెల్లింపు ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. -
బ్యాంక్ ఖాతా ప్రారంభం ఇక మరింత సులువు
చిరునామా నిబంధనలు సరళతరం చేసిన ఆర్బీఐ ముంబై: ‘మీ కస్టమర్ల గురించి తెలుసుకోండి’ (కేవైసీ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సరళతరం చేసింది. దీనితో బ్యాంక్ అకౌంట్ల ప్రారంభం మరింత సులభతరం కానుంది. కేవలం ఒక శాశ్వత లేదా స్థానిక చిరునామా ధ్రువీకరణ ఉంటే చాలు బ్యాంక్ అకౌంట్ తెరిచేలా వెసులుబాటునిస్తూ నిబంధనలను సడలించినట్లు ఆర్బీఐ సోమవారం విడుదల చేసిన ఒక నోటిఫికేషన్లో తెలిపింది. ప్రస్తుతం వలస కార్మికులు, ఉద్యోగులకు బ్యాంకింగ్ సేవలు పొందడం క్లిష్టంగా మారింది. ఈ సమస్య పరిష్కారానికి ఆర్బీఐ తాజా నిర్ణయం దోహదపడుతుంది. ఒకవేళ చిరునామా ధ్రువీకరణను సమర్పించలేకపోతే ఖాతాదారు నుంచి స్థానిక చిరునామాకు సంబంధించిన డిక్లరేషన్ ఒకదానిని తీసుకుని ఖాతా తెరవాలని ఆర్బీఐ సూచింది. ఆ డిక్లరేషన్లో తెలియపర్చిన చిరునామాకు లేఖ, చెక్బుక్స్, ఏటీఎం కార్డ్స్ వంటివి ‘ఎకనాలెడ్జ్మెంట్’ ద్వారా పంపి, తిరిగి వచ్చిన రిిసీట్ ద్వారా చిరునామాను బ్యాంక్ బ్రాంచ్ ధ్రువీకరించుకోవచ్చని సైతం ఆర్బీఐ నోటిఫికేషన్ సూచించింది. ఒక బ్యాంక్ బ్రాంచ్లో అకౌంట్ తెరచిన తరువాత మళ్లీ ఒకవేళ అడ్రస్ మారితే ఆ వివరాలను ఆరునెలల్లో సంబంధిత బ్యాంక్ బ్రాంచ్కి తెలియజేస్తే సరిపోతుంది. ఈ విధంగా కేవైసీ నిబంధనలను సడలించుకుంటూనే... సంబంధిత నిబంధనలను కఠినంగా అమలుచేయడంపై దృష్టిపెట్టాలని నోటిఫికేషన్ స్పష్టం చేసింది.