తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో జరిగే ఇంజనీరింగ్ పనుల్లో నాణ్యత, పనితీరుకు..
సాక్షి , హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో జరిగే ఇంజనీరింగ్ పనుల్లో నాణ్యత, పనితీరు మదింపు(ఎవాల్యుయేషన్) చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడానికి స్వతంత్రంగా పనిచేసేలా ‘ఎవాల్యుయేషన్ అథారిటీ ఆఫ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ’(ఈస్ట్) ఏర్పాటు ముసాయిదా సిద్ధమైంది. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతున్న ఈ విధానాన్ని రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధమైంది. ఇందుకోసం ఇటీవల బడ్జెట్లోనూ ప్రభుత్వం రెండు కోట్ల రూపాయలు కేటాయించింది. ప్రస్తుతం ఆయా శాఖలే తాము చేపట్టే పనుల మదింపు చేపడుతున్నాయి.
దీంతో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో ప్రభుత్వం కొత్తగా ఈ అథారిటీ ఏర్పాటుకు నిర్ణయించింది. ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో నడిచే ఈ అథారిటీ వివిధ శాఖల్లో మంజూరైన పనులు, ఉద్దేశం, వాటి పురోగతి, అమలుపై దృష్టి పెడుతుందని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి బీపీ ఆచార్య వివరించారు. అర్హులైన కన్సల్టెంట్లు ఉండే ఈ అథారిటీ ప్రధాన ప్రగతి సూచికలు రూపొందించడంతోపాటు అక్కడి లోపాలకు సంబంధించి సంబంధిత విభాగానికి సూచనలు పంపిస్తుంది. లోపాలకు సంబంధించి శాఖ నుంచి వివరాలు వచ్చిన తరువాత తుది నివేదికను ప్రభుత్వానికి ఈ అథారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇదంతా పారదర్శకంగా సాగేందుకు నివేదికను ప్రభుత్వ గెజిట్లో ప్రచురించడంతోపాటు, వెబ్సైట్లో ఉంచుతారు. ఎప్పటికప్పుడు ఆయా పథకాలు అమలు సక్రమంగా, షెడ్యూల్ ప్రకారం జరుగుతున్నదీ లేనిదీ పర్యవేక్షించి సంబంధిత విభాగాలకు, ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం ద్వారా సత్ఫలితాలు వచ్చేందుకు ‘ఈస్ట్’ ప్రయత్నిస్తుంది.