
హన్మకొండ చౌరస్తా: ‘వారు రాళ్లు పడితే.. మేం బాంబులు పడతాం.. కర్రలు పడితే మేం కత్తులు పడతాం..’ అని బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. జాతీయవాదుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో బుధవారం వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని వేయిస్తంభాల గుడి నుంచి హన్మకొండ పబ్లిక్ గార్డెన్ వరకు పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ.. గుంటూరులో సీఏఏకు మద్దతుగా జాతీయవాదులు ర్యాలీ తీస్తుంటే రాళ్లతో దాడులు చేశారని, వాళ్లు రాకెట్లు పడితే మేం లాంచర్లు పడతామన్నా రు. యుద్ధం ప్రారంభమైనందున ఎవరినీ విడిచిపెట్టేది లేదన్నారు. సీఏఏ ముస్లింలకు వ్యతిరేకం కాదన్న విషయం వారికి తెలిసిపోయిందన్నారు.
కేసీఆర్ ఒక్క మాట మాట్లాడలేదు
‘కేటీఆర్ మా అయ్య గొప్ప హిందువు అని చెబుతున్నాడు.. కరీంనగర్లో హిందుగాళ్లు బొందు గాళ్లు అన్నప్పుడు మీ అయ్య ఎక్కడికి పోయాడు’అని సంజయ్ ప్రశ్నించాడు. అందుకే హిందువులంతా ఏకమై బొందు గాళ్లను బొంద పెట్టారని తెలిపారు. సీఏఏ విషయంపై కేసీఆర్ ఒక్క మాట మాట్లాడలేదని విమర్శించారు. సీఏఏను వ్యతిరేకిస్తున్న వారందరినీ బ్రేకుల్లేని వాహనాల్లో ఎక్కించి మూసీ నదిలో తోయాలని సంజయ్ అన్నారు.