ఆధార్‌ అవస్థలు

Peoples Problems With Aadhar Card Link - Sakshi

వికారాబాద్‌ అర్బన్‌: కొత్తగా ఆధార్‌ కార్డు పొందాలన్నా, ఉన్న దాంట్లో మార్పులు, చేర్పులు చేసుకోవాలన్నా ఇబ్బందులు తప్పడం లేదు. ప్రస్తుతం ఇంటర్మీడియెట్‌ ముగిసి డిగ్రీలో చేరాలనుకునే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరు దోస్త్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దోస్త్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌ చేసుకోవాలి. ఇందుకోసం విద్యార్థి ఆధార్‌ నంబర్‌కు ఫోన్‌ నంబర్‌ లింక్‌ తప్పకుండా ఉండాలి. చాలా మంది గ్రామీణ విద్యార్థుల ఆధార్‌ నంబర్‌కు ఫోన్‌ నంబర్‌ లింక్‌ లేకపోవడంతో దరఖాస్తు చేసుకోవడంలో వెనకబడుతున్నారు. అంతే కాకుండా ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న ప్రతీ పథకానికి ఆధార్‌ లింక్‌ తప్పని సరి చేయడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఆధార్‌ కార్డు ప్రవేశపెట్టిన మొదట్లో తీసుకున్న చాలా మందికి వారి ఫోన్‌ నంబర్‌ ఆధార్‌ కార్డుకు లింక్‌ లేదు. ఓటీపీ నంబర్‌ తెలుసుకునేందుకు ఆధార్‌ కేంద్రం నిర్వాహకులే వారి నంబర్లు ఇచ్చి అప్పటి పూర్తిగా పని ముగించారు.

ఇటీవల బ్యాంకుల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో తప్పకుండా సొంత ఫోన్‌ నంబర్‌ ఆధార్‌ లింకు ఉండాలని షరతు పెడుతున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాలకు చెందిన చాలా మంది  మార్పుల చేర్పుల కోసం ఆధార్‌ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. అవస్థలు పడి మార్పులు, చేర్పుల దరఖాస్తులు నింపి ఇచ్చినా సకాలంలో మార్పులు జరగడం లేదు. కొత్తగా కార్డు తీసుకోవాలనుకునే వారి అవస్థలు వర్ణనాతీతం. ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా రుణాలు పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలన్నా ఆధార్‌ కార్డుకు ఫోన్‌ నెంబర్‌ లింక్‌ అడుగుతున్నారు. ఇటీవల పోలీసులు రోడ్డుపై వాహనదారులను ఆపి తగిన పత్రాలు లేకపోయినా, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ చేస్తున్నా, హెల్మెట్‌ లేకున్నా కేసులు నమోదు చేస్తున్నారు. ఈ కేసులకు కూడా ఆధార్‌ కార్డు లింక్‌ అడుగుతున్నారు. ఇలా ప్రతిపనికి ఆధార్‌ అనుసంధానం తప్పనిసరిగా మారింది. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలో ఒకేఒక ఆధార్‌ కేంద్రం ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆధార్‌ కార్డులో మార్పులు చేసుకోవాలన్నా, కొత్త కార్డు తీసుకోవాలన్నా వారం రోజుల సమయం పడుతోంది. ఆధార్‌ కార్డు విషయంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకొని ప్రతి నియోజకవర్గానికి ఒక సెంటర్‌ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
 
24న నేతన్నల సమస్యలపై చలో ఢిల్లీ 
హిమాయత్‌నగర్‌: నేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాటలు నీటి మూటలుగా మిగిలిపోతున్నాయని జాతీయ చేనేత నాయకులు దాసు సురేష్‌ ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వాగ్దానాలు చేసిన నాయకులు ఎన్నికల అనంతరం ఎవరూ తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకునే నాథుడు కరువైయ్యాడని వాపోయారు. ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన హామీలపై తమ వాణి వినిపించేందుకు ఈ నెల 24న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చెప్పారు. బుధవారం హిమాయత్‌నగర్‌లోని బీసీ సాధికారిత సంస్థ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నేతన్నల కోసం తెలంగాణ ప్రభుత్వం రెండు దఫాలుగా బడ్జెట్లో ప్రవేశపెట్టిన రూ.1,283 కోట్ల నిధులను ఏ మేరకు ఖర్చు పెట్టారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top