breaking news
Australia police
-
ఆస్ట్రేలియాలో కిడ్నాప్కు గురైన 4 ఏళ్ల చిన్నారి.. 18 రోజుల పాటు గాలింపు
-
18 రోజుల పాటు గాలింపు.. ఆ పాపను చూసి ఏడ్చిన అధికారులు
సిడ్ని: ఆస్ట్రేలియాకు చెందిన నాలుగేళ్ల చిన్నారి క్లియో స్మిత్ని చూసి ఆమె కుటుంబ సభ్యులతో పాటు.. పోలీసులు, డిటెక్టివ్లు, చుట్టుపక్కల ప్రజలు చాలా సంతోషిస్తున్నారు. చిన్నారిని చూసి వారికి కన్నీళ్లు ఆగలేదు. కాకపోతే అవి ఆనందబాష్పాలు. ఎందుకంటే 18 రోజుల కిత్ర కిడ్నాప్కు గురైన క్లియో స్మిత్(4).. క్షేమంగా తల్లిదండ్రుల చెంతకు చేరింది. ఇన్ని రోజులు క్లియో కోసం కన్నీరుమున్నిరుగా విలపించిన వారంతా ఇప్పుడు సంతోషంతో ఏడుస్తున్నారు. క్లియో కిడ్నాప్ వ్యవహారానికి వస్తే.. ఉత్తర ఆస్ట్రేలియా ప్రాంతానికి చెందిన క్లియో.. సుమారు 18 రోజుల క్రితం తన తల్లిదండ్రులతో కలిసి పిక్నిక్కు వెళ్లింది. రాత్రి తన టెంట్లో నిద్రిస్తుండగా దుండగుడు క్లియోని కిడ్నాప్ చేశాడు. ఉదయం నిద్రలేచిన క్లియో తల్లిదండ్రులకు ఆమె కనిపించలేదు. ఆ ప్రాంతం అంత వెదికారు. ఎక్కడా క్లియో జాడ లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. (చదవండి: నెల క్రితం కిడ్నాప్.. ఇప్పుడు ఎముకల గూడుగా.. ) క్లియో తల్లిదండ్రులు తమ కుమార్తె ఆచూకీ చెప్పాలంటూ సోషల్ మీడియా వేదికగా అభ్యర్థించారు. ముక్కుపచ్చలారని పసికందు కిడ్నాప్ వ్యవహారం ప్రతి ఒక్కరిని కదిలించింది. క్లియో క్షేమంగా ఇంటికి చేరుకోవాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్లియో తల్లిదండ్రులకు మద్దతుగా నిలిచారు జనాలు. కేసు సీరియస్గా మారడంతో పోలీసులు దీన్ని సవాలుగా తీసుకున్నారు. క్లియో పిక్నిక్ వెళ్లిన ప్రాంతం, ఆ చుట్టుపక్కల ప్రదేశాలను జల్లెడ పట్టారు. ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో ఆశ వదిలేసుకున్నారు. చివరకు డిటెక్టివ్ల సాయం తీసుకున్నారు. అయితే క్లియో ప్రాణాలతో ఉంటుందని ఎవరికి నమ్మకం లేదు. దుర్వార్తే వినాల్సి వస్తుందని భావించారు. (చదవండి: తొమ్మిది రోజులైనా కానరాని జాడ.. డానియెల్ ఎక్కడ?) ఈ క్రమంలో సుమారు 18 రోజుల తర్వాత క్లియోని కిడ్నాప్ చేసిన వ్యక్తి గురించి.. అతడి స్థావరం గురించి పోలీసులుకు సమాచారం తెలిసింది. ఎంతో చాకచక్యంగా నిందితుడు ఉండే ప్రాంతాన్ని చుట్టుమట్టారు పోలీసులు. అతడి నివాసంలోకి వెళ్లారు. అక్కడ ఓ గదికి తాళం వేసి ఉండటం గమనించారు. దాన్ని పగలకొట్టి లోపలికి వెళ్లి చూడగా.. వారి ఎదురుగా క్లియో. ఒక్కనిమిషం పాటు అధికారులకు నోటమాట రాలేదు. చిన్నారిని తట్టి.. ‘‘నీ పేరేంటని ప్రశ్నించగా.. నా పేరు క్లియో’’ అని చెప్పింది. వెంటనే హుటాహుటిన క్లియోని అక్కడ నుంచి కాపాడి.. ఆస్పత్రికి తరలించారు. 18 రోజుల పాటు కిడ్నాపర్ చెరలో ఉండటం అంటే మామూలు విషయం కాదు. పెద్దవారే ఎంతో భయపడతారు. (చదవండి: వందల కోట్ల రూపాయల ఆస్తి.. వృద్ధుల కిడ్నాప్) కానీ చిన్నారి క్లియో ఏమాత్రం బెదరకుండా.. ధైర్యంగా ఉండటం చూసి పోలీసులు, డిటెక్టివ్లు ఆశ్చర్యపోయారు. చిన్నారిని చూసి వారు ఒక్కసారిగా ఏడ్చేశారు. ప్రస్తుతం నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇక క్లియో క్షేమం కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు చిన్నారి తల్లిదండ్రులు. చదవండి: 22 ఏళ్ల క్రితం.. పునీత్ రాజ్కుమార్ తండ్రిని కిడ్నాప్ చేసిన వీరప్పన్ The moment Cleo was rescued 👏 pic.twitter.com/arusYi9kCa — WA Police Force (@WA_Police) November 3, 2021 -
ఆస్ట్రేలియాలో మందుబాబుల కోసం 2.ఓ సినిమా
కాన్బెర్రా : ఆస్ట్రేలియా పోలీసులు మందుబాబుల్లో మార్పుకోసం సూపర్స్టార్ రజనీకాంత్ నటించిన 2.ఓ చిత్ర సన్నివేశాన్ని చూపిస్తున్నారు. రజనీకాంత్కే కాదు, ఆయన నటించిన చిత్రాలకు ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ ఉందన్న విషయం తెలిసిందే. జపాన్, కెనడా, మలేషియా, సింగపూర్ దేశాల్లో రజనీకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఆస్ట్రేలియాలోనూ ఆయన చిత్రాల ప్రభావం ఉందని తెలిసింది. వివరాలు చూస్తే.. ఇటీవల దక్షిణ ఆస్ట్రేలియాలోని టోర్ఫీ ప్రాంత పోలీసులు రాత్రుల్లో వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. మందుబాబులను అరెస్ట్ చేసి కేసులు నమోదు చేయడం లేదు. బదులుగా వారికి మద్యం సేవించడం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తున్నారు. అందుకు పోలీసులు రజనీ నటించిన 2.ఓ చిత్రంలోని సన్నివేశాలను అధికారిక పూర్వకంగా వినియోగిస్తున్నారు. వాహన తనిఖీల్లో ఒక వ్యక్తిని టెస్ట్ చేయగా.. అతను 0.341 ఆల్కాహాల్ సేవించినట్లు గుర్తిస్తారు. అంత మద్యం సేవించిన వారు శస్త్ర చికిత్సలో ఉన్నవారికి, కోమాలో ఉన్న వ్యక్తికి సమానం అని సన్నివేశంలో ఉంది. ఈ సన్నివేశాన్ని చూపిస్తూ మందుబాబులకు పోలీసులు అవగాహనను కల్పిస్తున్నారు. ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవడంతో రజనీకాంత్ అభిమానులు ఇతర మందుబాబుల్లో మార్పు తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలెట్టారు. -
అండర్ గ్రౌండ్ నుంచి బాలుడికి విముక్తి
సిడ్నీ: మత్తు పదార్థాల ముఠా స్థావరంపై దాడి చేసిన ఆస్ట్రేలియా పోలీసులు అండర్ గ్రౌండ్ లో బంధించిన 8 ఏళ్ల బాలుడికి విముక్తి కల్పించారు. బాలుడిని బంధించిన తీరు చూసి పోలీసులు అవాక్కయ్యారు. సిడ్నీకి ఉత్తర దిక్కుగా 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎలాండ్స్ ప్రాంతంలో ఓ మారుమూల ఇంటిపై పోలీసులు దాడి చేసినప్పుడు ఈ దారుణోదంతం వెలుగు చూసింది. రెండు చదరపు అడుగుల గదిలో బంధించివున్న బాలుడిని పోలీసులు గుర్తించారు. చిన్న పరుపు, బకెట్ మాత్రమే గదిలో ఉంచారు. మూడు వారాల పైనుంచి తనను అందులో బంధించారని పోలీసులకు బాలుడు తెలిపాడు. అతడితో పాటు మరో ముగ్గురు పిల్లలను పోలీసులు కాపాడారు. సరిగా తిండి లేకపోవడంతో వీరంతా నీరసించిపోయారు. ఇంటి ప్రాంగణంలో నిషేధిత గంజాయి మొక్కలు పెంచినట్టు గుర్తించారు. ఈ కేసులో ఇద్దరు పురుషులు, మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. నిషేధిత మొక్కలు పెంచినందుకు, బాలలను నిర్బంధించినందుకు నిందితులపై కేసు నమోదు చేశారు. తాము దాడి చేసిన ఇంటి ఫొటోలు పోలీసులు విడుదల చేశారు.