అధికార లాంఛనాలతో నారాయణ రెడ్డి అంత్యక్రియలు | Former Nizamabad MP Narayana Reddy Funeral | Sakshi
Sakshi News home page

అధికార లాంఛనాలతో నారాయణ రెడ్డి అంత్యక్రియలు

Feb 4 2020 9:45 AM | Updated on Feb 4 2020 9:45 AM

Former Nizamabad MP Narayana Reddy Funeral - Sakshi

సాక్షి, డిచ్‌పల్లి: తెలంగాణ తొలితరం ఉద్యమకారుడు, న్యాయవాది నిజామాబాద్‌ జిల్లా మాజీ ఎంపీ ఎం నారాయణరెడ్డి పారి్థవ దేహానికి అంత్యక్రియలు సోమవారం అధికార లాంఛనాలతో పూర్తి చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు డిచ్‌పల్లి మండలం ధర్మారం(బి) గ్రామ శివారులోని కృషి దర్శన్‌ కేంద్రంలో (నారాయణరెడ్డి వ్యవసాయ క్షేత్రం)అంత్యక్రియలను నిర్వహించారు. అంతకు ముందు నిజామాబాద్‌ నగరంలోని ఆయన నివాసం నుంచి స్వర్గ రథయాత్ర వాహనంలో ఆయన పార్థివ దేహాన్ని  కృషి దర్శన్‌ కేంద్ర వరకు ర్యాలీ నిర్వహించారు. స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి,  జెడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు, ఎమ్మెల్సీలు వీజీగౌడ్, జీవన్‌రెడ్డి, అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్త, నగర మేయర్‌ నీతూకిరణ్, మాజీ స్పీకర్‌ సురేశ్‌రెడ్డి, మాజీ మంత్రులు జానారెడ్డి, సుదర్శన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మి నారాయణ, జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, తదితరులు నారాయణరెడ్డి భౌతిక కాయంపై  పుష్పగుచ్ఛం ఉంచి నివాళులరి్పంచారు.

జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి, పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ పర్యవేక్షణలో రెవెన్యూ, పోలీస్‌ అధికారులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. పోలీసులు గార్డ్‌ ఆఫ్‌ హానర్‌ స్వీకరిస్తూ గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులరి్పంచారు. నారాయణరెడ్డి కుమారుడు అరుణ్‌రెడ్డి చితికి నిప్పంటించి అంత్యక్రియలు నిర్వహించారు. నారాయణరెడ్డి కుమార్తెలు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

కార్యక్రమంలో పాల్గొన్న జెడ్పీ చైర్మన్, స్పీకర్, మంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్, సీపీ, మేయర్‌

ఉద్యమకారుడు.. అభ్యుదయవాది
అనంతరం స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమకారుడు, అభ్యుదయ వాది, మాజీ ఎంపీ నారాయణరెడ్డి మృతి జిల్లాకే కాకుండా రాష్ట్రానికే తీరని లోటని అన్నారు. తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకతపై ఆనాడే పార్లమెంట్‌లో గళం విప్పి 45 నిమిషాలు సుదీర్ఘంగా ప్రసంగించిన నాయకుడని అన్నారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా అన్ని విషయాలు తెలుసుకుని సభలలో సుదీర్ఘంగా తెలంగాణ వాణి విని్పంచే వారని అలాంటి నాయకుడు మనమధ్య లేకపోవడం బాధాకరమని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. భగవంతుడు నారాయణరెడ్డి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆకాంక్షించారు. అంత్యక్రియల్లో జిల్లా రెవెన్యూ అధికారి అంజయ్య, ఆర్డీవో వెంకటయ్య, ఏసీపీ శ్రీనివాస్‌కుమార్, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, రాష్ట్ర నాయకుడు విద్యాసాగర్, నాయకులు తాహెర్‌బిన్‌ హందాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement