మరో రూ.100 కోట్లు
సేకరించిన జీహెచ్ఎంసీ
మూడోసారి బాండ్ల ద్వారా నిధులు
త్వరలో మరో రూ. 205 కోట్లు తీసుకుంటాం: మేయర్
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ)మునిసిపల్ బాండ్ల ద్వారా మరో రూ.100 కోట్లు సేకరించింది. మంగళవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం నుంచే బాంబే స్టాక్ ఎక్సే్ఛంజ్ (బీఎస్ఈ)ద్వారా నిర్వహించిన బిడ్డింగ్లో ఈ నిధులు సేకరించింది. ఇప్పటికే రెండు పర్యాయాలు బాండ్ల ద్వారా రూ.395 కోట్లు సేకరించిన జీహెచ్ఎంసీ తాజా సేకరణతో దేశంలోనే మూడు పర్యాయాలు బాండ్ల ద్వారా నిధులు పొందిన ఏకైక కార్పొరేషన్గా నిలిచింది. ఈసారి రూ.305 కోట్లు సేకరించాలని తొలుత భావించిన అధికారులు బాండ్ల మార్కెట్ పరిస్థితిని పరిగణనలోకి తీసుకొని రూ.100 కోట్లకు పరిమితమయ్యారు. 10.23 శాతం వడ్డీకి వీటిని తీసుకున్నారు. బాండ్ల మార్కెట్ పరిస్థితి బాగాలేకపోవడంతో దాదాపు మూడు నెలలుగా వాయిదా వేస్తూ వచ్చిన జీహెచ్ఎంసీ ఒక దశలో బ్యాంక్ రుణాలకువెళ్లాలనుకుంది. కేంద్రం ప్రకటించిన రూ.100 కోట్లకు రూ.13 కోట్ల ప్రోత్సాహకాన్ని దృష్టిలో ఉంచుకొని బాండ్ల ద్వారా వెళ్లేందుకు సిద్ధమై..సేకరించింది. మార్కెట్ పరిస్థితుల్ని బట్టి దాదాపు నెలరోజుల్లో మరోమారు బాండ్ల ద్వారా మిగతా రూ.205 కోట్లు సేకరిస్తామని, అప్పటికీ పరిస్థితి బాగులేకుంటే బ్యాంకు రుణాల ద్వారా తీసుకుంటామని జీహెచ్ఎంసీ మేయర్ బి.రామ్మోహన్, కమిషనర్ ఎం.దానకిశోర్ తెలిపారు. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల మధ్య నిర్వహించిన బిడ్డింగ్లో ఆరు సంస్థలు రూ.100 కోట్లకు బిడ్లు దాఖలుచేసినట్లు అధికారులు తెలిపారు. ఎస్సార్డీపీలో భాగంగా జీహెచ్ంఎసీ చేపట్టిన ఫ్లై ఓవర్లు, అండర్పాస్లు, కేబుల్బ్రిడ్జి తదితర పనులకు ఈనిధులు ఖర్చు చేయనున్నారు.
త్వరలో మరో రూ.205 కోట్లు..
జీహెచ్ఎంసీలో చేపట్టిన ఎస్సార్డీపీ పనుల కోసం మరో నెల రోజుల్లో మిగతా రూ. 205 కోట్లు సేకరిస్తామని మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. బిడ్డింగ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ, నగరంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, పటిష్టమైన జీహెచ్ఎంసీ ఆర్థిక పరిస్థితిని బేరీజు వేశాకే జాతీయ స్థాయి ఆర్థిక సంస్థలు విశ్వాసంతో ట్రేడింగ్లో పాల్గొన్నాయన్నారు. బ్యాంకు వడ్డీ కన్నా తక్కువ వడ్డీకి రూ. 100 కోట్లు సేకరించామన్నారు. స్థానిక సంస్థలు ఆర్థికంగా ఎదుర్కొంటున్న సమస్యలతో ఏమునిసిపల్ కార్పొరేషన్ కూడా బాండ్లకు వెళ్లే సాహసం చేయకున్నా, జీహెచ్ఎంసీ ఆ రికార్డు సృష్టించిందన్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం. దానకిశోర్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా బాండ్ల మార్కెట్ పరిస్థితి బాగులేకున్నా బిడ్డింగ్ కు అనూహ్య స్పందన లభించిందని పేర్కొన్నారు. 20 రోజుల తర్వాత మరోమారు బాండ్ల ద్వారా కానీ, బ్యాంకురుణాల ద్వారా కానీ అవసరమైన నిధులు పొందుతామన్నారు. బీఎస్ఈ అధికారులు, రాష్ట్రప్రభుత్వ మునిసిపల్ శాఖ సలహాదారు జయశ్రీ, జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్లు సిక్తా పట్నాయక్, ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్, ఎపీఏ సెక్యూరిటీస్ లిమిటెడ్, ఎస్బీఐ క్యాప్ట్రస్టీస్, కార్వీ(ఆర్టీఐ)ప్రతినిధులు జీహెచ్ఎంసీ కమాండ్ కంట్రోల్ రూం నుంచి బిడ్డింగ్ ప్రక్రియను పరిశీలించారు.
ప్రోత్సాహకంతో లాభం
ఈ ఆర్థిక సంవత్సరం బాండ్ల ద్వారా నిధులు సేకరించే స్థానిక సంస్థలకు రూ.100 కోట్లకు రూ.13 కోట్లు ప్రోత్సాహకంగా ఇవ్వనున్నట్లు కేంద్రం తెలపడంతో దాన్ని పరిగణనలోకి తీసుకుంటే జీహెచ్ఎంసీకి 8.9 శాతం వడ్డీ మాత్రమే పడుతుందని జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ (ఫైనాన్స్) జయరాజ్ కెనెడి వివరించారు. జీహెచ్ంఎసీ తొలివిడత రూ.200 కోట్లు 8.9 శాతం, రెండో విడత రూ.195 కోట్లు 9.38 శాతం వడ్డీతో తీసుకుంది. ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకు కేవలం ‘ఏఏఏ’ రేటింగ్ కలిగిన సంస్థలు మాత్రమే బాండ్ల ద్వారా నిధులు సేకరించగా, ‘ఏఏ’ రేటింగ్తోనే నిధులు సేకరించిన సంస్థ జీహెచ్ఎంసీ మినహా మరోటి లేదని కెనెడి పేర్కొన్నారు.
పెండింగ్ బిల్లులకే సరి..
జీహెచ్ఎంసీ ప్రస్తుతం సేకరించిన రూ.100 కోట్లు పెండింగ్ బిల్లుల చెల్లింపులకే సరిపోనున్నాయి. ఎస్సార్డీపీ పనులు, భూసేకరణలకు చెల్లించాల్సిన నిధులు వెరసి దాదాపు రూ. 240 కోట్లు అవసరం కాగా, తమ వద్ద దాదాపు రూ. 100 కోట్ల బిల్లులు మాత్రమే ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. ఈ నిధులతో వాటిని చెల్లించనున్నారు.