
సన్ ఫార్మా చేతికి జీఎస్కే ఓపియేట్స్ వ్యాపారం
గ్లాక్సోస్మిత్లైన్కు చెందిన ఆస్ట్రేలియాలోని ఓపియేట్స్(మత్తుమందుల) వ్యాపారాన్ని సన్ఫార్మా కొనుగోలు చేసింది.
న్యూఢిల్లీ: గ్లాక్సోస్మిత్లైన్కు చెందిన ఆస్ట్రేలియాలోని ఓపియేట్స్(మత్తుమందుల) వ్యాపారాన్ని సన్ఫార్మా కొనుగోలు చేసింది. ఓపియేట్స్ వ్యాపారంలో మరింత వృద్ధి సాధించే వ్యూహాంలో భాగంగా జీఎస్కే వ్యాపారాన్ని కొనుగోలు చేస్తున్నామని సన్ ఫార్మా పేర్కొంది. ఎంతకు కొనుగోలు చేసిన వివరాలను మాత్రం కంపెనీ వెల్లడించలేదు. మధ్య స్థాయి నుంచి తీవ్రమైన నొప్పుల నివారణ ఔషధాలను జీఎస్కే ఓపియేట్స్ రూపొందిస్తుంది. నల్లమందు నుంచి ఉత్పన్నమయ్యే ముడి పదార్ధాల ద్వారా వీటిని తయారు చేస్తారు.
ఈ డీల్లో భాగంగా లాట్రోబ్(టాస్మానియా), పోర్ట్ ఫెయిరీ(విక్టోరియా)ల్లోని ప్లాంట్లను, తయారైన ఔషధాల నిల్వలతో సహా జీఎస్కే కంపెనీ సన్ఫార్మాకు బదిలీ చేస్తుంది. ఈ రెండు ప్లాంట్లలోని ఉద్యోగులందరికీ ఉద్యోగాలు కల్పిస్తామని సన్ ఫార్మా వెల్లడించింది. ఈ ఏడాది ఆగస్టుకల్లా ఈ డీల్ పూర్తవతుందని అంచనా. ఈ కొనుగోలు నేపథ్యంలో సన్ ఫార్మా షేర్ ఎన్ఎస్ఈలో 2 శాతం లాభంతో రూ.943 వద్ద ముగిసింది.