ఉస్మానియా..యమ డేంజర్
మళ్లీ ఊడిపడిన సీలింగ్
ఇద్దరు రోగులకు స్వల్ప గాయాలు
సాక్షి, సిటీబ్యూరో: ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో రోగుల ప్రాణాలకు కనీస రక్షణ లేకుండా పోయింది. ఇన్పేషంట్లు చికిత్స పొందే పాతభవనంలోని పలు వార్డులు ఇప్పటికే పూర్తిగా శిథిలావస్థకు చేరి తరచూ పెచ్చులూడిపడుతుండగా, తాజాగా గురువారం తెల్లవారుజామున ఓపీ భవనంలోని జనరల్ సర్జరీ విభాగం ఇన్పేషంట్ వార్డులో సీలింగ్ ఊడి కిందపడింది. ఈ ఘటనలో ఇద్దరు రోగులకు స్వల్ప గాయాలయ్యాయి. అర్ధరాత్రి దాటిన తర్వాత అంతా గాఢనిద్రలో ఉన్న సమయంలో పైన ఉన్న సీలింగ్ ఒక్కసారిగా కూలి కిందపడటంతో ఆ వార్డులో చికిత్స పొందుతున్న రోగులతో పాటు వారికి సహాయంగా ఉన్న బంధువులు, చికిత్స అందిస్తున్న వైద్యులు, నర్సులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన అధికారులు రోగులను వెంటనే మరో వార్డుకు తరలించడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.