విద్యాసంస్థల బంద్ సక్సెస్ | education institutes bandh success | Sakshi
Sakshi News home page

విద్యాసంస్థల బంద్ సక్సెస్

Jul 9 2014 2:45 AM | Updated on Jul 11 2019 5:01 PM

ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని, విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాలనే డిమాండ్‌తో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన పాఠశాలల బంద్ విజయవంతం అయింది.

ఖమ్మం వైరారోడ్: ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని, విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాలనే డిమాండ్‌తో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యం లో మంగళవారం చేపట్టిన పాఠశాలల బంద్ విజయవంతం అయింది. నగరంలో వివిధ  ప్రైవేట్ పాఠశాలలను మూసి వేయించిన ఆ యూనియన్ నాయకులు పెవి లియన్ గ్రౌండ్ నుంచి ప్రదర్శన నిర్వహించారు.

జిల్లాలో ప్రైవేట్ విద్యాసంస్థలు వేలకువేలు ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.ఉపేందర్, ఎల్. బాలరాజు ఆరోపించారు. పేద, మధ్యతరగతి వర్గాలకు ప్రైవేట్ విద్యాసంస్థలలో చదువు అందని ద్రాక్షలా మారిందన్నారు. జీవో నంబర్ 42ప్రకారం ఫీజుల వివరాలను విద్యాసంస్థల నోటీసుబోర్డులో పెట్టాలనే నిబంధన ఉన్నా దాన్ని ఎవ రూ పట్టించుకోవడం లేదన్నారు. విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నందువల్లనే ఇలా చేయడం లేదని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ప్రతి పాఠశాలలో 25 శాతం సీట్లు ఉచితంగా ఇవ్వాల్సి ఉన్నా ఏ ఒక్క ప్రైవేట్ పాఠశాల యా జమాన్యం దీన్ని పట్టించుకోవడం లేదన్నారు.

 మౌలికవసతుల కల్పన విషయాన్ని మాత్రం అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో విస్మరిస్తున్నారన్నారు. ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాల పేరుతో అనుమతి తీసుకొని..విచ్చలవిడిగా క్యాంపస్‌లు ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. ఫిట్‌నెస్ లేని బస్సులను నిర్వహిస్తూ విద్యార్థుల ప్రాణాల తో చెలగాటమాడుతున్నారన్నారు. ఈ బంద్‌తోనైనా జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు స్పందించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు టి. నాగరాజు, ఖమ్మం, వైరా డివిజన్‌ల అధ్యక్ష, కార్యదర్శులు ఎం.కిరణ్, సిహెచ్.రమేష్, ప్రశాంత్, అశోక్, బాలికల కన్వీనర్ ఎస్.రజని, రమ్య, భవాని పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement