
నాకిప్పుడే పెళ్లి వద్దు..!
ఆ బాలిక వయసు 16 ఏళ్లు. తండ్రి జీవనోపాధి కోసం ఎడారి దేశానికి వలస వెళ్లాడు.
⇒ పోలీసులను ఆశ్రయించిన బాలిక
⇒ తల్లి పెళ్లి సంబంధాలు చూస్తోందని ఆరోపణ
⇒ స్వధార్హోంకు తరలించిన పోలీసులు
ఇందూరు : ఆ బాలిక వయసు 16 ఏళ్లు. తండ్రి జీవనోపాధి కోసం ఎడారి దేశానికి వలస వెళ్లాడు. తల్లి ఇంటి వద్ద ఉంటూ కూతురును చదివిస్తోంది. ఇంతలో ఏమైందో ఏమో.. బిడ్డకు పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టింది.
అమ్మాయికేమో చదువుకోవాలని ఉంది. అదే విషయాన్ని తల్లితో చెప్పింది. పెళ్లి చేసుకోవాల్సిందేనని ఆమె స్పష్టం చేయడంతో బాలిక తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించింది. వివరాలిలా ఉన్నాయి. బాల్కొండ మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన బాలిక ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది.
కూతురికి పెళ్లి చేయడానికి తల్లి సంబంధాలు చూస్తోంది. తనకు ఇప్పుడే పెళ్లి వద్దని, చదువుకుంటానని ఎంత మొరపెట్టుకున్నా తల్లి వినిపించుకోలేదు. చదువును సైతం మాన్పించింది. ఇంట్లోనే కూర్చున్న బాలికకు ఏం చేయాలో తెలియలేదు. టీవీలో వచ్చిన ఒక ప్రకటన ఆమెకు మార్గం చూపింది. బాల్య వివాహాలు జరిగితే పోలీసులకు సమాచారం అందించాలనేది ఆ ప్రకటన సారాంశం. వెంటనే ఆ బాలిక నేరుగా వెళ్లి ఆర్మూర్ డీఎస్పీని ఆశ్రయించింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంది.
ఆయన వెంటనే బాల్కొండ ఎస్ఐ సురేశ్ను పిలిపించి బాలికకు రక్షణ కల్పించాలని ఆదేశించారు. బాలికను జిల్లా కేంద్రంలో ఉన్న ఐసీడీఎస్ పీడీ కార్యాలయానికి తీసుకువచ్చి పీడీకి అప్పగించారు. అనంతరం స్వధార్ హోంలో వసతి కల్పించారు. తల్లికి కౌన్సెలింగ్ నిర్వహించి, తదుపరి చర్యలు తీసుకుంటామని, కళాశాల నిర్వాహకులతో మాట్లాడి పరీక్షలు రాసే విధంగా చర్యలు తీసుకుంటామని ఐసీడీఎస్ పీడీ రాములు తెలిపారు.