కన్నతల్లి కర్కశత్వం | Mother Killed Her Daughter In Nizamabad | Sakshi
Sakshi News home page

కన్నతల్లి కర్కశత్వం

Jul 6 2019 12:32 PM | Updated on Jul 6 2019 12:34 PM

Mother Killed Her Daughter In Nizamabad - Sakshi

మృతి చెందిన కూతురు ఒమెజా, ఆసిడ్‌ తాగిన తల్లి వసీమా

సాక్షి, కామారెడ్డి క్రైం: చున్నీతో ఐదేళ్ల కూతురుకు ఉరి బిగించి చంపిన తల్లి.. ఆపై తాను యాసిడ్‌ తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బతుకమ్మకుంట కాలనీలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బతుకమ్మ కుంటకు చెందిన షేక్‌ తాజొద్దీన్‌ ఇటీవలే గల్ఫ్‌ నుంచి తిరిగివచ్చాడు. అతడికి భార్య వసీమా, కూతురు ఒమెజా (05) ఉన్నారు. కొంతకాలంగా వసీమా మానసిక పరిస్థితి సక్రమంగా లేదు. ఆమె వింతవింతగా ప్రవర్తించేదని కుటుంబ సభ్యులు తెలిపారు. శుక్రవారం బంధువుల ఇంట్లో శుభాకార్యం ఉండడంతో తాజొద్దీన్‌ తన భార్య పిల్లలను అదే కాలనీలో నివసించే బంధవుల ఇంట్లో వదిలి హైదరాబాద్‌కు వెళ్లాడు. సాయంత్రం వరకు వసీమా తన కూతురుతో కలిసి బంధువుల ఇంట్లోనే ఉంది.

సాయంత్రం సమయంలో ఇంటివరకు వెళ్లి వస్తానని చెప్పి కూతురును తీసుకుని బయలుదేరింది. ఇంటికి చేరిన తర్వాత కూతురు ఒమెజా మెడకు చున్నీచుట్టి గొంతు నులిమింది. దీంతో ఆ చిన్నారి చనిపోయింది. అనంతరం ఇంట్లో ఉన్న స్క్రూ డ్రైవర్‌తో కడుపులో పొడిచింది. ఆ తర్వాత ఆమె యాసిడ్‌ తాగింది. వసీమా ఎంతకీ తిరిగి రాకపోవడంతో ఆమె బంధువులు ఆందోళన చెంది ఆమె ఇంటికి వచ్చి చూశారు. అపస్మారక స్థితిలో ఉన్న తల్లీకూతుళ్లను కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చిన్నారి మృతిచెందిందని వైద్యులు ధ్రువీకరించారు. వసీమా పరిస్థితి కూడా విషమంగా ఉండడంతో ఆమెను హైదరాబాద్‌కు తరలించారు. మానసిక పరిస్థితి సరిగా లేకే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటుందని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నామని పట్టణ ఎస్‌హెచ్‌వో రామకృష్ణ, ఎస్సై గోవింద్‌ తెలిపారు. వసీమా స్పృహలోకి వస్తేగానీ ఎందుకు ఇలా చేసిందో తెలిసే పరిస్థితి లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement