కన్నెపల్లిలో మళ్లీ రెండు మోటార్లు షురూ

Two Pumps starts At Kannepalli Pump House - Sakshi

నేడు రెండో మోటార్‌కు వెట్‌రన్‌ 

కాళేశ్వరం : జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌లో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కన్నెపల్లి పంపుహౌస్‌లో మళ్లీ 2 మోటార్లను  అధికారులు ప్రారంభించారు. 4 రోజులుగా ఆటోమోడ్‌ పద్ధతిలోకి మార్చడానికి మోటార్లకు విరామం ఇచ్చిన విషయం తెలిసిందే. ఆదివారం 3, 4 నంబర్ల మోటార్లు డెలివరీ సిస్టంలో నీటిని ఎత్తిపోశాయి.  కన్నెపల్లిలో 2, 7, 8 మోటార్లకు కూడా వెట్‌రన్‌ నిర్వహిస్తామని ఇంజనీరింగ్‌ అధికారులు తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీలోని 85 గేట్ల ను మూసివేశారు. 4 రోజుల క్రితం వరద ఉధృతి పెరగడంతో ఇంజనీరింగ్‌ అధికారులు 8 గేట్లు ఎత్తారు. వరద ఉధృతి తగ్గుతుండడంతో రెండేసి చొప్పున గేట్లు మూస్తూ వచ్చారు.  బ్యారేజీ వద్ద 10 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 7 టీఎంసీలు నిల్వ ఉంది. అన్నారం బ్యారేజీలో 4 రోజులుగా మోటార్లు నిలిపివేశారు. ఆదివారం కన్నెపల్లిలో 2 మోటార్లు నడపడంతో మళ్లీ గ్రావిటీ కాల్వ నుంచి నీటిని తరలించారు. దీంతో అన్నారం బ్యారేజీలోకి నీరు చేరుతోంది. ప్రస్తుతం బ్యారేజీలో 5.8 టీఎంసీల నీరునిల్వ ఉంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top