ఎందరో ‘రుక్సా’లు..! | Police Arrested Arab Shakes In Old City Over Illegal Marriages | Sakshi
Sakshi News home page

ఎందరో ‘రుక్సా’లు..!

Sep 21 2017 2:36 AM | Updated on Aug 20 2018 3:58 PM

ఎందరో ‘రుక్సా’లు..! - Sakshi

ఎందరో ‘రుక్సా’లు..!

ఒమన్‌ షేక్‌ కామవాంఛకు బలై, పాతబస్తీలో వెలుగులోకి వచ్చిన మైనర్‌ బాలిక రుక్సా లాంటి వారు మరెందరో ఉన్నారు.

► పాతబస్తీలో ఇప్పటికీ కొనసాగుతున్న గల్ఫ్‌ షేక్‌ల ఆగడాలు
► ఏజెంట్ల సాయంతో బాలికలతో నిఖా యత్నాలు
► భారీ నెట్‌వర్క్‌ గుట్టురట్టు చేసిన సౌత్‌జోన్‌ పోలీసులు
► ముంబై చీఫ్‌ ఖాజీ సహా 20 మంది నిందితుల అరెస్టు
► రుక్సాను వివాహమాడిన ఒమన్‌ షేక్‌ కోసం వేట
► ఆమెను భారత్‌కు రప్పించేందుకు దౌత్యపరమైన చర్యలు


సాక్షి, హైదరాబాద్‌: ఒమన్‌ షేక్‌ కామవాంఛకు బలై, పాతబస్తీలో వెలుగులోకి వచ్చిన మైనర్‌ బాలిక రుక్సా లాంటి వారు మరెందరో ఉన్నారు. రుక్సా కేసు దర్యాప్తులో భాగంగా మరికొందరు ఒమన్, ఖతర్‌ షేక్‌ల వ్యవహారాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. పాతబస్తీకి చెందిన 12 మంది బాలికలు షేక్‌ల విషవలయంలో చిక్కకోకుండా దక్షిణ మండల పోలీసులు కాపాడగలిగారు. ఈ కేసులకు సంబంధించి మొత్తం 20 మంది నిందితుల్ని అరెస్టు చేశామని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ ఎం.మహేందర్‌రెడ్డి బుధవారం వెల్లడించారు. దక్షిణ మండల డీసీపీ వి.సత్యనారాయణతో కలసి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. రుక్సాను భారత్‌కు రప్పించడానికి దౌత్యపరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మైనర్‌ను వివాహం చేసుకుని, ఒమన్‌కు తరలించి అఘాయిత్యాలకు ప్రోత్సహించిన ఒమన్‌ షేక్‌ అహ్మద్‌ అబ్దుల్లా అమూర్‌ అల్‌ రహ్బీ(61)ని అరెస్టు చేసి భారత్‌కు తీసుకువచ్చే చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

రుక్సాను రక్షించేందుకు దౌత్య చర్యలు
ఒమన్‌ వెళ్లిన రుక్సా అక్కడ నరకాన్ని చవి చూసింది. షేక్‌తో పాటు అతడి బంధువులు ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ విషయాలను ఆమె ఫోన్‌ ద్వారా కుటుంబీ కులకు తెలపడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లి సైదా ఉన్నిస్సా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఫలక్‌నుమ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దక్షిణ మండల డీసీపీ సత్యనారాయణ రుక్సాను భారత్‌ రప్పించడానికి దౌత్యప రమైన చర్యలు తీసుకుంటూనే నగరంలో వేళ్లూనుకున్న షేక్‌ల పెళ్ళిళ్ళ వ్యవహారాలకు చెక్‌ పెట్టడానికి మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. రంగంలోకి దిగిన అధికారులు దళారులు, వారికి సహకరిస్తున్న వ్యక్తులపై ఆరా తీశారు.

ఇంతలోనే బయటకొచ్చిన మరో బాలిక
ఈలోగా ఒమన్, ఖతర్‌ దేశాల నుంచి వచ్చిన ఎనిమిది మంది షేక్‌లు కొందరు దళారుల సాయంతో పాతబస్తీలోని పేదింటి మైనర్లకు ఎరవేస్తున్నారు. 60 నుంచి 80 ఏళ్ళ మధ్య వయస్కులైన వీరం తా చాంద్రాయణగుట్ట పరిధిలోని ఎఫ్‌కే ప్లాజా, గులాబ్‌ రెసిడెన్సీ, ఎంజే ఆన్స్‌ గెస్ట్‌హౌస్, విన్‌సిటీ డెవలపర్స్‌ గెస్ట్‌హౌస్‌ ల్లో బస చేశారు. పాతబస్తీకి చెందిన కొందరు మైనర్లను బ్రోకర్లు వీరి వద్దకు తీసుకువెళ్ళి చూపించి రావడం ప్రారం భించారు. అలా వెళ్ళిన వారిలో ఓ బాలిక ఎదురు తిరిగింది. హోటల్స్, లాడ్జీల కేం ద్రంగా జరుగుతున్న ఈ చీకటి వ్యవహా రాలపై పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో రంగంలో దిగిన ప్రత్యేక బృందాలు వరుసదాడులు చేసి మొత్తం 20 మందిని అరెస్టు చేశాయి. వీరిలో రుక్సా, బాలిక ఇచ్చిన సమాచారంతో నమోదైన కేసుల్లో నిందితులుగా ఉన్న షేక్‌లు, ఖాజీలు, దళారులు, లాడ్జి యజమానానులు ఉన్నా రు. వీరిలో కొందరు నిఖాలు చేసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికారు.

అరెస్ట్‌ అయ్యింది వీరే
అల్‌ మయహి హబీబ్‌ అలీ ఇస్సా (మైనర్‌తో నిఖా చేసుకుంటూ చిక్కాడు), అల్‌ సాల్హీ తబ్లీ హమేదీ అలీ, అల్‌ ఉబాయ్‌దాని జుమ షినూన్, సులాయ్‌ మాన్, అల్‌ సాలేహీ నసీర్‌ ఖలీఫా హమీద్, అల్‌ ఖుసిమీ హసన్‌ ముజామిల్‌ మహ్మద్, (వీరంతా ఒమన్‌కు చెందిన షేక్‌లు), ఒమర్‌ మహ్మద్‌ సిరాజ్‌ అబ్దుల్‌ రెహ్మాన్, హమద్‌ జబీర్‌ ఓ అల్‌ కువారీ, సఫిల్దీన్‌ మహ్మద్‌ మొహమ్మద్నూర్‌ సాలే హ్‌ (వీరంతాఖతర్‌కు చెందిన షేక్‌లు), మహ్మద్‌ అసిఫ్, మహ్మద్‌ హబీబ్‌ ఖాన్‌ (దళారులు), ఖాజీ హబీబ్‌ అలీ (రుక్సా నిఖా చేశాడు), అహ్మద్‌(రుక్సా కేసులో దళారి, అక్రమ వీసా ఏజెంట్‌), సికిందర్‌ ఖాన్‌ (రుక్సా మేనమామ), గౌసియా బేగం(రుక్సా మేనత్త), ఫరీద్‌(ముంబైకి చెందిన చీఫ్‌ ఖాజీ), మునావర్‌ అలీ (చీఫ్‌ ఖాజీ సహాయకుడు). వీరితో పాటు ఒమ న్, ఖతర్‌ షేక్‌లను పరోక్షంగా ప్రోత్స హించిన నలుగురు లాడ్జి యజమానులు అరెస్టు అయ్యారు.

రుక్సా కేసు తీగలాగితే కదిలిన డొంక
పాతబస్తీలోని నవాబ్‌సాబ్‌కుంట ప్రాంతంలో గత నెల 17న వెలుగులోకి వచ్చిన బాలిక రుక్సా ఉదంతం సంచలనం సృష్టించింది. ఒమన్‌కు చెందిన షేక్‌ రహ్బీ పాతబస్తీకి చెందిన బ్రోకర్లు అహ్మద్, సికిందర్‌ ఖాన్‌ (రుక్సా మేనమామ), గౌసియా బేగం(రుక్సా మేనత్త) సాయంతో రుక్సా తల్లిదండ్రులకు ఎరవేసి మే 16న ఆమెను వివాహం చేసుకున్నాడు. వారం పాటు పాతబస్తీలోని ఓ హోటల్‌లో బస చేసిన షేక్‌ ఇక్కడే రుక్సాపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆపై అతడు స్వదేశానికి వెళ్ళి రుక్సా పేరుతో వీసా పంపించాడు. రుక్సా మైనర్‌ కావడంతో నకిలీ పత్రాలు సృష్టించడం ద్వారా ముంబైకి చెందిన చీఫ్‌ ఖాజీ ఫరీద్‌ అహ్మద్‌ ఖాన్, ఇతడి సహాయకుడైన మరో ఖాజీ మునావర్‌ అలీ అక్కడే వివాహమైనట్లు నిఖానామా సృష్టించి.. రుక్సాకు వీసా సంపాదించి ఒమన్‌కు పంపేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement