గద్వాల – మాచర్ల రైల్వేలైన్‌కు కేంద్రం అంగీకారం

Measures to Develop Gadwal Railway Station: Nagarkurnool MP Ramulu - Sakshi

రాష్ట్రవాటాతో చేపట్టేందుకు కేంద్ర మంత్రి అంగీకారం

గద్వాల ప్లాట్‌ఫాం పొడిగింపునకు, జోగుళాంబ స్టేషన్‌ అభివృద్ధి చర్యలు

నాగర్‌కర్నూలు ఎంపీ రాములు

గద్వాల టౌన్‌: గద్వాల– మాచర్ల రైల్వేలైన్‌ చేపట్టేలా కృషి చేస్తున్నామని, రాష్ట్రవాటాతో కలిసి చేపట్టేందుకు కేంద్ర మంత్రి అంగీకరించినందున త్వరలోనే ప్రజాప్రతినిధులు అందరం కలిసి సీఎం కేసీఆర్‌ను కలవబోతున్నామని నాగర్‌కర్నూలు పార్లమెంట్‌ సభ్యులు పి రాములు అన్నారు. శనివారం గద్వాల మండలం జమ్మిచేడు హరిత హోటల్‌లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ.. రాయచూరు నుంచి గుంటూరు జిల్లాలోని మాచర్ల వరకు ఏర్పాటు చేయాల్సిన రైల్వే లైన్‌లో గద్వాల రాయచూర్‌ మధ్య మాత్రమే మొదటి దశలో పూర్తయిందని, రెండో దశగా గద్వాల నుంచి వనపర్తి, నాగర్‌కర్నూల్, కల్వకుర్తిల ద్వారా మాచర్ల వరకు చెపట్టాల్సిన రైల్వే లైన్‌ను చేపట్టేందుకు కృషి చేస్తున్నానమన్నారు. ఇందుకు కేంద్ర మంత్రి పీయూస్‌ గోయల్‌ను కోరగా, ప్రాజెక్టులో రాష్ట్ర వాటాకు అంగీకరిస్తే చేపట్టేందుకు వీలుపడుతుందని చెప్పారన్నారు. నాగర్‌కర్నూలు పార్లమెంట్‌ ప్రాంత ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు అందరం కలిసి త్వరలోనే సీఎం కేసీఆర్‌ను కలవాలని నిర్ణయించామని తెలిపారు. గద్వాల మాచర్ల లైన్‌ వల్ల ఈ ప్రాంత అభివృద్దికి జరిగే మేలును ఆయనకు వివరించి, రాష్ట్ర వాటాను కలిపేందుకు కోరుతామన్నారు. త్వరలోనే గద్వాల మాచర్ల లైన్‌ డీపీఆర్‌కు అవసరమైన కసరత్తు పూర్తి చేసేలా తన వంతు కృషి ఉంటుందని తెలిపారు. 

గద్వాల, జోగుళాంబ స్టేషన్ల అభివృద్ధికి చర్యలు
గద్వాల రైల్వే స్టేషన్‌లో 21 బోగీల ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు తగినట్లుగా ప్లాట్‌ ఫాంలు 1.2లను పొడగింపురకు జీఎం అంగీకరించారన్నారు. గద్వాల జిల్లా కేంద్రం, జంక్షన్‌ స్టేషన్‌గా ఉన్న ఈ స్టేషన్‌ ద్వారా ఆగకుంగా వెళ్తున్న కొంగు, అజరత్‌ నిజాముద్దీన్, ఘోరక్‌పూర్, ఓకా రామేశ్వరం ఎక్స్‌ప్రెస్‌లకు హల్టింగ్‌ ఇవ్వాలని కోరడమైందన్నారు. వాటిలో రెండింటిని ఆపేలా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని జీఎం హామీ ఇచ్చారన్నారు. గద్వాల స్టేషన్‌లో వాహనాల పార్కింగ్‌ను విస్తరించాలని కోరగా.. చేస్తామన్నారని వివరించారు. జోగుళాంబ రైల్వే స్టేషన్‌లో రిజర్వేషన్‌ సౌకర్యం కల్సించేలా బుకింగ్‌ను అభివృద్ధి, స్టేషన్‌ ప్రక్కనే ఉన్న రహదారికి అండర్‌ బ్రిడ్జిని చేపట్టాలని కోరగా.. అందుకు అంగీకారం తెలిపారన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top