బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ సభలకు వస్తున్న జన సందోహాన్ని సర్కస్ ప్రదర్శనలకు వెళ్లే జనంతో పోల్చుతూ కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత వెంకయ్య నాయుడు ఆదివారం తీవ్రంగా స్పందించారు.
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ సభలకు వస్తున్న జన సందోహాన్ని సర్కస్ ప్రదర్శనలకు వెళ్లే జనంతో పోల్చుతూ కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత వెంకయ్య నాయుడు ఆదివారం తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు వారి అహంకార ధోరణికి నిదర్శనంగా నిలుస్తున్నాయని విమర్శించారు. మోడీ సభలకు జనం వస్తుండటంపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి రేణుకా చౌదరి శనివారం మాట్లాడుతూ, సర్కస్ ప్రదర్శనలకూ జనం గుంపులుగా వస్తారని వ్యాఖ్యానించారు.
ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు మానుకోవాలని వెంకయ్య హితవు పలికారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, మోడీకి పెరుగుతున్న ప్రజాదరణను చూసి కాంగ్రెస్ నాయకత్వానికి ఏం చేయాలో పాలుపోవడం లేదన్నారు. మోడీ లేవనెత్తుతున్న అంశాలకు రాజకీయంగా సమాధానం చెప్పే సత్తా కాంగ్రెస్కు లేదన్నారు. మోడీ సభలకు వస్తున్న జనంపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు నిజానికి ప్రజల వివేచనను అవమానించేలా ఉన్నాయన్నారు.