నిల్వ నీటిని తీసివేయాలి | water storage removing from cotton crop | Sakshi
Sakshi News home page

నిల్వ నీటిని తీసివేయాలి

Aug 29 2014 12:00 AM | Updated on Sep 2 2017 12:35 PM

ఇటీవల కురుస్తున్న వర్షాలతో పత్తి పొలాల్లో వర్షపు నీరు నిల్వ ఉండి పంటను దెబ్బ తీస్తుందని ధారూరు ఏడీఏ చంద్రశేఖర్ అన్నారు.

ధారూరు: ఇటీవల కురుస్తున్న వర్షాలతో పత్తి పొలాల్లో వర్షపు నీరు నిల్వ ఉండి పంటను దెబ్బ తీస్తుందని ధారూరు ఏడీఏ చంద్రశేఖర్ అన్నారు. గురువారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ పత్తి పొలాల్లో నిల్వ నీటిని వెంటనే తీసివేయాలని సూచించారు. నీరు నిల్వ ఉంటే పత్తికి తెగుళ్లు సోకుతాయని చెప్పారు. ఈ వర్షాల వల్ల ప్యారావిల్ట్, వేరుకుళ్లు తెగుళ్లు వ్యాపిస్తాయని పేర్కొన్నారు. ఈ తెగుళ్ల నివారణకు కార్బండిజం, మ్యాంకోజెబ్ కలిపిన పౌడర్‌ను (స్టాఫ్ లేదా స్ప్రింట్) లీటరు నీటికి 3 గ్రాముల చొప్పున కలిపి పంటపై పిచికారీ చేయాలని సూచించారు. ముదురు ఆకులు పసుపు, ఎరుపు రంగుకు మారితే డీఏపీని లీటరు నీటికి 10 గ్రాములు లేదా యూరియాను లీటరు నీటికి 10 గ్రాములు కలిపి పంటపై పిచికారీ చేయాలన్నారు.
 
 మొక్కజొన్న పంట బీమాకు ఈ నెల 30వ తేదీ ఆఖరు
 ఈ సంవత్సరం ఖరీఫ్‌లో బ్యాంకులు పంట రుణాలు ఇవ్వకపోవడం వల్ల బ్యాంకుల తరఫున బీమా చేయలేరని ఏడీఏ చంద్రశేఖర్ తెలిపారు.

 రైతులంతా గ్రామం యూనిట్‌గా చేసుకుని మొక్కజొన్న పంటకు బీమా చేయించుకోవడానికి ప్రతిపాదన ఫారాన్ని వీఆర్‌ఓ సంతకంతో నేరుగా బ్యాంకులో గానీ పీఏసీఎస్‌లో చెల్లించాలని సూచించారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement