breaking news
Apprentice Act
-
లబోదిబోమంటున్న ఆంధ్రా యువత
సాక్షి, విజయవాడ: రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్షిప్లో ఆంధ్రా అభ్యర్థులకు అన్యాయం జరుగుతోంది. ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులను రైల్వే శాఖ యాక్ట్ అప్రెంటిస్షిప్ విద్యార్థులుగా తీసుకుంటోంది. వారికి శిక్షణ ఇచ్చి తరువాత అర్హత పరీక్ష నిర్వహించి క్లాస్–4 ఉద్యోగులుగా తీసుకుంటారు. ఈ ఉద్యోగాలను ఉత్తర భారతదేశం యువకులు తన్నుకుపోతున్నారు. ఐటీఐ అర్హత ఆధారంగా అభ్యర్థుల ఎంపిక యాక్ట్ అప్రెంటిస్ చేయడానికి రైల్వే బోర్డు జాతీయ స్థాయిలో నోటిఫికేషన్ విడుదల చేస్తోంది. గతంలో ఐటీఐ ఉత్తీర్ణులైన వారికి అర్హత పరీక్ష నిర్వహించి అప్పుడు అప్రెంటిస్కు తీసుకునేవారు. ఎంపికైన అభ్యర్థులకు వ్యాగన్ వర్క్ షాపు, కోచింగ్ అండ్ వ్యాగన్, డీజిల్ మెకానిక్ షెడ్స్, ఎలక్ట్రికల్ లోకో షెడ్ తదితర విభాగాల్లో శిక్షణ ఇచ్చేవారు. అది పూర్తయిన తరువాత పోస్టింగ్లు ఇచ్చేవారు. అయితే కొన్నేళ్ల క్రితం దీన్ని మార్పుచేసి ఐటీఐలో అభ్యర్థులు పొందిన మార్కుల ఆధారంగా ఎంపిక చేయడం ప్రారంభించారు. అప్రెంటిస్ పూర్తిచేసిన వారికి రైల్వే క్లాస్–4 ఉద్యోగాల్లో 20 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నారు. బిహార్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల్లో ఐటీఐలను ప్రోత్సహించేందుకు అక్కడి విద్యార్థులకు భారీగా మార్కులు వేస్తున్నారు. దీంతో ఆంధ్రా, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలతో పోల్చితే అక్కడి విద్యార్థులకు ఎక్కువ మార్కులు వస్తున్నాయి. దీంతో వారు యాక్ట్ అప్రెంటిస్కు ఎంపికవుతున్నారు. విజయవాడ మెకానికల్ విభాగంలో 184 మంది విద్యార్థులు శిక్షణ పొందుతుంటే 70 మంది ఉత్తర భారతదేశానికి చెందిన వారే ఉన్నారు. ఇతర విభాగాల్లోనూ ఉత్తర భారత అభ్యర్థుల శాతమే ఎక్కువగా ఉంటోంది. ఆయా రాష్ట్రాల్లోని ఐటీఐలలో శిక్షణ కోసం తెలుగు విద్యార్థులు వెళితే.. వారిని ఇబ్బందులకు గురిచేసి వెనక్కి పంపుతున్నారు. యాక్ట్ అప్రెంటిస్ పూర్తి చేసిన తరువాత కూడా ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారికే క్లాస్–4 ఉద్యోగాలు లభిస్తున్నాయి. వారంతా ఇక్కడే ఉద్యోగాలు పొంది కొంతకాలానికి తమ రాష్ట్రాలకు బదిలీ చేయించుకుని వెళ్లిపోతున్నారు. దీంతో ఇక్కడ పోస్టులు తిరిగి ఖాళీ అవుతున్నాయి. ఫలితంగా ఇక్కడ పనిచేసే సిబ్బందిపై పనిభారం పడుతోంది. నాకు ఉద్యోగం రాలేదు 2013లో విజయవాడలో యాక్ట్ అప్రెంటిస్ పూర్తి చేశాను. కానీ.. నాకు రైల్వేలో ఉద్యోగం రాలేదు. కనీసం మన రాష్ట్రంలో శిక్షణ పొందిన వారికి ఇక్కడ ఉద్యోగాలు ఇస్తే బాగుంటుంది. ఇతర రాష్ట్రాల వారే ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. – పి.దేవేంద్రనాయక్, విశాఖ శిక్షణ పూర్తి చేసుకుంటున్నాను మెకానికల్లో అప్రెంటిస్ షిప్ చేస్తున్నాను. ఇక్కడ ఇతర రాష్ట్రాల వారు ఎక్కువ మంది ఉన్నారు. కనీసం ఉద్యోగాలు ఇచ్చే విషయంలోనైనా ఏ జోన్ వారికి ఆ జోన్లోనే ఇస్తే మాలాంటి వారికి ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి. – కె.కిరణ్, అప్రెంటిస్ అభ్యర్థి -
నైపుణ్యం పెంచేందుకు శిక్షణ కార్యక్రమాలు
నాలుగేళ్ల ‘శిక్షణ’లో జపాన్తో దీటుగా భారత్ కేంద్ర మంత్రి దత్తాత్రేయ స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: యువతలోని నైపుణ్యాన్ని వెలికి తీసి ఉద్యోగావకాశాలను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం త్వరలో భారీ శిక్షణ కార్యక్రమాలు చేపట్టనుందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడించారు. మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్పేయి 90వ జన్మదినం సందర్భంగా కేంద్ర కార్మికుల బీమా సంస్థ(ఈఎస్ఐసీ) గురువారం నగరంలోని ఒక హోటల్లో ‘సుపరిపాలన’ అంశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో కేంద్ర మంత్రి దత్తాత్రేయ మాట్లాడారు. నైపుణ్యం పెంపుదల శిక్షణ విషయంలో ఇతర దేశాలతో పోల్చుకోలేని స్థితిలో భారతదేశం ఉందని ఇటీవల జరిపిన ఓ సర్వేలో తేలిందన్నారు. దేశంలో 11 వేల పారిశ్రామిక శిక్షణ సంస్థల ద్వారా 2.8లక్షల మందికి శిక్షణ లభిస్తుండగా, జర్మనీలో 30 లక్షల మందికి, జపాన్లో కోటి మందికి, చైనాలో రెండు కోట్ల మందికి శిక్షణ ఇస్తున్నారన్నారు. శిక్షణా సామర్థ్యం విషయంలో రానున్న నాలుగేళ్లలో జపాన్కు దీటుగా దేశాన్ని తీర్చిదిద్దుతామని దత్తాత్రేయ స్పష్టం చేశారు. యువతలో నైపుణ్యాల పెంపు కోసమే ఇటీవల పార్లమెంటులో అప్రెంటీస్ చట్టాన్ని సవరించామని తెలిపారు. 2042 నాటికి ప్రపంచంలోని అన్ని దేశాల్లో కలిపి మొత్తం 5.45 కోట్ల మానవ వనరుల కొరత ఏర్పడనుందని చెప్పారు. అప్పటి లోగా దేశంలో 4.90 కోట్ల మందికి శిక్షణ ఇచ్చి నైపుణ్యం గల కార్మికులుగా తీర్చిదిద్దుతామన్నారు. నైపుణ్యాల పెంపుదల కార్యక్రమం పైలట్ ప్రాజెక్టు కింద తెలంగాణ రాష్ట్రాన్ని ఎంపిక చేశామని ప్రకటించారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణలో అవినీతి లేని పారదర్శక పాలనను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని హైదరాబాద్ నగరాన్ని స్మార్టు, సేఫ్ నగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పోలీసు శాఖ డీజీ అనురాగ్ శర్మ తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి పెట్టుబడులతో వచ్చే వారికి పూర్తి రక్షణ కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ పోలీసు శాఖ డీజీ ఆర్పీ ఠాకూర్, ఇన్ఫోటెక్ చైర్మన్ మోహన్ రెడ్డి, ఈఎస్ఐ మెడికల్ కమిషనర్ ఎస్ఆర్ చౌహాన్, ఎమ్మెల్యేలు కె.లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.