చినుకు..వెన్నులో వణుకు
అర కిలోమీటరుకు 60పైగా గుంతలు
దెబ్బతింటున్న ప్రయాణికుల స్పైన్, డిస్క్లు
వెన్ను, నడుం నొప్పులతో ఆస్పత్రుల్లో చేరిక
రిపేరుతో షెడ్డుకు తరలుతున్న వాహనాలు
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు నగర రోడ్లను పూర్తిగా ధ్వంసం చేశాయి. ఇప్పటికే రోడ్లన్నీ గుంతల మయంగా మారడంతో అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థితి. అరకిలోమీటరు ప్రయాణిస్తే చాలు అరవైకి పైగా గుంతలు శరీరాన్ని కుదిపేస్తున్నాయి. ఫలితంగా వాహనాలే కాదు ప్రయాణికుల ఒళ్లు గుళ్లవుతోంది. వెన్నుపూస కదిలిపోతోంది. నొప్పిని భరించలేక ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య ఇటీవల భారీగా పెరిగింది. నిమ్స్ సహా నగరంలోని ఏ కార్పొరేట్ ఆస్పత్రిలోకి చూసినా బ్యాక్పెయిన్ బాధితులే దర్శనమిస్తున్నారు.
సాక్షి, సిటీబ్యూరో: మెట్రోరైల్ వర్క్స్, విద్యుత్ కేబుళ్లు, సీవరేజ్ పైప్లైన్స్ కోసం తవ్విన గుంతలు ఇప్పటికే ప్రయాణికులను ఓ కుదుపు కుదుపుతుండగా, ఇటీవల ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు రహదారులనే కాదు నగరవాసుల ఒంటిని కూడా గుళ్ల చేస్తున్నాయి. సాధారణ పౌరులు తిరిగే రహదారులే కాదు వీవీఐపీలు తిరిగే బంజారాహిల్స్, బేగంపేట్, ఎన్టీఆర్మార్గ్, రాజ్భవన్రోడ్డు, అసెంబ్లీ, పంజêగుట్ట, లక్డికపూల్, ట్యాంక్బండ్, మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్పల్లి రహదారు లపై భారీ గుంతలు ఏర్పడ్డాయి. ఇక ఎల్బీనగర్ నుంచి మెజంజాహీ మార్కెట్, ఉప్పల్, రామంతాపూర్, అంబర్పేట్, నల్లకుంట, నారాయణగూడ, హిమాయత్ నగర్, లిబర్టీ చౌరస్తా రహదారులు మరీ అధ్వానంగా మారాయి. అడుగుకోగుంత దర్శనమిస్తోంది. ఈ గుంతల రోడ్లపై ప్రయాణిస్తున్న అనేక మంది వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. వీరిలో కొంరు కాళ్లు, చేతులకు గాయాలై చికిత్స కోసం ఆస్పత్రుల్లో చేరుతుండగా, మరికొందరు స్పైన్, నెక్, నడుము నొప్పుల బారిన పడుతున్నారు.
డ్రైవరే కాదు..ప్రయాణికులు కూడా..
వాహనం నడిపే వారే కాదు..వెనుక సీట్లో కూర్చొన్న వారికి కూడా వెన్ను, భుజం, తొడ, మెడ జాయింట్స్ పెయిన్స్ తప్పడం లేదు. బైక్ నడిపే వారు వెన్ను, మెడ, భుజాలు, ఇతర కండరాల నొప్పులతో బాధ పడుతుంటే, కారు నడిపేవారు నడుము, పిరుదులు, కాళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. వీరు సరైన భంగిమలో కూర్చోకపోవడం వల్ల గుంతల్లో ఎత్తేసిన ప్రతి సారీ డిస్క్ల మధ్య కదలికలు ఎక్కువై జాయింట్స్ అరిగి పోతున్నట్లు వైద్యులు స్పష్టం చేస్తున్నారు. జంట జిల్లాల్లో ప్రస్తుతం 50 లక్షలపైగా వాహనాలు ఉండగా, వీటిలో 35 లక్షలకుపైగా ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. ఏడు లక్షల కార్లు, లక్షకుపైగా ఆటోలు ఉండగా, మరో లక్ష ఇతర వాహæనాలు ఉన్నాయి. రహదారులపై ఏర్పడిన గుంతల వల్ల వాహనాల నిర్వహణ ఖర్చులు రెట్టింపయ్యాయి. ద్విచక్ర వాహనాలకు క్లచ్, బ్రేక్ సిస్టమ్ దెబ్బ తింటుంది. టైర్లు కూడా అరిగిపోతున్నాయి. తరచూ ఇలాంటి గుంతల్లో కార్లు, ద్విచక్రవాహనాల్లో ప్రయాణిస్తే ఇంజిన్ దెబ్బ తింటుంది. బుష్లు పగులుతున్నాయి. ఇక గుంతలు వచ్చినప్పుడు బ్రేకులు వేస్తూ.. గేర్లు మార్చడం వల్ల మైలేజీ తగ్గుతుంది.
నిటారుగా కూర్చోవాలి
♦ బైక్ నడిపేటప్పుడు తల, నడుము, షోల్డర్ వంచకుండా నిటారుగా ఉండటం అలవాటు చేసుకోవాలి
♦ మెడపై భారం పడకుండా తేలికైన హెల్మెట్లను వాడాలి. తలను అటూ, ఇటూ తిప్పరాదు
♦ ర్యాష్ డ్రైవింగ్ చేయరాదు. సీటు దిగజారినట్లు ఉండకూడదు.
♦ కారులో సిట్టింగ్ 110 డిగ్రీలు తప్పని సరిగా ఉండాలి
♦ క్లచ్లు, గేర్లు చేతికి చేరువలో ఉండేలా చూడాలి.
♦ వీపు భాగాన్ని పూర్తిగా సీటుకు అనించి కూర్చోవాలి
♦ గుంతలు, ఎగుడు దిగుడు రోడ్లు, స్పీడ్బ్రెకర్ల ఉన్నప్పుడు వేగం తగ్గించాలి
♦ లాంగ్ జర్నీ చేసేప్పుడు ప్రతి గంట, రెండు గంటలకోసారి కొంత విరామం తీసుకోవాలి. –డాక్టర్ నరేంద్రనాథ్, ఆర్థోపెడిక్ నిపుణుడు, మాజీ డైరెక్టర్, నిమ్స్
మరిన్ని వార్తలు