న్యాయవ్యవస్థకు ఆటుపోట్లు సహజమే!

Justice NV Ramana Comments On Judicial system - Sakshi

సంక్షోభాలనే అవకాశాలుగా మలుచుకున్నాం.. బలోపేతమయ్యాం

న్యాయవ్యవస్థపై ఆధిపత్యం కోసం కొందరు దాడులు చేస్తున్నారు

తెలంగాణ హైకోర్టు భవనం శతాబ్ది ఉత్సవాల్లో 

సుప్రీంకోర్టు న్యాయమూర్తి  జస్టిస్‌ ఎన్వీ రమణ

వీటిని అందరం కలిసికట్టుగా తిప్పికొట్టాలని పిలుపు

న్యాయమూర్తుల ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటామని భరోసా

హాజరైన ప్రస్తుత, విశ్రాంత సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు

సాక్షి, హైదరాబాద్‌: న్యాయవ్యవస్థకు ఆటుపోట్లు, సంక్షోభాలు కొత్త కాదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. సంక్షోభాలను అవకాశాలుగా మలచుకుని, న్యాయవ్యవస్థ మరింత బలోపేతమైందని ఆయన తెలిపారు. మరింతగా ప్రజల విశ్వాసాన్ని చూరగొందన్నారు. పెత్తనం చెలాయించేందుకు కొందరు వ్యక్తులు న్యాయవ్యవస్థపై దాడులు చేస్తున్నారని, ఇటువంటి వాటిని కలిసికట్టుగా తిప్పికొట్టాలని న్యాయవాదులకు పిలుపునిచ్చారు. తెలంగాణ హైకోర్టు భవనం నిర్మించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా హైకోర్టులో శనివారం శతాబ్ది ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జస్టిస్‌ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థ ఎవరికీ భయపడ దని, విమర్శలను చూసి వెనుకడుగు వేయదన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుల్లో న్యాయ మూర్తుల సంఖ్య చాలా తక్కువగా ఉందని, ఈ ఖాళీల భర్తీకి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

పోస్టుల భర్తీకి పేర్లను సిఫారసు చేయాలని హైకోర్టు కొలీజియంను కోరారు. హైకోర్టు కొలీజియం నుంచి సిఫారసులు వస్తే, వీలైనంత త్వరగా ఆ పేర్లకు ఆమోదముద్ర వేస్తామన్నారు. తాను హైకోర్టు నియామకాలను చూసే సుప్రీంకోర్టు కొలీజియంలో సభ్యుడిగా ఉన్నందున.. ఈ రెండు హైకోర్టుల్లో వీలైనంత త్వరగా పోస్టులను భర్తీ చేసేందుకు చేయాల్సిందంతా చేస్తానని తెలిపారు. ఈ విషయంలో సీజేఐతో ప్రత్యేకంగా మాట్లాడ తానని భరోసా ఇచ్చారు. ఈ హైకోర్టు ఎంతోమంది దిగ్గజాలను న్యాయవ్యవస్థకు అందించిందన్నారు. తన వంటి న్యాయమూర్తులు ఎంతో మంది ఈ హైకోర్టు భవనం నీడలో ఎదిగారన్నారు. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎన్వీ రమణతోపాటు జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, జస్టిస్‌ రామయ్యగారి సుభాష్‌రెడ్డి ముఖ్య అతిథు లుగా హాజరయ్యారు. ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సి. ప్రవీణ్‌ కుమార్, ఉత్తరాఖండ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌తోపాటుగా పలువురు సుప్రీం కోర్టు, హైకోర్టు ప్రధాన విశ్రాంత న్యాయమూర్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ హైకోర్టు గొప్ప అనుభూతినిచ్చింది
ఈ సందర్భంగా జస్టిస్‌ రమణ మాట్లాడుతూ, 1983 నుంచి 2013లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యే వరకు ఈ హైకోర్టు భనవంలో తన ప్రస్థానం కొనసాగిందన్నారు. ఎన్నో కొత్త విష యాలను ఈ హైకోర్టు తనకు నేర్పిందన్నారు. తన సీనియర్‌ అయ్యపురెడ్డి తనకు అవకాశం ఇవ్వడం వల్లే తాను ప్రస్తుతం ఈ స్థానంలో ఉన్నానని జస్టిస్‌ రమణ తెలిపారు. ఆయనకు సదా రుణపడి ఉంటానన్నారు. ఈ హైకోర్టుతో తనకు భావోద్వేగ జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయని.. ఎన్నో గొప్ప అనుభూతులను ఈ హైకోర్టు మిగిల్చిందన్నారు. న్యాయవ్యవస్థకు ఎంతో మంది దిగ్గజాలను, ఉద్దం డులను, మేధావులను, నిపుణులను ఈ హైకోర్టు అందించిందని తెలిపారు. వారు న్యాయవ్యవస్థకు అందించిన సేవలను ఎప్పటికీ మర్చిపోకూ డదన్నారు. 14 మంది సుప్రీంకోర్టు జడ్జీలను, 16 మంది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను ఈ హైకోర్టు అందించిందని ఆయన తెలిపారు.

పెండింగ్‌ కేసులే సవాల్‌
న్యాయవ్యవస్థకు పెండింగ్‌ కేసుల సంఖ్య ఓ సవాలుగా మారిందన్నారు. దేశవ్యాప్తంగా కింది కోర్టుల్లో 2.84 కోట్ల పెండింగ్‌ కేసులున్నాయని, మిగిలిన కేసులు హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. కేసులు సత్వర విచారణకు నోచుకోక పోవడం వల్ల అండర్‌ట్రయిల్‌ ఖైదీలు జైళ్లలో మగ్గుతున్నారన్నారు. తగినంత మంది న్యాయ మూర్తులు లేకపోవడం, సిబ్బంది కొరత, మౌలిక సదుపాయాలు లేకపోవడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోలేకపోవడం వంటి అనేక కారణాల వల్ల పెండింగ్‌ కేసుల సంఖ్య పెరి గిపోతోందన్నారు. జిల్లా కోర్టులు సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియో గించుకోలే కపోతున్నాయని, అనేక కోర్టులు  అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చునన్నారు.

చెప్పలేని ఆనందమిది: జస్టిస్‌ లావు నాగేశ్వరరావు
జస్టిస్‌ లావు నాగేశ్వరరావు మాట్లాడుతూశతాబ్ది ఉత్స వాల సందర్భంగా తాను హైకోర్టు ప్రాం గణంలోకి అడుగుపెడుతుంటే చెప్పలేని ఆనందం కలుగు తోందన్నారు. అసలు ఈ వృత్తిలో కొన సాగాలా? వద్దా? అన్న అనిశ్చితిలో ఉన్నప్పుడు ఈ హైకోర్టులోని ఎంతోమంది మిత్రులు తనను ప్రోత్సహిం చా రని, సుప్రీంకోర్టుకు ప్రాక్టీస్‌ను మారుస్తు న్నప్పుడు కూడా అదే రకమైన ప్రోత్సాహం ఇచ్చారని తెలి పారు. సీనియర్‌ వై.సూర్యనారాయణ వల్లే తాను  ఈ స్థానంలో ఉన్నానన్నారు. సహచర న్యాయవాదుల నుంచి ఎన్నో విషయాలను నేర్చుకున్నానని చెప్పారు. ఈ హైకోర్టు భవనం ఎంతో మంది గొప్ప న్యా యమూర్తులను, న్యాయ వాదులను అందించింద న్నారు. ఇటువంటి ఈ భవనం వందేళ్ల కార్యక్ర మం లో పాలుపంచుకోవడం ఆనందంగా ఉందన్నారు.

చిన్న సైన్యంతో పెద్ద యుద్ధం: ఏసీజే చౌహాన్‌
హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్‌ స్వాగతోపన్యాసం చేస్తూ, అతి తక్కువ మంది సైన్యం (జడ్జీలు)తో గొప్ప యుద్ధం(కేసులతో) పోరాటం చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో 1.93 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. 11 మంది జడ్జీలు మాత్రమే ఉన్నారని ఆయన తెలి పారు. ప్రతి న్యాయమూర్తి 17,545 కేసుల అదనపు భారాన్ని మోస్తున్నారని వివరించారు. కింది కోర్టులో 5.22 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, కేవలం 350 మంది న్యాయాధికారులే పనిచేస్తున్నారని తెలిపారు. కుటుంబ కోర్టుల్లో 12,951 కేసులు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టుల్లో 3,322 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, సగటున ఒక్కో న్యాయాధికారి 1,500 కేసుల భారాన్ని ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రస్తుతం 416 కోర్టుల్లో 80 కోర్టులు అద్దె భవనాల్లో ఉన్నాయన్నారు. ఓ జట్టుగా అందరం కలిసి సత్వర న్యాయం అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. హైకోర్టుల ముందున్న సవాళ్లును ఎదుర్కొనేం దుకు ప్రతీ హైకోర్టు కూడా 2030 విజన్‌ స్టేట్‌మెంట్‌ను సిద్ధం చేసుకో వాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయమూర్తి జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌ వం దన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్, బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ ఏ.నర్సింహారెడ్డి, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు సి.దామోదర్‌రెడ్డి మాట్లాడారు. అనం తరం సుప్రీంకోర్టు న్యాయమూర్తులను హైకోర్టు న్యాయవాదుల సంఘం ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. 
శతాబ్ది ఉత్సవాల సందర్భంగా విద్యుత్‌ దీపాల కాంతులతో వెలుగులీనుతున్న హైకోర్టు భవనం 

ధనార్జన యంత్రాల్లా మారొద్దు
న్యాయం ఉన్న చోట ప్రశాంతత ఉంటుందని భీష్మ పితామహుడు చెప్పారని, అందువల్ల న్యాయాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని జస్టిస్‌ రమణ అన్నారు. న్యాయపాలన ద్వారా ప్రజాస్వామ్య, రాజ్యాంగ లక్ష్యాలను సాధించాలని, ఇందులో న్యాయవాదులు కీలక పాత్ర పోషించాలన్నారు. న్యాయవ్యవస్థ ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టిందని, వీటి ఫలితాలు అద్భుతంగా ఉన్నాయన్నారు. ప్రజలు విశ్వాసాన్ని కోల్పోతే వ్యవస్థ మనుగడ ప్రమాదంలో పడిన ట్టేనన్నారు. కేవలం ఆదాయాన్ని ఆర్జించే యంత్రాల్లా కాకుండా సమాజంలో అవసరమైన వారికి న్యాయ సాయం చేస్తూ, సమాజానికి మార్గదర్శకులుగా ఉండాలని న్యాయవాదులకు సూచించారు.

జడ్జీల సంఖ్యను 42కు పెంచాలి: జస్టిస్‌ సుభాష్‌రెడ్డి
జస్టిస్‌ సుభాష్‌రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను 42కు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఇంత తక్కువ మంది జడ్జీలతో లక్షల్లో ఉన్న కేసులను విచారిం చడం చాలా కష్టమేనన్నారు. ఇరు హైకోర్టుల్లో న్యాయమూర్తుల ఖాళీలను భర్తీ చేసేందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఏం చేయాలో అన్ని ప్రయత్నాలూ చేస్తామన్నారు. సాధ్యమైనంత త్వరగా ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుం టామన్నారు. న్యాయమూర్తులు ఎన్ని కేసులను పరిష్కరించామని కాకుండా, ఎంత నాణ్యతతో తీర్పులిచ్చామన్నదే చూడాలన్నారు. అప్పుడే ప్రజలకు న్యాయం చేసినట్లు అవుతుందని తెలిపారు. న్యాయవాదులుగా తాము వాదనలు వినిపించిన సమయంలోని న్యాయమూర్తులం దరినీ (ఇప్పుడు రిటైర్డ్‌) ఈ కార్యక్రమంలో చూడటం ఆనందంగా ఉందన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top