పీహెచ్‌డీ ప్రవేశాలకు కామన్‌ గైడ్‌లైన్స్‌! | sakshi effect : comman guidelines for phd | Sakshi
Sakshi News home page

పీహెచ్‌డీ ప్రవేశాలకు కామన్‌ గైడ్‌లైన్స్‌!

Jul 20 2017 2:29 AM | Updated on Sep 5 2017 4:24 PM

రాష్ట్రంలో డాక్టర్‌ ఆఫ్‌ ఫిలాసఫీ(పీహెచ్‌డీ) ప్రవేశాల్లో కామన్‌ గైడ్‌లైన్స్‌ అమలు చేసేలా ఉన్నత విద్యా మండలి చర్యలు తీసుకుంటోంది.

రూపకల్పనకు ఉన్నత విద్యామండలి కసరత్తు
సాక్షి, హైదరాబాద్‌:

రాష్ట్రంలో డాక్టర్‌ ఆఫ్‌ ఫిలాసఫీ(పీహెచ్‌డీ) ప్రవేశాల్లో కామన్‌ గైడ్‌లైన్స్‌ అమలు చేసేలా ఉన్నత విద్యా మండలి చర్యలు తీసుకుంటోంది. యూనివర్సిటీల్లో నాణ్యమైన పరిశోధనలు జరిగే దిశగా కసరత్తు చేస్తోంది. ఒక్కో యూనివర్సి టీలో ఒక్కో విధంగా కటాఫ్‌ మార్కులు ఉండడం, స్థానిక ఒత్తిళ్ల కారణంగా వాటిల్లో మార్పు చేయడం వంటి చర్యలకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించింది. ‘పరిశోధనలు అంతంతే..’శీర్షికన ‘సాక్షి’లో బుధవారం ప్రచురితమైన కథనంపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పందించారు. యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్లతో కూడిన ఉన్నస్థాయి కమిటీతో సమీక్ష నిర్వహించారు. నాణ్యమైన పరిశోధనలకు అవసరమైన మార్గదర్శకాలు రూపొందిం చాలని నిర్ణయించారు. వివిధ రాష్ట్రాల్లో పరిశోధనలు జరుతున్న తీరు, ఈ అంశాల్లో తెలంగాణ వెనుకబడడానికి దారితీసిన పరిస్థితులపై చర్చించారు. యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ) తాజాగా జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం పీహెచ్‌ డీల్లో ప్రవేశాలు చేపట్టాలన్న నిర్ణయానికి వచ్చారు. వాటి ప్రకారం నేషనల్‌ ఎలిజిబి లిటీ టెస్టు (నెట్‌) లేదా స్టేట్‌ ఎలిజిబిలిటీ టెస్టులో (సెట్‌) అర్హత సాధించినవారే పీహెచ్‌డీ చేసేందుకు అర్హులు.

వాటిని పక్కాగా అమలు చేయడంతోపాటు నేషనల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ అక్రెడిటేషన్‌ కౌన్సిల్‌ (న్యాక్‌) ఏ గ్రేడ్‌ ఉన్న యూనివర్సిటీలు మాత్రమే పీహెచ్‌డీలో ప్రవేశాలు చేపట్టేందుకు, ప్రవేశ పరీక్ష నిర్వహించేందుకు అర్హులన్న యూజీసీ నిబంధనలను అమలు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏ ఒక్క యూనివర్సిటీకి కూడా న్యాక్‌ ఏ గ్రేడ్‌ లేదు. ఏ గ్రేడ్‌ వచ్చిన తర్వాతే పీహెచ్‌డీ ప్రవేశాలకు నోటిఫికేషన్లను జారీ చేసే అవకాశం ఉంది. అయితే ఈలోగా కామన్‌ గైడ్‌లైన్స్‌ రూపొందించడం ద్వారా భవిష్యత్తులో పక్కాగా పీహెచ్‌డీ ప్రవేశాలు చేపట్టవచ్చని భావిస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి వెల్లడించారు. భవిష్యత్తులో యూజీసీ నిర్వహించే నెట్‌ మాత్రమే అమల్లో ఉండే అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడు కాకపోయినా భవిష్యత్తులో మాత్రం రాష్ట్రాలు నిర్వహించే సెట్‌లకు మంగళం పాడే అవకాశం ఉందని, ఈ దిశగా యూజీసీ చర్యలు చేపడుతోందన్న ఓ ఉన్నతాధికారి వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement