breaking news
Anand cine services
-
జూబ్లీహిల్స్లో చదరపు గజం రూ.1.75కి కేటాయించారా?
సాక్షి, హైదరాబాద్: ఆనంద్ సినీ సర్వీసెస్కు 2001లో జూబ్లీహిల్స్లో చదరపు గజం రూ.1.75 పైసలకు కేటాయించడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఆస్తులకు ట్రస్టీగా ఉండాల్సిన ప్రభుత్వం కారు చౌకగా, పప్పుబెల్లాల మాదిరిగా భూములను కేటాయించిందని అసహనం వ్యక్తం చేసింది. అయితే ఆ భూమిని ఎప్పటిలోగా వినియోగించుకోవాలన్న షరతులు విధించకపోవడాన్ని తప్పుబట్టింది. నిర్ణీత గడువులోగా వినియోగించుకోకపోతే స్వాధీనం చేసుకుంటామని షరతు విధించాల్సి ఉన్నా ఎందుకు విధించలేదని ప్రశ్నించింది. ఇప్పుడు ఆ భూమిని వినియోగించుకోలేదనే కారణంతో స్వాధీనం చేసుకుంటామంటూ కొత్తగా షరతులు ఎలా పెడతారని నిలదీసింది. భూకేటాయింపులకు సంబంధించి ప్రభుత్వం కొత్తగా పాలసీ తెచ్చిందని, ఈ మేరకు పద్మాలయ, రామానాయుడు స్టూడియోలకు షరతులతో కేటాయింపులు చేశామని, ఇదే పాలసీని ఆనంద్ సినీ సర్వీసెస్కు వర్తింపజేస్తామన్న ప్రభుత్వ వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. కొత్త పాలసీని పాత భూ కేటాయింపులకు ఎలా వర్తింపజేస్తారంటూ ప్రశ్నించింది. ఈ మేరకు ఈ భూ కేటాయింపులకు సంబంధించి విధించిన షరతులను, పూర్తి వివరాలను సమర్పించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్రెడ్డితో కూడిన ధర్మాసనం శుక్రవారం ఆదేశించింది. ఖాళీగా మూడెకరాల స్థలం.. ఆనంద్ సినీ సర్వీసెస్ సంస్థకు 2001లో జూబ్లీహిల్స్లో 5 ఎకరాల స్థలాన్ని చదరపు గజం రూ.1.75 పైసలకు కేటాయించింది. అయితే ఈ భూమిలో 1.7 ఎకరాలు మాత్రమే ఆనంద్ సినీ సర్వీసెస్ వినియోగించుకుందని, ఖాళీగా ఉన్న 3.31 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంటూ 2014లో భూపరిపాలన ప్రధాన కమిషనర్ జారీచేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆనంద్ సినీ సర్వీసెస్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ను విచారించిన సింగిల్ జడ్జి.. 3.31 ఎకరాలను ఆనంద్ సినీ సర్వీసెస్కు రిజిస్ట్రేషన్ చేసివ్వాలంటూ తీర్పునిచ్చారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ను ధర్మాసనం విచారించింది. -
ఆనంద్ రీజెన్సీ అధినేత మృతిపై సీబీఐ విచారణ!
యానాం : ఆనంద్ రీజెన్సీ గ్రూప్ సంస్థలు, ఆనంద్ సినీ సర్వీసెస్ అధినేత ఎం.రవిశంకర్ ప్రసాద్ మరణంపై చెన్నైకు చెందిన సీబీఐ అధికారుల బృందం విచారణ చేపట్టినట్లు సమాచారం. సీబీఐ అధికారులు విచారణ నిమిత్తం యానాం వచ్చినట్లు తెలుస్తోంది. గత ఏడాది జూలై 7వ తేదీన రవిశంకర్ ప్రసాద్ స్థానిక బైపాస్ రోడ్లో ఉన్న ఆనంద్ రీజెన్సీ హోటల్కు వచ్చి, రాత్రి అక్కడ బస చేశారు. మరుసటి రోజు వేకువజామున యానాం-ఎదుర్లంక వారధిపై గొడుగును పట్టుకుని మార్నింగ్ వాక్కు వెళ్లినట్లు టోల్గేట్లోని సీసీ కెమెరా పుటేజిలో ఉంది. అప్పుడు అదృశ్యమైన రవిశంకర్ ప్రసాద్ జూలై 13న ఐ.పోలవరం మండలం గుత్తినదీవి శివారు గోగుల్లంక సమీపంలోని రేవులో విగతజీవిగా కనిపించారు. దీనిపై ఐ.పోలవరం పోలీసు స్టేషన్లో అనుమానాస్పద మృతి కేసు నమోదు అయ్యింది. పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల ఆదేశాల మేరకు చెన్నైకు చెందిన సీబీఐ అధికారులు ఈ కేసు విచారణ చేపట్టినట్లు సమాచారం. రవిశంకర్ ప్రసాద్ మరణానికి కారణాలపై విచారణ జరుపుతున్నారు.