ఎన్నికల్లో అన్ని పోలింగ్‌ బూతుల్లో వెబ్‌ కాస్టింగ్‌

Election Commission Set Rules, Nalgonda - Sakshi

ఇంటర్‌నెట్‌ లేని గ్రామాల్లో ప్రత్యేక ఏర్పాట్లు

జిల్లాలో ఇంటర్‌నెట్‌లేని గ్రామాలు 30గుర్తింపు

జాయింట్‌ కలెక్టర్‌ నారాయణరెడ్డి

సాక్షి,నల్లగొండ: ఎన్నికల నిర్వహణ పారదర్శంగా సాగాలంటే అందుకు సాంకేతికత ఎంతో ఉపయోగపడుతుంది.గమనించిన ఎన్నికల సంఘం ఈ సారి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలింగ్‌ బూతుల్లో ఉపయోగించి ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు పూనుకుంది. అందులో భాగంగా జిల్లాలో కూడా అన్ని పోలింగ్‌ బూతుల్లో వెబ్‌ కాస్టింగ్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దాని ద్వారా ఎన్నికల్లో అక్రమాలకు తావులేకుండా ఉండడంతో పాటు త్వరితగతిన  పనుల్లో వేగం పెరుగుతుంది.

 
ఇప్పటికే ఆన్‌లైన్‌ ద్వారా ఓటు నమోదు కార్యక్రమాలు చేపట్టారు. ఓటు నమోదుతో పాటు మార్పులు చేర్పులకు కూడా ఆన్‌లైన్‌లో అవకాశం ఇవ్వడంతో నేరుగా దరఖాస్తులు వచ్చాయి.  అంటే ఇంటర్‌నెట్‌ సౌకర్యం ఏవిధంగా ఉపయోగ పడిందనేది అర్థం అవుతుంది. అంతేకాక ఈ సారి ఎన్నికల్లో  ఈవీఎంలతో పాటు వీవీ ప్యాట్లను ఏర్పాటు చేశారు. ఈవీఎంల ద్వారా ఓటరు ఓటు ఎలక్ట్రానిక్‌ విధానంలో ఓటు వేస్తుండగా వీవీ ప్యాట్ల ద్వారా ఏ వ్యక్తికి, ఏ గుర్తుకు ఓటు వేసింది నిజంగా తను వేసిన గుర్తుకు ఓటు పడిందా లేదా అనేది వెంటనే తెలిసి పోతుంది. ఆ విధంగా కొత్త విధానాన్ని తీసుకువచ్చారు. అయితే ఎన్నికలను సమర్థంగా నిర్వహించేందుకు ప్రతి పోలింగ్‌ బూతును శాటిలైట్‌ ఆధారంగా గుర్తించడంతోపాటు, ఎన్నికల సరళిని పర్యవేక్షించేందుకు వెబ్‌కాస్టింగ్‌ తీసుకువస్తున్నారు. దీనికి ఇంటర్‌నెట్‌ ఎంతో అవసరం ఉంది. 

ఇంటర్‌నెట్‌ అంతంత మాత్రమే..
బీఎస్‌ఎన్‌ఎల్‌ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో 4జీ సేవలు అందడం లేదు. చాలా గ్రామాల్లో బ్రాడ్‌బ్రాండ్‌ సేవలు అందడం లేదు. సెల్‌టవర్లు కూడా మారుమూల ప్రాంతాల్లో తక్కువగా ఉన్నాయి. దీంతో అన్ని గ్రామాలకు నెట్‌సౌకర్యం లేదు. గత ఎన్నికల్లో సమస్యాత్మక ప్రాంతాల్లో వెబ్‌కాస్టింగ్‌ను ఏర్పాటు చేయడం వల్ల చాలా వరకు సమస్యలు తగ్గాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని అధికారులు అన్ని పోలింగ్‌ స్టేషన్లలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇంటర్‌ నెట్‌ను కంప్యూటర్లకు అనుసంధానం చేసి పోలింగ్‌ సరళిని పర్యవేక్షించేందుకు చర్యలు తీసుకోనున్నారు. అయితే లైన్ల విషయంలో కొన్ని సమస్యలు ఏర్పడితే వాటిని పరిష్కరించాలంటే  చాలారోజులు పట్టేది. వాటిని అధిగమించి ఎన్నికల్లో సాంకేతికను ఉపయోగించాల్సి ఉంది. 

నెట్‌ సామర్థ్యాన్ని పెంచాల్సి ఉంది..
ప్రస్తుతం బ్రాడ్‌బ్రాండ్‌ సేవలు అందతున్నాయి. కానీ స్పీడ్‌ తక్కువగా ఉంది. ఎన్నికల్లో  ఆ స్పీడు సరిపోదు. అధికారులు దాని సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకోకపోతే ఇబ్బందులు పడక తప్పదు. దీంతో పోలింగ్‌ వెబ్‌కాస్టింగ్, ఇతర డాక్యుమెంట్లు పంపే విషయంలో కూడా  ఇబ్బంది జరిగే అవకాశం ఉంది.

 
ఇంటర్‌నెట్‌ లేని 30గ్రామాల గుర్తింపు...
అధికారులు ఇప్పటికే ఇంటర్‌నెట్‌ లేని గ్రామాలను గుర్తించారు. దేవరకొండ డివిజన్‌లోనే ఈ గ్రామాలు ఉన్నాయి. జిల్లా పౌరసరఫరాల శాఖ పేదలకు ఫుడ్‌ సెక్యూరిటీ కింద రూ.1 కిలో బియాన్ని ఇస్తుంది. అయితే అందులో ఈ పాసింగ్‌ విధానాన్ని అమలు చేశారు. అయితే ప్రతి ఒక్కరు తంబ్‌ వేయాల్సి ఉంది. అది నెట్‌ఉంటేనే సాధ్యం. దాంతో దేవరకొండ డివిజన్‌లో 30 గ్రామాలు నెట్‌లేని కారణంగా ఈ పాస్‌ విధానం కాకుండా మ్యానువల్‌గా ఇస్తున్నారు.

 
ఇంటర్‌నెట్‌ లేని గ్రామాల్లో ప్రత్యేక ఏర్పాట్లు : జేసీ
ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్నిచర్యలు తీసుకుంటున్నాం. అయితే జిల్లాలో 30 గ్రామాలను ఇంటర్‌ నెట్‌ సౌకర్యం లేని గ్రామాలుగా గుర్తించాం. సారి ఎన్నికల సంఘం అన్ని పోలింగ్‌ స్టేషన్లలో వెబ్‌కాస్టింగ్‌ నిర్వహించాలని నిర్ణయించింది. అయితే ఇంటర్‌ నెట్‌ సౌకర్యాలు లేని ప్రాంతాల్లో స్టీల్‌ కెమెరాలు ఉపయోగించడం లేదా మైక్రో అబ్జర్‌వర్‌ను (సెంట్రర్‌ గరవర్నమెంట్‌ ఉద్యోగి) ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. ఈ విషయాన్ని ఎన్నికల సంఘానికి నివేదిస్తాము. వారు  సూచించిన విధంగా నిర్ణయం తీసుకుంటాం. 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top