వివరాలిస్తేనే వేతనం

income tax  for government employees - Sakshi

10లోగా ఉద్యోగులు, పెన్షనర్లు ఆదాయ పన్ను వివరాలు అందజేయాలి

మినహాయింపులపై స్పష్టంగా లేకుంటే సమస్యలు

పొదుపుపై తగిన రుజువులు తెలియజేయాలి

హన్మకొండ అర్బన్‌: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఈ నెల 10వ తేదీ లోగా తమ డ్రాయింగ్, డిస్బర్సింగ్‌ అధికారి ద్వారా  సంబంధిత ట్రెజరీ కార్యాలయాల్లో తమ ఆదాయం, పొదుపు వివరాలతో కూడిన ఆదాయ పన్ను వివరాలు అందజేయాలి. ఏడాదికి రూ.2.50 లక్షలకు పైగా ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరూ తమ పూర్తి వివరాలు అందజేయాల్సి ఉంటుంది. వివరాలు ఇవ్వని వారి వేతనం, పెన్షన్‌ నిలిపివేయనున్నట్లు జిల్లా ఖజానా అధికారులు చెబుతున్నారు. పాన్‌కార్డు వివరాలతో ఆదాయ పన్ను వివరాలు ఇవ్వని ఉద్యోగుల ఆదాయం నుంచి 20శాతం పన్నుగా కోత విధించనున్నట్లు వారు హెచ్చరిస్తున్నారు.  

వేతన ఆదాయంగా పరిగణించే అంశాలు..
మూల వేతనం, కరువు భత్యం, ఇంటి కిరాయి అలవెన్సు (హెచ్‌ఆర్‌ఏ), సీసీఏ, ప్రోత్సాహక ఇంక్రిమెంట్లు, తెలంగాణ ఇంక్రిమెంట్, వేతన బకాయిలు, వేతన అడ్వాన్స్, పెన్షన్, సరెండర్‌ లీవులు, నూతన పెన్షన్‌లో ప్రభుత్వ వాటా మొదలైన వాటిని వేతన ఆదాయంగా పరిగణిస్తారు. 

వేతనం నుంచి మినహాయించబడేవి..
గ్రాట్యూటీ, కమ్యూటేషన్, ఎల్‌టీసీ, జీపీఎఫ్‌ నుంచి చెల్లింపులు, రవాణా భత్యం, కన్వేయన్స్‌ అలవెన్స్, ఎడ్యుకేషన్‌ అలవెన్స్‌ తదితరాలను వేతనం నుంచి మినహాయించి లెక్కలు వేస్తారు.

తగ్గింపు లభించేవి..
 ఉద్యోగుల ఇంటి అద్దె
 అలవెన్స్‌లో వాస్తవంగా పొందిన ఇంటి అద్దె
 వేతనంలో 10 శాతం కంటే ఎక్కువగా చెల్లించిన ఇంటి అద్దె
 వేతనంలో 40శాతం

అయితే పై మూడింటిలో ఏది తక్కువైతే దానికి మినహాయిస్తారు. అదే విధంగా ఉద్యోగికి సొంత ఇల్లు ఉన్నట్‌లైతే హెచ్‌ఆర్‌ఏ మినహాయింపు వర్తించదు. ఉద్యోగి రూ.3వేల లోపు హెచ్‌ఆర్‌ఏ పొం దుతుంటే ఇంటి కిరాయికి సంబంధించి రశీదులు పొందు పరచా ల్సిన అవసరం లేదు. రూ.3వేల కన్నా ఎక్కువ ప్రతినెలా హెచ్‌ఆ ర్‌ఏ పొందుతున్న వారు ఇంటియజమానితో ఇంటిఅద్దెకు సంబం ధించి రసీదు జతచేయాల్సి ఉంటంది. అలాగే ఇంటి అద్దె ఏడాది లో రూ.లక్ష దాటితే ఇంటి యజమానికి సంబంధించిన పాన్‌కార్డు వివరాలు డ్రాయింగ్‌ అధికారికి అందజేయాల్సి ఉంటుంది. 

పెన్షనర్లకు ఇంటి అద్దె
నెలకు రూ.5వేలు
పింఛన్‌లో 10 శాతం కంటే తక్కువ(మూల పెన్షన్, డీఆర్‌)

25శాతం పెన్షన్‌ మొత్తంలో 
వీటిలో ఏది తక్కువగా ఉంటే దానిని మిమహాయిస్తారు.

సెక్షన్‌ 80 జీజీ ద్వారా పింఛన్‌దారు ఇంటి అద్దె అలవెన్స్‌లు మినహాయింపు పొందాలంటే ఇల్లు తన పేరుతోగాని, భార్య, భర్త పేరుతో గాని, మైనర్‌ పిల్లల పేరుతోగాని అవిభాజ్య హిందూ కుటుంబం పేరునగాని ఇల్లు లేదని ఫారం 10 బీఏ పేరుతో ధ్రువీకరణ పత్రం ట్రెజరీ అధికారికి అందజేయాల్సి ఉంటుంది. 

సెక్షన్‌ 80జీ ప్రకారం వివిధ రకాల పొదుపులకు సంబంధించి రూ.1.50 లక్షల వరకు మినహాయింపు పొందవచ్చు. ఇందులో జీపీఎఫ్, గ్రూప్‌ ఇన్సూరెన్స్, తెలంగాణ ప్రభుత్వ జీవిత బీమా(టీఎస్‌జీఎల్‌ఐసీ), సీపీఎస్‌ ఉద్యోగి వాటా, ఎల్‌ఐసీ చెల్లింపులు, పోస్టాఫీస్, జాతీయ బ్యాంకుల్లో ఐదేళ్లకు తగ్గకుండా చేసిన డిపాజిట్లు గృహ రుణాలపై చెల్లించిన అసలు, ఇద్దరు పిల్లలకు చెల్లిం చిన ట్యూషన్‌ ఫీజు, పీఎల్‌ఐకి చెల్లించిన ప్రీమియం, పీఎఫ్‌ చెల్లింపులు సుకన్య సమృద్ధి బ్యాంకు ఖాతాలో చేసిన పొదుపు, అనుమతించిన మ్యూచువల్‌ ఫండ్స్, ఇఫ్రాస్ట్రక్చర్‌ బాండ్‌.

సెక్షన్‌ 80ఈ
ఈ సెక్షన్‌ ప్రకారం తన పేరుతో భార్య, భర్త పేరుతో, పిల్లల పేరుతో ఉన్న విద్యా రుణంపై చెల్లించిన వడ్డీ, లేదా మొదటి ఏడేళ్లుచెల్లించిన వడ్డీ మినహాయింపు పొందవచ్చు.

సెక్షన్‌ 80 ఈఈ 
ఈ సెక్షన్‌ ప్రకారం 01–04–1999 తర్వాత గృహ నిర్మాణానికి తీసుకున్న అప్పుపై రూ.2 లక్షల వరకు మినహాయింపు లభిస్తుంది. అదే విధంగా మొదటిసారి ఇంటి నిర్మాణానికి తీసుకున్న అప్పులో చెల్లించిన వడ్డీ రూ.50 వేలకు మించకుండా మినహాయింపు పొందవచ్చు. దాని కోసం రూ.35 లక్షలకు మించకుండా అప్పు... రూ.50 లక్షలకు మించకుండా ఇంటి విలువ ఉండాలి. అందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని సంబంధిత బ్యాంకు అధికారి ద్వారా పొంది బిల్లులకు జతచేయాలి. ఈ రుణం 01–04–2016 నుంచి 31–03–2017 మధ్య పొందినదై ఉండాలి.

సెక్షన్‌ 80 డీ
ఈ సెక్షన్‌ ప్రకారం ఆరోగ్యబీమా ఖర్చుల కింద భార్య, భర్త, తమ పిల్లలు, తమ పై ఆధారపడిన తల్లిదండ్రుల కోసం చెల్లించిన ఆరోగ్య బీమాకు సంబంధించి రూ.25 వేల వరకు మినహాయింపు పొందవచ్చు. తల్లిదండ్రులు 80 ఏళ్ల వయస్సుకు మించిన వారైతే మినహాయింపు 30వేల వరకు లభిస్తుంది.

సెక్షన్‌ 80 డీడీ
ఈ సెక్షన్‌ ప్రకారం వికలాంగులైన ఆధారితులపై చేసిన ఖర్చుకు సంబంధించి రూ. 75 వేలకు మిహాయింపు పొంవచ్చు.

వెరీ సీనియర్‌ సిటిజన్స్‌పై చేసిన చేసిన ఖర్చుకు రూ.1.25 లక్ష ల వరకు మినహాయింపు పొందవచ్చు. దీనికోసం ప్రభుత్వం తో గుర్తింపు పొందిన, గుర్తించ బడిన కేంద్రం నుంచి మూడేళ్ల లోపు పొందిన మెడికల్‌ సర్టిఫికెట్‌ బిల్లులతో జతచేయాలి. 

సెక్షన్‌ 80 డీడీబీ
కింది ఉద్యోగి తనపై ఆధారపడిన వ్యక్తులపై చేసే ఖర్చులకు సంబంధించి మినహాయింపును డ్రాయింగ్‌ అధికారి, ట్రెజరీ అధికారి ద్వారా కాకుండా తన రిటర్న్‌ దాఖలు చేసిన ఆదాయపన్ను శాఖ ద్వారా తిరిగి పొందాల్సి వుంటుంది. అలాగే 80జీ ద్వారా గుర్తింపు పొందిన స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చిన విరాళాలు ఉద్యోగులు, పెన్షనర్లు మినహాయింపు పొందవచ్చు. 

సెక్షన్‌ 80యూ
ఈ సెక్షన్‌ ప్రకారం ఉద్యోగికి అంగవైకల్యం ఉంటే రూ.75 వేల వరకు మినహాయింపు పొంవచ్చు. అదే విధంగా  80శాతం కన్నా ఎక్కువ వైకల్యం ఉన్నట్లయితే రూ.లక్ష వరకు మినహాయింపు పొంవచ్చు. అందుకోసం తాజాగా పొందిన వైకల్య నిర్ధారణ పత్రం అందజేయాలి.

కేంద్ర ప్రభుత్వ ఫైనాన్స్‌ చట్టం–2017 ప్రకారం, ఆదాయ పన్ను సెక్షన్‌ 87ఏ ప్రకారం 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.3.50 లక్షలకు మించని ఆదాయ వర్గాలకు రూ. 2500 రిబేటు లభిస్తుంది.

ఆదాయ పన్ను చట్టం 1961, సెక్షన్‌ 80 టీటీఏ ప్రకారం సేవింగ్‌ బ్యాంకు ఖాతాలపై కానీ, కో–ఆపరేటివ్‌ సొసైటీల్లో కానీ, పోస్టాఫీసుల్లోని సేవింగ్‌ ఖాతాలపై వచ్చిన ఆదాయంలో రూ.10 వేల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. అంతకన్నా ఎక్కువగా వచ్చిన వడ్డీని ఆదాయంగా చూపాల్సి ఉంటుంది. 
సెక్షన్‌80 సీసీడీ(1బీ)

ఈ సెక్షన్‌ ప్రకారం జాతీయ పెన్షన్‌ పథకం యొక్క ఉద్యోగి చందాను ఆదనంగా రూ.50వేల వరకు మినహాయింపు పొందవచ్చు. ఆదాయ పన్ను వివరాలకు సంబంధించి ఉద్యోగులు, పెన్షనర్లు తప్పనిసరిగా తమ పాన్‌ కార్డు వివరాలు అందజేయాల్సి ఉంటుం ది. అందజేయని వారికి ఆదాయ పన్ను శాఖ వారు ఇచ్చే ఫారం–16 ఇవ్వబడదు. అలాగే పొదుపునకు సంబంధించి పూర్తి వివరాలు అందజేయాలి. లేని పక్షంలో మొత్తంగా ఆదాయం కింద లెక్కించబడుతుంది. సరైన ఆధారాలు లేని, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటిని తిరస్కరిస్తారు.

ఆదాయ పన్ను శ్లాబు రేట్ల వివరాలు(60 ఏళ్ల లోపు వారికి)
మొత్తం ఆదాయం                         పన్ను వివరాలు
రూ.2.50 లక్షల లోపు                             లేదు
రూ.2.50 లక్షల నుంచి రూ.5లక్షల వరకు    5 శాతం
రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు     20 శాతం
రూ.10లక్షల నుంచి ఆపైన ఆదాయానికి     30 శాతం 

60 ఏళ్లు పైబడినా, 80 సంవ్సతరాల లోపు వారికి..
రూ.3 లక్షల లోపు                              లేదు
రూ.3 లక్షల నుంచి 5 లక్షల వరకు    5 శాతం
రూ.5 లక్షల నుంచి 10 లక్షల వరకు    20 శాతం
రూ.10 లక్షలు నుంచి ఆపైన ఆదాయానికి     30 శాతం

80 ఏళ్ల వయస్సు పైబడిన వారికి
రూ.5 లక్షల లోపు                             లేదు
రూ.5 లక్షల నుంచి 10లక్షల లోపు    20 శాతం
రూ.10 లక్షలు ఆపైన ఆదాయానికి    30 శాతం

ఈనెల 10లోగా అందజేయాలి
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో సుమారు 18వేల మందికి పైగా పెన్షనర్లు, 15వేల మంది వరకు ఉద్యోగులు ఉన్నారు. వీరందరూ పూర్తి వివరాలతో ట్రెజరీ కార్యాలయంలో తమ డీడీఓల ద్వారా ఆదాయ పన్ను వివరాలు అందజేయాలి. ముఖ్యంగా పెన్షనర్లు రూ.2.50 లక్షల సంవత్సర ఆదాయం దాటిన వారు ఈనెల 10లోగా అందజేయకుంటే వారికి పెన్షన్‌ నిలిపి వేసే అవకాశం ఉంటుంది. పూర్తి వివరాలు ఉద్యోగులు తమ డీడీఓల ద్వారా, పెన్షనర్లు నేరుగా ట్రెజరీల్లో అందజేయాలి.
– గుజ్జు రాజు, ఖజానా, లెక్కల అధికారి, వరంగల్‌ అర్బన్‌ జిల్లా  

Read latest Warangal News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top