పురోహిత్ ప్రజల గవర్నర్
తంజావూర్: జిల్లాల్లో పర్యటిస్తూ కలెక్టర్లు, అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్న రాష్ట్ర గవర్నర్ను ప్రతిపక్షాలు తప్పుబడుతుండగా ఆయనకు తమిళనాడు మంత్రి ఒకరు అండగా నిలిచి పురోహిత్ ప్రజల గవర్నర్ అని కొనియాడారు. కమలాలు పండించే నాగపూర్ నుంచి ధాన్యం పండించే తంజావూర్కు వచ్చారని తమిళ భాష, సాంస్కృతిక శాఖ మంత్రి పాండ్యరాజన్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి ఎం.జి.రామచంద్రన్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.కె.స్టాలిన్, కాంగ్రెస్, సీపీఐ(ఎం), సీపీఐ, పీఎంకే, ఏఐడీఎంకే నుంచి విడిపోయిన టి.టి.వి.దినకరన్లు గవర్నర్ చర్యలను తప్పుబట్టారు. ఇది రాష్ట్ర హక్కులలో జోక్యం చేసుకోవడమే అవుతుందని విమర్శించారు. అయితే ఈ ఆరోపణలను కొందరు రాష్ట్ర మంత్రులు, బీజేపీ నాయకులు ఖండించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ పురోహిత్ ఎంజీఆర్కు నివాళులర్పించి ఆయన ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజనం పథకాన్ని కొనియాడారు.