‘స్థానిక’ రిజర్వేషన్లు ఖరారు | ZPTC And MPTC Reservations Finalised Rangareddy | Sakshi
Sakshi News home page

‘స్థానిక’ రిజర్వేషన్లు ఖరారు

Mar 6 2019 9:47 AM | Updated on Mar 6 2019 9:47 AM

ZPTC And MPTC Reservations Finalised Rangareddy - Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా: స్థానిక సంస్థలకు రిజర్వేషన్లు ఖరార య్యాయి. ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు కేటాయిస్తూ అధికారులు మంగళవారం నోటిఫికేషన్‌ విడుదల చేశారు. అయితే, జెడ్పీ చైర్మన్‌ స్థానానికి ఇంకా రిజర్వేషన్‌ ఖరారు కాలేదు. ఇది రాష్ట్ర స్థాయిలో ప్రకటించాల్సి ఉండడంతో మరికొంత సమయం పట్టవచ్చని జిల్లా అధికారులు పేర్కొంటున్నారు. ఎస్సీ, ఎస్టీల జనాభా, బీసీ ఓటర్ల సంఖ్యను ప్రామాణికంగా తీసుకుని రిజర్వేషన్లు కేటాయించారు. కొత్త జిల్లాల ప్రాతిపదికన 2011 నాటి జనాభాను పరిగణనలోకి తీసుకున్నారు. ఎంపీపీలకు రాష్ట్రం, జెడ్పీటీసీలకు జిల్లా, ఎంపీటీసీలకు మండలం జనాభా యూనిట్‌గా తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. 

బీసీలకు రెండు ఎంపీపీలే.. 
జిల్లాలో 21 ఎంపీపీలకుగాను 10 స్థానాలకు రిజర్వేషన్లు కేటాయించగా, మిగతావి అన్‌ రిజర్వ్‌డ్‌ కోటాలోకి వెళ్లాయి. రిజర్వ్‌ చేసిన స్థానాల్లో ఎస్టీకి మూడు, ఎస్సీకి ఐదు, బీసీలకు రెండు    స్థానాలు దక్కాయి. మిగిలిన 11 అన్‌రిజర్‌డ్డŠవ్‌ స్థానాల్లో ఐదు మహిళల ఖాతాల్లోకి వెళ్లాయి. మొత్తం ఎంపీపీల్లో 9 స్త్రీలకు దక్కాయి.

ఎస్సీలకు రెండు జెడ్పీటీసీలు 
మొత్తం 21 జెడ్పీటీసీల్లో 10 స్థానాలకు రిజర్వేష్లను వర్తింపజేశారు. వీటిలో ఎస్టీలకు రెండు, ఎస్సీలకు, బీసీలకు నాలుగు చొప్పున దక్కాయి. అన్‌రిజర్‌డ్డŠవ్‌ 11 స్థానాల్లో ఐదు మహిళా కోటా కింద వెళ్లాయి. మొత్తం జెడ్పీటీసీల్లో 10 స్థానాలు మహిళలకు దక్కాయి.

మహిళలకు 123 ఎంపీటీసీలు 
స్థానిక సంస్థల్లో మహిళలకు తప్పనిసరిగా 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉంది. ఈ మేరకు మొత్తం 257 ఎంపీటీసీల్లో 123 మహిళలకు దక్కాయి. ఒక్కో మండలంలో కేటగిరీల వారీగా ఎంపీటీసీలు బేసి సంఖ్యలో ఉండటంతో 50 శాతం చేయడం సాధ్యం కాదు. 50 శాతం చేయగా వచ్చిన ఫలితాన్ని.. తదుపరి అంకెకు రౌండప్‌ చేస్తారు. ఇందులో ఎక్కువ సంఖ్యను మహిళలకు, తక్కువ సంఖ్యను జనరల్‌గా పరిగణిస్తారు. మహిళా కోటాకు ఈ సూత్రాన్ని అనుసరిస్తారని అధికారులు పేర్కొంటున్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement