‘డబుల్’ ధమాకా! | Mumbai - Goa between the double-decker AC train | Sakshi
Sakshi News home page

‘డబుల్’ ధమాకా!

Feb 8 2014 11:37 PM | Updated on Sep 2 2017 3:29 AM

ముంబ్రా-దీవా స్టేషన్ల మధ్య ఉన్న సొరంగ మార్గం అడ్డంకులు తొలగిపోవడంతో ముంబై-మడ్‌గావ్(గోవా) మధ్య డబుల్ డెక్కర్ ఏసీ రైలు నడిపేందుకు మార్గం సుగమమైంది.

 సాక్షి, ముంబై: ముంబ్రా-దీవా స్టేషన్ల మధ్య ఉన్న సొరంగ మార్గం అడ్డంకులు తొలగిపోవడంతో ముంబై-మడ్‌గావ్(గోవా) మధ్య డబుల్ డెక్కర్ ఏసీ రైలు నడిపేందుకు మార్గం సుగమమైంది. ఈ రెండు ప్రాంతాల మధ్య డబుల్ డెక్కర్ రైలు నడపాలని గతంలోనే రైల్వే పరిపాలన విభాగం నిర్ణయం తీసుకుంది. కానీ ముంబ్రా-దీవా స్టేషన్ల మధ్య ఉన్న పార్సిక్ సొరంగంవల్ల అడ్డంకులు ఎదురయ్యా యి.

 కానీ ఇటీవల చేపట్టిన ఏసీ-డీసీ మార్పిడి పనుల వల్ల ఆ సొరంగాన్ని కొంత ఎత్తు పెంచారు. అలాగే రైల్వే ట్రాక్ కిందున్న మట్టిని తీసి కొంత లోతుగా మార్చారు. దీంతో డబుల్ డెక్కర్ రైలు సొరంగం లోంచి సులభంగా వెళ్లనుందనే ధీమాకు వచ్చినట్లు సెంట్రల్ రైల్వే భద్రతా శాఖ కమిషనర్ చేతన్ బక్షి తెలిపారు.

 రద్దీ తగ్గించేందుకు..
 ముంబై నుంచి కొంకణ్ దిశగా వెళ్లే ప్రయాణికుల సంఖ్య అత్యధికంగా ఉంటోంది. నిత్యం ఆర్టీసీ, ప్రైవేటు వాహనాలతో పాటు రైళ్లన్నీ రద్దీగా ఉంటున్నాయి. ఇవి కూడా ఎటూ చాలకపోవడంతో జల మార్గం సేవలు ప్రారంభించాలని ఇటీవల మేరీ టైం బోర్డు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీన్ని బట్టి కొంకణ్ దిశగా వెళ్లే ప్రయాణికుల సంఖ్య ఏ స్థాయిలో ఉంటుందో ఇట్టే ఊహించుకోవచ్చు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఛత్రపతి శివాజీ టెర్మినల్(సీఎస్టీ)-మడ్‌గావ్ మధ్య డబుల్ డెక్కర్ రైలు నడపాలని రైల్వే ప్రతిపాదించింది.

 గతంలో స్పందన అంతంతమాత్రమే..
 ఇదిలాఉండగా 2013 సెప్టెంబర్‌లో ఇండోర్-భోపాల్ మధ్య ప్రారంభించిన డబుల్ డెక్కర్ రైలుకు ప్రయాణికుల నుంచి అనుకున్నంత మేర స్పందన రాలేదు. దీంతో ఈ రైలును ఎనిమిది బోగీలుగా మార్చారు. మిగిలిన బోగీలను ప్రయోగాత్మకంగా ముంబ్రా-దీవాల మధ్య నడిపారు. కానీ పార్సిక్ సొరంగం కారణంగా కొన్ని సాంకేతిక పరమైన ఇబ్బందులు ఎదురయ్యాయి.

ఇటీవల ఏసీ-డీసీ మార్పిడి పనుల వల్ల దాని ఎత్తు పెంచడంతో సమ స్య పరిష్కారమైంది. సీఎస్టీ-భాయ్‌కళ స్టేషన్ల మధ్య ఉన్న ఓ వంతెన ఎత్తు తక్కువ ఉండడంవల్ల డబుల్ డెక్కర్ రైలుకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయి. దీంతో ఈ రైలును సీఎస్టీ నుంచి కాకుండా దాదర్ టెర్మినల్ లేదా కుర్లా లోకమాన్య తిలక్ టెర్మినల్ నుంచి నడపాలనే యోచనలో ఉన్నట్లు కమిషనర్ చేతన్ బక్షి చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement